Monthly Archives: August 2019

విరోధి పరిహారాలు – 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/10/virodhi-pariharangal-15/ .

చదవడానికి ముందు, శ్రీ వైష్ణవ తిరువారాదనంపై  మంచి అవగాహన కలిగి ఉండటాని  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2014/02/03/srivaishnava-thiruvaaraadhanam/ లోకి వెల్లి చదవండి.  ఈ క్రింది మొత్తం వ్యాసం ఈ అంశానికి సంబంధించినది.

47. సమారాధన విరోధి – ఇంట్లో ఎమ్పెరుమాన్కు తిరువారాదనం  చేసేటప్పుడు వచ్చే అవరోధాలు

   ఎమ్పెరుమాన్ యొక్క విభిన్న రూపాలు – పర (పరమపదంలో), వ్యూహ (క్షీరాబ్ది), విభవ (శ్రీ రామ, కృష్ణ, మొదలైన అవతారాలు), అంతర్యామి (అందరిలో ఉన్న పరమాత్మ), అర్చా (ఆలయంలో, ఇండ్లల్లో)

ఇంట్లో తిరువారాదనం

సమారాధనం అంటే ఇక్కడ కైంకర్య రూపంగా మనం ఇంట్లో ఎమ్పెరుమాన్కు చేసే పూజ అని అర్థం. దీనిని సాంప్రదాయకంగా తిరువారాదనం అని అంటారు. భగవత్ ఆరాదనం (తిరువారాదనం) ప్రేమపూర్వక భక్తితో ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. భగవత్ గీత 9.26 లో, భగవాన్ “పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తధహం భక్తి ఉపహ్రుతం అస్నామి ప్రయతాత్మనః” – పండు గానీ, జలం గానీ, పువ్వు గానీ, ఆకు గానీ నాకు భక్తితో సమర్పిస్తే నేను దానిని సంతోషంగా స్వీకరిస్తాను. ఈ విభాగంలో, భగవత్ ఆరాదనం చేసేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలో వివరించబడింది. చివరి భాగంలో, భాగవత ఆరాదనం (భక్తులను ఆరాధించడం) కూడా వివరించబడింది.

అనువాదకుల గమనిక: మన శ్రీవైష్ణవుల దినచర్యలో తిరువారాదనం చాలా ముఖ్యమైన భాగం. భగవాన్ గొప్ప కరుణతో తన భక్తుల ఇళ్లకు అర్చావతార రూపంగా దిగివస్తారు.  అటువంటి భగవానుని,  శ్రీవైష్ణవులు వారి ఇళ్ళల్లో జాగ్రత్తగా చూసుకోవలసిన ప్రాముఖ్యత చాలా ఉంది. మన సమాశ్రయణం (పంచ సంస్కారం) లో భాగంగా, ఆచార్యులు 5 పవిత్ర కార్యములు నిర్వహిస్తారు – 1) తపం (శిష్యుని భుజాలపైన వేడిచేసిన శంఖ చక్ర ముద్రలు వేయుట), 2) పుండ్రం (తిలకం  – తిరుమణ్ –  ఎమ్పెరుమాన్ శ్రీ పాదాలు మరియు మహాలక్ష్మి ఉనికిని సూచిస్తూ నిలువు గుర్తులు, 3) నామం ( దాస్య నామం – శిష్యునికి నామకరణం చేయుట), 4) మంత్రం (రహస్య మంత్రాన్ని ఉపదేశించుట, ఇది శిష్యులను సంసారం బారి నుండి బయటకు పడేస్తుంది) మరియు 5) యాగం (తిరువరాధన ప్రక్రియ) నేర్పుతారు. ఆచార్యులు చేత పంచ సంస్కారం అయిన తరువాత ఒక శిష్యుడు చేయవలసిన అతి ముఖ్యమైన కైంకార్యము ఈ తిరువారాదనం. శిష్యుడు తిరువారాదన ప్రక్రియను ఆచార్యుల నుండి సరిగ్గా నేర్చుకొని, వారి ఇంట్లో పెరుమాళ్కు చేయాలి. ఎమ్పెరుమానార్ వారి  గ్రంధం (సంస్కృతంలో) లో తిరువారాదన క్రమం గురించి వివరించారు. మణవాళ మామునులు వారి జీయర్ పడి తిరువారాదన క్రమం (తమిళం) లో ఇదే విషయాన్ని వివరించారు. తిరువారాదన కీర్తిని  చేయవలసిన పద్దతిని http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html లో వివరించారు. నిత్యానుష్టానం (రోజువారీ దినచర్యలు) పై మరిన్ని వివరాలను http://ponnadi.blogspot.in/p/anushtanam.html లో చూడవచ్చు.

