Monthly Archives: December 2016

అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhV63nRcaHTfJ4iwK

మన శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయము ఉభయ వేదాంత ఆధారితము. ఉభయ అనగా రెండు మరియు వేదాంతము అనగా శీర్ష భాగము. సంస్కృతమున వేదము (ఉ: ఋగ్, యజుర్, సామ, అథర్వణ) మరియు వేదాంతము (ఉపనిషత్తులు) అను రెండు భాగములు, ఇంకను ద్రావిడమున వేదము (దివ్య ప్రబంధము) మరియు వేదాంతము (వ్యాఖ్యానములు) అను రెండు భాగములు కలవు. ఈ రెండూ రెండు కనులుగా పరిగణింపబడి, ఒకే ప్రాముఖ్యము కలిగి ఉన్నవి. ఆయినను, ఆళ్వార్ల ద్వారా దివ్య ప్రబంధములు వెలువరింబడటము వలనను, వారు ఎమ్పెరుమాన్ల దివ్య కటాక్షముతో అకళంకిత జ్ఞానము పొందిన వారగుట చేత సంస్కృత వేద సారము అయిన నాలాయిర దివ్య ప్రబంధములను సకల జీవుల ఉజ్జీవనమునకై మాత్రమే వెలువరించడము వలన, మనకు వాటి యందు అధిక ప్రావణ్యము కలదు.

అధ్యయనము అనగా పఠనము, అభ్యసించడము, పునశ్చరణ మొదలుగునవి. వేదము ఆచార్యుల వద్ద శ్రవణము గావించి, దానిని మరల మరల మననము చేయడము ద్వారా అభ్యసింపబడుతుంది. వేద మంత్రములు నిత్యానుష్టానములో భాగముగా కూడా పఠింప బడతాయి. అనధ్యయనము అనగా వేద పఠనము నిలిపి వేయడము. సంవత్సరములో కొన్ని సమయములలో వేదము పఠింపబడదు. ఈ సమయము ఇతర శాస్త్ర భాగములు అయిన స్మృతి, ఇతిహాసములు, పురాణములు మొదలగు శాస్త్రములను పఠించడానికి ఉపయుక్తము. అధ్యయన కాలము నందును అమావాస్య, పౌర్ణమి మొదలగు దినములలొ వేద పఠనము నిషిద్ధము. ఈ సాంప్రదాయము సంస్కృత వేదముతో సమానముగా పరిగణింప బడే ద్రావిడ వేదమునకు కుడా కలదు. మనము ఇప్పుడు దివ్య ప్రబంధము అనధ్యయన కాలము యొక్క ప్రాశస్త్యమును తెలుసుకొందాము.

అధ్యయనోత్సవము అనధ్యయన కాలములో భాగము. అధ్యయనోత్సవము నమ్మాళ్వార్ల మోక్షమును స్తుతిస్తుంది. అధ్యయనోత్సవము మరియు అనధ్యయన కాలము మన సాంప్రదాయములో పరస్పరాన్వయములు. ఈ చరిత్ర అంతయు శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై స్వామి ప్రసాదించిన “కలియన్ అరుళ్ పాడు” (http://srivaishnava-literature.blogspot.in/p/kaliyan-arul-padu.html)  అను గ్రంథమున వివరింపబడినది (శ్రీ పుత్తూర్ కృష్ణ స్వామి అయ్యంగార్లచే ప్రచురింపబడిన (పెరియ వాచ్చాన్ పిళ్ళై శ్రీ సూక్తమాల -1 లో భాగముగా).

ఇక ఈ గ్రంథములో పొందుపరచ బడిన ఐతిహ్యములను క్లుప్తముగా తెలుసు కొందాము.

  • శ్రీమన్నారాయణుడు, తమ నిర్హేతుక కరుణా కటాక్షములచే సకల జీవుల ఉజ్జీవనమునకై, ఈ సంసారములో కోయిల్ (శ్రీరంగం), తిరుమలై (తిరువేంకటమ్), పెరుమళ్ కోయిల్ (కాంచిపురమ్) మొదలగు పుణ్య క్షేత్రములలో అర్చారూపములో సర్వ సులభుడుగా, సర్వారాధ్యుడుగా వేంచేసారు.
    ఆళ్వారులలో చివరివారైన తిరుమంగయాళ్వార్, శ్రీమన్నారాయణుని నిర్హేతుక కృపచే అనుగ్రహింప బడి, ఎన్నో అర్చావతారములను సేవించిన పిమ్మట శ్రీ రంగము వేంచేసి, అచ్చటనే అనేక మహత్తర కైంకర్యములను సమర్పిస్తూ నివసించారు. తిరుమంగయాళ్వార్ తనను తాను “ఇరున్తమిళ్ నూల్ పులవన్ మంగయాళన్” గా (ఇరున్తమిళ్ నూల్ – తిరువాయ్మొళి, పులవన్ – కవి, తిరువాయ్మొళి ప్రబంధములో ప్రావణ్యము కలవారైన, మంగయాళన్ – తిరుమంగయాళ్వార్) అభివర్ణించుకొని, తిరువాయ్మొళి యందు మిక్కిలి ప్రావణ్యము కలిగి, ఆ పాశురములను నిత్యమూ అనుసంధిచు చుండెడివారు.

