Monthly Archives: February 2017

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< తత్త్వత్రయం – త్రివిధ తత్త్వములు

భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని) వేంచేసి ఉంటాడు – పరత్వం (పరమపదమున), వ్యూ హ(క్షీర సముద్రమున), విభవ (రామ కృష్ణాది అవతారములు), అంతర్యామి (యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు, మఠం, గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని రూపమున.

మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం
తక్క నెఱియుం తడైయాగిత్తొక్కియలుం
ఊళ్ వినైయుం వాళ్ వినైయుం  ఓదుం
కురుగైయర్ కోన్ యాళిన్ ఇశై వేదత్తియల్ 

– తిరువాయ్మొళికి  పరాశరభట్టర్ అనుగ్రహించిన తనియన్

ఆళ్వార్ తిరునగరి నివాసి మరియు అధికారియైన నమ్మాళ్వార్ అనుగ్రహించిన  తిరువాయ్మొళి అను వీణానాదం అతి ముఖ్యమైన ఐదు అంశములను చాలా శ్రావ్యంగా పలుకుతుందట. ‌అవి – పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని (పర స్వరూపం) – జీవాత్మ స్వభావం (జీవాత్మ స్వరూపం) – ఉపాయ స్వరూపం (జీవాత్మ పొందవలసినది) – విరోధి స్వరూపం (పరమాత్మను పొందుటకు అడ్డంకులు) – ఉపేయ స్వరూపం (పరమాత్మను పొందుటకు పరికరం).

అర్థ పంచకం అనగా “ఐదు అంశములు” (అత్యంతావశ్యకంగా తెలుకోవలసినవి). పిళ్ళై లోకాచార్యులు తమ రహస్య గ్రంథములలో ఈ ఐదు అంశములను “అర్థపంచకం” అను పేరుతో  కృప చేశారు. ఈ గ్రంథమంతా ఈ ఐదు అంశముల సంకలమే.

ఈ గ్రంథములోని ఈ విషయాలను పరిశీలిద్దాం:

  • జీవాత్మ ఇది తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.

1) నిత్యసూరులు: పరమపదమున అనాదిగా నివసిస్తున్నవారు. (శ్రీ వైకుంఠం – నిత్యం భగవదానందానుభవం చేయు స్థలం)

2) ముక్త్మాత్ములు: ఆత్మ విమోచనం పొంది పరమపదమును చేరు కున్నవారు (అంటే ఒకానొక జన్మలో సంసార బంధ వాసన కలిగి ఉన్నవారు).

3) బద్ధాత్ములు: సంసార బంధముననే అతి అభిలాష కలవారు.

4) కైవల్యులు: మోక్షమును పొందిన ఆత్మలు (సంసారం నుండి విముక్తి పొందిన వారు). కాని ఆత్మాను భవమును కోరుకొనేవారు (అనగా భగవత్ కైంకర్యమునకు అతి దూరులు) భగవదనుభవమున ఆశ లేనివారు.

5) ముముక్షువులు: సంసారంలో ఉండి విముక్తినిపొంది భగవానునికి నిత్య కైంకర్యము చేయాలనుకొనేవారు.

1) పరత్వం: పరమపదమున వేంచేసి ఉండు దివ్యమైన రూపం.

2) వ్యూహం: క్షీరాబ్ధిలో ఉండు అనంతశయనుని రూపాలు. ఇవి సంకర్షణ (సృష్ఠి), ప్రద్యుమ్న (స్థితి), అనిరుద్ధ (లయ) రూపాలు.

3) విభవ: శ్రీ రామ, శ్రీ కృష్ణ వంటి అవతారములు.

4) అంతర్యామి: ఆత్మ లోపల నివాసముండువాడు. ఇతను రెండు రూపములచే వేంచేసి ఉంటాడు – ఒకటి ఆత్మలోనుండు రూపం, మరొకటి హృదయంలో శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న ప్రకాశించు రూపం.

5) అర్చావతారం: ఆరాధనకు వీలుగా కంటికి కనిపించు రూపం. దేవాలయములు, మఠములు, గృహములలో వేంచేసి ఉన్న రూపం.

  • పురుషార్థం: పురుషుని (జీవుని) చేత సాధించ దగినది. ఇది ఐదు విభాగములు

1) ధర్మం:  లోక కళ్యాణార్థం చేయు కార్యములు.

