Monthly Archives: November 2019

విరోధి పరిహారాలు – 21

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/07/virodhi-pariharangal-20/.

52. గృహ విరోధి  – నివాస స్థలంలో అవరోధాలు

ఎమ్పెరుమానార్ పరుత్తిక్ కొల్లయ్ అమ్మాళ్ ఇంటికి వెళ్లినపుడు, చిరిగిన బట్టలతో బయటకు రావడానికి ఆమె సిగ్గుపడుతున్నట్లు గమనించి తన సొంత ప్రపన్న పాకై (వారి తలను కప్పుకునే ఒక వస్త్రం) ను ఆమెకిచ్చి ఆశీర్వదిస్తారు. వారి తిరువేంకట యాత్రా సమయంలో,  ఆమె అద్భుత సాత్విక లక్షణాలను తెలుసుకొని ఎమ్పెరుమానార్ ఆమె నివాసానికి వెళ్లి ఆశీర్వదిస్తారు  – ఈ సంఘటన పిళ్ళై లోకం జీయర్ రాసిన రామానుజార్య దివ్య చరితలో వివరించబడింది.

ఈ విభాగంలో, ప్రపన్నులు / శ్రీవైష్ణవుల నివాసం యొక్క స్వభావం గురించి వివరించబడింది. అనువాదకుల గమనిక: సాధారణంగా మన పూర్వాచార్యులు దివ్య దేశాలు, వారి అభిమాన స్థలాలు, ఆళ్వారుల / ఆచార్యల అవతార స్థలాలు మొదలైన వాటిలో నివాసంపై దృష్టి పెట్టారు. పెరియాళ్వార్ తిరుమోళి 5.1.3 లో పెరియాళ్వార్ వివరిస్తూ ఇలా అన్నారు, “ఉన్ కోయిలిల్ వాళుం వైట్టణవన్ ఎన్నుం వన్మై కండయే” – శ్రీ వైష్ణవుడిగా అత్యున్నతమైన లక్ష్యం ఏమిటంటే , మీకు (భగవాన్) ప్రియమైన ప్రదేశంలో నివసించి, భగవాన్ మరియు భాగవతుల కైంకర్యములో నిమగ్నమై జీవించడమే.  దివ్య దేశములును “ఉగంతరుళినా నిలంగళ్ ” –  భగవాన్ గొప్ప ఆశతో ఆశీర్వదించిన ప్రదేశం అని అర్థం. దివ్య దేశములు మొదలైన వాటిలో నివసించే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, నేర్పరులైన శ్రీవైష్ణవులతో  పరస్పరం వ్యవహారంలో ఉండి తద్వారా భగవత్ విషయం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో నిరంతరం నిమగ్నమవ్వడం,  భగవాన్ మరియు భాగవతులకు నిరంతరం కైంకర్యంలో పాల్గొనడం. చుట్టూ  భాగవతుల మధ్య ఉండటం ద్వారా, సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) తో కలవ వలసిన అవసరం కూడా ఉండదు. అదంతకదే తొలగిపోతుంది.  ఈ సూత్రాన్ని ఈ విభాగంలో వివరంగా నొక్కిచెప్పారు.

  • దేవతాంతరములతో (బ్రహ్మ, రుద్ర మొదలైన ఇతర దేవతలు) సంబంధం కారణంగా ఖండించబడిన ప్రదేశంలో నివాసం ఉండటం ఒక అడ్డంకి.
  • పాషండులు (బాహ్యులు – వేదాన్ని  అంగీకరించని వారు, కుదృష్టులు –  వేదాన్ని  అంగీకరిస్తారు కాని వాటిని  తప్పుగా అర్ధం చేసుకునేవారు) ఉండే వీధుల్లో నివసించడం ఒక అడ్డంకి.
  • పొరుగిడ్లల్లో సంసారులు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ఉన్న (నివసించిన) ప్రదేశంలో నివసించడం ఒక అడ్డంకి.
  • ఊర్ధ్వపుండ్రాలు, శంఖం, చక్రం మొదలైన భగవాన్ యొక్క దివ్య చిహ్నాలను వ్యక్తపరచని గృహాలలో నివసించడం ఒక అడ్డంకి. ఊర్ధ్వపుండ్రాలు మొదలైన వాటితో శ్రీవైష్ణవ ఇండ్లకు గుర్తులు పెట్టుకోవడం / గుర్తించడం యొక్క అవసరాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు.
