శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
క్రిందటి వ్యాసంలో ఆచార్యశిష్య మధ్యన ఉన్న విశిష్ఠ సంబంధమును తెలుసుకున్నాము.
భగవానునికి మనకు మధ్యన ఆచార్యుని ఆవశ్యకత ఏమిటి? అని కొందరి వాదన. మరి గజేంద్రున్ని, గుహున్ని, శబరిని, అక్రూరున్ని, త్రివక్రను(కృష్ణావతారమున ఉన్న కుబ్జ) మరియు మాలాకారుడను (పూల వర్తకుడు) మొదలైన వారిని భగవానుడు ప్రత్యక్షముగా అనుగ్రహించాడు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
దీనికి మన పూర్వాచార్యుల సమాధానం, భగవానుడు సర్వస్వతంత్రుడు కావున ఒకసారి తన నిర్హేతుకకృపను జీవుని మీద ప్రసరింపచేస్తాడు, అలాగే జీవుల కర్మానుసారం వారికి ఫలితాలనివ్వడం అనేదానికికూడ కట్టుబడి ఉంటాడు . ఈ స్థితిలో ఆచార్యుని ఆవశ్యకత ఏర్పడును. ఉజ్జీవించు ఙ్ఞానమును అందించి తనను చేరుటకు మార్గమును చూపు ఒక సదాచార్యున్ని ఆశ్రయించేలా అవిశ్రాంతముగా అవకాశాలను సృష్ఠిస్తాడు భగవానుడు (వారి సుకృతమును గణింపక) ఈ జీవాత్మలకు. ఈ జీవాత్మలు కేవలం శ్రీమన్నారాయున్ని ఆశ్రయించి అతని కృపచేతనే ఉజ్జీవింపబడాలని తలచి ఆచార్యుడు పురుషాకారభూతురాలైన శ్రీమహాలక్ష్మివలె తానుకూడ భగవానునికి సిఫారిస్ చేస్తాడు. భగవానుడు ఈ జీవాత్మల కర్మానుసారం వారికి మోక్షముగాని సంసారముగాని ప్రసాదించేటప్పుడు ఆచార్యుడు జీవాత్మలకు మొక్షము మాత్రమే వచ్చేలా కృషిచేస్తాడు.
భగవానున్ని స్వయంగా ఆశ్రయించడంకన్నా ఆచార్యతిరువడిని ఆశ్రయించి దాని ద్వారా ఆ భగవానుని శ్రీపాదములను ఆశ్రయించడం చాలా శ్రేయస్కరం. భగవానుడు జీవాత్మలను తాను స్వయంగా స్వీకరించడం చాలా అరుదు, అదే ఆచార్య సంభందం ఉన్నవారిని కటాక్షించుట సహజమైనది అని మన పూర్వాచార్యులు అభిమతం.
ఆచార్య వైభవమును ప్రస్తుతించుచున్న సందర్భమున మన ఆచార్యపరంపరను కూడ తెలుసుకొనుట ఉచితం. దీని వల్ల భగవానుని నుండి ఙ్ఞానం ఎలా పరంపరగా వచ్చినదో అవగతమవుతుంది. సాధారణంగా ఇది లోకవిదితమైనదే అయినను కొంతమంది సాంసారికులకు తెలియని విషయము. ఈ శ్రీవైష్ణవసంప్రదాయం సనాతనమైనది, అనాదిగా కలది మరియు మహానుభావులచే ప్రచారంగావించబడినది. ద్వాపరాంతమున ఈ సంప్రదాయం దక్షిణభారతావనిలో పలు నదీతీరప్రాంతములయందు అవతరించిన ఆళ్వార్లద్వారా ప్రారంభించబడినది. కొందరాళ్వార్లు మనకు కలియుగారంభమున కూడ కనిపిస్తారు.
లోకోద్ధారణకై భగవత్ ఙ్ఞానమును కలిగి శ్రీమన్నారాయణుని భక్తులగు మహానుభావులు పలు నదీతీరప్రాంతములయందు అవతరిస్తారని వేదవ్యాసులు శ్రీమధ్భాగవతమున సూచించారు. వారు పదిమంది. క్రమంగా పోయ్ఘైఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమజిశై ఆళ్వార్, , నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్ , పెరియాళ్వార్,, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, మరియు తిరుమంగైఆళ్వార్. మధురకవిఆళ్వార్ మరియు ఆండాళ్ పరమ ఆచార్యనిష్ఠను కలిగినవారై ఆళ్వార్ల గోష్ఠిలో చేరిరి. కావున ఆ సంఖ్య పన్నెండుకు పెరిగినది. ఆండాళ్, భూదేవి అవతారం. ఆళ్వార్లందరు( ఆండాళ్ తప్ప) ఈ సంసారమున జీవాత్మలుగా ఉండి భగవానునిచే ఉద్ధరింపబడినవారు. భగవానుడు తన స్వసంకల్పముచే ఈ ఆళ్వార్లకు తత్త్వత్రయమును (చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు)విశదపరచు దివ్యఙ్ఞానమును అనుగ్రహించి మరల భక్తి/ప్రపత్తి మార్గమును పునరుద్ధరింపచేశాడు. వీరికి స్పష్ఠమైన భూతభవిష్యవర్తమానముల ఙ్ఞానమునుకూడ అనుగ్రహించాడు. అలా వారు భగవానున్ని అనుభవించినప్పుడు పొంగిపొరలిన అనుభవమును నాలాయిరదివ్యప్రబంధములుగా (అరుళిచ్చెయళ్ అని కూడ ప్రసిద్ధిచెందినది) అనుగ్రహించారు. ఈ అరుళిచ్చెయళ్ సారమే నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయ్ మొళి.