2) అర్థ: శాస్త్రానుసారం సంపదను ఆర్జించుట.

3) కామ: ప్రాపంచిక సుఖములు.

4) ఆత్మానుభవం: స్వీయానుభవం

5) భగవత్ కైంకర్యం (పరమ పురుషార్థం): పరమపదమున భగవానునికి సర్వ విధ సేవలు చేయడం. భౌతిక శరీరమును వదలి పరమపదమునకు చేరి, దివ్య శరీరమును పొంది, నిత్య సూరులకు ముక్త్మాత్మలకు అర్పింప బడుట.

  • ఉపాయం: ఇది ఐదు విభాగములు

1) కర్మ యోగం: శాస్త్ర విహితమైన యఙ్ఞం, దానం, తపం మరియు ధ్యానం మొదలైన వాటిని ఆచరించుటచే ఇంద్రియ నిగ్రహం పొంది దీని ద్వారా అష్ఠాంగ యోగాదులను అనుష్ఠించి ఆత్మ తత్త్వం తెలుసుకొనుట. ఇది ఙ్ఞాన యోగమునకు సహకారిగా ఉండును. ఐహికమైన సంపదలపై నియంత్రణను చేయును.

2) ఙ్ఞాన యోగం: కర్మ యోగము ద్వారా ఆర్జించిన ఙ్ఞానముతో హృదయాంతర్గతుడై మనపైననే తదేక దృష్ఠి సారించిన భగవానుడైన శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేయుట. ఇది భక్తి యోగమునకు దోహద పడి కైవల్య మోక్షమును అందించును.

3) భక్తి యోగం: ఙ్ఞాన యోగ సహకారంతో స్థిరమైన ధ్యానము ఏర్పడుతుంది, ఇది పరమానందమునకు దారి తీసి పేరుకుపోయిన పాపాలను మరియు దుర్గుణములను తొలగించి వేసి చేరుకోవలసిన లక్ష్యమువైపు పయణం సాగేలా చేస్తుంది.

4) ప్రపత్తి: భగవానున్ని శరణు జొచ్చుట / ఆధీనమవుట. అత్యంత సులభమైనది మరియు ఆనందాను భవమును కలిగించునది. శీఘ్రముగా ఫలితములనిచ్చునది. ఒకసారి శరణాగతి చేశామా చాలు ఇక ఇతర వ్యాపారములన్నీ దీనికి అనుగుణంగా భగవత్ సేవలో భాగంగా మారి పోతాయి.

ఇది కర్మ, ఙ్ఞాన, భక్తి యోగములు అనుసరించలేని వారికి మరియు ఇవి అనుచితంగా లేని వారికి  అత్యంత సులభమైన మార్గం. (తాను భగవానునికి మాత్రమే చెందిన వాడిని అనే స్వరూప ఙ్ఞానం కలిగినప్పుడు స్వీయ రక్షణ, స్వప్రయత్నములు సరైనవి కావని తెలుసుకొంటాడు) దీనిలో రెండు విభాగములు – ఆర్త ప్రపత్తి – (ఈ భౌతిక జగత్తులో క్షణ కాలం కూడ ఉండడం సహించలేక పరమపదం చేరాలని త్వర ఉన్నవారు) మరియు ద్రుపద ప్రపత్తి (పరమపదమునకు చేరుకొనే వరకు ఈ భౌతిక జగత్తులో ఉంటు సర్వం భగవానునిపై భారము నుంచి  భగవత్భాగవత ఆచార్య కైంకర్యమును చేస్తుండే వారు).

5) ఆచార్య అభిమానం:  పైన చెప్పబడిన మార్గములన్నీ అనుష్ఠించడం క్లిష్ఠతరమైనప్పుడు ఆచార్యుడే (భగవదాఙ్ఞతో) పరమ కృపతో, ప్రేమతో అతనిని స్వీకరించి అతని రక్షణ భారాన్ని తాను స్వీకరించి ఙ్ఞానము నందించి మార్గదర్శం చూపుట. శిష్యుడు తన సర్వస్వం ఆచార్యుడే అని భావించి అతనిని వినమ్రతో సదా అనుకరించాలి.