  • భౌతికంగా ఆలోచించే వారి యాజమాన్యంలో ఉన్న నివాసాలు లేదా వారికి ప్రియమైన గృహాలలో నివసించడం ఒక అడ్డంకి.
  • ఆచార్యులకు అప్రియమైన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఒక ఇల్లు నిర్మించినప్పుడు, అది మన ఆచార్యులకు అర్పించి మరియు వారి ఆమోదం మీద ఆశీర్వాదంగా ఆ నివాసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ అర్థం చేసుకోవాలి.  గృహ ప్రవేశ సమయాన  ఆచార్యులను ఆహ్వానించి, కొత్త ఇంటికి వారి ఆశీర్వాదాన్ని ప్రసాదించమని అభ్యర్థిస్తున్నట్లు ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆచార్య హృదయంలో, 85 వ చూర్ణికలో ఒక అందమైన సంఘటన వివరించబడింది – “మ్లేచనుం భక్తన్ ఆనాళ్”. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ భాగవతుల కీర్తిని వివరిస్తూ, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ ఒక కొత్త గృహాన్ని నిర్మించి, ఆ స్థలాన్ని శుద్ధి చేయటానికి, అతను కేవలం పిళ్ళై వానమామలై దాసును కొత్త గృహంలో అడుగు పెట్టమని, వారి చరణ కమలాలతో ప్రతి గదిలో ప్రవేశించమని కోరారు. కొత్తింటిని శుద్ధి చేయడానికి  పెద్ద పెద్ద యజ్ఞాలు మొదలైనవి చేయడానికి బదులు ఇది అన్నివిధాలా సరిపోతుంది.
  • ఏ సమయాల్లోనైన భాగవతులు వచ్చి ఉండటానికి పూర్తి వసతి లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భాగవతులు ఏ సమయంలోనైనా వచ్చి ఉండగలిగే విధంగా మన ఇండ్లను ఉంచుకోవాలి. పెరియాళ్వార్ తిరుమొళి 4.4 పదిగంలో, పెరియాళ్వార్ తిరుక్కోష్టియుర్ నివాసులను శ్రీవైష్ణవ అతిథులను స్వాగతించడంలో,  వారికి సేవలందించడంలో నిపుణులని గొప్పగా కీర్తించారు.
  • భౌతిక – అంశాలపై ఎక్కువగా దృష్టి ఉన్న రక్త సంభంధం ఉన్న – బంధువులు తరచూ వచ్చే ఇండ్లల్లో నివసించడం. ఒకానొక సమయంలో వడుగ నంబి ఇంటికి  కొంతమంది బంధువులు వచ్చి వెళ్లినపుడు,  వారు ఉపయోగించిన కుండలను / పాత్రలను బద్దలు కొట్టేసి ముదలియాండాన్ ఉపయోగించిన కుండలను తెచ్చుకుంటారు. అనువాదకుల గమనిక: గురుపరంపరా ప్రభావం 6000 పడిలో, వడుగ నంబి యొక్క కీర్తిని వివరించారు. అందులో ఈ సంఘటన  వివరించబడింది. ఒకసారి వడుగ నంబి బంధువులు (శ్రీవైష్ణవులు కానివారు) ఆయనను చూడటానికి వస్తారు. వారు వెళ్ళిన తరువాత, వడుగ నంబి అన్ని కుండలను / పాత్రలను బద్దలు కొట్టి  నాశనం చేసి, ఆ స్థలాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. తరువాత అతను ముదలియాండాన్ ఇంటికి వెళ్లి, వారు వాడి పడేసిన కుండలను తీసుకొని వచ్చి వాడడం ప్రారంభించారు. వారు ఈ విధంగా స్వచ్ఛమైన ఆచార్య సంభంధం ఉన్నవారు, వాటికి సంబంధించిన ప్రతిదీ (వాడి పడేసినవి కూడా) పూర్తిగా పవిత్రమైనవి మనకు ఆమోదయోగ్యమైనవి, సంసారులు తాకిన ఏదైనా అక్కడే విడిచిపెట్టాలి అని నిర్ధారించారు.