  • ధర్మశాస్త్రం / నిషేధాలకు భయపడుకుంటూ తిరువారాదనం చేయడం మరియు ఎమ్పెరుమాన్ పట్ల భక్తి, ప్రేమపూర్వకంగా చేయక పోవడం ఒక అడ్డంకి. ఇది మనకు సరైన కైంకర్యం అన్న దృఢమైన  విశ్వాసంతో తిరువారాదనం చేయాలి.  అనువాదకుల గమనిక: భగవాన్ తన భక్తుల ఇళ్లకు ఎంతో కరుణ మరియు ప్రేమతో దిగివస్తారు. మనం చేయవలసింది ఆ ప్రేమకు ప్రతిస్పందించడమే.  తిరువారాదనం చేయడం ద్వారా, మనము వారితో ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా సంభాషిస్తాము. ఆ పరస్పర చర్య సరైనదిగా ఉండాలంటే, అపరిమితమైన శుభ లక్షణాలను కలిగి ఉన్నభగవాన్ యొక్క నిజమైన సేవకుడని జీవాత్మ (తాను స్వయం) అర్థం చేసుకోవాలి. ఆ అవగాహనే మనల్ని మన పూర్వాచార్యుల మార్గనిర్దేశం చేసినట్లుగా భగవంతుడిని సేవించడానికి దారి తీస్తుంది.
  • తిరువారాదనం చేసేటప్పుడు సోమరితనంతో ఉండకూడదు. తిరువారాదనం చేసేటప్పుడు ఎంతో ఆనందంతో , ఉత్సాహంతో ఉండాలి. అనువాదకుల గమనిక: తిరువారాదనం భయంతో (తిరువారాదనం సమయంలో, మనం సర్వోపరి భగవంతుడితో వ్యవహరిస్తున్నాం అని  ఎటువంటి పొరపాటులు చేయకూడదు) , ప్రేమపూర్వక భక్తితో (అటువంటి సర్వోపరి భగవాన్ మన ఆరాధనను  స్వీకరించడానికి దిగి వచ్చారు కాబట్టి మనం భక్తితో ప్రవర్తించాలి). అటువంటి వైఖరి ఉంటే, ఒక్క క్షణం కూడా బద్ధకం / సోమరితనానికి ఆస్కారమే ఉండదు.
  • తిరువారాదనం చేయటానికి వేరొకరిని నియమించడం సరైనది కాదు. ఇంట్లో వారి సోంత ఎమ్పెరుమాన్ని జాగ్రత్తగా వారే చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్రసిద్ధమైన వాక్యము మనం గుర్తుచేసుకోవాలి,   “అళ్ ఇత్తు అంధి తొళవో” ( మనం సంధ్యా వందనం చేయటానికి  ఎవరినైనా నియమించగలమా? లేదు – ఎవరైనా సరే, వారి నిత్య కర్మలను వారే చేయాలి) మరియు “మహిషీ స్వెతతత్తుక్ ఆళిడువారుణ్డో?” (తన భార్య (రాణి) చెమటను తుడిచిపెట్టడానికి సహాయకుడిని నియమించే రాజు ఎవరైనా ఉంటారా? లేదు – వారే ప్రేమతో చేస్తారు).
  • తిరువారాదనం తగిన సమయంలో చేయాలి –  మనకు సౌకర్యంగా ఉన్నప్పుడు కాదు. అనువాదకుల గమనిక: వరవరముని యొక్క పూర్వ / ఉత్తర దినచర్యలో తిరువారాదనం 3 సార్లు చేయాలని చూపించారు – ఉదయాన్నే సంక్షిప్తముగా ఒకసారి, మధ్యాహ్నం సమయంలో వివరంగా ఒక సారి, సాయంత్రం సంక్షిప్తముగా మరో సారి. సామాన్యంగా, తిరువారాదనం రోజు మధ్యలో జరుపుతారు. వైధికులను పంచ కాలా పరాయణులు అని పిలుస్తారు – రోజును ఐదు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగంలో కొన్నికార్యాలు చేస్తారు. ఐదు విభాగాలు ఇవి: అభిగమనం (మేల్కొనడం – ఉదయం శారీరక శుద్దీకరణలు చేయుట), ఉపాదానం (ముడి పదార్థాలను సేకరించడం), ఇజ్జా (దేవ పూజ – సేకరించిన పదార్థాలతో తిరువారాదనం చేయడం), స్వాధ్యాయం – వేదం, వేదాంతం, దివ్య  ప్రబందం మొదలైనవి నేర్చుకోవడం, చివరకు యోగం – ఎమ్పెరుమాన్ ఆలోచనలపై మనస్సు / శరీరాన్ని ధ్యానం చేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం. దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు విస్తృతమైన ప్రధాన తిరువారాదనం రోజు మధ్యలోనే జరుగుతుంది. అదేవిధంగా, పిత్రు కార్యములు (శ్రార్ధం మొదలైనవి) మధ్యాహ్నం 2 గంటల తర్వాత చేయాలి – ఇది పితృలకు తగిన సమయం.
  • కీర్తి కోసం తిరువారాదనం చేయడం మరియు ఇతరులు మనలను కీర్తింపజేయడం కోసం చేయడం ఒక అడ్డంకి. ఇది ఎమ్పెరుమాన్ కు కైంకర్యముగా చేయాలి.
  • తిరువారాదనం డబ్బుల కోసం చేయడం ఒక అడ్డంకి. ఉద్యొగ రూపముగా చేయకూడదు, బదులుగా దీనిని స్వయం ప్రయొజనం రూపము (ఎమ్పెరుమాన్ యొక్క పూర్తి ఆనందం కోసం చేయడం) గా చేయాలి.
  • తిరువారాదనం ఇతర కామ్య కర్మల వలె చేయకూడదు (ప్రతి ఫలాన్ని ఆశించే కర్మలు). ఇది ఎలాంటి కామ్యం లేకుండా కైంకర్యంగా చేయాలి. అనువాదకుల గమనిక: ఉదాహరణకు, స్వర్గ లోకం (ఇంద్రుని యొక్క నివాసం) సాధించడానికి, ఒకరు జ్యోతిష్టోమా నిర్వహిస్తారు. తిరువారాదనం అటువంటి భౌతిక ప్రయోజనాలను పొందడం కోసం కాదు – భగవాన్ యొక్క శాశ్వత సేవకుడన్న మన స్వరూపాన్నినిరూపించడం కోసం.
  • మన శరీరం (మరియు ఇంద్రియాలు) భగవానునికి సేవ చేయటానికి మరియు ఉద్ధరింపబడటానికి ఇవ్వబడినవి అన్న అవగాహన భావనతో తిరువారాదనం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: “విచిత్రా దేహ సంపతిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ క్రుతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత” అని చెప్పినట్లుగా, జీవాత్మ  సూక్ష్మస్తితిలొ (లయ స్థితిలో ) ఇంద్రియాలు / శరీరం లేకుండా, ప్రాపంచిక ఆనంద విహీనంగా,  విమోచన ప్రయత్నాలకు దూరంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు , పరమ దయతో సర్వేశ్వరుడు, తన యొక్క పాద పద్మాలను సమీపించే ప్రక్రియను ప్రారంభించడానికి జీవాత్మకు ఇంద్రియాలను / శరీరాన్ని ప్రసాదిస్తాడు. జీవాత్మ, ఆ ఇంద్రియాలను / శరీరాన్ని తన ఉద్ధరణకి ఉపయోగించి భగవానుని పొందుటకు బదులుగా, (తిరువాయ్మొళి 3.2.1 లో “నమ్మాళ్వార్” చెప్పినట్లుగా “అన్నాళ్ నీ తంత వళి ఉళల్వేన్”), శారీరక / ఇంద్రియ సుఖాలకై, ఒక వ్యక్తికి నదిని దాటడానికి ఒక తెప్పను ఇస్తే, వాడు ఆ నీటి ప్రవాహంతో పాటు వెళ్లి, చివరకు సముద్రంలో పడిపోయినట్లు , ఈ సంసారం నుండి ఉద్ధరింపబడడానికి జీవత్మాకు ఇచ్చిన ఇంద్రియాలను / శరీరాన్ని సంసారంలో మరింత ఎక్కువగా ఉపయోగిస్తాడు. తిరువరంగతు అముధనార్ కూడా ఇదే సూత్రాన్ని రామానుశనూఱ్ఱందాది పాసురం 67లో “మాయవన్ తన్నై వణంగ వైత్త కరణం ఇవై” అని వివరిస్తున్నారు – భగవాన్ జీవత్మలకు ఈ శరీరాన్ని వారి ఆరాధనకై ఇచ్చాడు. ఈ విధంగా మన పుట్టుక యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా మెలగాలి.
  • ఎమ్పెరుమాన్ నిత్య దాసుడై ఉండటం జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి సరిపోయే సహజ కార్యము అనే అవగాహనతో మనము ఎమ్పెరుమాన్ని ఆరాధించాలి. ఇది పైపైనగా చేయకూడదు.
  • భగవాన్ని అవాప్త సమస్త కామన్ అని పిలుస్తారు (తన కోరికలన్నీ ఇప్పటికే తీరిపోయినవాడు). వారు ఎవరి నుండి ఏమీ ఆశించరు కనుక వారిని నిరపేక్షుడు (కోరికలు లేనివాడు) అని పిలుస్తారు. మనము మన స్వరూపానికి తగినట్టుగా మన బాధ్యతను నెరవేర్చడానికి తిరువారాదనం చేయాలి. భగవానుడు మనపై ఆధారపడి ఉన్నాడని  మనం అనుకోకూడదు. అనువాదకుల గమనిక: భగవాన్ సర్వ స్వతంత్రుడు (సంపూర్ణ స్వతంత్రుడు). జీవాత్మ పూర్తిగా వారిపై ఆధారపడి ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో, భగవానుడు అర్జునుడికి రథసారధిగా (సేవకుడు) ఉన్నాడు. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని ముముక్షుప్పడి చరమ శ్లోక ప్రకరణం సుత్రం 247 లో అందంగా వివరించారు. “కీళిల్ పారతంత్రియముం ఇంత స్వాతంత్ర్యత్తినుడైయ ఎల్లై నిలమిఱే”. ఈ అందమైన వివరణ నుండి మన పూర్వాచార్యుల యొక్క తేజస్సును అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ, ఈ విభాగంలో, పిళ్ళై లోకాచార్యులు “అహం” గురించి చర్చిస్తున్నారు – ఇక్కడ భగవాన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యులు దీనిని చరమ  శ్లోకం యొక్క మొదటి వరుసలో “మాం” తో కలుపుతున్నారు, ఇక్కడ శ్రీక్రిష్ణుడు రథసారధిగా (తక్కువైన సేవకుడిగా) తనను తాను చూపిస్తూ అర్జునుడిని తనపై పూర్తిగా ఆధారపడమని చెబుతాడు.  భగవాన్ తన భక్తుల ముందు ఇంత తక్కువ స్థానాన్ని చేపట్టడం వారి అత్యున్నత ఆధిపత్యానికి నిదర్శనమని పిళ్ళై లోకాచార్యులు వివరించారు. అదేవిధంగా, భగవాన్ అర్చా విగ్రాహ రూపాంలో వారి భక్తుల ఇళ్లల్లోకి దిగిరావడం, భక్తులపై పూర్తిగా ఆధారపడటం, వారి యొక్క అత్యున్నత స్వాతంత్ర్యానికి మరియు అత్యున్నత సౌలభ్యానికి నిదర్శనం.
  • భగవాన్ ప్రతి వస్తువుకీ అధిపతి, అన్నింటినీ నియంత్రించువారు అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారు వారి పదార్థాలతోనే తిరువారాదనం స్వీకరిస్తున్నారు అని భావించాలి. మన స్వంత పదార్థాలతో ఎమ్పెరుమాన్ కి తిరువార్ధనం చేస్తున్నామని అనుకోకూడదు. మనం కొన్ని పండ్లు లేదా ఆహారాన్ని అర్పిస్తున్నపుడు “అతను తన సొంత పదార్థాన్నిస్వీకరిస్తున్నాడు, ఏదీ మనకు చెందినది కాదు” అని భావించి అతనికి సేవ చేయాలి. అనువాదకుల గమనిక:    శాస్త్రంలో “స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్తితం” అని చెప్పబడింది – జీవాత్మ భగవాన్ సొంతం, భగవాన్ యజమాని. ఇదే సూత్రం అచిత్ కి కూడా వర్తిస్తుంది – ప్రతి వస్తువుకీ భగవాన్ యజమాని. ఒకసారి ఈ జ్ఞానాన్ని జీవాత్మ సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత, అతను ఎమ్పెరుమాన్ కు శాశ్వతమైన సేవ కోసం పరితపిస్తాడు.
  • తిరువారాదనం మనలను శుద్ధి చేసుకోవటానికి చేయాలి కాని ఎమ్పెరుమాన్ని శుద్ధి చేస్తున్నామని అనుకోకూడదు (తిరుమంజనం – దివ్య మంగళ స్నానం చేయడం ద్వారా) మొదలైనవి. భగవాన్ ఎల్లప్పుడూ శుద్ధ స్తితిలో ఉంటారు, వారిని  అందణన్, కుందన్, అమలన్… అని పిలుస్తారు. మనం లోపాలు మరియు మలినాలతో నిండి ఉన్నాము. ఎమ్పెరుమాన్ను ఆరాధించడం ద్వారా, మనం పరిశుద్ధులమౌతాము (మనస్సు నిరంతరం ఎమ్పెరుమాన్ ఆలోచించనలలో నిమగ్నమై ఉండటం వల్ల). అయినప్పటికీ, తిరువారాదనం చేయడానికి ముందు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, స్నానం చేసి ధౌత వస్త్రం ధరించాలి (సరిగ్గా ఉతికి ఆరబెట్టిన శుభ్రమైన బట్టలు), నిత్యా కర్మానుష్ఠం చేసి మరియు ప్రపన్నల యొక్క నిత్యకృత్యాలను పాటించాలి.  మనం నిత్యారాధనలో పాల్గొనడం వలన శుద్ధి అవుతున్నాము కదా ఇంకే శుద్దీకరణ అవసరం లేదు అని అనుకోకూడదు. అనువాదకుల గమనిక: శరీరం మరియు మనస్సు రెండూ శుద్ధి చేయబడాలి. శరీర శుద్దీకరణ స్నానం మొదలైన వాటి ద్వారా జరుగుతుంది మరియు ఎమ్పెరుమాన్ మరియు వారి కళ్యాణ లక్షణాలను నిరంతరం ధ్యానించడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. ఎమ్పెరుమాన్ స్వచ్ఛమైనందున, జీవాత్మ వారి చింతన / ఆరాధనలో నిమగ్నమైనప్పుడు, జీవాత్మ కూడా పరిశుద్ధుడు అవుతాడు.
  • తిరువారాదనం చేసే సమయంలో భగవానుడు కేవలం మన భావశుద్ధి  మాత్రమే ఆశిస్తాడని అర్థం చేసుకోకపోవడం.
  • భగవాన్ మనం అర్పించే పదార్థాల బట్టి మనల్ని అర్ధం చేసుకుంటారని అనుకోవడం ఒక అడ్డంకి. భగవాన్ వారికి అర్పించే వాటిని బట్టి తీర్మాణించరు – అది ఖరీదైనది కావచ్చు కాకపొవచ్చు. మనం వారిని ప్రేమతో ఆరాధించి సేవ చేయాలి మరియు మన స్థోమతకు తగినంత ఏదైనా  అర్పించ వచ్చు.  నాణ్యమైన నెయ్యి మొదలైన ఖరీదైన పదార్థాలు అర్పించగలిగితే, ఎటువంటి సంకోచం లేకుండా అర్పించాలి. కాని స్తోమత లేనిచో మామూలు ఆహార పదార్థాలైనా అర్పించవచ్చు. భగవాన్ అర్పిస్తున్న పదార్థాలను చూడరు – కాని అర్పించే వారి మానసిక స్థితి, భావనను చూస్తారు. శాస్త్రాంలో “యధన్నః పురుషో భవతి తదన్నస్తస్య దేవతా” – మనం తినే పదార్థాలను తయారుచేసి ముందు వారికి అర్పించి తరువాత మనం ప్రసాదంగా తీసుకోవాలి.  అనువాదకుల గమనిక: ఈ ప్రమాణం చాలా ముఖ్యం. అర్పిస్తున్న వ్యక్తికి తినడానికి తగిన ఏ ఆహార పదార్థాలు అయినా ఎమ్పెరుమాన్కి అర్పించ వచ్చు. ఎమ్పెరుమాన్ ఏ పదార్థమైనా తినగలడు. కానీ ప్రతి వ్యక్తి తన వర్ణం మరియు ఆశ్రమం ప్రకారంగా కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తినవచ్చు. ఉదాహరణకు, గృహస్థుడు  ఆకు / వక్క తినవచ్చు (ఎమ్పెరుమాన్ కు అర్పించిన తరువాత), కాని బ్రహ్మచారి వాటిని తినలేరు (ఇది ప్రసాదమైనా సరే). కాబట్టి, నిర్దిష్ట వస్తువును జాగ్రత్తగా విశ్లేషించి, తాను తినే ముందు ఎమ్పెరుమాన్కు అర్పించ వచ్చో లేదో చూడాలి.
  • తిరువారాదనం చాలా కష్టమైన చర్యగా పరిగణించడం మరియు ఆనందకరమైన చర్యగా పరిగణించకపోవడం. తిరువారాదనం చాలా ఆహ్లాదకరమైన మరియు త్రుప్తి గొలిపే చర్య అని అర్థం చేసుకోవాలి. అందువల్ల చాలా సంతోషంగా చేయాలి.