విశేషసూచన: ఇక్కడ మనం ఉత్తారక ఆచార్యులైన (ఈ సంసారం నుండి ఉజ్జీవింప చేశేవారు) భగవద్రామానుజులను స్మరించాలి. అలాగే మనకు ఈ ఉత్తారకాచార్యులను చూపిన వారిని (స్వాచార్యులను) ఉపకారకాచార్యులుగా భావించాలి. మన పూర్వాచార్యులందరు దీనిని అనుష్ఠానమున ఉంచి భగద్రామానుజుల శ్రీ పాదములనే శరణు వేడారు.

విశేషంగా తెలుసుకోవాలన్న దీనిని పరిశీలించవచ్చుhttp://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html .

మణవాళ మాముణులు తమ ఆర్తి ప్రబంధమున  భగవద్రామానుజులకు పూర్తిగా వశుడై కైంకర్యం చేసిన వడుగ నంబి వలె తాము కూడ ఉండాలని ఆర్తి చెందారు.

  • విరోధి – ఈ అంశం మనను మన లక్ష్యమును చేరుకోకుండ అడ్డగించును. ఇది ఐదు విభాగములు

1) స్వరూప విరోధి: శరీరమునే ఆత్మగా భ్రమింప చేయును. భగవతేతర అంశములపై ప్రీతిని కలిగించి స్వతంత్రునిగా భ్రమింపచేయును.

2) పరత్వ విరోధి: ఇతర దేవతలను పరత్వముగా భావింప చేయును. దేవతాంతరములను భగవంతునితో సమానమనే భ్రమను కలిగించును. అల్ప దేవతలు సర్వ శక్తిమంతులని, భగవానుని అవతారములను సామాన్య మానవునిగా, భగవానుని అర్చా మూర్తిని కేవలం బొమ్మ అని భావింప చేస్తుంది.

3) పురుషార్థ విరోధి: భగవానుని కైంకర్యము కన్న ఇతరములపై వ్యామోహమును కలిగించును. భగవానుని సేవలో వ్యక్తిగత తత్త్వమునకు ప్రాధాన్యతను కలిగించును. (భగవానుని నియమమునకు వ్యతిరిక్తముగా)

4) ఉపాయ విరోధి: ఇతరోపాయములకు అధిక ప్రాధాన్యత నిచ్చుట. ఫలా పేక్షతో ఆశ్రయించడం. పరమపద  కైంకర్యముకన్న వీటిని అధికంగా భావించడం. (సర్వార్థ ఫలమునను అగ్రహించు ఆచార్య /  భగవానుని కంటే వీటిని అధికంగా నమ్ముట). అన్ని సమస్యలకు భీతి చెందుట. (ఆచార్య / భగవానునిపై నమ్మకలేని)

5) ప్రాప్తి విరోధి: పొందవలసిన దానిని పొందనీయకుండచేయును. ప్రస్తుత శరీరముతో దుశ్చర్యలను, భగవతాపచార, భాగవతాపచారములను చేయించును.

స్వామి పిళ్ళై లోకాచార్యులు అర్థ పంచకమును ఇలా వివరించి (సారం) ముగిస్తున్నారు.

ఈ అర్థ పంచక ఙ్ఞానమును పొందిన తర్వాత ముముక్షువు (మోక్షము నందు ఇచ్ఛ కలిగినవాడు) వర్ణాశ్రమ ధర్మాలకను గుణంగా ఆర్జిస్తు, వైష్ణవ నియమాలను పాటిస్తు, ఆర్జించిన దానిని తన శరీర పోషణ సరిపడే మాత్రమే స్వీకరించి మిగిలినది భగవానునికి  / భాగవతులకు సమర్పించి, ఆచార్యుని కృపతో ఙ్ఞానోదయం పొంది అతనికి సేవ చేస్తు జీవించాలి.

 భగవానుని ముందు వినమ్రతతో (భగవానుడే సర్వ శ్రేష్ఠుడని భావిస్తు), ఆచార్యుని ముందు అఙ్ఞానిలా (ఆచార్యుడే ఙ్ఞానాధికుడని భావిస్తు) శ్రీ వైష్ణవుల యందు ఆదరణ భావనతో (వారి వైభవమును తెలుసు కనుక), సంసారుల యందు హేయ భావమును ప్రదర్శిస్తు (భౌతిక సంసారులను దూరపరచుటకు) ఉండవలెను.