  • ప్రత్యేక/వేరుగా కోయిళ్ ఆళ్వార్ (తిరువారాధన గది/దేవుడి గది) లో లేని ఆర్చావతార ఎమ్పెరుమాన్ (సాలగ్రామ శ్రీ మూర్తి, విగ్రహ ఎమ్పెరుమాన్  మొదలైనవి) నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: పంచ సంస్కారాంలో భాగంగా, తిరువారాధనం ఎలా చేయాలో ఆచార్యుల నుండి మనం తెలుసుకుంటాము. అది తెలుసుకున్న తరువాత, అటువంటి శ్రీవైష్ణవుల నివాసంలోకి దయతో దిగిన వచ్చిన భగవానుడిని సరిగ్గా ఆరాధించాలి. గృహార్చ (గృహాలు / ఇండ్లల్లో ఉన్న ఆర్చావతార భగవాన్) మన పూర్వాచార్యుల చేత గొప్పగా మహిమపరచబడింది. శ్రీవైష్ణవ తిరువారాధనంపై ఒక వివరణాత్మక కథనాన్ని http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html లో చూడవచ్చు.
  • ప్రవేశద్వారం వద్ద ప్రముఖంగా సాంగు (శంఖం) ఉన్న నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. శంఖం ఎమ్పెరుమాన్ యొక్క దివ్య ఆయుధం మరియు చిహ్నం అయినప్పటికీ, దీనికి ఒక్కటే ప్రముఖ్యత ఇవ్వడం ఇక్కడ ఖండించబడింది.
  • ఆచార్య శ్రీపాద తీర్థం (చరణామృతం) లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. ప్రతి నివాసంలో ఆచార్య శ్రీపాద తీర్థం మరియు ఎమ్పెరుమాన్ (సాలగ్రామ శ్రీ మూర్తి) తీర్థం (పవిత్రమైన జలం) తప్పనిసరిగా ఉండాలని మన పుర్వచార్యులు వివరించారు. సాధారణంగా ఆచార్యుల చరణ పాద పద్మాలకు కుంకుమ లేదా చందన లేపం రాసి, వారి పాదాల ముద్రలను ఒక గుడ్డలోని అచ్చు తీసుకొని ఇంట్లో భక్తితో ఉంచుకుంటారు. కొన్నిసార్లు, ఆచార్య ధరించే పాదుకలు కూడా ఇంట్లో ఉంచుకుంటారు. శ్రీపాద తీర్థం వీటిలో ఒకదాని నుండి తయారు చేయవచ్చు – ఆచార్యుల యొక్క తామర పాదాల ముద్రతో లేదా వారి పదుకలతో. శ్రీపాద తీర్థం సిద్ధం చేయడానికి మరో మార్గం కూడా ఉంది – తులసి మొక్క కింద ఉన్న మట్టిని ఆచార్య యొక్క శ్రీపాద తీర్థం తో కలిపి  ఒక ముద్ద తయారు చేస్తారు. ఎండినప్పుడు దీనిని “తీర్థవడి” అని పిలుస్తారు – ఈ ముద్దపైన నీటిని పవిత్రం చేయడం ద్వారా శ్రీపాద తీర్థం తయారు చేయవచ్చు. ఏదేమైనా, శ్రీపాద తీర్థాన్ని ప్రతిరోజూ శిష్యులు తీసుకోవాలి.
  • ఊర్ధ్వపుండ్రాన్ని (శ్రీచూర్ణం)  తీసుకువెళ్ళే పెట్టి లేని నివాసంలో నివసించడం మరియు భిక్ష (భగవాన్ యొక్క ప్రసాదం) తీసుకువెళ్ళే బుట్ట లేని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఈ వస్తువులు శ్రీవైష్ణవుల యొక్క రోజువారీ దినచర్యలకు చాలా అవసరమైన వస్తువులు.