  • ఒకానొక తిరుక్కార్తె (కార్తీక మాసం, కృత్తిక నక్షత్రము, పౌర్ణమి తిధి) దినమున, నంపెరుమాళ్ మరియు దేవేరుల తిరుమంజనమ్ (దివ్య స్నానం) తరువాత వేంచేసి యుండగా, ఆ గొప్ప భక్త సందోహములొ, తిరుమంగయాళ్వార్, తిరునెడుందాండగమ్ అను దివ్య ప్రబంమును వ్యక్త పరచి ఎంపెరుమాన్ సమక్షములొ దివ్యముగా గానము చేశారు. తిరువాయ్మొళి పాశురములను కూడ దివ్యముగా గానము చేశారు.
  • నంపెరుమాళ్ ఆ దివ్య గానమునకు ఎంతో ఆనందించి, తిరుమంగైయాళ్వార్లను వరము కోరమనగా, ఆళ్వార్ రెండు వరములను కోరెను.
  • తిరుమంగై యాళ్వార్లకు రెండు కోరికలుండెడివి
      • అవి తిరువాయ్మొళికి సంస్కృత వేదముతో సామ్యము.
      • మరియు నంపెరుమాళ్ సమక్షములో మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి నాడు అధ్యయనోత్సవము (నమ్మాళ్వార్ మోక్షము) సందర్భములో తిరువాయ్మొళి దివ్య ప్రబంధము అనుసంధానము.
  • ఎంపెరుమాన్ సంతోషముగా ఆ వరములను ఆమోదించి, వెంటనే ఆ సభను, తన తిరుమేనికి అద్దగా మిగిలిన నూనెను, చాలా సమయము నుంచి దివ్య ప్రబంధమును గానము చేయుచున్న కలియన్ కు స్వరము చెడకుండ ఉండునట్లు ఈయ వలసినదిగా ఆజ్ఞాపించెను.
  • అనంతరమ్ ఆళ్వార్ తిరునగరిలో అర్చారూపములో వేంచేసి యున్న నమ్మాళ్వార్లకు వర్తమానము పంపగా, వెంటనే నమ్మాళ్వార్ అక్కడ నుంచి శ్రీ రంగమునకు చేరుకున్నారు.
  • తిరుమంగై ఆళ్వార్ వైకుంఠ ఏకదశి మొదలు 10 రోజులు తిరువాయ్మొళి అనుసంధానమునకు ఆదేశించారు. ఉదయమున వేద పారాయణము సాయం వేళల తిరువాయ్మొళి అనుసంధనము జరిగెడెది. చివరి రోజున, నమ్మాళ్వార్ నంపెరుమాళ్ దివ్య చరణములను తమ శిరస్సుతో తాకే ఘట్టము ఎంతో భక్తి పారవశ్యముతో అనుకరింపబడెడిది. ఉత్సవముల అనంతరము, నమ్మళ్వార్ తిరిగి అళ్వార్ తిరునగరి చేరుకొనేవారు. ఇలా ప్రతి సంవత్సరము సంభవించేది.
  • కొంత కాలము తరువాత, కలియుగ ప్రభావమున, సాంప్రదాయములు అడుగంటి, దివ్య ప్రబంధములు లుప్తములయి, నమ్మాళ్వార్ శ్రీ రంగమును దర్శించడము ఆగి పోయినది.
  • పిమ్మట శ్రీమన్ నాథమునులు అవతరించి, కాల క్రమమున శ్రీమన్నారాయణుని దయతో, ఆళ్వార్లు మరియు దివ్య ప్రబంధముల గురించి తెలుసుకొన్నారు. శ్రీమన్ నాథముని, ఆళ్వార్ తిరునగరి దర్శించి, మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిరుత్తాంబును అభ్యసించి, నమ్మాళ్వార్ల కరుణా ప్రభావముతో 4000 దివ్య ప్రబంధములను మరియు అందలి భావములను గ్రహించిరి.
  • శ్రీమన్ నాథమునులు తమ శిష్యులకు దివ్య ప్రబంధమును ఉపదేశించి, శ్రీ రంగమునకు వేం చేసి మరల అధ్యయనోత్సవమును ఉద్ధరించారు. అంతే గాక, ఆళ్వార్ల మరియు 4000 దివ్య ప్రబంధముల ప్రాశస్త్యమును నమ్మాళ్వార్ల ద్వారా గ్రహించి, నమ్మాళ్వార్ల మోక్షోత్సవమును కూడ పునరుద్ధరించి, వారి శ్రీ రంగ దర్శనమును తిరిగి ఏర్పాటు చేశారు.
  • ఎంపెరుమాన్ తిరువాయ్మొళి దివ్య ప్రబంధమునకు వేద సామ్యము ధ్రువీకరించి నందు వలన. శ్రీమన్ నాథమునులు వేదమునకు వలెనే తిరువాయ్మొళి మరియు ఇతర దివ్య ప్రబంధములకు అనధ్యయన కాలము నిర్ణయించిరి. ఈ అనధ్యయన కాలము తిరుక్కార్తె దినమున ప్రారంభమయి, కోవెలలో అధ్యయన ఉత్సవము ప్రారంభమయే ముందు ముగుస్తుంది. అలాగే అధ్యయన కాలము అధ్యయన ఉత్సవము మొదటి రోజున ప్రారంభమయి, తిరుక్కార్తె దినమున ముగుస్తుంది.
  • నమ్మాళ్వార్లకు ఆళ్వార్ తిరునగరి యందు ఆహ్వానము పంపే సాంప్రదాయమును మరల ఏర్పరచి, ఈ సమయములో నిత్య తిరువారాధనలో దివ్య ప్రబంధానుసంధానము నుండి శ్రీ వైష్ణవులందరికీ విరామమును ఏర్పాటు చేసారు (దివ్య ప్రబంధము యొక్క మననము, ధ్యానమునకు విరామము లేదు).
  • అంతేగాక ఎంపెరుమాన్లకు తిరుక్కార్తెనాడు అలంకరించిన శుద్ధ తైల శేషమును, నమ్మాళ్వార్లకు, కలియనుకు మరియు మిగిలిన ఆళ్వార్ల కంఠములకు కూడా అలంకరించి, ఆ శేషమును శ్రీ వైష్ణవులందరికీ ప్రసాదించ వలనదిగా అజ్ఞాపించారు.
  • నమ్మాళ్వార్ల తిరువిరుత్తమ్, తిరువాశిరియమ్ పెరియ తిరువన్తాది మరియు తిరువాయ్మొళిలకు నాలుగు వేదములతో సామ్యము. మిగిలిన ఆళ్వార్ల దివ్య ప్రబంధములకు వేదాంగములైన శీక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చంధస్సు మరియు జ్యోతిషములతో సామ్యము. ఈ దివ్య ప్రబంధములు తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకముల నిగూఢ భావములను విశదీకరిస్తాయి.
  • ఇంకను నాథమునుల ఆదేశానుసారము,
    • శ్రీ వైకుంఠ ఏకాదశి మునుపు అమావాస్య నుండి మొదటి పది రోజులు ముదలాయిరము (తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, నాచ్చియార్ తిరుమొళి, పెరుమాళ్ తిరుమొళి,  తిరుచ్ఛంద విఱుత్థం,  తిరుమాలై , తిరుప్పళ్లిఎళ్ళుచ్చి, అమలనాదిపిరాన్, కణ్ణినుణ్ శిరుత్తాంబు, పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండకం) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము తిరువాయ్మొళి తొడక్కము (ప్రారంభము) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము ఉదయము వేదపారాయణము, సాయమువేళలో తిరువాయ్మొళి దినమునకు ఒక పత్తు, 10 దినములు అనుసంధింపబడుతుంది. చివరిరోజున ఇ నమ్మాళ్వార్ తొళల్తో ఘనముగా శాత్త్ఱుమురై  నిర్వహింపబడుతుంది.
  • ఇరవై ఒకటో దినము ఇయర్పా (ముదల్ తిరువన్తాది, ఇరణ్డామ్ తిరువందాది, మూన్ఱామ్ తిరువన్తాది, నాన్ముగన్ తిరువన్తాది, తిరువిరుత్తమ్, తిరువాసిరియమ్, పెరియ తిరువందాది, తిరువెళుకూట్రిరుక్కై, శిఱియ తిరుమడల్, పెరియ తిరుమడల్) అనుసంధిప బడుతుంది. (గమనిక: ఎమ్పెరుమానార్ల కాలములో నంపెరుమాళ్ ఆజ్ఞతో ఇరవై ఒకటో దినము సాయంకాలము ఇయఱ్పా శాఱ్ఱుముఱై ముగిసిన పిమ్మట పెరుమాళ్ళ పురప్పాడు సమయములో రామానుజ నూఱ్ఱందాది అనుసంధిప బడుతోంది).
  • నాథమునుల ఆదేశానుసారము బ్రాహ్మణులకు వేదాధ్యయనము విధింప బడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులు విధిగా దివ్య ప్రభన్దమును అభ్యసించవలెను.
  • అనధ్యయన కాలము అయినను, మార్గశిర మాసములో వేకువ ఝామున, భగవంతుని మరియు భాగవతులకు సుప్రభాతము పాడుటకు ఉద్ద్యేశించిన పాశురములు కలిగిన తొణ్డరడిప్పొడి ఆళ్వార్ల తిరుప్పళ్ళియెళ్ళుచ్చి మరియు ఆణ్డాళ్ ప్రసాదించిన తిరుప్పావై అనుసంధింపబడతాయి.
  • ఈ సాంప్రదాయము ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి మరియు ఎమ్పెరుమానార్ల కాలములో కొనసాగింది.
  • ఒకప్పుడు కారణాంతరముల వలన నమ్మాళ్వార్ శ్రీ రంగము చేరుకోలేకపోయారు. అప్పుడు ఎమ్పెరుమానార్ అన్ని దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహమును ప్రతిష్ఠింప వలసినదిగా అదేశించారు. తిరుమల పర్వత శ్రేణి అంతా శ్రీమన్నాయణుని శరీరముగా భావింప బడుట వలన, ఆళ్వారుల దివ్య విగ్రహమును ఆ తిరుమల పర్వత శ్రేణి క్రింది భాగములొ ప్రతిష్ఠింప బడింది. ఇంకా అన్ని దివ్య దేశములలో అధ్యయన ఉత్సవము వైభవముగా నిర్వహించ వలసినదిగా ఎమ్పెరుమానార్ ఆదేశించారు.
  • తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళై ఎమ్పెరుమానార్ అనుఙ్ఞతో తిరువాయ్మొళి వ్యాఖ్యానం సాయించారు. అంతట ఎమ్పెరుమానార్ ఆనందముతో ఆ వ్యాఖ్యానమును కూడా శ్రీ భాష్యముతో అనుసంధించ వలసినదిగా ఆజ్ఞ్యాపించారు.
  • ఎమ్పెరుమానార్ శ్రీ రంగంలో చాలా కాలం అసంఖ్యాకమైన శ్రీ వైష్ణవ సముదాయముతో నివసించారు. వారికి ఎంతో గహనము మరియు ముఖ్యములైన సంప్రదాయ రహస్యములను వివరిస్తూ సదా పెరియ పెరుమాళ్కు మంగళాశాసనం గావించారు.
  • స్వామి ఎమ్పెరుమానార్ పరమపదమును అలంకరించగా భట్టర్ (ఆళ్వాన్ వరపుత్రులు మరియు శ్రీ రంగనాథ శ్రీ రంగ నాచియర్ల దత్త పుత్రుడు) అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఎంబార్ కందాడై ఆండాన్ తదితరులు శ్రీ రంగంలో మరి ఇతర దివ్య దేశములలోను ఎమ్పెరుమానార్ విగ్రహమును సకల జీవుల ఉజ్జీవనమునకై ఎమ్పెరుమాన్ ఆజ్ఞ్యతో ప్రతిష్టించారు.
  • శ్రీమన్ నాథమునులు కణ్ణినుణ్ శిఱుతాంబు యొక్క నిగూఢమైన భగవద్భావములను గ్రహించి నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చినట్టు, ఎమ్పెరుమాన్ అభిమతము మేరకు రామానుజ నూఱ్ఱందాది కూడ చేర్చడమైనది. సద్బ్రాహ్మణునకు ప్రతి నిత్యము గాయత్రి జపము విధింపడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులకు రామానుజ నూఱ్ఱందాది నిత్యానుసంధానము విధింపడినది.
  • తరువాతి ఆచార్యులందరు రామానుజులచే వెలువరింపబడిన సంప్రదాయ రహస్యములను సకలుర ఉజ్జీవనమునకై ప్రచారము చేయుచూ కాలక్షేపము చేసారు. కలియన్ అరుళ్ళప్పాడు ప్రబంధము సమాప్తము.

తదనంతరము పరాశర భట్టర్ తిరునారాయణ పురమునకు దిగ్విజయము చేసి వేదాంతిని వాదమున జయించి తన శిష్యునిగా స్వీకరించారు. వేదాంతి సన్న్యాసము స్వీకరించి నంజీయరుగా ప్రసిద్ధులయినారు. భట్టర్ వేదాంతిని వాదమున జయించి అధ్యయనోత్సవము ప్రారంభమునకు ముందు రోజు శ్రీ రంగమునకు వేంచేశారు. పెరియ పెరుమాళ్ళకు తిరుమంగై ఆళ్వారు సాయించిన తిరునెడుందాండకము నందలి రహస్యములను విశదీకరించి వాదమున వేదాంతిని జయించిన విధమును తెలియజేయగా, పెరియ పెరుమాళ్ మిగుల ఆనందించి, భట్టరులను బాగుగా ప్రశంశార్హులుగా ఆఙ్యాపించి, శ్రీ రంగములో అధ్యయనోత్సవము తిరునెడుందాండకముతో ప్రారంభము అగునట్లు శాసించారు. దీనితో మన సత్సంప్రాదాయమున అధ్యయనోత్సవము యొక్క పూర్వాపరాలను తెలిసికొన్నాము.