లక్ష్య సాధనకై త్వర / తృష్ణ కలిగి ఉండాలి, ఈ విధానముపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలి, అడ్డంకులను (విరోధములను) అధిగమించాలి, శరీరంపై వ్యామోహమును వదలాలి, ఆత్మ పరిపూర్ణత కలిగి ఉండాలి, తనకు తాను రక్షకుడనే విషయంలో అశక్తుడవ్వాలి, భగవానుని యందు కృతఙ్ఞతా భావం కలిగి ఉండాలి, ఆచార్యుని యందు కృతఙ్ఞతా మరియు విశ్వాసమును కలిగి ఉండాలి.

ఎవరైతే ఆచార్యుల ద్వార ఙ్ఞానము పొంది ఆ ఙ్ఞానమును అనుష్ఠానమున పెడతారో వారు భగవానునికి తన దేవేరల కన్నా, నిత్యసూరుల కన్నా మరియు ముక్తాత్మల కన్నా అధికంగా  ప్రీతి పాత్రుడవతారు.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం                                                               

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలం:  http://ponnadi.blogspot.in/2015/12/artha-panchakam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు – క్లుప్త సారాంశము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< రహస్య త్రయం

తత్త్వములు  ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు.

నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే  చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞాన పరిపూర్ణతను కలిగి ఉంటాయి.

ఈ సహజ ఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజ ఙ్ఞానమును పొందునో అప్పుడు అది నిత్యానందమును పొందును. ఈ జీవాత్మ మూడుగా విభజించబడింది – నిత్యసూరులు (పరమపదమున అనాదిగా ఉండేవారు), ముక్తాత్మ (ఒకానొకప్పుడు సంసార బంధమును ఉండి ముక్తిని పొందినవారు) మరియు బద్ధాత్మలు (ఈ సంసారిక లోకమున సంసార బంధం కలిగినవారు). మరలా ఈ బద్ధాత్మలు రెండుగా విభజించ బడ్డారు – మొదటి వారు భుభుక్షువులు (సంసారానుభవమును కోరుకొనేవారు) రెండవవారు ముముక్షువులు (ఈ సంసార బాధల నుండి ముక్తిని కోరుకొనేవారు). తిరిగి ఈ ముముక్షువులు రెండు రకములు – కైవల్యార్థులు (స్వీయ ఆత్మ సాక్షాత్కారం / స్వీయానందమును కోరుకొనేవారు) మరియు  భగవత్కైంకర్యార్థులు  (పరమపదమున భగవానునికి కైంకర్యము చేయాలని కోరుకొనేవారు ).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html  దర్శించండి.

అచిత్తు అనగా  ఈ స్థూల ఇంద్రియాలకు గోచరించు వైవిధ్యములు కలిగిన జడవస్తువులు. ప్రళయ కాలమున అవ్యక్తముగా (అదృశ్యముగా) ఉండి సృష్ఠి సమయమున వ్యక్తమవుతాయి (దృశ్యముగా). అచిత్తు లీలా మరియు నిత్య విభూతులలో ఉండును. సాధారణముగా ఈ భౌతిక జగత్తులో అచిత్తు స్వరూప ఙ్ఞానమును కప్పి వేస్తుంది అదే అలౌకిక జగత్తులో స్వరూప ఙ్ఞానమును ఉత్తేజపరుస్తుంది. మరలా ఈ అచిత్తు మూడు విధములు ఒకటి శుద్ధసత్వం (పరమ సాత్వికమైనది – కేవలం పరమపదముననే అగుపించును) రెండవది మిశ్రసత్వం (తమోరజోగుణమేళనం – ఈ సంసారమున అగుపించును) మరియు సత్త్వశూన్యం (గుణవిహీనమైనది – అదే కాలం (సమయం)).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html దర్శించండి.

ఈశ్వరుడు: శ్రీమహాలక్ష్మితో కూడి సర్వ శక్తిమంతుడు, పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు. భగవానుడు అనగా ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. అవి ఙ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు కళ్యాణ గుణములు తిరిగి అనేక కళ్యాణ గుణములుగా విస్తరిస్తాయి.  భగవానుడు అన్ని కళ్యాణ గుణములకు ఆశ్రయణీయుడు మరియు హేయ గుణములకు వ్యతిరిక్తుడు. చిత్తు మరియు అచిత్తులు భగవానుని  యందు లీనమై ఉంటాయి మరియు వాటికి అతనే ఆధారం – కావున అన్నింటికి ఆధారం మరియు  భరించేవాడు అతనే. అన్నింటికి సర్వాధికారి. చిత్తు అచిత్తులన్ని అతని దివ్య ఆనందమునకై ఉద్భవిస్తున్నాయి.