  • జప మాల (జపించేటప్పుడు మంత్రాలను లెక్కించడానికి ఉపయోగించే పూసలు) యాలాడేసిన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి.  ఎప్పుడైనా మన మంత్ర పారాయణం చేసేటపుడు లెక్కించాల్సిన అవసరం ఉంటే, మన  వేళ్ళతో లెక్కపెట్టుకోవచ్చు. అనువాదకుల గమనిక: మంత్ర పఠనాన్ని సూచించే ఇతర సాంప్రదాయాలలా కాకుండా, మన సాంప్రదాయం మంత్రాల (తిరుమంత్రం, ద్వయం మొదలైనవి) యొక్క అర్ధాలను ధ్యానం చేయడంపై దృష్టి పెట్టింది. మొదటి 3 వర్ణాలకు (బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య) సంద్యావందనంలో భాగమైన గాయత్రి మంత్ర పారాయణం మినహా మన సాంప్రదాయంలో మంత్రజపం యొక్క సంఖ్యకు ప్రాదాన్యత ఇవ్వలేదు.
  • కుక్కలు, తోడేళ్ళు, నక్కలు, పాషండులు  (మనము ఇంతకు ముందే చూశాము) మొదలైన వాటికి దగ్గరగా ఉండే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి.
  • శైవ, బౌద్ధ, జైన, చార్వాక (బాహ్యా మరియు కుదృష్టులు) సాంప్రదాయాల సాహిత్య పుస్తకాలు ఉంచే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. తొండరడిప్పొడి ఆళ్వార్ తన తిరుమాలై 7వ పాసురంలో “కాణ్బరో కేట్పరో తాం” – ఇతర సాంప్రదాయ సాహిత్యాన్ని ఎప్పుడైనా చూస్తారా లేదా వింటారా) అని అన్నారు. పాసుర వ్యాక్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై వివరిస్తూ, చిన్నతనంలో కూరత్తాళ్వాన్  అలాంటి ఉపన్యాసాలు విన్నందుకు వారి తండ్రిగారు అతన్ని ఎలా శిక్షించారో మనం ఇంతకు ముందు శీర్శికలలో చూశాము.
  • శుక్రవారం, అమావాస్య, మొదలైన రోజుల్లో మాత్రమే ఆవు పేడను అలికి శుభ్రం / పవిత్రం చేసే నివాసాలలో నివసించడం ఒక అడ్డంకి. ప్రతిరోజూ మన ఇండ్లను చక్కగా శుబ్రం చేసి పవిత్రం చేసుకోవాలి. అర్జన విరోధిలో కూడా ఇదే విధమైన సూత్రం వివరించబడింది (చివరికి, శుక్రవారం మాత్రమే శుభ్రం చేయబడిన గృహాల నుండి భిక్షను స్వీకరించడం కూడా వర్జితం). అనువాదకుల గమనిక: ప్రతి శ్రీవైష్ణవుల ఇంటిలో భగవానుడు నివసిస్తున్నందున, నివాసాన్ని ఎమ్పెరుమాన్ ఆలయంగా పరిగణించి వీలైనంత శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచాలి.
  • వంటగది లేదా వండిన ఆహారాన్ని ఉంచిన ప్రదేశం బయటి నుండి సామాన్యులకు కనిపించే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఒకసారి వండిన తర్వాత, ఆహారాన్ని ఎమ్పెరుమాన్కు సమర్పించే ముందు వేరొకరు చూడటం గానీ / వాసన చూడటం గానీ / రుచి చూడటం గానీ చేయకూడదు. కాబట్టి, వండిన పదార్దాలను  సాధారణంగా మూతతో లేదా బట్టతో గానీ కప్పి భద్రంగా ఉంచాలి. ఈ కారణంగానే సమర్పణ కోసం ఎమ్పెరుమాన్కు తీసుకువెళ్ళే భోగాన్ని ఎప్పుడూ పూర్తిగా కప్పబడి ఉండటం మనం సాధారణంగా గుళ్ళల్లో గమనిస్తాము. ఈ పద్ధతిని ఇండ్లల్లో కూడా పాటించాలి.
  • అన్ని చోట్ల బూడిద చల్లిన నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. బూడిద సాధారణంగా శైవులు నుదిటిపై పెట్టుకుంటారు.  శ్రీవైష్ణవులు తాకడం అస్సలు సరికాదు. అనువాదకుల గమనిక:  ఈ విషయం ఇళ్ళ  పరిశుభ్రతను మరియు పవిత్రతను సరిగ్గా నిర్వహించడానికి సంబంధించినది.