 

అధ్యయనోత్సవముల సందర్భములో అన్ని దివ్య దేశములలోనూ 21 దినములు జరిగే ఉత్సవములు ఇలా ఉంటాయి.

  • ఎమ్పెరుమాన్, నాచియార్లు, ఆళ్వార్లు మరియు ఆచార్యులు 21 దినములునూ ఒక పెద్ద సభలో ఆసీనులు అవుతారు. ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లు సభ మధ్య భాగమునను, ఆళ్వారాచార్యాదులు వారికి రెండు వైపుల రెండు వరుసలలో ఆసీనులవుతారు ఎదురెదురుగా ఆసీనులవుతారు.
  • అనేక దివ్య దేశములలో నమ్మాళ్వార్ ఆళ్వార్ గోష్ఠికి తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్లతో కలసి (శ్రీ వైష్ణవ సంప్రదాయమునకు వారు చేసిన కైంకర్యమునకు) నాయకత్వము వహిస్తూ, ఆళ్వారాచార్యాదులతో ఆసీనులవుతారు.
  • వానమామలై, తిరుక్కుఱుంగుడి మొదలగు దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహము లేకపోవడము వలన, తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ల ఆధ్వర్యములో ఉత్సవములు జరుగుతాయి.
  • శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశము ఎమ్పెరుమానార్ అవతార స్థలము అయినందు వలన మరియు ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమానార్ను జ్యేష్ఠ సోదరునిగా భావించి నందు వలనను, ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లతో ఆసీనురాలు కాక, ఆళ్వార్ ఎమ్పెరుమానార్ గోష్ఠీని అలంకరిస్తారు.
  • వైకుంఠ ఏకాదశి మొదలుకొని సాయం సమయమున పరమపద ద్వారము తెరవబడుతుంది. నమ్మాళ్వార్, మరియు ఆ దివ్య దేశము ఆచారమును బట్టి మిగిలిన ఆళ్వారాచార్యాదులు, పరమపద ద్వారమునకు అభిముఖముగా నిలచి, ఎంపెరుమాన్లకు మంగళాశాసనములు చేస్తూ పురప్పాడులో పాల్గొంటారు.
  • పగల్పత్తు మొదట 10 దినములు తిరుమొళి తిరునాల్ అనగా మధ్యాహ్న సమయములో ముదలాయిరము మరియు పెరియ తిరుమొళి అనుసంధింపబడతాయి. పురప్పాడు జరుగు దివ్య దేశములలో ఆ సమయములో ఉపదేశరత్తిన మాలై అనుసంధింపడుతుంది.
  • వైకుంఠ ఏకాదశి మొదలు 10 దినములు తిరువాయ్మొళి తిరునాల్ అనగా సాయము సమయములో తిరువాయ్మొళి అనుసంధింపడుంది.
  • 20వ దినము తిరువడి తొళల్ మరియు తిరువాయ్మొళి శాఱ్ఱుమురైతో ముగుస్తుంది. తిరువడి తొళల్ సందర్భములో అర్చకులు నమ్మాళ్వార్లను తమ హస్తములతో తోడ్కొని వెళ్ళి ఆయన శిరమును ఎమ్పెరుమాన్ పాదములమీద ఉంచుతారు. ఆ పిమ్మట నమ్మాళ్వార్ తులసీదళములతో అలంకరింపబడతారు.
  • 21వ రోజు
    • సాయంకాలము – ఇయర్పా అనుసంధానము
    • రాత్రి – పురప్పాడు (ఊరేగింపు)లో రామానుజ నూఱ్ఱందాది గోష్ఠి మరియు ఇయల్ శాఱ్ఱు
  • 22వ రోజు – తిరుప్పల్లాణ్డు తొళక్కమ్ (ప్రారంభము) మరియు 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మొదలు

ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసు కొందాము ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసుకొందాము.

  • శ్రీరంగము
    • 22 రోజులు ఉత్సవములు – అనగా ప్రారంభములో ఒక రోజు తిరునెడున్తాణ్డగమ్ అనుసంధానము, తరువాత 21 రోజులు ఉత్సవము.
    • అరయర్లు నమ్పెరుమాళ్, నాచియార్లు మరియు ఆళ్వారాచార్యాదుల ఎదుట పాశురములను అనుసంధింస్తూ వాటి అర్ధములకు, భావములకు అనుగుణముగా అభినయిస్తారు.
    • అరయర్ సేవ సమయములో నంపెరుమాళ్ మరియు నాచియార్లు ఎత్తైన మండపము మీద ఆసీనులవుతారు. ఆళ్వారాచార్యాదులు వారికి అభిముఖముగా ఆసీనులవుతారు.
  • ఆళ్వార్ తిరునగరి
    • అరయర్ సేవలో అభినయముతో పాశురనుసంధానము. అరయర్ స్వాములు అనుసంధించిన పాశురములను తరువాతి రోజు అధ్యాపక స్వాములు అనుసంధిస్తారు.
    • పగల్పత్తు 10వ రోజున (వైకుంఠ ఏకదశి ముందు దశమి) నమ్మాళ్వార్ ఎంపెరుమానార్ల ప్రత్యేక దర్శనము – శ్రీ రంగనాధ స్వామి వారి శయన భంగిమలో ఉన్న నమ్మాళ్వార్ శ్రీ పాదముల వద్ద శ్రీ రంగ నాచియార్ల భంగిమలో ఎంపెరుమానార్ దర్శనము ఇస్తారు.

                        నమ్మాళ్వార్ – ఎంపెరుమానార్

    • అన్ని దివ్య దేశములలోను పగల్పత్తు చివరి రోజైన 20వ రోజున తిరువడి తొళళ్ (నమ్మాళ్వార్ ఎంపెరుమాన్ పాద కమలములను చేరుకోవడము) జరుగుతుంది. కాని ఇక్కడ తిరుముడి తొళల్ అంటే అర్చకులు తమ శ్రీ హస్తములతో ఎంపెరుమాన్ను తీసుకువెళ్ళి ఎంపెరుమాన్ శ్రీ పాదములను స్వామి నమ్మాళ్వార్ శిరమున ఉంచుతారు. ఈ అద్భుత దృశ్యము కన్నుల పండుగై, పరగత స్వీకారమును ధృఢపరుస్తుంది (పరగత స్వీకారము అనగా స్వయముగా శ్రీమన్నారాయణుడే సకల జీవులను తన నిర్హేతుక కృపాకటాక్షములతో కరుణించి తన అధీనమునకు చేర్చుకోవడము).
    • 22 దినములు అధ్యయనోత్సవములు – చివరిలో మరి ఒక రోజు “వేడు పడై
      తిరుమంజనమ్” (విశేష స్నానోపచారము).
    • ఈ చివరి రోజున, పొలిందు నిన్ఱప్పిరాన్ ఎంపెరుమాన్ సర్వుల ఉజ్జీవనముకై నమ్మాళ్వర్లను తిరిగి లీల విభూతికి పంపుతారు.
    • తిరుప్పల్లాండు తొడక్కమ్ (మొదలు) తరువాత వచ్చే విశాఖ నక్షత్రమున (నమ్మాళ్వార్ తిరునక్షత్రమున) ప్రారంభము అవుతుంది.
  • తిరు తులైవిల్లిమంగలమ్
    • నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో దేవ పిరాన్ ఎంపెరుమాన్లను తమ తల్లి దండ్రులుగా సంభావించారు. నమ్మాళ్వార్లకు దేవ పిరాన్ అనిన అమితమైన అభిమానము. అందువలన, పూర్వము, ఆళ్వార్ శ్రీ రంగము నుండి తిరిగి వచ్చునప్పుడు, తిరువిల్లి మంగలమ్ చేరి, అక్కడే మాసి విశాఖమువరకు వేంచేసి, ఆళ్వార్ తిరునగరికి చేసుకునేవారు.
    • ఈ వృత్తాంతము అనుసారము, ఆళ్వార్ తిరునగరిలో మాసి మాసములో జరిగే 13 రోజుల ఉత్సవముల చివరిలో మాసి విశాఖదినమున నమ్మాళ్వార్ తులైవిల్లిమంగల దివ్య దేశమునకు వేంచేసి, ఆ దినము అంతా తిరుమంజనము, గోష్ఠి మొదలగునవి సేవించి తిరిగి ఆళ్వార్ తిరునగరి చేరుకుంటారు.
    • తరువాతి దినము తిరుప్పల్లాండు తొడక్కమ్ (అప్పటి వరకు ఈ దివ్య దేశములో అనధ్యయన కాలము).
  • తిరువాలి / తిరునగరి మరియు తిరునాంగూర్ దివ్యదేశములు
    • సాధారణముగా తిరుక్కార్తె దీపము కలియన్ తిరు నక్షత్రము ఒకేసారి వస్తాయి. కానీ ఎప్పుడైనా ఒకే నెలలో రెండు కార్తీక నక్షత్రములు వచ్చి నపుడు, రెండవ కార్తీక నక్షత్రమును తిరుమంగై యాళ్వార్ తిరు నక్షత్రముగా నిర్ణయిస్తారు. అనధ్యయన కాలము మిగిలిన దివ్య దేశములలో తిరుక్కార్తె దీపము నుండి మొదలు అయినా, ఈ దివ్య దేశములలో మాత్రము తిరుమంగైయాళ్వార్ తిరువవతారము సందర్భములో 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మరియు వైభవముగా ఉత్సవములు అయిన తరువాతే అనధ్యయనకాలము మొదలు అవుతుంది.
  •  తిరుమెయ్యమ్
    • 21 రోజుల అధ్యయనోత్సవములతో కలియన్ తిరువడి తొళల్ (కలియన్ శ్రీమన్నారాయణుని పాదారవిందములను సేవించడము) కూడ పగల్పత్తు చివరి రోజున వైభవముగా జరుగుతుంది.
  • శ్రీ పెరుంబూదూర్
  • మకర మాసం పుష్యమి నక్షత్రము వరకు 3 దినముల పాటు గురు పుష్యమి వైభవముగా జరుగుతుంది. శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశములో ఎంపెరుమానార్ అర్చా విగ్రహము ప్రతిష్ఠింప బడి నందు వలన దీనికి అధికమైన ప్రశస్తి కలదు.
    అధ్యయనోత్సవము గురు పుష్యమి ఒకేసారి సంభవిస్తే అధ్యయనోత్సవము మొదట నిర్వహింప బడుతుంది.
  • తిరుచేఱై, తిరుమళిశై మొదలగు దివ్య దేశములలో కూడ బ్రహ్మోత్సవములు లేదా ఆళ్వార్ ఉత్సవములు మరియు అధ్యయనోత్సవములు ఒకేసారి వస్తే అధ్యయనోత్సవములు మొదట నిర్వహింప బడతాయి.