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html . దర్శించండి.

తత్త్వముల మధ్య సారూప్యతలు:

  • ఈశ్వరుడు మరియు చిత్తు (జీవాత్మ) ఇద్దరు ఙ్ఞానం కలిగిన వారే.
  • చిదచిత్తులు ఈశ్వరుని సొత్తు.
  • ఈశ్వరుడు మరియు అచిత్తులు తమ లక్షణాలను బట్టి చిత్తును పరివర్తనం చెందించే సామర్థ్యం కలవారు. ఉదాహరణకు జీవాత్మ అతిగా భౌతిక కార్య కలాపాల యందే నిమగ్నమైనప్పుడు అతను పదార్థముగా రూపాంతరం చెందుతాడు. ఒకవేళ జీవాత్మ భగవద్విషయము లందు నిమగ్నుడైతే అతను ఈ సంసారము నుండి విముక్తిని పొంది భగవానుని వలె ఆనందరూపాన్ని పొందుతాడు.

తత్త్వముల మధ్య భేధములు:

  • అన్నింటికన్న ఈశ్వరునికి భేధము / ఏకైక లక్షణం సర్వేశ్వరత్వం. అనగా సర్వఙ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు.
  • ఈశ్వరుని యందు దాసత్వం అనే విశిష్ఠ లక్షణం చిత్తు కలిగి ఉండును.
  • అచిత్తు ఙ్ఞాన శూన్యమైనది. ఇతరులకై మాత్రమే దీని ఉనికి.

పిళ్ళై లోకాచార్యుల తత్త్వత్రయం అను రహస్య గ్రంథమును ఇక్కడ పరిశీలించవచ్చు. http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html .

ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                              ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                  పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/thathva-thrayam-in-short.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్య త్రయం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

పంచ సంస్కారములలో ఒక్కటైన మంత్రోపదేశం అనే ప్రక్రియ (రహస్య మంత్రముల ఉపదేశము) చాలా ప్రథానమైనది. ఈ సంస్కారములో ఆచార్యునిచే మూడు రహస్య మంత్రములు శిష్యునికి ఉపదేశించ బడతాయి. అవి

*తిరుమంత్రం / అష్ఠాక్షరి మహామంత్రం – బదరికాశ్రమములో నారాయణ ఋషిచే నర ఋషికి ఉపదేశించ బడింది (వీరిద్దరు భగవానుని అవతారం).

   “ ఓం నమో నారాయణాయ ”  

సంక్షిప్తార్థం: భగవానునికే చెందిన ఈ జీవాత్మ భగవానుని ముఖోల్లాసమునకై జీవించాలి. సర్వేశ్వరుడైన నారాయణునికి మాత్రమే కైంకర్యమును చేయాలి.

* ద్వయ మంత్రం – విష్ణు లోకమున శ్రీమహాలక్ష్మికి శ్రీమన్నారాయణునిచే ఉపదేశించబడింది.

“ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ||   శ్రీమతే నారాయణాయ నమః ”   

సంక్షిప్తార్థం: శ్రియః పతియైన శ్రీమన్నారాయణుని శ్రీ పాదములను ఆశ్రయిస్తున్నాను. శ్రియః పతియై  సర్వసులభుడైన నారాయణుని శ్రీపాదముల నిస్వార్థ సేవ చేయుటకు ఉపాయముగా ఆశ్రయించుచున్నాను.

*చరమ శ్లోకం (భగవద్గీతలో భాగం): కురు క్షేత్రయుద్ధ రంగమున శ్రీ కృష్ణుడిచే అర్జునునకు  ఉపదేశించబడింది.

 

సర్వధర్మాన్  పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వాం
 సర్వపాపేభ్యో  మోక్షయిష్యామి మా శుచః ||

సంక్షిప్తార్థం: ఇతరోపాయములన్నింటిని సవాసనగ విడిచి నన్నే ఇతరోపాయ నిరపేక్షకునిగా నమ్మియుండుమా! సర్వ శక్తిమంతుడనైన నేను నిన్ను అన్ని ప్రతి బంధకముల నుండి విడిపింతును, దుఃఖింపకుమా! అని భగవంతుడు ప్రతిఙ్ఞా పూర్వకముగా ఉపదేశించెను.