  • ఎమ్పెరుమాన్ యొక్క అత్యున్నతమైన సౌలభ్యాన్ని(సరళత – సులభంగా ప్రాప్యత) చూసి , వారికి తిరువారాదనం చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. అనువాదకుల గమనిక: భగవాన్ మన ఇళ్ళల్లో  అర్చా విగ్రాహాన్ని స్వీకరించడమే వారి అత్యున్నతమైన  సౌలభ్యాన్ని సూచిస్తుంది – వారు మన స్వంత ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్నాడు. కానీ వారి సరళతను చూసి అనర్హుడని భావించకూడదు, నిర్లక్షం చేయరాదు  – అది అగౌరవంగా ఉంటుంది.
  • ఇంట్లో అర్చావతార ఎమ్పెరుమాన్ను సర్వోపరిగా పరిగణించకపోవడం,  మరియు వారి సంపూర్ణ ఉనికిని అనుభవించకపోవడం అడ్డంకి. అర్చావతార ఎమ్పెరుమాన్ పరమపదనాథునికి (శ్రీ వైకుంఠంలో కనిపించే సర్వోపరి భగవాన్) సమానమని ఒక నమ్మకం ఉండాలి. ముదల్ తిరువందాదిలో, పోయిగై ఆళ్వార్ పాసురం 44 లో చెప్పారు “తమరుగణ్తతు ఎవ్వురువం అవ్వురువం తానే తమరుగణ్తతు ఎప్పేర్ మఱ్ఱప్పేర్ – ఎమ్పెరుమాన్ వారి భక్తులు ఇష్టపడే రూపాన్ని ధరిస్తారు. వారి భక్తులు ఇష్టపడే నామాలను పెట్టుకుంటారు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 3.6.9 లో “నెంజినాల్ నినైప్పాన్యవన్   అవనాగుం నేల్కడల్ వణ్ణానే” – సర్వోపరి భగవాన్ ఎవరో కాదు వారి భక్తులు ఇష్టపడే రుపమే.  
  • మనం మన చేతులను ఆచార్య హస్తాలుగా (ఉప సేవకుడు) భావించి, తమ ఆచార్యుల తరఫున తిరువారాదనం చేయాలి. ఆచార్యుల నుండి అనుమతి పొందిన తరువాత తిరువారాదనం చేయడం ప్రారంభించాలి. సమాశ్రయణం (పంచ సంస్కరం) లో భాగంగా, ఆచార్యులు తిరువారాదనం ఎలా చేయాలో నేర్పుతారు మరియు తిరువారాదనం చేయటానికి అవసరమైన అర్హతతో శిష్యుడిని ఆశీర్వదిస్తారు. మన రోజువారీ తిరువారాదనంలో, మనం ఈ సంకల్పాన్ని స్మరించుకొవాలి “శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్యరూపం, ఆచార్య హస్తేన భగవతరాదనం కరిష్యే”  – ఆచార్య హస్తాలతో ఈ తిరువారాదనం (వారి దివ్య ఆదేశాల ఆధారంగా భగవానుకి కైంకర్య రూపంగా నిర్వహించుట) నిర్వహించుట. ఈ విధంగా, మనం తమను తాము ఆచార్యుల సేవకుడిగా భావించి, తిరువారాదనం చేయాలి.
  • సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు, జ్ఞానం పొందిన వారు కాని ఆ జ్ఞాన సూత్రాలను పాటించనివారు) ఎదుట తిరువారాదనం చేయకూడదు  – అలా చేయడం ఒక అడ్డంకి. అదేవిధంగా, శ్రీవైష్ణవులు (జ్ఞానం ఉన్నవారు మరియు సూత్రాలను సక్రమంగా పాటించేవారు) ఉన్నప్పుడు, మనం చేసే తిరువారాదనం వారికి కనిపించకుండా తెరవేయకూడదు – బదులుగా తిరువారాదనం వారి ముందు చేయాలి.
  • తిరువారాదనం కేవలం ఒక నిత్య దినచర్యగా చేయకూడదు. తిరుప్పావైలో “మేలైయార్ సెయ్వనగళ్” (పెద్దలు చేసిన విధంగా) చెప్పినట్టుగా పెద్దలు చేసిన విధానాన్ని అర్థం చేసుకోవాలి . అనువాదకుల గమనిక: శిష్ఠాచారం (మన పూర్వాచార్యులు పాటించిన సూత్రాలు) మనకు చాలా ముఖ్యమైనవి. వారు శాస్త్ర సారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు, అందులో చాలా ముఖ్యమైన వాటిని ఆచరించినవారు. ఈ విధంగా, మన ఆళ్వార్లు మరియు ఆచార్యలను అనుసరిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం చాలా సులభం.
  • ఈ క్రింది వాటిని తిరువారాదనం సమయంలో అడ్డంకులుగా పేర్కొన్నారు. 
    • ఇతర మంత్రాలతో తిరువారాదనం చేయడం. మంత్రం అంటే సాధారణంగా తిరుమంత్రం (అష్టాక్షరం) అని అర్థం. తిరునెడుంతాండగం పాసురం 4 లో చెప్పబడింది, “మంతిరత్తై మంతిరత్తాల్ మఱవాతు  ఎన్ఱుం  వాళుతియేల్ వాళలాం” – తిరుమంత్ర జపంతో భగవాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని గడపవచ్చు. ఈ తిరుమంత్రాన్ని “మంత్ర    రాజు” (మంత్రాల రాజు) అని అంటారు. ద్వయ మహా మంత్రం తిరుమంత్రం యొక్క విస్తరణ మరియు దీనిని మంత్ర రత్నం అని కూడా అంటారు. తిరువారాదనంలో, ద్వయ మహమంత్రాన్ని అనేక సందర్భాల్లో పఠిస్తారు. దీని అర్థ పూర్తి (సంపూర్ణ స్వభావం – అన్నిగుణాలతో నిండి ఉంది) మరియు సిష్ట పరిగ్రాహం (మన పుర్వచార్యల అంగీకరించి మరియు అభ్యాసించిన) వలన ఈ నారాయణ మంత్రం అగ్రశ్రేణి మరియు సాటిలేని మంత్రం.
    • తిరువారాదనం సమయంలో గురు పరమపర మంత్రాన్ని మొదట పఠించకుండా ద్వయ మంత్రాన్ని పఠించుట. పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి సూత్రం 4 వ సూత్రంలో వివరించారు –  “మంత్రత్తిలుం మంత్రత్తుక్కు ఉళ్ళిడాన వస్తువిలుం మంత్ర ప్రదనాన ఆచార్యన్ పక్కలిలుం ప్రేమం గనక్క ఉణ్డానాల్ కార్యకామావతు”. మాముణులు చాలా అందంగా వివరిస్తూ , శిష్యుడికి మంత్రంపైన గాఢ విశ్వాసం ఉండాలి, భగవాన్ (మంత్రం యొక్క లక్ష్యం) మరియు ఆచార్యుల (మంత్రంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవారు) పై గొప్ప నమ్మకం ఉండాలి మరియు ఈ మూడింటిపట్ల గొప్ప అనుబంధాన్ని పెంపొందించుకోవాలి. అనువాదకుల గమనిక: మనము ఇప్పటికే ఈ సూత్రాన్ని వివరంగా చూశాము.  ద్వయ మహా మంత్రాన్ని పఠించే ముందు గురు పరంపర మంత్రం (అస్మత్ గురుభ్యో నామః … శ్రీధరాయ నామః) ఎప్పుడూ పఠించాలి. ఎమ్పెరుమాన్ చేరుకోవడానికి ముందు మన ఆచార్య పరంపర పట్ల గౌరవం, మన స్వంత ఆచార్యులతో ప్రారంభించి శ్రీమన్నారాయణుడి (ప్రతి ఒక్కరికి మొదటి ఆచార్యలు) వరకు మన కృతజ్ఞతను ఎప్పుడూ చూపించాలి.
    •  తిరువారాదనం సమయంలో ద్వయ మహా మంత్రాన్ని వివరంగా వివరించే ఆళ్వార్ల పాసురములను, అచ్యార్యుల స్తోత్రాలను / వాఖ్యలను కూడా గుర్తుంచుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ “ద్వయార్తం దీర్గ చరణాగతి ఎన్ఱాతు సారసంగ్రహత్తిలే” అని చెప్పారు – పిళ్ళై లోకాచార్యులు తిరువాయ్మొళి ( దీర్గ శరణాగతి అని కూడా పిలుస్తారు) ద్వయ మహామంత్రం యొక్క విస్తారమైన వివరణ అని స్థాపించారు. కాబట్టి, ఆళ్వారులు మరియు ఆచార్యల యొక్క పాసురములను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, మనం ద్వయ మహామంత్రాన్ని మరియు దాని అర్ధాలను నిరంతరం చింతన చేస్తూఉంటాము . అలాగే, పుర్వ దినచర్యలో, ఎముంబి అప్పా అంటారు, మణవాళ మామునుల యొక్క పెదవులు ఎల్లప్పుడూ ద్వయ మహ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాయని మరియు వారి మనస్సు ఎల్లప్పుడూ వాటి అర్ధాలను  స్మరిస్తూ ఉంటారని అంటారు. కాబట్టి, ఈ అంశంలో మన పూర్వాచార్యులు యొక్క మానసిక స్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
    • అర్గ్య / పాద్య / ఆచమనముల (ఎమ్పెరుమాన్ చేతులు,  పాదకమలాలు మరియు నోరు శుభ్రం చేయడానికి జలం), స్నపనం (తిరుమంజనం / స్నానం), ధూపం (ధూపం / సుగంధాలు), దీపం, తిరువాలవట్టమ్ (వింజామర సేవ), గంధము సమర్పించుట, పువ్వులు అర్పించడం, భోగం (ఆహారం) మొదలైనవి ఇవ్వడం మన పూర్వాచార్యులు చేసినట్లుగా తగిన స్తోత్రాలను/పాసురాలను స్మరించి /పఠించాలి. వీటిని మామునులు మనకు ఆశీర్వదించిన “జీయర్ పడి తిరువాదన క్రమం” లో చూడవచ్చు. అనువాదకుల గమనిక: ప్రతి ఉపచారానికి దానికి సంబంధించిన పాసురాలు ఉన్నాయి. ఉదాహరణకు, తిరుమంజనం కోసం,  పెరియాళ్వార్ తిరుమోళి పదిగం “వెణ్ణెయ్ అళైంత కుణుంగుం”ను పారాయణం చేస్తాము – ధూపం కోసం తిరువాయ్మొళి పాసురం “పరివతిల్ ఈసనైప్ పాడి”, మొదలైన పాసురాల పఠనం చేస్తారు.
    • బాగా జ్ఞానము గల వ్యక్తులు (మన పూర్వాచార్యులు ) పఠించిన మంత్రాలు, పాసురాలు మొదలైన వాటిని పఠించాలి. సొంత అవగాహన ఆధారంగా సొంతంగా పఠించకూడదు.
  • ఏకాగ్రత లోపంతో తిరువారాదనం చేయుట. మనం ఎమ్పెరుమాన్ పై పూర్తి దృష్టి పెట్టి జాగ్రత్తగా ప్రేమతో తిరువారాదనం చేయాలి.
  • ఆళ్వారులు మరియు ఆచార్యలు ఎమ్పెరుమాన్ కంటే గొప్పవారని పరిగణించాలి మరియు వారికి తిరువారాదనం చేయడం కూడా అంతే లేదా అంత కంటే గొప్ప మహత్వపూర్ణమైన కార్యం అని అర్థం చేసుకోవాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి. వారిని “విణ్ణుళారిలుం సీరియర్” (పరమపదంలో ఉన్న వారి కంటే గొప్పవారు) గా మహిమపరచబడ్డారు. అలాగే, వారి పాద పద్మాలను ఎమ్పెరుమాన్ చరణ కమలాలకు తక్కువగా భావించి కడగడానికి వెనుకాడటం ఒక అడ్డంకి. భాగవతులను ఆరాధించడం (ఎమ్పెరుమాన్ భక్తులు) భగవాన్‌ను ఆరాధించడం కంటే గొప్పదని శాస్త్రాంలో వివరించబడింది. వారిని భగవానునికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఆదరించాలి.  అనువాదకుల గమనిక: ఈ సంధర్భములో, వడుగ నంబి స్థితిని గుర్తుంచుకోవచ్చు. వడుగ నంబి ఎమ్పెరుమానార్ పట్ల చాలా అంకితభావంతో ఉండేవారు మరియు ఎమ్పెరుమాన్ వైపు తిరగి కూడా చూసేవారు కాదు. ఒకసారి ఎమ్పెరుమానార్తో, ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాదనం పెరుమాళ్ తో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, వడుగ నంబి తన తిరువారాదన పెరుమాళ్ని (ఎమ్పెరుమానార్ పాదుకలు), ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాదనం పెరుమాళ్ ని ఒకే మూటలో కట్టారు. ఎమ్పెరుమానార్ అది గమనించి ఆశ్చర్యపోయి వడుగ నంబిని విచారించారు. వడుగ నంబి టక్కున జవాబిస్తూ  “నా పెరుమాళ్ మీ పెరుమాళ్ళ కంటే ఏ విధంగా తక్కువ?” అని అడుగుతారు. అందువల్లనే ” వడుగ నంబి యొక్క హృదయపూర్వక దృష్టి మీ పైన ఉన్నట్టుగా నన్ను ఉండనివ్వండి” అని మామునులు ఆర్తి ప్రభాంధంలో ఎమ్పెరుమానార్ కి ప్రార్థన చేసారు.
  • ఎమ్పెరుమాన్ సమర్పణ కోసం తయారుచేసిన భోగం వారి అధరాల (దివ్య పెదవులు) దగ్గర పెట్టి  సమర్పించాలి. సమర్పించేటప్పుడు భోగాన్ని క్రిందకు లేదా దూరంగా ఉంచకూడదు. అనువాదకుల గమనిక: ముందు వివరించినట్లుగా, ఎమ్పెరుమాన్ శారీరకంగా అక్కడ ఉన్నారని అర్థం చేసుకోవాలి.  వారిని నిత్య కర్మలో ఒక పద్ధతిగా నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ప్రేమతో చూసుకోవాలి.
  • అచార్యులను ఎమ్పెరుమాన్ కంటే గొప్పగా ఆరాధించాలి మరియు భోగం మొదలైనవాటిని అచార్యులకు సమర్పించెందుకు వెనుకాడకూడదు.
  • సంసారుల  ఇళ్లలో  (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) మరియు శ్రీవైష్ణవుల ఇళ్లలో ఉన్న ఎమ్పెరుమాన్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. దివ్య దేశాలలో (ఆళ్వారులు పాడిన) మరియు గొప్ప శ్రీవైష్ణవుల ఇళ్లలో ఉన్న ఎమ్పెరుమాన్ చాలా మహిమాన్వితమైన వారని అర్థం చేసుకోవచ్చు.  అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులకు దర్శనం ఇవ్వడానికి, వారి ఉనికిని ఆస్వాదించడానికి, వారి సేవలను స్వీకరించడానికి ఎమ్పెరుమాన్  ప్రత్యేకంగా దిగివస్తారు. భగవత్గీత 4.8 లో, ఎమ్పెరుమాన్ “పరిత్రాణాయ సాదూనామ్, వినాసాయ చ దుష్కృతాం, ధర్మ సంస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే” – నా భక్తులను రక్షించడానికి,  శత్రువుల నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనం చేయడానికి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాను. ఈ మూడు కారణాలు ఉన్నప్పటికీ, ప్రధాన కారణం తన భక్తులను సంతోషపెట్టడం మరియు రక్షించడం అని గీతా భాష్యంలో, ఎమ్పెరుమానార్ వివరించారు. ఎమ్పెరుమానార్ పూర్తిగా ఆళ్వార్ల పాసురాల ఆధారంగా వివరిస్తూ, నమ్మాళ్వారి తిరువాయ్మొలి 3.1.9 లో చెప్పినట్టుగా, “ఒకవేళ ఎమ్పెరుమాన్  గజేంద్రుడిని రక్షించడానికి రాకపోయి ఉంటే వారి కీర్తి ప్రఖ్యాతులు (వారు ప్రత్యక్షముగా ప్రకటమైయ్యి వారి భక్తులను ప్రసన్నులను చేస్తారు ) ఖచ్చితంగా కోల్పోయేవారు.