ఇయర్పా తరువాతి దినమున సాధారణముగా కోవెలలో దివ్య ప్రబంధానుసంధానము తిరుప్పల్లాండు అనుసంధానముతో యదా విధిగా తిరిగి మొదలు అవుతుంది. ఇలాగే ఆయా దివ్య దేశములకు మాత్రమే ప్రత్యేకములైన విశిష్ఠతలు ఉన్నాయి.

అనధ్యయన కాలము నందు గృహములలో దివ్య ప్రబంధము అనుసంధానము ఆయా దివ్య దేశములలో ఆచారములను బట్టి వివిధములుగా మారుతూ ఉంటుంది

  • అనేక దివ్య దేశములలోని స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము ఆ దివ్య దేశము యొక్క సంప్రదాయమును అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు, తిరుక్కార్తె దీపము లేదా అనధ్యయన కాలము మొదలు అయిన దినము నుండే స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానమునకు విరామము ఇవ్వ బడుతుంది. తిరిగి దివ్య దేశములలో తిరుప్పల్లాండు తొడక్కమ్ అనుసంధానము మొదలు అయినప్పటి నుంచి (సాధరణముగా ఇయర్పా శాఱ్ఱుమురై తరువాతి దినము నుండి) స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము మొదలు అవుతుంది.
  • ఒక సంప్రదాయము ప్రకారము దివ్య ప్రబంధానుసంధానము తాయ్ హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది. ఈ సంప్రదాయమునకు నాంది, పూర్వము శ్రీ వైష్ణవులు అధ్యయనోత్సవములను నంపెరుమాళ్ మరియు నమ్మాళ్వార్లతో సేవించడానికి గాను శ్రీ రంగమునకు విశేషముగా వెళ్ళేవారు. ఉత్సవములు పూర్తి అయిన తరువాత తిరిగి స్వగృహములను చేరుకునేందుకు చాల రోజులు అయ్యేది. దీని స్మృత్యర్ధముగాను, స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము తై హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది.
  • అన్ని సంప్రాదాయ రహస్యముల వలెనే, ఈ విషయములోను మన పెద్దల నుండి ఆయా దివ్య దేశములలోని శిష్ఠాచారములను గ్రహించి వాటినే పాటించాలి.

మరి అనధ్యయన కాలములో అభ్యసించి అనుసంధించి దగిన సంప్రదాయ రహస్యములు?

కొన్ని సూచనలు

  • సాధారణముగా దేవాలయములలో అనధ్యయన కాలము నందు తిరుప్పావై బదులు ఉపదేశరత్తిన మాలై మరియు కోఇల్ తిరువాయ్మొళి/రామానుజ నూఱ్ఱందాది బదులు తిరువాయ్మొళి నూఱ్ఱందాది అనుసంధానము జరుగుతుంది.
  • మార్గశిర మాసములో తిరుప్పళ్ళియెళ్ళుచ్చి / తిరుప్పావై అనుసంధానము తిరిగి మొదలు అవుతుంది.
  • కోవెలలో అధ్యయనోత్సవములో 4000 పాశురములను ఒకసారి అనుసంధిస్తారు.
  •  అనధ్యయనకాలములో స్వగృహములందు తిరువారాధనములో 4000 దివ్య ప్రబంధము అనుసంధింపబడదు (కానీ మార్గశిర మాసములో కోవెలలో వలెనె తిరుప్పావై మరియు తిరుప్పళ్ళియెళ్ళుచ్చి అనుసంధింప బడతాయి).
    • స్వగృహములలో పూజామందిర ద్వారములు తెరిచే సమయములో జితన్తే స్తోత్రము మొదటి 2 శ్లోకములను, కౌసల్యా సుప్రజా రామ శ్లోకమును, కూర్మాదీన్ శ్లోకమును అనుసంధిస్తాము, కానీ ఆళ్వార్ల పాశురములను ధ్యానించుట / మననము చేయుటకు ఏమీ ఆటంకము లేదు.
    • అలాగే తిరుమంజన సమయములో మనము నిత్యము పంచ సూక్తములను, వెణ్ణై అళైన్ద కుణున్గుమ్ పథికము మరియు కొన్ని ఇతర పాశురములను అనుసంధిస్తాము, కానీ, అనధ్యయన కాలమందు పంచ సూక్తములను మాత్రమే అనుసంధిస్తాము.
    • మంత్ర పుష్పముతో చెన్ఱాయ్ కుడైయమ్ పాశురమ్ అనుసంధిస్తాము, కానీ అనధ్యయన కాలములొ ఎమ్పెరుమానార్ దరిశనమ్ ఎన్ఱే పాశురమును అనుసంధిస్తాము.
    •  శాఱ్ఱుముఱై సమయములో మనము నిత్యమూ అనుసంధించే శిఱ్ఱమ్ శిరుకాలే, వంగక్కడల్ మరియు పల్లాండు పాశురముల బదులు ఉపదేశరత్తిన మాలై మరియు తిరువాయ్మొళి నూఱ్ఱందాది పాశురములను అనుసంధించి, సర్వ దేశ దశాకాలేషు… మరియు వాళి తిరునామములతో కొనసాగిస్తాము.
  • మన పూర్వాచార్య విరచితములయిన సంస్కృత స్తోత్త్ర గ్రంథములను, మరియు ఙానసారము, ప్రమేయసారము, సప్త కాదై, ఉపదేశరత్తిన మాలై, తిరువాయ్మొళి నూఱ్ఱందాది మొదలైన తమిళ ప్రబంధములను అభ్యసించుటకు ఇది మంచి సమయము. అలాగే మన పూర్వాచార్యుల తనియన్లను వాళి తిరునామములను అభ్యసించి అనుసంధించు కొనవచ్చును.
  • అలాగే, మన సంప్రదాయ రహస్య గ్రంథములను సేవించి మననము చేసికొనవచ్చును.

అనధ్యయన కాలములో దివ్య ప్రబంధము యొక్క అభ్యాసము కాని, అనుసంధానము లేకున్నను, వాస్తవమునకు ఈ సమయములో మనము ఆనందముగా సేవించుటకు చాలా సంప్రదాయ విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • మనము ఎంతో ఆతురతతో ఎదురు చూసే అద్భుతమైన అధ్యయన ఉత్సవము – శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రాముఖ్యము కలది – భగవదనుభవముతో నిండిన 20+ ఆహ్లాద భరితమైన దినములు.
  • ఆణ్డాళ్ నాచియార్ వరప్రసాదమైన అద్భుత ధనుర్మాస తిరుప్పావై అనుభవము.
  • మన పూర్వాచార్యులచే ఎంతొ సరళము దివ్యము అయిన సంస్కృతములోను అందిచ బడ్డ స్తోత్ర గ్రంథములు మరియు తమిళ ప్రబంధములను నేర్చుకొని తరించగలిగే మహత్తరమైన అవకాశము.

ఈ విధముగా మనము అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవములకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశములను ఈ శీర్షికలో గ్రహించాము.

మణవాళ మాముణుల తిరువావతారముతో తిరువాయ్మొళి మరియు నమ్మాళ్వార్ల వైభవము దశ దిశలా ప్రసరింపబడింది. వారు సకల మానవాళి ఉజ్జీవనమునకు దివ్య ప్రబంధము, అందలి రహస్యములను సర్వులకు అందజేయుటకు తమ యావజ్జీవనము కృషి చేశారు. అంతియేగాక మణవాళ మాముణులు తమ ప్రవృత్తి లోను ఆళ్వారాచార్యాదులచే ఉటంకింపబడిన సదాచారములను, గుణములను ఎల్లప్పుడూ వ్యక్తపరిచారు. వీరి సద్వృత్తి, సదాచారములకు నంపెరుమాళ్ ఎంతగానో ఆనందించి భగవద్విషయము (నంపిళ్ళై స్వామి వారి ఈడు వ్యాఖ్యానము మరియు ఇతర తిరువాయ్మొళి వ్యాఖ్యానముల ఆధారముగా) ఒక సంవత్సరము పాటు ప్రవచనము చేయ వలసినదిగా ఆదేశించారు. అంతట ప్రవచనము ముగింపులో ఆణి తిరుమూలా నక్షత్రమున శ్రీ రంగనాధులు ఒక చిన్న బాలుని రూపములో ఏతెంచి మణవాళ మాముణుల ను తమ ఆచార్యునిగా సంభావించి, వారి పట్ల కృతఙ్ఞతతో “శ్రీ శైలేశ దయాపాత్రమ్…….” శ్లోకమును సమర్పించారు.