 ఈ మూడు రహస్య మంత్రములకు రెండు విధములైన సంబంధ బాంధవ్యములు ఉన్నాయని మాముణులు తమ ముముక్షుపడి వ్యాఖ్యానమున తెలిపారు. (ద్వయ మహా మంత్ర వివరణలో)

  • విధి – అనుష్ఠానం (సిద్ధాంతం – ఆచరణ) తిరుమంత్రం జీవాత్మ మరియు పరమాత్మల మధ్య సంబంధమును తెలుపుతుంది. చరమ శ్లోకం పరమాత్మ జీవాత్మను తనకు ఆధీనం మవ్వమని ఆదేశిస్తుంది. ద్వయం జీవాత్మ పరమాత్మను ఆశ్రయించుటకు సదా ధ్యానమును చేయుమని తెలుపుతుంది.
  • వివరణ – వివరణి (సంక్షిప్త వర్ణన) తిరుమంత్రం “ఓం నమో నారాయణ” లో ప్రణవం (ఓం) గురించి తెలుపుతుంది.  ద్వయం, తిరు మంత్రమును వివరించును. చరమ శ్లోకం దీనినే అతి వివరంగా తెలుపుతుంది.

ఈ మూడు రహస్య మంత్రములలో ద్వయ మంత్రము మన పూర్వాచార్యులచే విశేషంగా ధ్యానించ బడి కీర్తింపబడింది. ఇదే మంత్ర రత్నముగా (అన్ని మంత్రములలో రత్నంవంటిది)  ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రం శ్రీమహాలక్ష్మి  పురుషాకార (మధ్య వర్తిత్వం/ సిఫారిస్) పాత్రను తెలుపుతుంది.

శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుడే జీవుల ఉజ్జీవనకు ప్రధాన కారణం. దేవరాజ గురు  (ఎరుంబియప్ప) “వరవరముని దినచర్య” లో మణవాళ మాముణుల పుణీతమైన దినచర్యను గ్రంథస్థ పరిచారు. ఆ విషయమై దీనిలోని 9వ శ్లోకములో –

మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం| తదర్థతత్త్వ నిధ్యాన సన్నద్ధపులకోద్గమం||

శ్రీమణవాళ మాముణు అధరములు (పెదవులు) నిరంతరం మంత్ర రత్నమును అనుసంధించు చుండును. ఈ ద్వయాను సంధానముచే (ద్వయం యొక్క వివరణే తిరువాయ్మొళి) వారి శరీరం పులకించి పోయేది – అని వివరణ. కావున ద్వయ మంత్రం  ఎప్పుడు కూడ స్వతంత్రముగా అనుసంధించరాదని – గురుపరంపర మంత్రం (అస్మద్గురుభ్యో నమః నుండి శ్రీధరాయ నమః వరకు) అనుసంధానం చేసిన పిమ్మట మాత్రమే ద్వాయానుసంధానం చేయాలని ఇది ఙ్ఞప్తికి తెస్తుంది.

మన పూర్వాచార్యులలో పరాశర భట్టర్ మొదలుకొని (అష్ఠశ్లోకి), పెరియ వాచ్చాన్ పిళ్ళై (పరందరహస్యం) , పిళ్ళై లోకాచార్యులు  (శ్రియఃపతి పడి, యాదృచ్ఛికపడి, పరంద పడి, ముముక్షు పడి) అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్  (అరుళిచ్చెయళ్ రహస్యం) మణవాళ మాముణులు (ముముక్షుపడి వ్యాఖ్యానం) మొదలైన వారందరు రహస్య త్రయమున వారి వారి వ్యాఖ్యానములలో విశదముగా తెలియపరచారు. ఈ ప్రబంధముము అన్నింటిలో అతి ప్రధానముగా ముముక్షు పడి నిలుస్తుంది మరియు శ్రీ వైష్ణవుల కాలక్షేపములలో ఈ గ్రంథమే సింహ భాగమును ఆక్రమిస్తుంది.

రహస్య త్రయం ముఖ్యంగా తత్త్వ త్రయం మరియు అర్థ పంచకంపైన దృష్ఠిని సారిస్తుంది. శ్రీ వైష్ణవులు తెలుకోవలసిన ముఖ్యార్థములలో ఇది ప్రధానమైనది.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org