  • వండిన అన్నాన్ని ఒక మూలన కుండలో నిలువ ఉంచే ఇంట్లో నివసించడం ఒక అడ్డంకి. ఇది సాధారణంగా ఈశాన్య మూలలో ఉంచబడుతుంది. అనువాదకుల గమనిక: వండిన అన్నం ఆ రోజున అయిపోనప్పుడు, సాధారణంగా రాత్రిపూట నీటిలో ఆ అన్నం కుండను ఉంచుతారు. ఇది అన్నాన్ని కొంతవరకు పాడవకుండా ఉంచుతుంది, అది మర్నాడు తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు. పాత రోజులలో (15 సంవత్సరాల క్రితం కూడా), చాలా కుటుంబాలు (శ్రీవైష్ణవ కుటుంబాలు కూడా) ఈ విధంగా అన్నాన్ని ఉంచి మరుసటి రోజు ఉదయం  పెరుగుతో కలిపి తినడం వంటివి చేసేవారు. ఈ రకమైన ప్రక్రియను ఇక్కడ ఖండించారు. శ్రీ కృష్ణుడు భగవద్గితలో వివరించారు, మునుపటి పూట వండిన ఆహారాన్ని తినకూడదు, ఎందుకంటే ఆ ఆహారం సద్ది అవుతుంది, సాత్విక స్వభావానికి మంచిది కాదు. కాని ఈ రోజుల్లో, జనం ఆహారం విలువ తెలియక మిగిలినవి పారవేస్తున్నారు. – ఇది కూడా సమానంగా మన శాస్త్రంలో ఖండించారు ప్రత్యేకంగా “అన్నం నా నింధ్యాత్” (ఆహారాన్ని వృథా చేయవద్దు) అని చెప్పబడింది. కాబట్టి, మనం ఆహారాన్ని(ప్రసాదం) వృథా చేయకుండా అవసరమైనంతగా వండుకోవాలి,  ఎక్కువైనపుడు అవసరం ఉన్న వారికి ఇవ్వాలి.
  • చేతులకు , కాళ్ళకు మొదలైన వాటిలో తాయిత్తులు/ కంకణాలతో నిద్రించడం. అనువాదకుల గమనిక: చేతులు, కాళ్ళు, మెడ మొదలైన వాటిలో దేవతాంతరములకు సంబంధించిన నలుపు / ఎరుపు రంగు దారాలను ధరించడం శ్రీవైష్ణవుల మధ్య కూడా దాదాపు ఫ్యాషన్‌గా మారింది. కొన్ని సార్లు వాళ్ళు దానిని తిరువడి (హనుమాన్), శ్రీవేంకటేశ్వరునిదని వచ్చిన వారకి చెప్పుకుంటారు. ఏది ఎమైనా, మన సాంప్రదాయాని విరుద్దమైనది. శ్రీవైష్ణవులకు సర్వ రక్ష వారి ఊర్ధ్వపుండ్రాలు (తమిళ్లో తిరుమన్ కాప్పు అని కూడా పిలుస్తారు, ఇక్కడ కాప్పు అంటే రక్షణ).  సాధారణంగా, శ్రీవైష్ణవులు ధరించగలిగే దారాలు / కంకణాలు ఇవి:
    • బ్రహ్మణులు, క్షత్రీయులు మరియు వైస్యులు కొరకు – యగ్యోపవీతం (దీనిని జంద్యం అని కూడా పిలుస్తారు) అనుమతించబడింది.
    • కటి సూత్రం (మొల త్రాడు) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి – కౌపీనం (కోవణం –  సాంప్రదాయకమైన లోని వస్త్రం) ఇందులో తప్పనిసరిగా కట్టుకోవాలి.
    • రక్షాబందనం – రక్షణ దారం / కంకణం, ఇది యాగాలు, దీక్షలు (ఉపనయనం వంటి ప్రత్యేక వైధిక వేడుకలు) మొదలైన సమయాల్లో ధరిస్తారు – సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.