 

మనమందరమూ కూడ ఇక ముందు రాబొయే ఈ ప్రశస్తమైన ఉత్సవములందు అన్వయించుకునేందుకు సంసిద్దులమవుదాము.

అడియేన్ అనంతరామన్ రామానుజదాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2013/11/anadhyayana-kalam-and-adhyayana-uthsavam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఆచార్య – గురుపరంపర

paramapadhanathanపరమపదమున శ్రీ దేవి (శ్రీ మహాలక్ష్మి) భూదేవి, నీళా దేవి సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

కిందటి సంచికలో మనం గురుపరంపర ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్య దేశములు మరియు దివ్య ప్రబంధ వైభవమును తెలుసుకుందాము.

శ్రీ మన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణ గుణములతో కూడు కొని ఉన్న సర్వోన్నత పరతత్త్వం. తన విశేష నిర్హేతుక కృపా కటాక్షములచే కొంత మంది జీవాత్మలపై కృప చూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు  (శ్రీమన్నారాయణుని గురించి ప్రబోధించిన వైభవం కలిగిన యోగులు) అయ్యారు. తాను నిత్యసూరుల (నిత్యాత్మలు) కు, ముక్తుల (ముక్తి చెందిన జీవాత్మలు) కు కూడా సర్వతంత్ర స్వతంత్ర నియామకుడు అయినా, ఎల్ల వేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింప బడిన జీవాత్మల కొరకై, ఎందు వలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరా మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది – సర్వ శక్తిమంతుడైన భగవానునకు వేదన / బాధ ఉంటుందా? అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు (అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్య సంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొనువాడు) కదా – దీనికి మన పూర్వాచార్యులు ఇలా తెలిపారు – ఈ జీవాత్మల ఉజ్జీవనము కొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్ట పడుతున్న సంతానం పైనే ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగి నప్పటికి తన బాధ అంతా ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం మరియు అవిధ్యచే ఆవరించ బడిన జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ జీవాత్మలు ఉజ్జీవించడానికి భగవానుడు ఈ జీవాత్మలకు సృష్ఠి సమయాన దేహాన్ని మరియు ఇంద్రియాలను, శాస్త్రములను అనుగ్రహిస్తాడు. శ్రీ రామ శ్రీ కృష్ణుడిగా తానే అవతరిస్తాడు. ఇనన్నీ అనుగ్రహించినప్పటికి ఈ జీవుడు భగవానుని యొక్క పరత్వమును అంగీకరించక అఙ్ఞానముతో ఉంటాడు. ఒక వేటగాడు ఒక జింక పట్టు కొనుటకు ఇంకొక జింకను ఎలాగైతే ఎరవేస్తాడో ఆమాదిరి ఈ జీవాత్మలను ఉద్ధరించుటకు వేరొక జీవాత్మలను ఉద్భవింప చేస్తాడు. వారే ఆళ్వార్లుగా పరిగణిస్తాము. ఆళ్వార్లు  అనగా భగవంతుని విషయ మందు మాత్రమే మునిగిన వారని అర్థం. భారతావనిలో దక్షిణ దేశమున పవిత్ర స్థలముల యందు ఈ ఆళ్వార్లు అవతరిస్తారని శ్రీ వేద వ్యాసులు శ్రీమద్భాగవతమున తెలిపినారు.

Azhwars

ఆళ్వార్లు  శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తు పాశురాలను (పద్యాలను) కృప చేశారు. ఇవన్నీ కలసి సుమారు 4 వేల పాశురాలు, కావున వీటిని  నాలాయిర దివ్య ప్రబంధముగా పేర్కొంటారు. దివ్య మనగా విశేషమైనది అని ప్రబంధమనగా పద్యముల కృతి (కేవలం భగవానున్ని కీర్తించునవి) అని అర్థవివరణ. ఆళ్వార్లు  అర్చారూపమున భగవానుడు వేంచేసి ఉన్నస్థలములను కీర్తించారు వాటినే దివ్య దేశములుగా పిలుస్తారు. మొత్తం 108 దివ్యదేశములున్నవి.106 దివ్య దేశములు భారతావనిలో వివిధ ప్రదేశముల యందు ఉన్నవి (నేపాల్తో కూడుకొని). క్షీరాబ్ధి (పాల సముద్రం) ఈ లీలా విభూతికి దూరంగా ఎవరు చేరుకోలేని ప్రదేశం. మోక్షం పొందిన జీవులు చేరుకొను పరమపవిత్ర స్థలం పరమపదం. ఈ 106 దివ్య దేశముల యందు శ్రీరంగం ప్రథానమైనది, ఆ తరువాత తిరుమల, కాంచీపురం, ఆళ్వార్ తిరునగరితిరువల్లిక్కేణి మొదలైనవి కొన్ని ముఖ్య దివ్య దేశములు. భగవానుడు ఐదు రూపములందు ఉంటాడు. అవి పరత్వముగా పరమపదమున, వ్యూహ రూపమున క్షీరాబ్ధిలో, అంతర్యామిగా జీవుల హృదయములందు, రామ కృష్ణాదిగా విభవ రూపమున, చివరిదైన రూపముగా అర్చావతారం (విగ్రహ రూపం) దివ్య స్థలములందు వేంచేసి ఉంటాడు. ఈ అర్చావతారం సర్వ సులభుడిగా అందరికి సదా చేరువలో ఉండే భగవానుని రూపముగా చెప్పబడుతుంది. మన పూర్వాచార్యులందరు దివ్య దేశమున నిత్య నివాసం చేస్తు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేస్తు తమ జీవనాన్ని గడిపారు.

వేదం / వేదాంతము యొక్క సారం సరళంగా తమిళ దివ్య ప్రబంధములో కూర్చబడింది. ఈ దివ్య ప్రబంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యం  ఙ్ఞాన ప్రసారం వలన  జీవాత్మలను ఉజ్జీవింప చేయడం. ఆళ్వారుల ఈ దివ్య ప్రబంధం వేల సంవత్సరముల నుండి ఆచార్యుల ద్వారా నాథమునుల నుండి ప్రారంభించ బడి శ్రీ రామానుజలు మాధ్యముగా కొనసాగుతూ శ్రీ మణవాళ మాముణుల వరకు పరంంపరగా వస్తున్నది. అఙ్ఞానులు ఈ ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ పద్యములుగా భావిస్తున్నారు కాని ఙ్ఞానాధికులైన ఆచార్యులు ఈ పాశురాలు శ్రీమన్నారాయణుని దివ్య తత్త్వమును (భవ బంధ విమోచాకాలు) ప్రబోధిస్తున్నాయని, శ్రీమన్నారాయణునికి మనం చేయ వలసిన కైంకర్యం ఈ దివ్య ప్రబంధం ద్వారా అవగతమగు చున్నదని విశద పరిచారు. మన పూర్వాచార్యులు తమ జీవితాన్నంతటిని ఈ ప్రబంధ అభ్యాసమునకై మరియు ఉపదేశించుటకే వెచ్చించారు.

azhwar-madhurakavi-nathamuni

ఆళ్వారుల అనంతరం దివ్య ప్రబంధమునకు కొంత కాలం గడ్డు పరిస్థితి ఏర్పడింది. క్రమంగా నమ్మాళ్వారుల అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి యందు నాథమునులు బహు శ్రమకోర్చి నాలాయిర దివ్య ప్రబంధమును అర్థానుసంధానముగా నమ్మాళ్వార్ కృపతో వారి వద్ద నుండి పొందారు. ఈ దివ్య ప్రబంధమును నాథమునులు నాలుగు విభాగాలుగా చేశారు. ఇది అందరికి సుపరిచితమే.  నాథమునులు ఈ ప్రబంధమును తమ శిష్యులకు నేర్పించి ప్రచారం గావించారు. అలాగే నమ్మాళ్వార్ విషయమున మధురకవి ఆళ్వార్ పరమ భక్తితో అనుగ్రహించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును  నాథమునులు వారి గౌరవార్థం నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చారు.