  • మన పూర్వాచార్యులచే ఆరాధించబడని ఎమ్పెరుమాన్ యొక్క  భక్తులను ఆరాధించడం ఒక అడ్డంకి. తిరుప్పావైలో చెప్పినట్లుగా, ” మేలైయార్ సెయ్వనగళ్” – మన పెద్దలు చేసిన పనులు మనమూ చేయాలి.  “చెయ్యాతన చెయ్యోం” (ఒకవేళ) – మన పెద్దలు చేయని పనులు మనమూ చేయరాదు. అనువాదకుల గమనిక: ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎమ్పెరుమాన్కి చాలా  చాలా మంది భక్తులు ఉన్నారు. మనం ప్రపన్నులమని ఎల్లప్పుడూ సత్వ గుణంలో ఉంటూ అహంకారానికి స్థానం లేని ఎమ్పెరుమాన్ యొక్క భక్తులను అనుసరించాలని మన పుర్వచార్యులు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఈ సంధర్భంగా తరచుగా వచ్చే మంచి ఉదాహరణ,  రుద్రుడు. సాధారణంగా, రుద్రుడిని జ్యేష్ట భాగవత (గొప్ప భక్తుడు) గా కీర్తిస్తారు. శ్రీ భాగవతంలో, “వైష్ణవానాం యథా సంబుః” అన్నారు. వైష్ణవులలో, శంబు (రుద్రుడు) గొప్పవారు. అయినప్పటికీ, మన పూర్వాచార్యులు వారిని నిషేధించారు, ఎందుకంటే వారు తమో గుణంతో ముడిపడి ఉన్నవారు.  అతను ఎమ్పెరుమాన్తో కూడా పోరాడిన (ఎమ్పెరుమాన్ యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా) సంధర్భాలు కూడా ఉన్నాయి. అజ్ఞానులుగా మారి ఎమ్పెరుమాన్తో పోరాడిన చాలా మంది దేవతాంతరములు ఉన్నారు. సత్వ గుణంలో ఉన్న కొంతమంది భక్తుల విషయంలో కూడా, వారు తమ సొంత భక్తి ద్వారా (ఎమ్పెరుమాన్ దయపై ఆధారపడకుండా) ఎమ్పెరుమాన్ సాధిస్తారని భావించడంలో వారిలో అహంకారం (స్వయం ప్రయత్నం) ఉండవచ్చు. ఈ సందర్భాల్లో కూడా అలాంటి భక్తులను ఆరాధించకపోవడమే మంచిది.
  • ఎమ్పెరుమాన్ను ఆదిత్య మండలం మధ్యలో (ఇది – ప్రతిదానిలో నివసించే ఆత్మ అని అంతర్యామి యొక్క చాలా సాధారణమైన అభివ్యక్తీకరణ) కనిపించే వ్యక్తిగా ఆరాధించాలనుకోవడం, కాని ఎమ్పెరుమాన్ యొక్క ఉత్తమ అభివ్యక్త రూపంలో  మన ముందు మన సొంత ఇళ్ళల్లోనే ఉన్నారు. అనువాదకుల గమనిక: అర్చావతార ఎమ్పెరుమాన్ను    ఆరాధించడం ఏ ఇతర ఆరాధనలకన్నా గొప్పది – ఎందుకంటే ఎమ్పెరుమాన్ తన భక్తుల సంపూర్ణ అధీనులై ఉంటారు.
  • అంతర్ యగం (అంతర్గత ఆరాధన) కన్నా బహిర్ యాగం (బాహ్య ఆరాధన) ఉత్తమమైనదని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. యాగం “యజ దేవ పూజ” (భగవాన్ ను ఆరాధించడం) నుండి ఉద్భవించింనది.  తెరల మధ్యలో అంతర్గతంగా చేయడం కన్నా అందరి సమక్షంలో బహిర్గతంగా చేయడం ఉత్తమం.  అనువాదకుల గమనిక: ఈ అంశం తిరువారాదనంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. మహిళలు, పిల్లలు మొదలైనవారు అందరూ తమ స్వభావానికి తగిన కైంకర్యాలు చేయవచ్చు. ఉదాహరణకు, మహిళలు ఇంట్లో ఎమ్పెరుమాన్ కొరకై వండటం, పువ్వులల్లి దండలు సిద్ధం చేయడం, ఆ పరిసరాన్ని శుభ్ర పరచడం మొదలైనవి. పిల్లలు స్తోత్రాలు, పాసురములు మొదలైనవి పారాయణం చేయమని ప్రోత్సహించవచ్చు. అంతర్ (అంతర్గత) మరియు బహిర్ (బాహ్య) యొక్క మరొక వివరణ – ఇది మన హృదయంలో అంతర్గతంగా ఆరాధించడం కంటే బాహ్యంగా అర్చావతార రూపంలో ఎమ్పెరుమాన్ను ఆరాధించడం మంచిది – ఎందుకంటే ఎమ్పెరుమాన్ వైభవంగా పూజించబడాలని ప్రత్యేకంగా అర్చావతార రూపంలో దిగి వస్తారు. కాబట్టి, మన హృదయంలో అంతర్గతంగా ఎమ్పెరుమానుని ధ్యానంచేస్తూ ఆరాధిస్తున్నామని చెప్పి మన ఇళ్ళకి దిగి వచ్చిన ఎమ్పెరుమాన్ను విస్మరించరాదు.
  • ఆచార్యుల నుండి ఒక అర్చా విగ్రాహం స్వీకరిస్తే, ఆ విగ్రహాన్ని యదావిధిగా ఆరాధించడం ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి ప్రయత్నించకూడదు. అనువాదకుల గమనిక: ఒక శిల్పి చేత తయారు చేయబడిన ఒక అర్చా విగ్రాహం వచ్చినప్పుడు, ప్రాణ ప్రతిష్ఠ (ఆ విగ్రాహంలోకి ఎమ్పెరుమాన్ను ఆహ్వానించడం) చేయటానికి అర్హతగల వ్యక్తితో (పురోహితున్ని) చేయించాలి. ఇంట్లో ఆరాధన కోసం కొత్తగా తయారైన విగ్రహంలోకి ఎమ్పెరుమాన్ను ఆహ్వానించడం కోసం ఆలయంలోని కొన్ని ఉత్సవాలలో (పవిత్రోత్సవం, మొదలైనవి) ఉంచవచ్చు. కాని అచార్యులు (సత్ సాంప్రదాయ సూత్రాలను గట్టిగా అనుసరించే వారు) సమర్పించిన అర్చా విగ్రాహాలకి  ఎటువంటి ఆచారాలు చేయవలసిన  అవసరం లేదు, వెంటనే ఆరాధించవచ్చు. అలాగే, ఈ సూత్రం (ప్రణ ప్రతిష్ఠ) మానవనిర్మిత అర్చా విగ్రహాలకు మాత్రమే వర్తిస్తుంది. సాలగ్రామ ఎమ్పెరుమాన్కు అలాంటి అవసరం లేదు, ఎందుకంటే స్వయంబువు (స్వయంగా వ్యక్తమైన) కాబట్టి. వెంటనే ఆరాధించవచ్చు.
  • ఇక్కడ నుండి, దృష్టి ఆచార్యుల / భాగవత ఆరాధనం వైపుకు మళ్ళుతుంది. ఎమ్పెరుమాన్ని ఆరాధించడం కన్నా ఎమ్పెరుమాన్ని ఆరాధించే వారిని మనం ఆరాధించడం ఎంతో గొప్పదని మనం అర్థం చేసుకోవాలి, చాలా సంతోషముగా చేయాలి. అనువాదకుల గమనిక: ఇది పద్మ పురణం – రుద్రుడు తన భార్య పార్వతికి వివరిస్తూ “ఆరాధనాం సర్వేశం విష్నోర్ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం దేవీ తాదీయానాం ఆరాధనం”, అన్ని రకాల ఆరాధనలలో, విష్ణు ఆరాధన ఉత్తమమైనది. అంతకన్నా ఉత్తమమైనది విష్ణు భక్తులను ఆరాధించడం. మన పూర్వాచార్యులు ఈ సూత్రాన్ని అనేక విధాలుగా ఆచరణాత్మకంగా స్థాపించారు. అందువల్ల, భాగవతుల పట్ల కూడా మనం శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
  • మన ఉద్ధరణకు  మన ఆచార్యులను ఆరాధించాలని గట్టిగా నమ్మాలి. అనువాదకుల గమనిక: మనతో వ్యక్తిగతంగా సంభాషించని అర్చావతార ఎమ్పెరుమాన్తో పోలిస్తే మనతో సంభాషించగల ఎమ్పెరుమాన్ ఆచార్యులు అని వివరించబడింది (తిరుక్కచి నంబి దేవ పెరుమాళ్తో ప్రత్యక్షముగా సంభాషించే అరుదైన సందర్భాలు తప్పా, మొదలైనవి). ఆ విధంగా, వారిని ఆరాధించడం మరియు సేవించడం శిష్యుల స్వభావానికి అనుకూలమైనది.
  • ఎమ్పెరుమాన్ విషయంలో, వారి తిరుమేని (దివ్య దేహం) కన్నా వారి తిరువడి (పాద పద్మాలు) ప్రియమైనవని వివరించబడింది. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 6.10.4లో “పూవఱ్ కళల్గళ్ అరువినైయేన్ పొరున్తుమరు పుణరాయే” – నా పాపాలను తొలగించే మీ పాద పద్మాల వద్ద దృఢంగా  స్థిరమై ఉంటాను. తిరువాయ్మొళి 6.10.11లో “అడిక్కీళ్ అమర్ న్తు పుగుంతేనే” – నేను మీ పాద పద్మాల వద్ద విశ్రాంతి పొందుతున్నాను. అదేవిధంగా, ఆచార్యుల విషయంలో కూడా, ఆచార్యుల యొక్క చరణ కమలాలకు సేవ చేయడంలో ఎక్కువ అనురాగము ఉండాలి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని ముముక్షుప్పడి 147 లో   ద్వయ ప్రకరణం చరణౌ (తిరువడి) శబ్దంలో చాలా అందంగా వివరించారు – శేషిపక్కల్ శేషభూతన్ శేషిపక్కల్ ఇళియుం తుఱై; ప్రజై  ములైయిళే వాయ్ వైక్కుమా పోలే – శిశువు పాలకోసం స్వాభావికంగా తన తల్లి (ఎందుకంటే అది జీవనాధారం/పోషణకు మూలాధారము కాబట్టి) దగ్గరికి వెళ్ళి నట్టుగా, జీవాత్మ సహజంగా భగవాన్ యొక్క పాద పద్మాలను వెతుక్కుంటూ వెళతాడు.
  • చరమాధికారుల (అత్యున్నతమైన ఆచార్య భక్తిలో స్థిరమై ఉన్న వ్యక్తులు) కోసం, ఆచార్య తిరువడి ( దివ్య పాద పద్మాలు) కన్నా గొప్పది అచార్యుల పాదుకలు. నిరంతర చింతన మరియు పరిజ్ఞానము తర్వాత ఇది మన హృదయాల్లో ద్రుఢంగా ఉంచాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఎమ్పెరుమాన్ యొక్క పాదుకలు శ్రీశఠగోపం (శఠారి) మనకు చాలా ప్రియమైనట్లే, ఆచార్య యొక్క పాదుకలు కూడా మనకు చాలా ప్రియమైనవి. ముందు చూసినట్లుగా, వడుగ నంబి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. నంబి “దేవుమఱ్ఱఱియేన్” – ఎమ్పెరుమానార్ కంటే మరే ఇతర దేవుడినెరుగను. అతను ఎమ్పెరుమానార్కు రహస్య మరియు తక్కువ స్థితిసేవలను చేయడంపై సంపూర్ణ దృష్టి పెట్టారు. ఒకసారి ఒక యాత్రలో ఎమ్పెరుమానార్తో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, అతను తన తిరువారాధనం – ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను, ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాధనం – ఎమ్పెరుమానార్ పెరుమాళ్ ని ఒకే దగ్గర కలిపి మూట కడతారు. దీని గురించి ఎమ్పెరుమానార్ తెలుసుకున్నప్పుడు కలత చెంది  నంబిని అడిగితే, నంబి, ఎటువంటి భయం లేకుండా, “నా పెరుమాళ్ మీ పెరుమాళ్ కంటే ఏ విధంగా తక్కువ?” అని జవాబు చెబుతారు. ఎమ్పెరుమానార్  నంబి యొక్క విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. “నేను నీతో చర్చలో గెలవలేను వదులుకుంటున్నాను. అని నంబితో అంటారు. అటువంటి బలమైన విశ్వాసాన్ని అభివృద్ధి కావడం చాలా కష్టం. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక విషయాలలో ఎమ్పెరుమానార్తో వ్యక్తిగతంగా బోధన పొందిన కొంగిల్ పిరాట్టిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆమె ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను తిరువారాధనంలో పూజించేది. ఆమె అభ్యర్థన మేరకు ఎమ్పెరుమానార్ ఒక జత పాదుకలు ఆమెకు ఇస్తారు. ఈ సందర్భంలో, వివిధ మహా పురుషుల పాదుకల పేర్లను చూద్దాం. సాధారణంగా, ప్రత్యేకమైన మహా పురుషుని  యొక్క ప్రియమైన శిష్యుడి పేరుతో పాదుకలకు పేరు పెడతారు. భగవాన్ కొరకు, శ్రీ శఠగోపం (నమ్మాళ్వార్ను సూచిస్తుంది) అంటారు. నమ్మాళ్వార్ కోసం, మధురకవులు అని పిలుస్తారు (ఆళ్వార్ తిరునగరిలో, దీనిని శ్రీ రామానుజం అంటారు). ఎమ్పెరుమానార్ కోసం, వీటిని ముదలియాండాన్ అంటారు. ఆళ్వాన్ మరియు ఎంబార్ కోసం, వీటిని  భట్టార్ అంటారు. మణవాళ మామునులు కొరకు, వీటిని పొన్నడియాం సెంగమలం (పొన్నడిక్కాళ్ జీయర్ని సూచిస్తుంది) అని పిలుస్తారు. ఇంక అలా కొనసాగుతుంది.
  •  భగవాన్ మరియు భాగవతలను ఆరాధించడంలో  నిమగ్నమై ఉండాలి – అది ఆచార్యలను ఎంతో సంతోషపరుస్తుంది. అలా చేయకపోవడం గొప్ప తప్పు. అలాగే, భగవత్ ఆరాధనం (భగవాన్‌ను ఆరాధించడం) మరియు భాగవత ఆరాధనం (భాగవతలను ఆరాధించడం) మధ్య భేదం చూపకూడదు – ఈ రెండింటినీ సమానంగా ఆదరించాలి.
  •  మనం ఎవరైనా శ్రీ వైష్ణవులు అలసిపోయినట్టు గమనిస్తే, వెంటనే వారి చరణాలను కడిగి,  అతనికి కొంత ప్రసాదం తినడానికి ఇవ్వాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  •  “దర్శనాత్ గ్రుహ్యతే మయా” (నాకు అర్పించినవి నేను నా చూపుతో ఆరగిస్తాను) – దీనిని “కణ్డరుళప్ పణ్ణుగై” (ఎమ్పెరుమాన్ భోగం సమర్పించడం) అని పిలుస్తారు. “అముదు సెయ్యప్ పణ్ణుగై” – అక్షరాలా ఎమ్పెరుమాన్ నైవేద్యాన్ని తినడం.   ఈ రెండూ భిన్నమైనవి అయినప్పటికీ, ఎమ్పెరుమాన్ వారి కళ్ళ ద్వారా ఆరగించి అవశేషాలను మనకు ఇస్తున్నప్పటికీ, ఎమ్పెరుమాన్ సాక్షాత్తూ తింటున్నారు అని మనం అనుకోవాలి. అనువాదకుల గమనిక: చర్చ భాగవత ఆరాధనం వైపు మారినందున, మనం దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎమ్పెరుమాన్కు భోగం అర్పించేటప్పుడు, వారి చూపుతో స్వీకరిస్తే, అప్పుడు మనం ఆ ప్రసాదాన్ని భాగవతలకు అర్పించాలి. అప్పుడు మాత్రమే, మనం ఆ ప్రసాదాన్ని (భగవాన్ మరియు భాగవతల అవశేషాలు) తీసుకోవాలి. ఆ ప్రసాదం ఎమ్పెరుమాన్ వారి కళ్ళతో స్వీకరించిన దానికన్నా గొప్పది.  మనము శుద్ధులు కావడానికి భాగవత శేషం (భగవతుల అవశేషాలు) చాలా గొప్పగా మహిమపరచబడింది. శ్రీ భాగవతంలో, నారద మహర్షి చెబుతూ మునుపటి జన్మలో భాగవతులైన గొప్ప ఋషుల ప్రసాదాన్నిస్వీకరించడం ద్వారా  తాను శుద్ధి అయ్యానని గొప్పగా కీర్తించారు. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరమాలై పాసురం 41 లో “పోనగం సెయ్త సేడం తరువరేల్ పునితమన్ఱే” –  భాగవతులు దయతో వారి అవశేషాలను ఇస్తే, అది చాలా వరకు శుద్ధి చేస్తుంది, అని చెప్పారు.
  • ఆచార్యులు మరియు భాగవతలను (ఆచార్యులకు సమానమైన వారు) ఎమ్పెరుమాన్తో సమానంగా ఆదరించాలి, ఎటువంటి భేదం లేకుండా అంతే గౌరవంతో సేవ చేయాలి. “ఆచార్యస్ స హరిస్ సాక్షాత్ చరరూపీ న సమ్సయః “ఆచార్యులు సాక్షాత్తూ హరి, ఆచార్యుల రూపంలో వారు తిరుగుతారు,  కాని అర్చావతార ఎమ్పెరుమాన్ కదలిక లేనివారు.”
  •  ఇక్కడ సామాన్య శాస్త్రం మరియు శిష్టాచారం  (విశేష ధర్మం) అని రెండు అంశాలు ఉన్నయి.  ఒక ప్రసిద్ధ సామెత ఉంది “ధర్మగ్య సమయం ప్రమాణం వేదాశ్చ” – నేర్పరులైన పండితుల మెధస్సు / మార్గదర్శకత్వం ప్రామాణికం, వేదం కూడా. ఇక్కడ పండితుల (శ్రీవైష్ణవుల ) మేధస్సుకు వేదం కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. కాబట్టి, తిరువారాదనం చేసేటప్పుడు, సాధారణ సూత్రాలను (ఇవి లౌకిక ప్రయోజనాలను ఆశించే) పాటించకుండా గొప్ప పండితులైన మన పూర్వాచార్యుల దిశను అనుసరించాలి.
  • ఎమ్పెరుమాన్ , ఆచార్యులను మరియు భాగవతలను ఆరాధించేటప్పుడు సోమరితనంతో ఆవలించడం మొదలైనవి చేయకూడదు.