  • తిరువారాధనం మొదలైన వాటిలో ఉపయోగించే కుండలు మరియు పాత్రలపైన ఊర్వపుండ్రాలు లేని నివాసంలో నివసించుట. అన్ని వస్తువులను భగవాన్ చిహ్నాలతో అలంకరించాలి. అనువాదకుల గమనిక: పెరియాళ్వార్ వారి  పెరియాళ్వార్ తిరుమొళి 5.4.1లో “ఎన్నైయుం ఎన్ ఉడైమైయైయుం ఉన్ చక్కరప్ పొఱి ఒర్క్కొణ్డు”  – నా శంఖ చక్ర గుర్తును నా పైన (ఆత్మ) నా సంపదపైన పెట్టండి. ఆసక్తి ఉన్న అన్ని వస్తువులలో భగవాన్ గుర్తును ఉంచడం ప్రతి శ్రీవైష్ణవుని యొక్క విధి.
  • భాగవతుల పాదాలతో శుద్ధి చేయని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇప్పటికే మనం నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మరియు పిళ్ళై వానమామలై దాసు యొక్క ఉదాహరణలను చూశాము – మరింత వివరించాల్సిన అవసరం లేదు.
  • పాషండులు (భగవాన్ మరియు శాస్త్రం యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవాడు) ఉండి వెళ్లిన తరువాత శుద్ధి చేయని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. పాషండులు ఉండి వెళ్లిన తరువాత, ఈ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి శుద్ధి చేయాలి.
  • పశువులను ఇతర దేవతల  చిహ్నాలతో గుర్తించే నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. ప్రత్యేక చిహ్నాల ద్వారా పశువులను గుర్తించడం గ్రామాల్లో ఒక సాధారణ పద్ధతి. అటువంటి దేవతాంతర చిహ్నాలు లేవని నిర్ధారించుకోవాలి.
  • మన పూర్వాచార్యుల చేత పఠించబడని  స్లోకాల సామూహిక పఠనంలో నిమగ్నమై ఉన్న నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మన సాంప్రదాయం ను సత్ సాంప్రదాయం లేదా శుద్ద సాంప్రదాయం అని అంటారు. మన పూర్వాచార్యులు, ఆళ్వారుల పాసురములు, పూర్వాచార్యుల స్తోత్రాలు, వ్యఖ్యానాలు మరియు రహస్య గ్రంధాల పై దృష్టి సారించారు –  ఇవన్నీ దేవతాంతర భజన, ఉపాయాంతర నిష్ఠ (భగవానుడు కాకుండా ఇతర ఉపాయాలను స్వీకరించుట) విహీనమై ఉన్నవి.  మన పూర్వాచార్యుల చేత అంగీకరించబడని ఎదీ మన  ఆళ్వారులు / ఆచార్యుల రచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. కాబట్టి, అటువంటి పఠణాలలో పాల్గొనక పోవడం మంచిది.
  • తులసి పెంచని గృహంలో నివసించడం ఒక అడ్డంకి. గృహ అర్చా తిరువారాధనం కోసం, మన స్వంత తులసిని ఇంట్లో పెంచుకోగలిగితే చాలా మంచిది.
  • దివ్య ప్రబందం యొక్క ధ్వని ప్రకంపన వినపడని నివాసంలో నివసించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంట్లో కూడా మనం దివ్యప్రభంధాలు, స్తోత్ర పాఠములు, రహస్య గ్రంథాలు మొదలైనవాటిని నిత్యకృత్యంగా పఠించడంలో నిమగ్నమవ్వాలి. ఈ విధంగా, కుటుంబ సభ్యులందరికీ భగవత్ గుణానుభవం మరియు కైంకర్యంలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది.

53. క్షేత్ర విరోధి  – భూమి యాజమాన్యంలో అవరోధాలు. 

ఇది మునుపటి అంశం యొక్క కొనసాగింపుగా చూడవచ్చు. గృహ విరోధిలో,  నివాస స్థలంతో వ్యవహరించే విషయాలు వివరించబడ్డాయి. ఈ అంశం ఇల్లు నిర్మించాలనుకున్న భూమికి సంబంధించినది. అనువాదకుల గమనిక: సాధారణంగా,  క్షేత్రం  అంటే సాగు భూమి అని అర్థం. వ్యవసాయం లేదా ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా భూమి లేదా ఆస్తి అని కూడా దీని అర్థం. సాధారణంగా, పూర్వాచార్యుల గ్రంథాలలో సాధారణంగా గృహం , క్షేత్రం   రెండూ  కలిసి చర్చించబడ్డాయి. ఇప్పుడు వివరంగా చూద్దాం.