Ramanuja_Sriperumbudur

ఆదిశేషుల అవతారమైన శ్రీరామానుజులు గురుపరంపర ద్వారా వస్తున్న ఈ విశేషమును యామునాచార్యుల కృపచే వివిధ ఆచార్యుల ద్వారా అభ్యసించారు. ఆళ్వారుల వైభవమును మరియు వారి కృతులను  శ్రీరామానుజులు సమాజంలోని వివిధ స్థాయిలలో ఉన్న ప్రజలందరికి  ప్రచారం గావించి శ్రీవైష్ణవ సంప్రదాయమును ప్రబల పరిచారు.  శ్రీరామానుజుల విశేష కృషి ఫలితంగా ఈ సంప్రదాయమునకు ‘శ్రీరామానుజ దర్శనం’ అని స్వయంగా శ్రీ రంగనాథునిచే స్థాపించ బడింది. అలాగే శ్రీ రామానుజుల విషయంగా శ్రీ తిరువరంగత్త అముదనారు అనుగ్రహించిన రామానుజ నూఱ్ఱందాదిని నాలాయిర దివ్య ప్రబంధమున మన పూర్వాచార్యులచే చేర్చబడింది. ఈ శ్రీరామానుజ నూఱ్ఱందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతి రోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచ సంస్కారము పొందినవారు ) ప్రతి రోజు విధిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1
 నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళైగారు ఆ కాలమున (శ్రీ రామానుజులుఎంబార్, భట్టర్ మరియు నంజీయర్ పరంపర తరువాత) గొప్ప ఆచార్యులుగా విరాజిల్లుతుండేవారు. వీరు శ్రీ రంగమున నిత్యవాసం చేయుచు ఆకాలమున శ్రీవైష్ణవ సంప్రదాయమునకు అధికారిగా వెలుగొందేవారు. వీరి కాలమున శ్రీ రంగమున  నాలాయిర దివ్య ప్రబంధమునకు అతి ప్రాధాన్యం ఇవ్వబడేది.  పెరియ పెరుమాళ్-శ్రీ రంగనాథుని సన్నిధిన వీరు కాల క్షేపమున సదా నిమగ్నమై ఉండేవారు. పెరియ పెరుమాళ్ నిలబడి గవాక్షం / కిటికి గుండా వీరి ప్రవచనమును శ్రవణం చేసేవారట. అలాగే నంపిళ్ళై శిష్యులు కూడా దివ్య ప్రబంధ అర్థమును ప్రచారం గావించారు. నంపిళ్ళై  ప్రధాన శిష్యులు వ్యాఖ్యాన చక్రవర్తి (వ్యాఖ్యాతలలో శ్రేష్ఠులు) అను బిరుదాంకితులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై  నాలాయిర దివ్య ప్రబంధమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పూర్వాచార్యులచే బహు ప్రశంసించ బడ్డారు.  నంపిళ్ళై  మరొక ప్రధాన శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై యొక్క నాలాయిర దివ్య ప్రబంధ ప్రవచనములను గ్రంథస్థ పరిచారు. తిరువాయ్మొళికి ఉన్నవీరి  వ్యాఖ్యానము ‘ఈడు’ (ఈడు ముపత్తు ఆరాయిరప్పడి) గా ప్రసిద్ధి చెందినది.

pillailokacharya-goshtiపిళ్ళై లోకాచార్యుల కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై అనంతరం ఈ సత్సాంప్రదాయమున పిళ్ళై లోకాచార్యులు ఉత్తరాధికారిగా ఉండి దివ్య ప్రబంధ రహస్యార్థములను తమ రహస్య త్రయ గ్రంథములో పొందుపరచారు. ఈ రహస్యార్థములు వివిధ ఆచార్యులచే వివిధ గ్రంథములలో వివరింప బడ్డాయి.   పిళ్ళై లోకాచార్యులు ఈ రహస్యార్థాలను తమ అష్ఠాదశ రహస్య గ్రంథములలో పొందు పరిచారు. కాని వారి చరమ దశలో శ్రీరంగం మొఘల్ ఆక్రమణ దారులచే బంధింపబడి అన్ని నాశానం చేయబడ్డాయి.  పిళ్ళై లోకాచార్యులు  ఆక్రమణదారుల నుండి తాము  నంపెరుమాళ్ (శ్రీ రంగనాథుని ఉత్సవ మూర్తి) తో తప్పించుకున్నారు. కాని ప్రమాదవశాత్తు వారు అటవీ ప్రయాణ క్లిష్ఠముల నుండి తప్పించు కోలేక పరమపదమును చేరుకున్నారు. చాలా కాలం ఈ విపత్తును శ్రీరంగ ప్రజలు అనుభవించారు. కొన్ని దశాబ్ధముల తర్వాత ఆక్రమణదారులు నిష్క్రమించి ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత నంపెరుమాళ్ శ్రీ రంగం తిరిగి చేరుకొన్నారు.

srisailesa-thanian-small

ఆ శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు  ఆళ్వార్ తిరునగరిలో అవతరించారు. మాముణులుతిరువాయ్మొళి పిళ్ళై గారి శిష్యులయి వారి వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్య ప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు.  మాముణులు తాము స్వయముగా లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి దానిని పఠనం చేసి ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింప చేసి భద్రపరిచారు. సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు దానిని విస్తరింప జేయుటకు వీరు చేసిన అవిరళ కృషి మరియు అకుంఠిత దీక్షను లోకానికి తెలియ పరచుటకు, స్వయంగా శ్రీరంగనాథుడు మాముణులను వద్ద తిరువాయ్మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి, కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి, వీరిని ఆచార్యులుగా భావించి అత్యంత వైభవము గల ‘శ్రీ శైలేశ దయా పాత్రం’ అను తనియను శిష్య భావనతో వారికి  సమర్పించారు. కాల క్రమేణ వివిధ ఆచార్య పురుష వంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు దివ్య ప్రబంధమును తరువాతి వారికి బోధించ సాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతార ప్రయోజనముగా కల  ఆళ్వారుల దివ్య ప్రబంధములను మన పూర్వాచార్యులు  భద్ర పరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిర దివ్య ప్రబంధమును అర్థయుక్తంగా నేర్చుకొని దీనితోనే మన జీవితకాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం.

ఈ క్రింది వాటిని పరిశీలించిన ఆళ్వారుల మరియు దివ్య ప్రబంధము యొక్క వైభవం తెలుసుకొనవచ్చు.

దివ్య ప్రబంధము యొక్క అనువాదమును వివిధ భాషలలో చదవాలని ఆశించినవారు, ఇక్కడ చూడవచ్చు http://divyaprabandham.koyil.org

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

పూర్వవ్యాసమందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసమందు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును (జీవులను ఉద్ధరించగల ఉత్తమ తత్వము) పూర్వాచార్యులైన పెద్దల అమృత అనుభవముల మూలముగా తెలుసుకొనెదము!

 తిరువాయ్మొళి ప్రవర్తకాచార్యులు – నమ్మాళ్వార్లు, భగవద్రామానుజులు, స్వామి మణవాళ మహాముణులు – ఆళ్వార్ తిరునగరి

భగవద్రామానుజులు తమ అభిమాన శిష్యులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ కు తిరువాయ్మొళి కాలక్షేపము గావిస్తున్న సమయమున “పొలిగ! పొలిగ! (తిరు-5-2-1)” దశకము రాగానే పిళ్ళాన్ హర్షాతిరేకముతో పులికితులై ఉండుట గమనించిన ఉడయవర్లు. “పిళ్ళాన్! ఏమి ఆ వైలక్షణ్యము?” అని ప్రశ్నించగా, వారు, “నమ్మాళ్వార్లు దేవరవారి యొక్క అవతారమును కటాక్షించి కదా ఈ దశకమునందు “కలియుమ్ కెడుమ్ కణ్డుకొణ్మిన్ – కలి నశిస్తుంది చూడండి!”” అని కీర్తించారు! అలాగే మీరు కూడా “దీనికి మేమే నిరూపణము!” అను విధముగా వేంచేసి ఉన్నారు! ఇదంతయు మనసులో తలచుకుని పులకితుడనై ఆళ్వార్లు అనుభవించిన రీతిలో దేవరవారు ఈ జీవులను ఉద్ధరించుటకు సర్వోత్తారకులుగా అవతరించినవారు! అటువంటి జన్మ విశేషము కలిగిన దేవరవారి తిరుముఖ మూలముగా తిరువాయ్మొళికి అర్థము తెలుసుకొను మహద్భాగ్యమును పొందితిని గదా అను విస్మయమొందు చుంటిని!”, అని బదులిచ్చెను. ఉడయవర్లు సంతోషించి పిళ్ళాన్ ను ఆనాటి రాత్రి పేరరుళాళన్ అయిన వరదరాజ స్వామి సన్నిధికి తోడ్కొని పోయి, తమ తిరువడిగళ్లను అతని శిరస్సుపై ఉంచి, “ఇక ఈ పాదములే మీకు రక్ష అని నమ్మండి! రాబోవు కాలమందు మిమ్ములను ఆశ్రయించిన వారికిన్నీ వీటినే రక్షకములుగా చూపించండి! రేపటి నుంచి వరదరాజ స్వామి సన్నిధిలో తిరువాయ్మొళికి విష్ణు పురాణ సాంఖ్యముగా (6000 శ్లోకములు గల విష్ణు పురాణమునకు సామ్యముగా) వ్యాఖ్యానమును రాయండి”, అని ఆదేశించిరి!

ఉడయవర్లు తమ శిష్యులైన కూరత్తాళ్వాన్, ముదలియాణ్డాన్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్ లతో కూడి భగవద్విషయమునకు వ్యాఖ్యాన సహిత కాలక్షేపములు గావిస్తున్న రోజులలో ఎందరో ఆచార్యులు ఉడయవర్లను ఆశ్రయించి శిష్యులయ్యారు ! అలా అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు ఉడయవర్లను ఆశ్రయించిరి! అయితే ఉడయవర్లు వారిని అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల చేత సమాశ్రయణము చేయించిరి! అంతట అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ తమ శిష్యులతో, ” పిచ్చుక కంఠానికి తాటికాయ కట్టినట్టు మీ అందరి బాధ్యత మోయుటకు నాకు శక్తి లేదు! సర్వోత్తారకులైన ఉడయవర్ల శ్రీ చరణాలే మీకూ మాకూ మనందరికీ దిక్కు!!”. అని బోధించెను! ఉడయవర్లు కూడా వారితో, “మీకు మా మూలముగా భగవత్సంబంధము కలిగించలేదని దిగులు పడకండి! మీ అందరి యొక్క ఉత్తారక బాధ్యత మా మీదనే ఉన్నది! మా చరణాలనే నిత్యమూ ధ్యానించండి!” అని చెప్పెను!