ఇది అతి ముఖ్యమైన మన రోజువారీ కార్యాలకు వర్తించే విషయాలతో చాలా సుదీర్ఘమైన విషయం, తిరువారాదనం. దీన్ని జాగ్రత్తగా చదివి, సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకొని, రోజువారీ జీవితంలో ఈ సూత్రాలను పాటించటానికి ప్రయత్నించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/03/virodhi-pariharangal-16.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/06/virodhi-pariharangal-14/ .

46. సేవ  విరోధి – ఎమ్పెరుమాన్ ఆరాధనలో అవరోధాలు

శ్రీవైష్ణవ పరిభాషలో సేవకి అనేక అంశాలు ఉన్నాయి. సాధారణంగా పెరుమాళ్ళని దర్శనం చేసుకోవటాన్ని, అంటే వారిని చూచుటను సేవ అంటారు. దండవత్ ప్రణామాలు (సాష్టాంగ నమస్కారాలు) సమర్పించడం, అంజలి (నమస్కారం) జోడించడం కూడా సేవ అంటారు. పాసుర పఠనం, గ్రంథాలను చదవడం కూడా సేవగా గుర్తించవచ్చు . సంగ్రహంగా చెప్పాలంటే, సాంప్రదాయకంగా, ఏ రకమైన కైంకార్యమైనా సేవ అంటారు. అనేక విభిన్న అంశాలు – ప్రధానంగా ఆలయంలో ఎమ్పెరుమాన్ ఆరాధనకు సంబంధించినవి ఈ శీర్షికలో వివరించబడ్డాయి.

