మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు,దివ్య వైభవము కలిగిన శ్రీపిళ్ళైలోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.
ఇక స్వామి మణవాళ మహామునులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము
- “దేహోZహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
- “ఈశ్వరోZహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
- తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.
“యోzన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మప్రదమైన ప్రాపంచిక సుఖములనుభవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.
“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రమునందు విశ్వము గాఢాంధకారమైయుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని ఆశీర్వదించెను.
సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )
- “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం “, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభముగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించుకొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
- ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్రజ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నా:”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
- చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.
అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్రజ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్రజ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగునట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.
- అహంకార రహితులు
- జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
- ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు
మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించవచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:
- ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరువేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా. అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
- ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.
ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయముగలవైయుండును.
ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహామునుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమకృపాపూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందామ్!
మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org