ఆళ్వారుల అనంతరం ఎంతోమంది ఆచార్యులు ఈ సంప్రదాయమును ప్రచారంచేసి విస్తరింపచేశారు. వారు క్రమంగా శ్రీమన్నాథమునులు, ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియనంబి, తిరువరంగప్పెరుమాళ్అరయర్,తిరుక్కోష్ఠియూర్నంబి, పెరియతిరుమలైనంబి, తిరుమలైఆండాన్, ఎమ్పెరుమానార్, ఎంబార్, కూరత్తాళ్వాన్, ముదలియాండాన్, అరుళాళపెరుమాళ్ ఎమ్పెరుమానార్, ఎంగళాళ్వాన్, అనంతాళ్వాన్, తిరువరంగత్తు అముదనార్, నడాదూర్ అమ్మాళ్, పరాశరభట్టర్, నంజీయర్, నంపిళ్ళై, వడక్కుతిరువీధిపిళ్ళై, పిళ్ళైలోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తిరువాయ్ మొళిపిళ్ళై , వేదాన్తాచార్యులు మరియు అళగియ మణవాళ మామునిగల్ మొదలైన వారు సంప్రదాయ ప్రవర్తకులుగా ఉన్నారు.
ఈ ఆచార్యపరంపర 74 సింహాసనాధిపతులచే (ఎమ్పెరుమానార్ చే నియమింపబడ్డవారు)మరియు జీయర్ మఠములచే (ఎమ్పెరుమానార్ మరియు అళగియ మణవాళమామునుల చే నియమింపబడ్డవారు) ప్రస్తుతకాలం వరకు కొనసాగించబడుతున్నది. ఈ ఆచార్యులు అరుళిచ్చెయ్యల్ కు వ్యాఖ్యాన్నాన్ని మరియు ప్రతిపాశురానికి విశేషార్థవివరణ చేశారు. ఈ వ్యాఖ్యానములు విశేష అర్థభావమును కలిగి భగవదనుభవమున ముంచివేస్తాయి. ఆళ్వారుల కృపతో ఈ ఆచార్యులు పాశురములకు సరైన అర్ధవివరణ వివిధ కోణాల్లో అనుగ్రహించారు.
దివ్యప్రభంధములను మనం అర్థానుసంధానముతో అనుభవిస్తున్నామంటే మన పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము వల్లే అని మామునుల తమ ఉపదేశరత్నమాలలో అనుగ్రహించారు. ఈ వ్యాఖ్యానములు లేకున్నచో వాటిని అర్థం చేసుకోవడం చాలాకష్ఠతరం. దివ్యప్రభంధముల వైభవం తెలిసిన మన పూర్వాచార్యులు గృహములలో మరియు దేవాలయములలో నిత్యానుసంధానమును(ప్రతిరోజు తప్పక పఠించవలసినవి) ఏర్పాటుచేశారు. దీనిని మనం ఈనాటికి తిరువల్లిక్కేణి వంటి దివ్యదేశములయందు సేవించవచ్చును. శుక్రవారమున జరుగు శిరియతిరుమడళ్ గోష్ఠిన ఐదారు సంవత్సరముల బాలురు ప్రౌఢశ్రీవైష్ణవులకన్నా ఉచ్ఛస్వరమున సేవిస్తారు. అలాగే ఆండాళ్ అనుగ్రహించిన తిరుప్పావై ని అతిచిన్న బాలురుకూడ సేవించడం మనం చూస్తున్నాము.
దీనివల్ల మనకు గురుపరంపర ప్రభావం అవగతమవుతుంది. దీనిని రక్షించుకోవడం మన ప్రథాన కర్తవ్యం.
వివిధభాషల్లో పూర్వాచార్యుల గురించి లోతైన వివరణకై http://acharyas.koyil.org దర్శించండి.
ఆళ్వార్గళ్ వాళి అరుళిచ్చెయళ్ వాళి, తాళ్వాదుమిల్ కురువర్ తామ్ వాళి (ఆళ్వారులకు మంగళం, దివ్యప్రభంధములకు మంగళం, దివ్యప్రబంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించి ప్రభోధించిన ఆచార్యులకు మంగళం) ఉపదేశరత్నమాల-3వ పాశురం.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-guru-paramparai.html
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org