పెరియ పెరుమాళ్ – శ్రీరంగం
ఆళ్వార్
ఆచార్యుల మధ్య ఎమ్పెరుమానార్
  • దివ్య దేశాలు, అభిమాన  స్టలములు మొదలైన వాటి యాత్రకు వెళ్లేటప్పుడు, (ప్రధానంగా అర్చావతార) ఎమ్పెరుమాన్ తో సంబంధం లేని ఇతర ప్రదేశాలకు వెళ్ళకూడదు. మనం అలాంటి ప్రదేశాలకు ఒకవేళ వెళ్ళవలసి వచ్చినప్పుడు, అటువంటి ప్రదేశాల యొక్క ప్రత్యేక లక్షణాలను విస్మరించాలి. మన మనస్సు భగవత్ విషయం (భగవాన్కు సంబంధించిన విషయాలు) పై మాత్రమే పెట్టాలి, ఇంక దేనిపైన కాదు. అనువాదకుల గమనిక: ఈ రోజుల్లో, దివ్య దేశాల యాత్రకు వెళ్లేటప్పుడు, ప్రజలు సమీప పర్యాటక ఆకర్షణలు, మార్కెట్లు, కొనుగొళ్ళు మొదలైనవాటికి కూడా వెళ్ళుతున్నారు. దివ్య దేశ యాత్రలకు వెళ్లేటప్పుడు అలాంటి చర్యలలో పాల్గొనకపోవడమే మంచిది. ప్రతి ఒక్కరినీ ఉద్ధరించాలనే గొప్ప సంకల్పముతో ఎమ్పెరుమాన్ స్వయంగా అర్చావతార రూపంలో అవతరించిన ప్రదేశాలు దివ్య దేశాలు. ఇక్కడ ఎమ్పెరుమాన్,  సౌలాభ్యం (సులభంగా ప్రాప్యత) మరియు కృపను అభివ్యక్తం చేస్తున్నారు. అటువంటి దివ్య దేశాల యొక్క కీర్తిని గ్రహించి, ఆళ్వార్ల పాసురాలతో, ఆచార్యల స్తోత్రములతో ఎమ్పెరుమాన్కి మంగలాసాసనం చేయడంపై పూర్తి దృష్టి పెట్టాలి.
  • దేవాలయాలు మరియు గోపురాలు చూసినప్పుడు, అది మొదట ఎమ్పెరుమాన్ ఆలయమా / గోపురమా కాదా అని విచారణ చేయాలి. అవి ఇతర దేవతలు లేదా అవైధిక విశ్వాసాలు సంబంధించిన దేవాలయాలు అయితే, మర్యాద సమర్పణ చేయవలసిన అవసరం లేదు. ఎమ్పెరుమాన్ ఆలయమా / గోపురమా కాదా అని విచారణ చేయకుండా పొరపాటున మర్యాదలు సమర్పిస్తే, అలాంటి సంధర్భంలో తప్పుకు పశ్చాత్తాపపడి శుద్ధి చేసుకోవాలి. ఈ సంధర్భంగా, తిరువాయ్మొళి 4.6.6కి నాంపిల్లై వారు ఇచ్చిన ఈడు వ్యాఖ్హ్యానంలో గుర్తించబడిన ఈ క్రింది సంఘటనను మనం గుర్తు చేసుకోవచ్చు. వాణ్డర్ మరియు చొణ్డర్ (పిళ్ళై ఉఱంగా విల్లి దాసు యొక్క మేనల్లుళ్ళు) ఉఱైయూర్ రాజు (అకళంగ నాట్టాళ్వాన్) కు రక్షక బఠులుగా పనిచేస్తుండేవారు. ఒకసారి వాళ్ళు రాజుతో కలిసి నడుస్తున్నప్పుడు, వారు ఒక జైన దేవాలయాన్ని చూశారు (నిర్మాణాత్మకంగా విష్ణు ఆలయానికి సమానంగా కనిపిస్తున్నది). వారిని పరీక్షించాలనుకుంటున్న రాజు, “చూడండి, అక్కడ పెరుమాళ్ ఆలయం ఉంది! నమస్కారం చేయండి” అని చెబుతాడు. ఇది విన్న వారు చటుక్కున క్రింద పడి పూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ ఘోరమైన పొరపాటు చేశామని వారు గ్రహించి – మూర్ఛపోతారు. అందరూ అవాక్కైపోతారు, రాజు తన సిబ్బందిని  పిళ్ళై ఉఱంగా విల్లి దాసును తీసుకురమ్మని పంపుతారు. ఉఱంగా విల్లి దాసులు ఆ స్థలానికి చేరుకుని ఏమి జరిగిందో వింటారు. వారు తన చరణ కమలాల ధూళిని వారి నుదుటిపైన పూస్తే వెంటనే ఇద్దరూ స్పృహలోకి వస్తారు. ఈ విధంగా, దేవతాంతరముల  ఆరాధనకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే , శ్రీవైష్ణవుల యొక్క శ్రీపాద ధూలి (చరణ కమలాల ధూళి) ని స్వీకరించడం ద్వారా శుద్ధి కావచ్చని మనం అర్థం చేసుకోవచ్చు.
  • ఎమ్పెరుమాన్ యొక్క దేవాలయాలు లేదా గోపురాలను చూసినపుడు, వెంటనే గొప్ప ఆనంద అనుభూతి చెందాలి, నమస్కారాలు చేయాలి, వాహనాల నుండి దిగాలి (ఒక వేళ ప్రయాణం చేస్తుంటే) చెప్పులు / బూట్లు విప్పాలి (ఒక వేళ వాటిని ధరిస్తే). అలా చేయకపోవడం గొప్ప నేరం.
  • చెప్పులు / బూట్లతో దివ్య దేశములలోకి ప్రవేశించుట. కనీసం, ఆలయం ఉన్న వీధిలోకి ప్రవేశించే ముందు చెప్పులు / బూట్లు విప్పాలి.
  • ప్రవేశద్వారం వద్ద గడపకి నమస్కారం చేయకుండా ఆచార్యులు, శ్రీవైష్ణవుల యొక్క తిరుమాళిగ (నివాసం) లోకి ప్రవేశించకూడదు.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల తిరుమాళిగ (ల) కి వెళ్ళకుండా నేరుగా ఎమ్పెరుమాన్ ఆలయానికి వెళ్ళడం. ఆచార్యుల నివాసం ఆలయానికి సమీపంలో ఉన్నట్లైతే, అక్కడకు వెళ్లి, ఆచార్యులను మరియు ఆచార్యుల తిరువారాధన ఎమ్పెరుమాన్ ని ఆరాధించిన తరువాత మాత్రమే, ఆలయానికి వెళ్లాలి. అనువాదకుల గమనిక: మనకు  ఎమ్పెరుమాన్ ని చూపించేవారు ఆచార్యులు. శ్రీవైష్ణవులు మనలను ఆచార్యులవైపు మార్గనిర్దేశం చేసి, ఎమ్పెరుమాన్ గురించి గొప్ప సూత్రాలను వివరిస్తారు. కాబట్టి, ఎమ్పెరుమాన్ని ఎల్లప్పుడూ ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల ద్వారా సమీపించాలి, స్వతంత్రంగా ఎప్పుడూ సమీపించకూడదు. నమ్మాళ్వార్ ఈ విషయాన్ని తిరువాయ్మొళి 4.6.8 లో ఇలా అన్నారు “వేదం వల్లార్గళై క్కొండు విణ్ణోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు” – వేదంలో నిపుణులైన శ్రీవైష్ణవుల ద్వారా నిత్య సూరులకు యజమాని అయిన ఎమ్పెరుమాన్ కమల పాద పద్మాలను ఆరాధించండి.
  • ప్రవేశద్వారం వద్ద సాష్టాంగ నమస్కారాలు సమర్పించకుండా ఆలయంలోకి వెళ్ళకూడదు.
  • ఉత్తరీయంతో నడుం పై భాగం కప్పుకొని ఆలయంలోకి ప్రవేశించుట. అనువాదకుల గమనిక: మనల్ని దాసులు (ఎమ్పెరుమాన్ సేవకులు) అని పిలుస్తారు. దాసులు ఎప్పుడూ నడుము వస్త్రాంతో ఛాతీని కప్పి ఉంచకూడదు (కనీసం యజమాని ముందు). కేరళ దేవాలయాలలో ఈ సూత్రాన్ని ఇప్పటికీ ఆచరణలో చూడవచ్చు, అక్కడ పురుషులు ఆలయంలోకి ప్రవేశించే ముందు చొక్కాలు తీసివేస్తారు మరియు మహిళలు సాంప్రదాయ దుస్తులతో (చీరలో) మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు. వానమామలై (తోతాద్రి), వంటి కొన్ని పాండ్యనాడు దివ్య దేశాల (దక్షిణ) లో కూడా ఇది ఆచరణలో చూడవచ్చు.
  • ఎమ్పెరుమాన్ మరియు బలి పీఠం (పరివార దేవతలకు మొదలైన వారికి సమర్పణలు ఇచ్చే ప్రదేశం) మధ్యలో ప్రవేశించకూడదు.
  • అప్రదక్షిణ  (సవ్యదిశకి వ్యతిరేకంగా) పద్ధతిలో ఆలయంలోకి ప్రవేశించుట. సన్నిధులకు సవ్యదిశలో వెళ్ళాలి.
  • ప్రధాన సన్నిధి (గర్భగుడి) బయట ఉన్న మెట్టుపై నడవడం / అడుగు పెట్టడం సరైన మర్యాద కాదు. పెరుమాళ్ తిరుమొళి 4.9 లో తిరుమల వేంకటేశ్వరునితో కులశేఖర ఆళ్వార్ ఈ మాటలు చెప్పడం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు  “పడియాయ్ క్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – నీ సన్నిధి వద్ద మెట్టు (గడప) లా మారి సంతోషంగా ముత్యం లాంటి నీ ముఖాన్ని ఆరాధిస్తాను.
  • ఆలయం చుట్టూ ఉన్న వివిధ సన్నీధులను ఆరాధించకుండా నేరుగా ములావిరాట్టు (ప్రధాన) సన్నీధికి వెళ్ళకూడదు. సాధారణంగా తాయార్ సన్నిధి, ఆళ్వారుల / ఆచార్యుల సన్నిధి, మొదలైనవి ప్రధక్షిణంలో ఉంటాయి. ఆలయ ప్రధాన సన్నీధిలోకి ప్రవేశించే ముందు వీరందరినీ మొదట సేవించాలి. అనువాదకుల గమనిక: పూర్వ దినచర్య 23 వ స్లోకంలో ఎఱుంబి అప్పా ప్రతిరోజూ శ్రీరంగం ఆలయంలో మాముణులు మంగళసాసనం చేసే క్రమాన్ని వివరించారు. “దేవి గోదా యతిపతి సటద్వేశిణౌ రంగసృంగం సేన నాతో విహగ వృషబః స్రీనిధి స్సింధుకన్యా భూమా నీలా గురుజనవృతః పూరుషచ్చేత్యమీషం అగ్రే నిత్యం వరవర మునేరంగ్రియుగ్మం ప్రపధ్యే”  – ప్రతిరోజూ, నేను మణవాళ మాముని యొక్క చరణ కమలాలను ఆండాళ్ నాచియార్, ఎమ్పెరుమానార్, నమ్మాళ్వార్, శ్రీరంగ విమనం, విశ్వక్సేనులు, గరుడ ఆళ్వార్, శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్యమైన శ్రీరంగనాథుడిని ,  ఆళ్వారులు / ఆచార్యలు శ్రీ భూ నీళా సమేత పరమపదనాథు (పరమపదనాథుని సన్నీధిలో)ని సమక్షంలో ఆరాధిస్తాను.  ఈ శ్లోకంలో ఎఱుంబి అప్పా  శ్రీరంగ ఆలయం మరియు వివిధ సన్నిధుల వరుసను చిత్రీకరణ చేసారు. మన సాంప్రదాయంలో మనం మొదట ఆచార్యలను, ఆళ్వర్లను, తాయార్ని ఆరాధించిన తరువాత ఎమ్పెరుమాన్ సమీపిస్తాము.
  • దేవాలయం యొక్క దివ్య విమానం (గోపురం) నీడలపై అడుగు పెట్టడం ఒక అడ్డంకి – ఎప్పుడూ అలా చేయకూడదు.
  • దివ్య  ద్వారపాలకుల (జయ / విజయులు) అనుమతి తీసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడం సరైనది కాదు. సన్నీధిలోకి ప్రవేశించే ముందు, తిరుప్పావై 16 వ పాసురమును  “నాయగనాయ్ నిన్ఱ” పఠించాలి – ఈ పాసురంలో, ఆండళ్ నాచియార్, ఎమ్పెరుమాన్ యొక్క సన్నీధిలోకి ప్రవేశించే ముందు ద్వార పాలకుల అనుమతి పొందెందుకు సరైన మర్యాదను మనకు ఏర్పాటు చేసారు. అనువాదకుల గమనిక: మన ఇంట్లో పెరుమాళ్ తిరువారధనం ప్రారంభించడానికి ముందు, ఈ పాసుర పారాయణం చేసిన తరువాత, ఆపై కోయిల్ ఆళ్వార్ (పూజ గది) తలుపులు తెరవాలి.
  • విశ్వక్సేనుల అనుమతి తీసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: విశ్వక్సేనులు పరమపదంలో భగవాన్ యొక్క ముఖ్య కార్య నిర్వాహకులు మరియు ప్రధానమైన నిత్యసూరులు (భగవాన్ యొక్క సహచరులు) కూడా. మన గురుపరంపరలో కూడా ఉన్నారు, మన గురుపరంపర క్రమం ఇలా ఉంటుంది: పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి, విశ్వక్సేనులు, నమ్మాళ్వార్, నాథమునులు, మొదలైనవారు …. మాణవాళ మాముణులు వరకు. కాబట్టి, ఎమ్పెరుమాన్ సన్నిధి లోకి ప్రవేశించే ముందు అతని అనుమతి తీసుకోవడం సముచితం.
  • మనం ఎప్పుడూ మన ఆచార్యల ద్వారా ఎమ్పెరుమాన్ ని సమీపించాలి. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమాన్తో మన శాశ్వతమైన సంబంధాన్ని గుర్తుచేసిన వ్యక్తి ఆచార్య. మనం ఎల్లప్పుడూ వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి మరియు ఎప్పుడూ మన ఆచార్యల ద్వారా ఎమ్పెరుమాన్ ని సమీపించాలి. మన ఇంటి పెరుమాళ్లకు తిరువారాదనం చేస్తున్నప్పుడు కూడా, మనల్ని మన ఆచార్య హస్తాలుగా భావించి, ఆచార్యల తరపున తిరువారాధనం చేయాలి.
  • ఏ సిగ్గు లేకుండా సన్నీధికి నేరుగా మధ్యలో ప్రవేశించడం ఒక అడ్డంకి. ఎంతో భక్తితో, వినయంతో పక్కన నుంచి  జాగ్రత్తగా సన్నీధిలోకి ప్రవేశించాలి.
  • కుడి వైపున ఖాళీ ఉన్నప్పుడు, ఎడమ వైపుకు వెళ్లి, ఎమ్పెరుమాన్ను అక్కడ నుండి పూజించడం అడ్డంకి.
  • సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) సమక్షంలో ఎమ్పెరుమాన్ ని ఆరాధించడం ఒక అడ్డంకి. వీలైనంత వరకు చేయకూడదు.
  • ఎమ్పెరుమాన్ ని వారి దివ్య చరణాల నుండి దివ్య ముఖం వరకు నెమ్మదిగా మన నేత్రాలు, హృదయం పూర్తి సంతృప్తి చెందే వరకు పూజించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమాన్ ని ఆరాధించడానికి అత్యంత ఆదర్శవంతమైన ఉదాహరణ తిరుప్పాణి ఆళ్వారులు. వారు అమలానాదిపిరాన్ రచించారు, ఇందులో పెరియ పెరుమాళ్ యొక్క దివ్య శరీర భాగాలను అందంగా వర్ణించారు. చివరిలో, పెరియ పెరుమాళ్ను చూసిన మరియు ఆనందించిన ఈ కళ్ళు మరేదీ చూడలేవని వారు ప్రకటించారు. అలా మన వైఖరి కూడా ఉండాలి.
  • ఎమ్పెరుమాన్ను తిరుపల్లాండు మరియు ఇతర దివ్య ప్రబంద పాసురములతో (దివ్య దేశానికి  ప్రత్యేకమైనవి) మరియు పూర్వాచార్య స్తొత్రాల (పెద్దల నుండి విన్నవి) యొక్క పఠనం / జ్ఞాపకంతో పూజించాలి.
  • భౌతికంగా దృష్టి సారించిన స్లోకములను పఠించకూడదు, భౌతికంగా ఆలోచించే వ్యక్తులు చేసే విధంగా మనం ఆరాధించకూడదు.
  • భౌతిక ప్రయోజనాలను పొందాలనే కోరికతో ఎమ్పెరుమాన్ ని పూజించకూడదు. అనువాదకుని గమనిక:  పొయిగై ఆళ్వార్ ముదల్ తిరువందాది పాసురం 26లో వివరిస్తూ – ” ఎళువార్ తుళాయానై వళువా వగై నినైందు వైగళ్ తొళువార్ వినైచ్ చుడరై నందువిక్కుం వేంగడమే  వానోర్ మనచ్ చుడరైత్ తూణ్డుం మలై” – మూడు రకాల జనులు తిరువెంకటముడయాన్ దగ్గరకు వెళతారు – లౌకిక ప్రయోజనాలు కావాలనుకునే వారు, కైవల్యం కావాలనుకునే వారు మరియు చివరకు శాశ్వత కైంకర్యం కావాలనుకునే వారు. ఈ మూడు రకాల మనుషుల కోసం, తిరుమల కొండ అడ్డంకులను తొలగిస్తుంది (వారు కోరుకున్నది సాధించడానికి). ఇందులో, మనం “ఇన్ తుళాయానై వళువా వగై నినైందు వైగల్ తొళువార్” – ఎమ్పెరుమాన్ ని ఏ దోషం, కళంకము లేకుండా నిరంతరం పూజించేలా ఉండాలి.
  • ఎమ్పెరుమాన్ ని ఆరాధించేటప్పుడు, వారిపై పూర్తి దృష్టి పెట్టాలి. అలా దృష్టి ఉండక పోవడం అడ్డంకి.
  • ఎమ్పెరుమాన్ ని ఆరాధించేటప్పుడు వారి మీదే మనస్సు స్థిరపరచాలి. ఎక్కడా స్థిరంగా ఉండని ఈగ లాగా ఎగురుతూ ఉండకూడదు.
  • దేవాలయాలలో పెరుమాళ్ తిరువారాదనం,   ఎమ్పెరుమాన్ భోగం సమర్పణల తరువాత, బలి పీఠంపైన పరివార దేవతలకు ప్రసాదం ఇవ్వబడుతుంది. ఆ తరువాత సాత్తుముఱై (పాసురముల పూర్తి) జరుగుతుంది. మధ్యలో వదిలి వెళ్ళాకూడదు (అనగా, తిరువారాదనం తరువాత).
  • ధూపం (సుగంధం), దీపం, తిరువందిక్కాప్పు (ధ్రుష్టి దోషాలు నివారించడానికి చేసే హారతి), ఎమ్పెరుమాన్కు భోగం సమర్పించడం మొదలైనవటువంటి ఉపచారము (సేవలు) లను పూర్తిగా గమనించాలి / ఆనందించాలి మరియు తగిన పాసురములను పఠించాలి. అలా చేయకపోవడం, వేరే వాటిపై దృష్టి పెట్టడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  జీయర్ పడి తిరువారాదన క్రమంలో, మాముణులు మన ఇళ్లలో తిరువరాధనం ఎలా నిర్వహించాలో అందంగా వివరించారు. తిరువారాదనం నిర్వహిస్తున్నప్పుడు, శ్రీవైష్ణవులు సాధారణంగా అనేక సమయాల్లో అనేక పాసురములను పఠిస్తారు. తిరుమంజనం (దివ్య స్నానం) సమయంలో, మనం పంచ సూక్తం, పెరియాళ్వార్ తిరుమోళిలోని వెణ్ణెయ్ అళైంత కుణుంగుం పదిగం మొదలైనవి  పఠించాలి. ఎమ్పెరుమాన్ ని అళంకరించే సమయంలో, చందనం సమర్పించే సమయంలో గంధత్వారం(శ్రీ సూక్తం) శ్లోకం, పూసుం చాంతు (తిరువాయ్మొళి) పాసురం పఠించాలి. తిరు ఆభరణాలు మరియు దండలు అర్పించేటపుడు, స్పురత్కిరీటాంగ హరకంటికా (స్తోత్ర రత్నం) శ్లోకం, చూట్టు నన్ మాలైగళ్ (తిరువిరుతం). ధూపం సమర్పణ సమయంలో, పరివతిల్ ఈసనైప్ పాడి (తిరువాయ్మొళి) పారాయణం చేస్తారు. దీపం సమర్పణ సమయంలో, వైయం తగళియా (ముదల్ తిరువంతాది), అన్బే తగళియా (ఇరండం  తిరువంతాది), తిరుక్కాండేన్ (మున్రామ్ తిరువంతాది) పఠిస్తారు. హరతి సమయంలో, ఇందిరణోడు బిరమన్ (పెరియాళ్వార్ తిరుమోళి పదిగం, ఇక్కడ పెరియ ఆళ్వార్ తిరువెళ్ళఱై  పెరుమాళ్పై వారి శ్రద్ధను చూపిస్తుంన్నారు) పదిగాన్నిపఠిస్తారు. దేవాలయాలలో,  ఎమ్పెరుమాన్కు ప్రత్యేకమైన ఉపచారములను సమర్పించేటపుడు, మనము దానిపై సంపూర్ణ దృష్టి కేంద్రీకరించాలి,  ఆ ఉపచారమునకు సంబంధించిన పాసురాలను పఠించాలి.
  • భౌతికవాదమైన నృత్యాలపై మరియు పాటలపై దృష్టి పెట్టి ఎమ్పెరుమాన్ యొక్క అర్చా విగ్రహాన్ని విస్మరించకూడదు.
  • ఆరిపోతున్న దీపాన్ని చూసి (ఎమ్పెరుమాన్/ ఆళ్వార్లు/ ఆచార్యల సన్నిధిలో ) వెంటనే దాన్ని సరిచేసి మరళా వెలిగేలా చేయక పోవడం  ఒక అడ్డంకి. శ్రీవచన భూషణం 382 సూత్రం యొక్క వ్యాఖ్యానంలో లలితా చరిత్రం గురించి దయచేసి చూడండి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు ఒక పురాణ చరిత్రమును (పురాణాలలో కీర్తించ బడిన సంఘటన) చెబుతున్నారు, ఒక ఎలుక అనుకోకుండా దీపంలో ఒక ఒత్తును గుచ్చుతూ దీపాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఆ ఎలుక మరు జన్మలో  అందమైన కన్యగా జన్మించి ఆమె కాశి రాజును వివాహమాడుతుంది. మునుపటి జన్మలో కర్మ కారణంగా, క్రమేణా ఆమె తరువాత ఎమ్పెరుమాన్ని  దీపాల ఆరాధన చేయుటకు చాలా ఇష్టపడేది. ప్రపన్నులం అయిన మనం, మంచి జన్మ కావాలని కైంకర్యం చేయము, అయినప్పటికీ మనం ఎమ్పెరుమాన్ పట్ల భక్తితో సహజమైన చర్యగా కైంకార్యం చేస్తాము.
  • నేలపై ధూళిని చూసి  (ఎమ్పెరుమాన్ / ఆళ్వార్లు/ ఆచార్యల సన్నీదిలో) వెంటనే శుభ్రం చేయకపోవుట. నమ్మాళ్వార్  తిరువాయ్మొళి 10.2.7 లో “కడైత్తలై చీయ్క్కప్పెత్తాళ్ కడువినై కళైయళామే” – ఆలయాన్ని ఊడవడం తుడవడం ద్వారా మన పాపాలు  తొలుగుతాయి. అనువాదకుల గమనిక: తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ వారి సర్వస్వాన్ని వదులుకొని తిరుక్కణ్ణమంగై భక్తవత్సల ఎమ్పెరుమాన్ సన్నీదిలో శాష్వతంగా ఉండిపోయారన్నది అందరికీ తెలిసిందే.  వారు   ఆలయంలో ఊడ్చే కైంకర్యం ఎంతో ప్రీతిగా క్రమం తప్పకుండా ఆ కైంకార్యం చేసే వారు.  నాచియార్ తిరుమోళి మొదటి లోనే, పెరియవాచాన్ పిళ్ళై చెప్తూ , తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ ఊడ్చే కైంకర్యమే వారి అంతిమ లక్ష్యంగా (ఏదో సాధించడానికి కాదు) నిర్వహించేవారు అని వారిని కీర్తించారు. తిరువాయ్మొళి 9.2.1 వ్యాఖ్హనంలో, నంపిళ్ళై ఒక ముఖ్యమైన అంశాన్ని అందంగా వివరించారు.  ఇక్కడ పాసురంలో, నమ్మాళ్వార్  ఎమ్పెరుమాన్తో  “మేము అనేక తరాల నుండి ఆలయాన్ని శుభ్రపరచడం మొదలైన అనేక కైంకర్యాలు చేస్తున్నాము”. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రపన్నులు పూర్తిగా ఎమ్పెరుమాన్నే ఏకైక ఉపాయంగా స్వీకరిస్తారు.  వ్యక్తిగత ప్రయత్నంలో వారి ప్రమేయం ఉండదు – కాబట్టి అసలు కైంకర్యాలు కూడా ఎందుకు చేయాలి? తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ పాల్గొన్నఈ క్రింది సంఘటన ద్వారా దీనిని నంపిళ్ళై అందంగా వివరించారు. వారి తరగతిలో ఒక సహచరుడు (నాస్తికుడైన) ఆణ్డాన్ను ప్రశ్నిస్తాడు. స్వయం ప్రయత్నం కాకపోతే నేలను శుభ్రం చేయడం , తుడవడం ద్వారా తనను తాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతాడు. ఆణ్డాన్ అతనికి దుమ్ము ఉన్న ప్రదేశాన్ని మరియు దుమ్ము లేని ప్రదేశాన్ని చూపిస్తారు – మనం చేసిన దానికి ఫలితం ఇది అంతే అని చూపిస్తారు – ఈ స్థలం శుభ్రం అయ్యింది – ఇంకేమీ లేదు అని అంటారు. “శుభ్రమైన ప్రదేశం మరియు మురికి ప్రదేశం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరా?” అని అడుగుతారు. ఈ విధంగా, కైంకర్యం  చేయడం దాస భూతుల (సేవకుని) యొక్క సహజమైన స్వభావం అని మరియు కైంకర్యం  (సేవ) ఉపాయం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు సూత్రం 88 లో అందంగా వివరిస్తూ, “భౌతికంగా నడుచుకునే వ్యక్తి తన కోసం (లేదా అతని ప్రియమైనవారి కోసం) లౌకిక కోరికలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తాడు, అలాంటప్పుడు ఒక ప్రప్పన్నుడికి  ఎమ్పెరుమాన్కి సేవ చేయాలనే కోరిక ఎంత ఉండాలి, పరమానందకరమైన భగవాన్ కి సేవ చేయడమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం సముచితం కూడా” అని అంటారు.
  • ఎమ్పెరుమాన్ ధరించే వస్త్రాలు, తిరు ఆభరణాలు, దండలు మొదలైనవాటిని చూసేటప్పుడు, వాటిని ఎమ్పెరుమాన్ కోసం ఆనందించాలి. “నేను వాటిని ధరిస్తే బాగుంటుంది” అని అనుకోకూడదు.
  • ఎమ్పెరుమానుకి భోగాన్ని సమర్పించే ముందు  నోరూరించుట, ఆపై వాటిని ప్రసాదంగా అందరికీ పంచుట. అనువాదకుల గమనిక: అన్నీ సహజంగానే ఎమ్పెరుమాన్కు చెందినదే, వారు ప్రతిదాన్ని ఆస్వాదించడానికి అర్హుడు. వారు కృపతో, వాటిని స్వీకరించి అవశేషాలను మనకిచ్చి ఆశీర్వదిస్తారు. తన అవశేషాలను మనకిచ్చినందుకు ఎమ్పెరుమాన్కి మనము కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే,  గీతా శాస్త్రములో, ఎమ్పెరుమాన్కి అర్పించకుండా ఏదైనా తినడం అంటే పాపాలను తినడం లాంటిది అని వివరించబడింది. కాబట్టి, ఎమ్పెరుమాన్కి సమర్పించే ముందు వారి కోసం తయారుచేసిన మరియు ఉంచబడిన ఆహారాన్ని చూడటం గొప్ప పాపం.
  • ఈ క్రింద  చెప్పబడినవి ఆలయాల లోపల చేయకూడదు.
    • కాళ్ళు చాచుట – కాళ్ళు  ఎప్పుడూ మడుచుకొని ఉంచుకోవాలి.
    • వస్త్రం (పంచ వగైరా) పైకి మడచ కూడదు – సరైన రీతిలో ధరించాలి.
    • ఆవలించకూడదు.
    • సోమరితనంతో చేతులు/కాళ్ళు చాచకూడదు.
    • తల విదిలించి జుట్టును విరపోసుకోకూడదు.
    • గోర్లను కొరకడం లేదా కత్తిరించుకోకూడదు.
    • తుమ్మడం, ముక్కు చీదుట
    • ఉమ్ముట
    • ఆకూ, వక్కా,పొగాకు మొదలైనవి నములుట చేయకూడదు.
    • శరీరం పైభాగాన్నివస్త్రంతో కప్పకూడదు.
    • నిద్రపోవుట, కునుకు తీయుట
    •  ముచ్చట్లాడుట
    • గట్టిగా నవ్వి చేతులు చప్పట్లు కొట్టకూదడదు
    • గట్టిగా అరిసి ఎవరినీ పిలవకూడదు.
    • ఇతరులను తిట్టుట
    • ఇతరులను కోపగించుట
    • వినమ్రత లేకుండా అహంకరంతో ఉండుట
  • ఆలయం లోపల లౌకిక ఆలోచనల వ్యక్తులతో మాట్లాడటం / చర్చించడం చేసి శ్రీవైష్ణవులను విస్మరించడం ఒక అడ్డంకి
  • భాగవతులను సేవించకుండా భగవన్ని సేవించుట.
  • మన ఆచార్యుల కైంకర్యానికి దూరంగా ఉండటం.  అనువాదకుని గమనిక: ఉపదేశ రత్న మాల 64 వ పాసురం లో మాముణులు  చాలా ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తున్నారు. “ఆచార్యులకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రమే మన  ఆచార్యులకు సేవ చేయగలము. ఇది గ్రహించిన తరువాత కూడా,  ఆచార్యులకు సేవ చేయకపోతే మనం ఏమి చెప్పగలము?”
  • మనం మన ఆచార్యులకు  నీడలా ఉండి అనుసరించి వారికి ఎప్పుడూ సేవ చేయాలి. ఎంబార్ను “రామానుజ పదచ్ చాయా” గా కీర్తిస్తారు – శ్రీ రామానుజుల యొక్క పాద పద్మాల నీడగా ఉండేవారు. పెరియాళ్వార్  తిరుమోళి చివరి భాగాన్ని (చివరి పాసురం యొక్క చివరి పంక్తి) మనం కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు “చాయై పోలప్ పాడ తాముం అణుక్కర్గళే”. అనువాదకుని గమనిక: ఈ పాసుర వ్యాఖ్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై ఒక మంచి సంఘటనను వివరించారు. కొంతమంది శ్రీ వైష్ణవులు ఎంబార్‌ దగ్గరకు వచ్చి ఈ వాక్యానికి అర్ధాన్ని వివరించమని అడుగుతారు. ఈ వాక్యము యొక్క అనువాదం ఇది – “నీడ వలె పాడగలవాడు ఎమ్పెరుమాన్ యొక్క ప్రియమైన సేవకులు” – కానీ ఇది స్పష్టంగా ఆనిపించడం లేదు. ఎంబార్‌  అంటారు “నేను దీని అర్థం ఎమ్బెరుమానార్ నుంచి వినలేదు, ఇప్పుడు వారు తిరుక్కోష్టియూర్ నంబిని కలవడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను మీకు ఈ విషయం వివరిస్తాను” అని చెప్పి ఎమ్బెరుమానార్ యొక్క పాదుకలను తీసుకొని తన శిరస్సుపై ఉంచి కొంచెము సేపు ధ్యానం చేస్తారు. కొద్దిసేపటి తరువాత వారు కళ్ళు తెరిచి, “ఇప్పుడు ఎమ్బెరుమానార్ దీని యొక్క అర్ధాన్ని నాకు వివరించారు. మీరు వినవచ్చు. దీనిని పాద వల్లార్ – చాయై పోల – తాముం అణుక్కర్గళే, అని తీసుకోవాలి.  అనగా, ఈ పాసురములను పాడగలిగేవాడు, నీడ లాగా అవుతాడు వారికి చాలా ప్రియమైనవాడుగా ఉంటాడు” అని అంటారు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-15.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 14