ఉడయవర్లు వారి శిష్యులు తిరుమల వెళ్ళి  తిరువేంగడముడైయాన్ అయిన శ్రీనివాసునికి  మంగళశాసనము చేయుటకు వరదరాజ పెరుమాళ్ళ వద్ద అనుమతి పొంది బయలుదేరిరి! నమ్మాళ్వార్లు “విణ్ణోర్ వెర్పు (తిరు-1-8-3) నిత్యసూరులు నివసించు కొండ” అని కీర్తించినట్టు, నిత్యసూరులే నిత్యము వచ్చి స్వామి కైంకర్యము చేసుకునే మహిమాన్వితమైన ఆ తిరుమల పర్వతమును కాలితో తొక్కి అపవిత్రము చేసి కొండను అగౌరవ పరచరాదన్న అభిప్రాయము కలిగి ఉడయవర్లు తిరుపతిలోనే నిలిచిపోయినారు! “తానే తొళుమ్ అతిశయుత్తు నొక్కీయే (తిరు – 6-5-5)- తానే ఆ దిశను చూస్తూ నమస్కరిస్తున్నది” అన్నట్లుగా తిరుమలేశుడు వేంచేసిన దిశవైపు చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోదామని అనుకున్నారు ఉడయవర్లు! అయితే తాము అంతకు ముందే స్వామి కైంకర్యము కొరకు నియమించిన అనంతాళ్వాన్ మరియు తక్కిన శ్రీ వైష్ణవులు, “మీరు కొండ ఎక్కనిచో మేము కూడా ఎక్కము! ఇకపై ఎవరును ఎక్కజాలరు! కనుక దేవరవారు అవశ్యం తిరుమల కొండ ఎక్కవలెను!”, అని ప్రార్థించెను! వారి విన్నపము మన్నించి ఉడయవర్లు, “పాదేనాధ్యారోహతి (ఛాన్దోగ్యోపనిషత్) – ముక్తుడు పాదముతో ఎక్కుతున్నాడు”, శ్రీ వైకుంఠనాధుని ఆజ్ఞతో పాదపీఠం పై కాలుమోపి అధిరోహించినట్లే, తిరుమలేశుని ఆజ్ఞానుసారం ఉడయవర్లు తిరుమల కొండ ఎక్కినారు! “ముడియుడై వానవర్ ముఱై ముఱై ఎదిర్గొళ్ల (తిరు -10-9-5) – కిరీటధారులైన నిత్యసూరులు క్రమానుసారముగా ఎదురు వచ్చి ముక్తుని ఆహ్వానించగా”, అనునట్లు తిరుమలలో స్వామి కైంకర్యపరులైన తిరుమల నంబి శ్రీ వైష్ణవ పరివారముతో పెరుమాళ్ళ తీర్థ ప్రసాదములను గైకొని ఎదురు వచ్చి ఉడయవర్లను ఆహ్వానించెను! ఉడయవర్లు భక్తితో దండం సమర్పించి తీర్థ ప్రసాదములు స్వీకరించి వయో వృద్ధులైన తిరుమల నంబిని ఉద్దేశించి, “మీరు ఇంత శ్రమ తీసుకోవాలా? చిన్నవారు ఎవరూ లేరా? ” అని అడుగగా నంబి, “నాలుగు మాడ వీధులలో ఎంత వెదకినను నాకన్నా చిన్నవాడు ఎవరూ కనపడలేదు! సాక్షాత్ ఆ తిరుమలేశుడే వచ్చి స్వాగతం పలకాలి! సర్వ జీవ ఉద్ధారకులైన మీవంటి మహానుభావుని ఆహ్వానించుటకు నాకు ఏ మాత్రము అర్హత లేదు! అయినా పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి నేను రాక తప్పలేదు”, అని నిగర్వముగా సమాధానమిచ్చెను! వారి యొక్క నిర్మలమైన నిరహంకార మనస్సుకు పులకితులైన ఉడయవర్లు మరి మరి దండం సమర్పిస్తూ సన్నిధిలోకి వేంచేసి పెరుమాళ్ళకు దండం సమర్పించి మంగళాశాసనము చేసి నిలువగా, ఆ ఆనందనిలయవాసుడు పరమానందముతో అర్చకముఖేన ఇట్లనెను, “మేము మీకు మా దక్షిణ గృహమైన శ్రీ రంగములో ఉభయ విభుతి ఐశ్వర్యములను ప్రసాదించి జగత్తును ఉద్ధరించుటకు నియమించితిమి కదా! ఇక ఏమి కొరవ ఉన్నదో చెప్పండి! ప్రసాదించెదము!” !

అంతట ఉడయవర్లు పెరుమాళ్ళకు దండము సమర్పించి,”స్వామి! కిడందదోర్ కిడక్కై (తిరుమాలై-23) – శయనించిన రూపము అద్వితీయము” అనియు, మరియు, “పిరాన్ ఇరుందమై (తిరు-6-5-5) – స్వామి కూర్చున్న అందము” అనియు మరియు, “నిలైయార నిన్ఱార్ (పెరియ తిరు-6-9-8) – నిలుచున్న స్వామి అందము”, అనియు దేవరవారి శయన, ఉపవిశ్య, ఉత్తిష్ట భంగిమలు ఎంతో అందముగా ఉంటాయి! శయన సౌందర్యమును శ్రీ రంగములో అనుగ్రహించితివి! నిలిచి ఉన్న భంగిమలో నీయొక్క సౌందర్యము హస్తిగిరిలో (కాంచీ పురము) అనుభవించితిమి! “అమరర్ మునిక్కణంగళ్ విఱుమ్బుమ్ తిరువేంగడత్తానే! (తిరు – 6-10-10) – దేవతలు, మునులు ఎంతో ఇష్టపడే ఓ తిరుమలేశుడా! “, అనునట్లు, ఈ తిరుమలలో గుణనిష్టులు, నీ యొక్క కైంకర్యపరులకు నీ దర్శనమును అనుగ్రహించెడి సన్నివేశం కనులార వీక్షించవలెనన్న కాంక్షతో వరదరాజ స్వామి వద్ద అనుమతి గొని నీ సన్నిధికి వచ్చితిమి!”, అని భక్తి పూర్వకముగా బదులిచ్చెను! అంతట పెరుమాళ్ళు, “అయితే ఇచటకు రండి” అని తమ వద్దకు పిలిచి తమ శ్రీచరణముల వద్ద శిరస్సు వంచమని, “మా తిరువడిని నిత్యమూ స్మరించి దర్శనాన్ని నిర్వహించండి! ఉభయ విభూతులకున్నూ మీరే అధికారి! మీ అభిమానములో ఒదిగిన వారే మాకు ఆప్తులు! అందరిని మాకు దాసులు అయ్యే రీతిలో సంస్కరించండి! జగత్తును ఉద్ధరింపచేయుట కొరకే మిమ్ములను మేము అవతరింప చేసితిమి! మీతో సంబంధము కలవారికి ఏ కొరతా ఉండదు! “శూళల్ పల పల (తిరు -1-9-2) – చేసిన ఉపాయములు అనేకములు”, అనునట్లు ప్రపన్నుల కొరకు మేము ఎన్ని అవతారాలెత్తి వెదకినను లభించ లేదన్న కొరతతోనే శ్రీ వైకుంఠమునకు వెళ్ళి పోయాము! ఆ కొరతను మీరు తీరుస్తారని విశ్వసిస్తున్నాము! మా నమ్మకమును నిజము చేసి చూపించుము!”, అని తిరుమలేశుడు ఉడయవర్లకు బదులిచ్చెను! ఈ విధముగా తిరుమల పెరుమాళ్ళు కూడా ఉడయవర్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించెను!

అచట నుంచి ఉడయవర్లు వారి శిష్య గణము తిరుక్కురుంగుడి వెళ్ళిరి. అక్కడ వేంచేసి ఉన్న తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళు ఉడయవర్లను సాదరముగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించి వారితో ఇట్లనెను, “”బహూని మే జన్మాని వ్యతీతాని (భగవద్గీత 4-5) – నా జన్మలు అనేకములు గడిచినాయి”, అనునట్లు ఎన్ని జన్మలు లోక కళ్యాణార్థమైన మేము ఎత్తిననూ మాకు మావారని ఎవ్వరూ లభించక, “అసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని, మమ ప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్ (భగవద్గీత 16-20) – దుష్ట యోనులలో ముఢులై ఎన్నో జన్మలు ఎత్తిన జీవులు నన్ను పొందకనే మరింత అధోగతి పాలవుతున్నారు”, అనునట్లు అసురప్రకృతి కలవారై అధోగతి పాలవుతున్నారు! కానీ ఇప్పుడు అదే జనులు మిమ్ములను ఆశ్రయించి తరించుచున్నారు! ఈ విధముగా మీరు వారిని ఆకర్షించుకున్న ఉపాయమేమి? ఆ ఉపాయము మీరు మాకు కూడా చెప్పవలెను!”, అని తిరుక్కురుంగుడి నంబి ఉడయవర్లను అడుగగా ఉడయవర్లు, “దేవరవారు సర్వజ్ఞులు! అయినా మీరు అడిగినారు కనుక చెప్పెదము! అయితే ఆ ఉపాయము తెలుసుకొనుటకు అడగవలసిన విధము కలదు! ఆ విధమున మీరు అడిగినచో ఆ దివ్య రహస్యమును మీకు చెప్పగలము!”, అని బదులివ్వ నంబి తమ మూల స్థానము నుంచి క్రిందకి వచ్చి కింద చిత్రాసనముపై కూర్చుని ఉడయవర్లను తమ సింహాసనముపై కూర్చుండ బెట్టి అందరిని బయటకి పంపించేసి, “ఇప్పుడు అషట్కకర్ణముగా ఉన్నది! అనుగ్రహించ వచ్చును!”, అని అనగా ఉడయవర్లు, “నివేశ్య దక్షిణే స్వస్య వినతాంజలి సంయుతం, మూర్ధ్ని హస్తం వినిక్షిప్య దక్షిణం జ్ఞాన దక్షిణం, సవ్యం తు హృది విన్యస్య కృపయా వీక్షయేత్ గురుః, స్వాచార్యం హృదయే ధ్యాత్వా జప్త్వా గురుపరంపరామ్, ఏవం ప్రపద్య దేవేశం ఆచార్యం కృపయా స్వయం, అధ్యాపయేన్మన్త్ర రత్నం సర్షిచ్ఛన్ధోధి దైవతం – వినయముతో అంజలి చేసిన శిష్యుని తన దక్షిణ దిక్కులో కూర్చొనపెట్టుకుని, అతని తలపై జ్ఞాన దక్షిణమైన కుడి చేతిని ఉంచి, ఎడమ చేతిని తన గుండెపై పెట్టుకుని, గురువు ఆ శిష్యుని కటాక్షించాలి! తన ఆచార్యుని హృదయమందు ధ్యానించి, గురుపరంపరను జపించి, భగవానుని, ఆచార్యుని శరణు వేడి, కృపతో స్వయముగా మంత్రరత్నమును, ఋషి – ఛందస్సు – అధిదేవతల సహితముగా మంత్రమును ఉపదేశించవలెను!”, అనువిధముగా తిరు మంత్రమును మరియు ద్వయ మంత్రమును నంబి యొక్క కుడి శ్రీ కర్ణ మందు ఉడయవర్లు ఉపదేశించిరి!