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/08/virodhi-pariharangal-13/ .

ఎమ్బెరుమానార్ వారి కాలక్షేప గోష్టి

45.  శ్రవణ విరోధి  – వినడంలో అవరోధాలు (భగవాన్ మరియు  భాగవతుల యొక్క మహిమలు) 

శ్రవణ౦ అనగా వినడం. ఈ విభాగంలో, మనం ఏమి వినాలి, ఏమి వినకూడదో వివరించబడింది. అనువాదకుని గమనిక: శ్రీ భాగవతంలో, ప్రహ్లాదుడు తొమ్మిది విధాల  భక్తిని వివరించారు – శ్రవణ౦ కిర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనమ్ వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం – శ్రీమన్నారాయణుడిని గురించి వినాలి, స్మరించాలి, గానం చేయాలి, వారి చరణ కమలాల సేవ చేయాలి, వారిని ఆరాధించాలి, వారిని కీర్తించాలి, వారిని సేవించాలి, వారితో స్నేహం చేయాలి మరియు వారికి తమను అర్పించాలి వంటివి ఎమ్పెరుమాన్ పట్ల భక్తిలో పాల్గొనడానికి  తొమ్మిది మార్గాలు. వీటిలో, శ్రవణ౦ మొదట వివరించబడింది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి. దాని గురించి ఇప్పుడు చూద్దాం.

  •  భగవత్ చర్చా సమయంలో వ్యర్థపు మాటలాడుటను ఖండించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఎవరైనా సంపూర్ణ భగవత్ విషయంలో (ఎమ్పెరుమాన్ సంబంధించిన విషయాలు) మునిగి ఉన్నప్పుడు, వారు సంభాషించేది ఏదైనా సహజంగా భగవత్ విషయంగా మారుతుంది. జ్ఞాన సారం పాసురం 40 లో, “అన్బర్ చోల్లుమవిడు చురుతియాం”  (భగవాన్ యొక్క ప్రియమైన భక్తుల సాధారణ సంభాషణలు కూడా ప్రమాణాలుగా (ప్రామాణికమైనవి) మారతాయి. అనువాదకుని గమనిక: వరవరముని వారి ఉత్తర దినచర్యలో, ఎరుంబి అప్పా మాముణులను ప్రార్థిస్తూ “ప్రియమైన స్వామీ! దయచేసి నా ఆలోచనలన్నీ మీపైనే కేంద్రీకృతమై ఉండేలా ఆశీర్వదించండి, నా పలుకులన్నీ మీ మహిమకై పలకాలి, నా శారీరిక చర్యలన్నీ మీ సేవ / మహిమకై చేయాలి, ఇంకా నేను ఇక్కడ ప్రస్తావించనవి ఏవైనా ఉంటే అవి కూడా మీ ఆనందం కోసం చేయనివ్వండి” – ఇది నిజమైన శ్రీవైష్ణవుడు యొక్క స్థితి – వాళ్ళు  ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ మరియు ఆచార్యల ఆనందాన్నిచూస్తారు – కాబట్టి వారు సహజంగా ఏమి చేసినా ఎమ్పెరుమాన్ మరియు ఆచార్యులను ప్రసన్నులను చేస్తుంది.
  • వినేటప్పుడు ఆ విషయంపై పూర్తి ఏకాగ్రత లేకపోవడం అడ్డంకి. మనస్సు యొక్క ఏకాగ్రత పూర్తిగా నిర్దిష్ట విషయాలపై ఉంచాలి. ఇది ఒక సామాన్య విషయమని వినకూడదు, పూర్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా తరువాత “నేను కూడా భగవత్ విషయం విన్నాను” అని ప్రగల్బాలు పలుకకూడదు.
  • భగవత్ విషయం వింటున్నప్పుడు, వేరే వాటిపై దృష్టి పెట్టడం గొప్ప అడ్డంకి.
  • మనకు తెలియని ఒక అంశం గురించి విన్నప్పుడు, జాగ్రత్తగా విని మరియు దానిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన తలను ఊపుతూ “అవును, సరైనదే” నని, అది తెలిసిందేనని నటించకూడదు.
  • జ్ఞానులైన పండితులు కొన్ని సూత్రాలను చక్కగా వివరిస్తున్నప్పుడు, మనం తమ స్వంత జ్ఞానాన్ని చూపుతూ ప్రగల్భాలతో అంతరాయం కలిగించకూడదు. సరిగ్గా వివరించబడుతున్న విషయాలలో లోపాలు చూపడం కూడా సరైనది కాదు.
  • భగవత్ విషయం గురించి చక్కనైన వివరణ ఎవరైనా చెప్పడం విన్నప్పుడు వారిపై అసూయపడటం ఒక అడ్డంకి. భగవత్ విషయంలొ ఇతరుల వికాసాన్ని చూసి అసూయ పడకూడదు. అనువాదకుని గమనిక: ఆర్తి ప్రభాంధంలో, మాముణులు వారి గురించి పాసురం 55లో వివరిస్తూ “పిఱార్ మినుక్కమ్ పొఱామై ఇల్లాప్పెరుమైయుమ్ పెఱ్ఱ ఓమే” – ఖచ్చితంగా ఇతరుల పెరుగుదల చూసి నేను అసూయపడను.  ఇది ఒక గొప్ప గుణం, సాధించడం చాలా కష్టం. శ్రీ వైష్ణవులు అందరు ఇతర శ్రీవైష్ణవులు కీర్తించబడినపుడు సహజంగా సంతోషంగా ఉండాలి.
  • భగవత్ విషయం యొక్క మంచి మాటలను విన్నప్పుడు మెచ్చుకోకపోవడం ఒక అడ్డంకి. కొన్ని మంచి మాటలు చెప్పబడినప్పుడు మరియు మంచి పనులు చేయబడినప్పుడు మర్యాదపూర్వకంగా  వ్యవహరించడం మరియు హృదయపూర్వకంగా వారిని అభినందించడం మంచిది.
  • తనకన్నా ఎక్కువ తెలివిగల సబ్రాహ్మచారుల పట్ల అసూయపడటం, ఆ అసూయను వ్యక్తం చేయుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక:  సాటి శ్రీవైష్ణవుల వికాసానికి ఒక శ్రీవైష్ణవుడు సహజంగా ఆనందించాలి,  సాటి శ్రీవైష్ణవులు బాధపడుతున్నప్పుడు బాధ అనుభవించాలి. అవగాహన ఉన్న వ్యక్తి యొక్క నిజమైన గుణం ఇది. సాటి శ్రీవైష్ణవులకు మంచి జరిగినప్పుడు మన స్వంత పిల్లలకు మంచి జరిగినట్లుగా భావించి మనం ఆనందపడాలి (సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ప్రకాశిస్తూ సంతోషంగా ఉండటం చూసి ఆనందిస్తారు).
  • భగవాన్ యొక్క దివ్య గుణాలైన సౌలభ్యం (సులువుగా లభించుట), సౌశీల్యం (అందరితో స్వేచ్ఛగా కలవడం) మొదలైనవి విన్నప్పుడు మన హృదయం కరిగిపొవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. రోలుకి కట్టిన  నిస్సహాయ స్తితిలో ఉన్న శ్రీక్రిష్ణుడిని జ్ఞాపకం చేసుకున్న తరువాత 6 నెలలు నమ్మాళ్ల్వారు స్పృహ కోల్పోయిన సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు.
  • భగవత్ విషయాన్ని  (ఎమ్పెరుమాన్ కు సంబంధించిన విషయాలు) గొప్ప భక్తితో హృదయపుర్వకంగా శ్రవణం చెయాలి. నిరాసక్తితో భక్తి లేకుండా వినడం ఒక అడ్డంకి.
  • దైవసంబంధమైన భావనలతో శారీరికంగా స్పందించక పొవుట ఒక అడ్డంకి. “ఆహ్లాధస్తీత నేత్రాంబు:  పులకీకృత గాత్రవాన్” – ఎమ్పెరుమాన్  నామాలను విన్నప్పుడు ఆనంద బాష్పాలతో భావోద్వేగముతో శారీరక మార్పులను (రోమాలు నిక్కరపొడుచుకొని నిలబడుట మొదలైనవి) అనుభవించుట. అనువాదకుల గమనిక: ఈ అంశాలను భగవాన్ స్వయంగా గరుడ పురాణంలో తన భక్తి యొక్క ఎనిమిది లక్షణాలను వివరిస్తూ , వారి దివ్య గుణాల గురించి వినేటప్పుడు దివ్య భావాలను అనుభవించుట కూడా ఒక లక్షణం అని వివరిస్తారు. వారు “నా భక్తులు తప్పనిసరిగా ఈ క్రింది ఎనిమిది లక్షణాలు కలిగి ఉంటారు – 1) ఎమ్పెరుమాన్  యొక్క భక్తులపై అమితమైన ప్రేమ కలిగి ఉండుట, 2)  ఎమ్పెరుమాన్ ఆరాధనను ఆనందించట, 3) ఎమ్పెరుమాన్ ను  తాను ఆరాధించుట, 4) అహంకారం లేకుండా ఉండుటం, 5) ఎమ్పెరుమాన్ గురించి వినడంలో ఆసక్తి చూపుట , 6) ఎమ్పెరుమాన్ గురించి విన్నప్పుడు / ఆలోచించేటప్పుడు / మాట్లాడేటప్పుడు శారీరక మార్పులు (రోమాలు నిక్కరపొడుచుకొని నిలబడుట వంటివి) చెందుట 7) ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ గురించి ఆలోచించుట, 8) ఎమ్పెరుమాన్ ఆరాధనకు ప్రతిఫలంగా భౌతిక ప్రయోజనాలు ఆశించకపోవుట. అలాంటి భక్తులు మ్లేచులు అయినప్పటికీ, వారు బ్రాహ్మణ పండితులచే, కైంకర్యపరారులచే మరియు సంసారులచే ఆరాధనీయులు. అలాంటి వారు పండితుల నుండి జ్ఞానాన్ని పొందుటకు, జ్ఞానాన్ని పంచుటకు కూడా అర్హులు “.
  • మన సత్ సాంప్రదాయ సూత్రాలను విన్న తరువాత, వాటిని పూర్తిగా పాటించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఆండాళ్ నాచియార్ నాచియార్ తిరుమొళి 11.10లో  “మెయ్మై ప్పెరువార్తై విట్టుచిత్తర్ కీట్టిరుప్పర్” – పెరియాళ్వార్ (మా నాన్నగారు) చరమ శ్లోక శ్రవణం చేసిన తరువాత అదే ప్రకారంగా వారి జీవితం సాగించారు. ఇది ఆస్తీక లక్షణం (శాస్త్రాన్ని నమ్మినవాడు అనే దానికి అసలు అర్ధం). సూత్రాలను పాటించకపోవడం నిజంగా తమ స్వభావానికి హాని కలిగిస్తుంది.
  • సదాచార్యుల (నిజమైన ఆచార్య) నుండి వినకపోవడం ఒక అడ్డంకి. సదాచార్యులు అంటే పెద్దల నుండి (ప్రామాణికమైన ఆచార్యలు) ప్రామాణికంగా జ్ఞానాన్ని పొందిన వారు, ఆలోచించి ఇతరులకు వివరించేవారు. మన పూర్వాచార్యుల  ఆచార వ్యవహారములను నేర్చుకునేవారు. అలాంటి గొప్ప వ్యక్తులను మాత్రమే సదాచార్యులు అంటారు. ఈ విషయాన్ని మాముణులు ఉపదేశ రత్నమాల పాసురం  61 లో ” జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్ ఱాగవే ఉడైయనాన గురు” – జ్ఞానమును పూర్తిగా ఇమిడ్చుకొని వాటిని సమర్థవంతంగా అనుసరించే వారు ఆచార్యులు.
  • సదాచార్యుల నుండి విలువైన జ్ఞానాన్ని నేర్చుకున్న తరువాత, అర్హత లేని వ్యక్తులకు బోధించడం ఒక అడ్డంకి. నిజమైన అర్హత – నేర్చుకోవాలనే కోరిక, ఆ జ్ఞానంపై  విశ్వాసం కలిగి ఉండటం.
  • అవైష్ణవుల నుండి భగవత్ విషయం వినడం ఒక అడ్డంకి. అవైష్ణవులు అనగా దేవతాంతర సంభంధం ఉన్న వ్యక్తి – రుద్రుడు , దుర్గ, బ్రహ్మ, ఇంద్రుడు, స్కందుడు, వంటి ఇతర దేవతలతో సంబంధం. అనువాదకుని గమనిక: తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళిలో వివరిస్తూ అన్నారు, దేవతాంతర సంభంధం ఉన్న వారితో మనకు ఏ సంబంధం ఉండకూడదు. పెరియ తిరుమోళి 8.10.3లో – మఱ్ఱ మోర్ దెయ్వం ఉళదెన్ఱు ఇరుప్పారోడు ఉఱ్ఱఇలేన్ – ఇతర దేవతల సంబంధం ఉన్న వారితో నేను ఏ సంబంధం పెట్టుకోను, వారు భగవత్ విషయమును అందిస్తున్నప్పటికీ, వారి అభిమాన దేవతలకు సంబంధించిన వారి వ్యక్తిగత ప్రయోజనాల రంగు ఉండవచ్చు – అందువల్ల వారి నుండి వినకుండా ఉండటం మంచిది. వారు భాహ్యులు  (వైధిక వ్యవస్థకు వెలుపల ఉన్న వ్యక్తులు) కావొచ్చు లేదా కుదృష్ఠులు (వైధిక వ్యవస్థను స్వీకరించినవారు కాని వాటి అర్థాలను తప్పుగా అర్థం చేసుకునేవారు) కావొచ్చు – వారి వివరణ ఏదైనా ఎల్లప్పుడూ సత్ సాంప్రదాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయి – కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి దూరంగా ఉండాలి. 
  • సత్ సాంప్రదాయ విషయాలకు మినహా ఏమీ వినకూడదు. సత్ సాంప్రదాయలో సరిగ్గా శిక్షణ పొందిన పండితుల నుండి మాత్రమే శ్రవణం చేయాలి. అనువాదకుని గమనిక: మునుపటి సూత్రం మాదిరిగానే – సరైన సూత్రాలపై శిక్షణ లేని పండితుల నుండి మనం విన్నప్పుడు, గందరగోళంతో, వాస్తవమైన సూత్రాలను తప్పుగా గ్రహించే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 7 వ పాసురంలో “కలైయఱక్ కఱ్ఱ మాన్తర్ కాణ్బరో కెట్పరో తామ్” – నేర్పరులైన పండితులు అవైధిక విషయాల శ్రవణం చేయరు.  పెరియ వాచాన్ పిళ్ళై వారి వ్యాఖ్యానంలో ఒక సంఘటన వివరించారు. కూరత్తాళ్వాన్ తన చిన్న వయస్సులో ఒక సంధర్భంలో బౌద్ధ వచనాల్ని కొన్ని విని ఇంటికి ఆలస్యంగా వస్తారు. వారి తండ్రి ఈ ప్రవర్తనతో కలత చెంది, ఆళ్వానుకి శ్రీపాద తీర్థాన్ని ఇచ్చి శుద్ధి చెసిన తరువాత అతన్ని ఇంటి లోపలికి రానిస్తారు.
  • భగవాన్ మరియు  భాగవతుల మహిమల గురించి విన్నప్పుడు బ్రహ్మానందాన్ని పొందాలి. అలాగే భగవాన్ మరియు  భాగవతులను అవమానించినప్పుడు (శిశుపాలుడు చేసినట్లు) కూడా టక్కున చెవులు మూసుకొని ఆ ప్రదేశాన్ని వదిలివేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం వంటి చరమార్థం (అత్యున్నతమైన సూత్రాలు) బాగా అర్థం చేసుకోవాలి మరియు రోజువారీ జీవితంలో అమలు చేయాలి. చరమార్థం అంటే చరమ శ్లోకం అని కూడా అర్ధం. అనువాదకుని గమనిక: చరమార్థం అంటే తుదకు ఆచార్యులను సాధనంగా మరియు లక్ష్యంగా స్వీకరించుట. అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అదే సూత్రాన్ని జ్ఞాన సారం మరియు ప్రమేయ సారం ప్రభంధములలో వివరించారు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, పిళ్ళై  లోకాచార్యులు మనలను ఉద్ధరించడానికి ఆచార్యుల అనుగ్రహమే  అంతిమ మార్గమని తెలియ చెప్పారు. విళాంచోలై పిళ్ళై అదే సూత్రాన్ని తమ  సప్త గాధయ్ లో ఏడు పాసురములుగా వివరించారు. మాముణులు అదే సూత్రాన్ని ఉపదేశ రత్నమాల చివర్న అద్భుత రీతిలో వివరించారు.
  • భగవత్ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు రుద్రుడు  బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన ఇతర దేవతలకు సంబంధించిన విషయాలను తీసుకురాకూడదు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-14.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 24

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 23

ఉపనిషత్ వాక్యాలు పరస్పర విరుద్ధంగా గోచరిస్తాయి, వేరు వేరు అర్థాలను చెప్పినట్లుగా కనపడతాయి. కానీ తరచి చూస్తె సత్యం బోధపడుతుంది.

కొన్ని వాక్యాలు జీవాత్మ పరమాత్మా వేరని చెప్పగా మరికొన్ని అభేదం చెపుతాయి.

               వేదాంతులెవరూ జీవాత్మ తత్వాన్ని తృణీకరించలేరు. లోకంలో సుఖదుఃఖాలను అనుభవించేది ఎవరు? అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏతత్వజ్ఞాని కూడా పరమాత్మ అని చెప్పరు. కావున జీవాత్మ భావాన్ని అంగీకరించేతీరాల్సి వుంటుంది.  పైగా పరమాత్మ, జీవాత్మ ఒకటే అని సిధ్దాంతికరించిన వారు కూడా లోకంలో సుఖదుఃఖాలను అనుభ వించే జీవాత్మ పరమాత్మను పోలిన వాడని చెపుతారు కానీ పరమాత్మ అని చెప్పారు.. ఇలా చెప్పటం వలన జీవపర ఐక్యం అన్న వాదన బోధింపబడుతుంది . జీవాత్మ పరమాత్మ భావాలు ఒకటి కాదు, అందుకని వ్యతిరేకమైనవి కావు. జీవాత్మ అనేవాడు పరమాత్మ యొక్క మనో, జ్ఞాన, ఉపాదుల వలన ఏర్పడిన వాడు అని చెప్పటం వలన జీవాత్మ పరమాత్మా ఒక్కటే అన్న సిద్దాంతం చేయబడింది. వేదాంత సిద్దాంతలన్నింటిలో జీవాత్మ పరమాత్మ భావాలను ఒప్పుకుంటారు. కానీ అన్వయంలోనే భేదాలు వస్తాయి.

                జీవాత్మ పరమాత్మ సంబంధ విషయమైన ప్రశ్నను పరిష్కరించడంలో వేదాంతులలో భిన్న స్వరాలు వినిపిస్తాయి. అద్వైతులు ఈ భేదభావాన్ని గౌణంగా పరిగణిస్తారు. అద్వైతుల వాదనలో జీవపరభావం  జీవుడికి అజ్ఞానం ఉన్నంత వరకే, ఒకసారి అజ్ఞానం తొలగి జ్ఞానం ఏర్పడితే  జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడు. అప్పుడు జీవపర భేదం అన్న ప్రశ్నకు అవకాశమే లేదు అని చెపుతారు. ఈ సిద్దాంతాన్ని నిరూపించటానికి ఉపనిషత్తుల నుండి, వేదాల నుండి అనేక వాక్యాలను ఉటంకిస్తారు.

                 భేద శృతిని చెప్పేవారు విభిన్నమైన రీతిలో వాదిస్తారు. వీరు అద్వైతులు దర్శించిన అభేద శ్రుతులను అంగీకరించరు. జీవాత్మ, పరమాత్మ  వేరు వేరు అన్న తత్వాలని అంగీకరిస్తారు. అచేతన భౌతిక ప్రపంచంలాకాక జీవాత్మ, పరమాత్మ ఇద్దరు స్వతంత్ర ఆత్మలని, చేతనులని, ఇద్దరి మధ్య భేదం ఉందని భావిస్తారు. అజ్ఞానమేజీవాత్మ,పరమాత్మల మధ్య భేద భావానికి కారణమని అద్వైతులు చెప్పే సిధ్దాంతాన్ని పూర్తిగా ఖండిస్తారు. దీనికి వారు లెక్క లేనన్ని ఉపనిషత్ వాక్యాలను ఉదాహరణగా ఉటంకిస్తారు.

                  వీరు తమ వాదనకు అనుకూలమైన శృతి వాఖ్యాలను మాత్రం గ్రహించి, వ్యతిరేకంగా ఉన్నవాటిని పూర్తిగా తృణీకరిస్తారు. అనుకూలమైన వాటిని మాత్రంగ్రహించి  వ్యతిరేకమైన వాటిని వదిలివేయటం శాస్త్ర సమ్మతం కాదు.

                   భేదాభేద వాదులు రెండు ఆత్మలను అంగీకరిస్తున్నారు.  అయితే అది ఎంత వరకు అంటే వాళ్ళు ఏ వాదానికి సంబంధించిన వాళ్ళో అంతవరకు మాత్రమే. వీరు కొత్త విధమైన తత్వావిచారం ఎమీ చేయటం లేదు. ఉన్న దానినే మళ్ళి చెప్పారు. ఈ భేదాభేద వాదాన్ని స్వీకరిం చడానికి కానీ, తృణీకరించడానికి కానీ సరి అయిన ఉపనిషత్ వాక్యాలను ఏవి  ఉదాహరించి చూపటం లేదు.

                 విశిష్టాద్వైతంలో ఉపనిషత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వీరు భేదం లేక ఐఖ్యం అన్న అర్థాన్ని స్పురింపజేసే  ఉపనిషత్ వాక్యాలను గొప్పవని అంగికరించట, తక్కువని త్రుణీకరించటమో లేదు. ఈ ప్రశ్నకు జవాబు ఉపనిషత్ లోనే దొరుకుతుంది దీనికోసం ప్రత్యేకమైన గ్రంధాల నుంచి ఉదాహరించాల్సిన అవసరం లేదు. ఉపనిషత్ చూపే మార్గంలో పొతే చాలు పరిష్కారం దొరుకుతుంది అన్నది వీరి భావాన.

విశిష్టాద్వైతంలో మూడు రకాల ఉపనిషత్ వాక్యాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  1. భేదశృతి – జీవాత్మ పరమాత్మా వేరు వేరు అని తెలిపే శృతి వాక్యాలు.
  2. అభేద శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు. ఒకటే అని తెలిపే శృతి వాక్యాలు.
  3. ఘటక శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు అని, వేరు వేరు తత్వాలని తెలిపే శ్రుతులకు భిన్నంగా ఉన్నరెండు రకాల శృతి వాక్యాలను ఏకంగా క్రోడీకరించినవి.

మొదటి రెండు వాదనలను చూసాము కాబట్టి మూడవ వాదనను చూద్దాం.

                   వీటిలో ముఖ్యమైన భాగాలు ప్రాచీన ఉపనిషత్తులుగా చెప్పబడే అంతర్యామి బ్రాహ్మణంలోను, సుభాలోపనిషత్తులోను కనపడతాయి . వీటిలో జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం శరీరాత్మ సంబంధం వంటిదిగా చెప్పబడింది. జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక శరీరం, పరమాత్మ చేతనాచేతనములన్నింటిని తన శరీరముగా ఉన్నవాడు. కావున పరమాత్మ జీవాత్మకు అంతర్యామి, అంతరాత్మ. ఈ సంబంధము జీవాత్మకు, పరమత్మకు నిత్యమైంది. ఇది లేకపోతె వారు లేరు. అర్తాత్ జీవాత్మ పరమాత్మ ఇద్దరూ ఒకటే, కానీ. కావున శరీర భేదంతో ఇద్దరూ వేరుగా ఉన్నారు. వాళ్ళు ఒకే వ్యక్తిగా ఉన్నారు. స్వామి రామానుజులు శరీరం, ఆత్మ రెంటిని స్పష్టంగా వివరించారు, ఇది ఇక్కడ అప్రస్తుతం.

            విశిష్టాద్వైతులు అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం మూడు నిత్యమని చెపుతారు. జీవాత్మ స్వరూపం, స్థితి, కర్మాచరణ అన్ని పరమాత్మలోనే చేరి వున్నాయి. జీవాత్మ లేకుండా పరమాత్మ, పరమాత్మ లేకుండా జీవాత్మ లేరు. ఈ తత్వంలోనే వారిరువురి స్వరూపం సిద్దిస్తుంది. స్వభావ రీత్యా ఆ రెండు వేరు వేరుగా ఉంటాయి, పరమాత్మ ఈ సంసారంలో కట్టుబడడు, వీటికి అతీతమైన వాడు.  పరమాత్మ సకల కల్యాణగుణ పరిపూర్ణుడు, అపహతపాప్మ.  ఏ పాపములు అంటని వాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వాంతర్యామి. సృష్టి, స్థితి, సంహారం చేయగల వాడు. కాలప్రమాణాలకు అందనివాడు .జీవాత్మ, సంసారం, సుఖం దుఃఖం కర్మబంధనాలకు కట్టుబడ్డ వాడు తనను తాను రక్షించుకోలేనివాడు, పూర్తిగా పరమాత్మ మీద ఆధారపడిన వాడు, వాడికే స్వాభావికంగా దాసుడు, ఈ విషయాన్ని మరచిపోయిననాడు దుఃఖిస్తున్నాడు. ఈ రకంగా పరమాత్మా, జీవాత్మ పూర్తిగా వేరువేరు తత్వాలు. ఉపనిషత్తులలోని ఘటక శృతి ఆధారంగా ఈ శరీర శరీరీ భావాన్నిబట్టి ఈ రెండు ఒకే సమయంలో వేరుగానూ, ఒకటిగాను  అర్థం చేసుకోవచ్చు . ఈవిధంగా  ఉపనిషత్తులలోని భేదాభేద గందరగోళానికి విశిష్టా ద్వైతంలో పరిష్కారం లభిస్తుంది. విశిష్టాద్వైతం కొత్తదో లేక విప్లవాత్మకమైన మార్పో కాదు. బోధాయనులు, వేదాంతులు,  టంకణులు, ద్రమిడులు, గుహదేవులు, వంటి మహర్షుల మనోభావాలకు సంబందించిన స్మృతి, శృతి, ఇతిహాస, పురాణాలకు సరిపోయే విధంగా వివరించటమే దీని లక్ష్యం. వైధికమైన భారతదేశపు ఉన్నతమైన సంప్రదాయాలను, అర్థవిశేషాలను కాపాడటం, ఈ దేశ ప్రాచిన వేదాంత పరంపరను రక్షించటం విశిష్టాద్వైతం యొక్క లక్ష్యం. ఒక రకమైన వాదన చేసేవారు తక్కువ అని మరొకరు ఎక్కువ అని భావించక అందరిని, అన్నింటిని సమన్వయపరచటయే ఈ సిధ్దాంతంలోని గొప్పదనం. ఉపనిషత్తులలోని సకల వాక్యాలను సమన్వయపరచేదే విశిష్టాద్వైతం. ఉపనిషత్తుల నుండి కర్మ, జ్ఞాన, భక్తి , ప్రపత్తి మార్గాలకు సంబంధించిన సూత్రాలను  క్రోడికరించి ఆచరింప చేయటమే విశిష్టాద్వైతం ఔన్నత్యం.

                మన ఆచార్యులు ఇతర సిధ్ధాంతపరులని చూడకుండా వదిలివేసిన ఘటక శృతులను ఉపనిషత్తులలో శోధించి ప్రవచించగలిగారంటే ఆళ్వార్ల దివ్యప్రబంధమే దానికి పక్కబలంగా ఉపకరించిందని పెద్దల అభిప్రాయము. తిరువాయ్మొళి మొదటి రెండు పత్తులు (రెండు వందల పాశురాలు) బ్రహ్మ సూత్ర సారాన్నే చెపుతున్నది.

                    ఆళ్వార్ల  “ఉడల్ మిసై ఉయిరెన కరన్దెగుం పరన్దుళన్” (తిరువాయ్మొళి 1-1-7) అన్న పాశుర భాగం ఉపనిషత్ వ్యాక్యాలు చెప్పే ఘటక శృతినే వివరిస్తున్నది.

                      శరీర శరీరి  భావాన్ని ఇక్కడ ఆళ్వార్లు చక్కగా చూపించారు. స్వామి రామానుజులు ఈ పాశురాలలో ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మసూత్రాలను దర్శించగలిగారు .

                     ఇక్కడ మాత్రమే కాదు మరొక సందర్భంలో కూడా ఉపనిషత్తులలోని ప్రశ్నలకు ఆళ్వార్ల తిరువాయ్మొళిలో జవాబు లభిస్తుంది. అది కూడా చూద్దాం.

                    ఉపనిషత్ వాక్యాలు కొన్ని బ్రహ్మ నిర్గుణుడని చెపుతుంది. మరికొన్ని సూత్రాలు బ్రహ్మ సగుణుడని, సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడని చెపుతుంది. వివిధ వ్యాఖ్యానాలలో వేరు వేరుగా వివరణ ఇవ్వబడింది. విశిష్టా ద్వైతులు దీనిని రెండు పక్కలుగా వివరించారు. బ్రహ్మకు హేయగుణములు లేవు కానీ కళ్యాణ గుణములున్నాయి అని ఉపనిషత్ వాక్యాల ఆధారంగా  విశిష్టాద్వైతులు వివరణ ఇచ్చారు. హేయగుణములు నిర్గుణం. కళ్యాణ గుణములు సగుణం.

                      ఆళ్వార్ల తిరువాయ్మొళిలోనే ఈ వివరణ కూడా కనపడుతుంది. సకల చరాచర ప్రపంచానికి నాయకుడైన పరమాత్మ సకల కళ్యాణ గుణములు కలవాడు .

                       బ్రహ్మ అన్న పదమే ‘బృ’ అన్న ధాతువు నుండి పుట్టింది. ‘బృ’అంటే పెద్ద అని అర్థము కదా!

                   స్వామి రామానుజులు బ్రహ్మ అన్న శబ్దాన్ని ఆళ్వార్ల తిరువాయ్మొళిలోని పాశురాన్నే తీసుకొని  వివరణ ఇచ్చారు.

‘ఉయర్వర ఉయర్నలం ఉడైయవన్ ఎవన్ వన్’

ఉయర్ వర = అనవధికాతిశయ

ఉయర్ =అసంఖ్యేయ

నలం ఉడైయవన్= పురుషోత్తముడు

ఆళ్వార్ల మనసు ఆచార్యులైన స్వామి రామానుజుల నోట పలకగా విన్నవారే అదృష్టవంతులు కదా!

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/22/dramidopanishat-prabhava-sarvasvam-24/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org