అంతట ఉపదేశము పొందిన నంబి పరమ సంతోషముతో, “మేము ఒకనాడు బదరికాశ్రమము నందు శిష్యాచార్య రూపేణ తిరు మంత్రమును బహిర్గతము చేసితిమి! అచట మేమే శిష్యునిగా మరియు ఆచార్యునిగా ఉండితిమి! కానీ అన్యుని ఆచార్యునిగా స్వీకరించి మేము శిష్యులమై ఉండి ఉపదేశము పొందుట ఇప్పటివరకు జరుగలేదే అనే పెద్ద కొరతతో ఉంటిమి ఇన్నాళ్ళున్నూ! ఆ కొరత నేడు మీమూలముగా తీరినదే! ఇక ఈనాటి నుంచి మేము కూడా రామానుజుల శిష్యులలో ఒకరిగా ఆవిర్భవించితిమి కదా! ఈ నాటి నుంచి మేము వైష్ణవ నంబి అయినాము! “, అని అనుగ్రహించిరి! అయితే నంబి యొక్క శిష్యత్వము వారి యొక్క స్వాతంత్ర్య గుణము యొక్క పరాకాష్ట అని తాత్పర్యము! అందరికి ఆదిగురువైన ఆ పరమాత్మ (తిరుక్కురుంగుడి నంబి) రామానుజుల వద్ద శిష్యరికము చేయుటలో ఉన్న ప్రభావమును గుర్తించి వారి వద్ద శిష్యరికమునకు ఆశపడుట కేవలం ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును లోకమునకు చాటుట కొరకే కదా!

నడాదూరు అమ్మాళ్  శ్రీ చరణాలను ఆశ్రయించి పన్నెండు మంది శిష్యులు శ్రీ భాష్యమును అధికరించుచున్న కాలమందు, “భక్తి ప్రపత్తులు దుశ్శకములు, స్వరూప విరుద్ధములు, విశ్వాస దుర్లభములు కనుక అవి ఆచరించలేని నిస్సహాయుడైన చేతనునికి ఇక ముక్తి ఏ విధంగా కలుగుతుంది? “, అను సంశయమును శిష్యులు అమ్మాళ్ వద్ద అడుగగా వారు, “ఇవి రెండూ లేని వారికి ఉడయవర్ల శ్రీ చరణములే దిక్కు! అంతకన్నా వేరే దారి లేదు! నేను నమ్మిన సత్యమూ అదే!”, అని బదులిచ్చెను! అమ్మాళ్ చరమదశలో శిష్యులు వద్దకు చేరి తాము తరించుటకు దారేదని అడుగగా వారు, “భక్తి ప్రపత్తులు ఆచరించండి! అవి దుష్కరములుగా తోచినచో రామానుజుల దివ్య చరణయుగళాన్ని పట్టి ఉండండి! అవే మీకు రక్షకములని విశ్వసించండి! ఇక మీ సంతోషమునకు కొరత రాదు!”, అని బదులిచ్చెను! “ప్రయాణకాలే చతురః స్వశిష్యాన్ పదాంతికస్థాన్, వరదో హి వీక్ష్య, భక్తిప్రపత్తీ యది దుష్కరే వో రామానుజార్యమ్ నమతేత్యవాదీత్!! – వరదులనబడే నడాదూరు అమ్మాళ్ తమ ప్రయాణకాల మందు తమ పాదాలను ఆశ్రయించిన శిష్యులను చూచి, “భక్తి ప్రపత్తులు మీకు ఆచరణ సాధ్యములు కాకున్నచో రామానుజులను శరణాగతి చేయండి!”- అని అన్నారు”, అని చెప్పిన అర్థము సుప్రసిద్ధము కదా!!

కారాంజి గ్రామస్థులైన సోమాసియాణ్డాన్ ఉడయవర్లకు అభిమాన శిష్యులు! చాలా రోజులు శ్రీ రంగములో  ఉండి ఆచార్య కైంకర్యము చేసుకొని తమ స్వగ్రామానికి వెళ్ళినారు! అయితే కొన్నాళ్ళకు భార్యాభిమానములో మునిగిన సోమాసియాణ్డాన్ ఆచార్య కైంకర్య విషయమును విస్మయించి ఉడయవర్లను సేవించుటకు శ్రీరంగము వెళ్ళలేదు! సోమాసియాణ్డాన్ తమ స్వగ్రామములో ఉడయవర్లకు ఆలయము కట్టించవలెనని సంకల్పించి విగ్రహము చేయించారు! అయితే విగ్రహము తమకు నచ్చినట్టు రానందున మరియొక శిల్పము చెక్కించవలెనని స్థపతికి చెప్పెను! ఆనాటి రాత్రి సోమాసియాణ్డాన్ కు స్వప్నములో ఉడయవర్లు సేవ సాయించి, “నీవు ఎందుకు నన్ను బాధించి నా విగ్రహము తయారు చేయుచుంటివి? నా పట్ల అభిమానమే ఉత్తారకమని గ్రహించని నీవు నా విగ్రహమునకు ఎట్లు శరణాగతి చేయగలవు?”, అని తెలుపగా ఉలిక్కిపడి లేచిన సోమాసియాణ్డాన్ తాను తప్పు చేయుచున్నట్లు గ్రహించి తమ భార్యను వెంటబెట్టుకుని శ్రీ రంగము వెళ్లి ఉడయవర్ల పాదాలపై బడి చంటి పిల్లవాని వలె విలపించెను! అంతట ఉడయవర్లు కారణమేమని అడుగగా సోమాసియాణ్డాన్ తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి క్షమించమని ప్రార్థన చేసిరి! దానికి ఉడయవర్లు సమాధానమిస్తూ, “నీకున్న స్త్రీ ఆసక్తి ని వదిలించుట కొరకే మేము అటుల స్వప్నమందు దర్శనమిచ్చితిమి! అంతే కానీ నీ మీద మాకు కోపము లేదు! నీవెక్కడ ఉన్ననూ నీ బాధ్యత మాదే కదా!! నీ యొక్క భారములన్నియు మాపై ఉంచి నిర్భయముగా జీవించుము!!”, అని చెప్పినట్లు మన పెరియ వాచ్చాన్ పిళ్ళై గారు అనుగ్రహించిరి!!

కణ్ణియనూర్ ఆచ్చాన్ ధరించిన దుస్తులతోనే కావేరి యందు స్నానమాడి (సాధారణముగా స్నానము ధరించిన దుస్తులతో చేయరాదు! వేరే దుస్తులు ధరించి స్నానమాచరించ వలెను! చర్మ కైంకర్యము లందు, చక్ర స్నాన మందు మరియు సత్య ప్రమాణము చేయు సమయ మందు మాత్రమే ధరించిన దుస్తులతో స్నానము చేయవలెనని శాస్త్రము చెప్పుచున్నది !) పెరియ తిరుమండపమును నందు శ్రీవైష్ణవులందరిని రావించి, శ్రీ శఠకోపము తలపైనుంచుకొని ఇట్లు చెప్పిరి:

సత్యమ్ సత్యమ్ పునస్సత్యమ్ యతిరాజో జగద్గురుః |
స ఏవ సర్వ లోకానామ్ ఉద్ధర్తా నాస్తి సంశయః ||

అర్థము: ఇది సత్యము ! ఇది సత్యము !ఇదే సత్యము ! మన యతిరాజులే జగద్గురువులు!! వారు మాత్రమే సర్వ లోకములను ఉద్ధరించ గలవారు!! ఇది నిస్సంశయము!!

అక్కడ గుమిగూడిన అందరిని ఉద్దేశించి ఆచ్చాన్ ఇట్లు ఘోషించెను, “ప్రపన్న కులమునకు చెందిన అందరు శ్రీ వైష్ణవులకు భగవద్రామానుజులే రక్షకులు! వారి శ్రీ చరణాలు మనకు ఉద్ధారకము! నా మాటను నమ్మండి !”

వచ్చే అధ్యాయములో ఉడయవర్ల ఉత్తారకము గురించి మరిన్ని ఐతిహ్యములు తెలుసుకుందాం!!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org