  • దేవతాంతర యాజమాన్యంలో / నియంత్రణలో ఉన్న భూమిని పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొన్ని భూములు ఇతర దేవతలు మరియు వారి దేవాలయాలకు చెందినవి కావచ్చు. శ్రీవైష్ణవులు అలాంటి భూములను వారి ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.
  • దేవతాంతరముల చిహ్నాలను కలిగి ఉన్న భూమిని ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: దేవతాంతరముల చిహ్నాలు – నుదుటిన అడ్డం నామాలు, త్రిశూలం వంటి అనేక ముఖ్యమైన చిహ్నాలు ఉన్నాయి. అటువంటి చిహ్నాలు ఉన్న భూములతో వ్యవహరించకుండా ఉండటం మంచిది.
  • భగవాన్కు అప్రియమైన ప్రదేశంలో భూములు ఉండటం అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకు ముందు చూసినట్లుగా, దివ్య దేశములు, ఆళ్వారులు/ ఆచార్యుల అవతార స్థలాలు మొదలైనవి భగవాన్‌కు ప్రియమైనవి, అందువల్ల మనకు అలాంటి ప్రదేశాలలో మాత్రమే భూములు ఉండాలి.
  • భగవాన్ నుండి దొంగిలించబడిన / స్వాధీనం చేసుకున్న భూములను పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొంతమంది ఆలయ భూములను దొంగిలించడం / స్వాధీనం చేసుకోవడం మొదలైన వాటిలో పాల్పడతారు. అలాంటి భూములకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే దొంగిలించబడిన భూములతో సంబంధం కలిగి ఉండటం మన స్వరూపానికి మంచిది కాదు.
  • ఇతరుల నుండి దొంగిలించబడిన / స్వాధీనం చేసుకున్న భూములతో సంబంధం ఒక అడ్డంకి.
  • ఇది “నా భూమి”  అని భావించి భూమిని పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి . అనువాదకుల గమనిక: ప్రతి వస్తువుకి సంపదకి యజమాని భగవాన్, కేవలం వారి ఆస్తిని ఉపయోగించుకునే అవకాశం మనకుంది అని మనం అర్థం చేసుకోవాలి.
  •  ఆచార్య సేవలో ఉపయోగించని భూములను పట్టి ఉంచుకోవడం. అనువాదకుల గమనిక: నంజీయర్ జీవిత చరిత్రలో ఒక మంచి సంఘటన చూపబడింది. ఒకసారి భట్టర్ తన కుటుంబంతో పాటు కూరకులోత్తమన్ (ఒక గ్రామం) లో ఉన్నప్పుడు, భట్టర్ కుటుంబ సభ్యులతో నంజీయర్ తోటకి కొంత నష్టం జరుగుతుంది. నంజీయర్ యొక్క ఏకాంగి (సేవకులు) కలత చెంది, వారితో కఠినంగా మాట్లాడుతారు. ఈ సంఘటన గురించి నంజీయర్ విని కలత చెందుతూ, భట్టర్ యొక్క సంతృప్తి కోసమే తోట ఉందని నంపెరుమాళ్ కోసం కాదని తన సేవకులకు వివరిస్తారు (అనగా, ఆచార్యుల కైంకర్యం మరింత ముఖ్యమైనది). దీని నుండి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మన సంపదను ఆచార్యుల కైంకార్యానికి వాడాలి అని అర్థం.
  • భగవాన్, భాగవతులు మరియు ఆచార్యలకు పూర్తిగా అందుబాటులో లేని భూములను పట్టి ఉంచుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ మాదిరిగానే. ఎంపెరుమానార్ ఆదేశాల మేరకు తిరువెంకటేశ్వరుని యొక్క కైంకార్యం కోసం తిరుమలలో ఒక కొలను మరియు అందమైన ఉద్యానవనాన్ని సృష్టించడంలో అనంతాళ్వాన్ చేసిన అద్భుతమైన అంకితభావాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.in/2014/05/virodhi-pariharangal-21.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/10/02/virodhi-pariharangal-19/


వైత్తమానిధి (గొప్ప నిధి) – తిరుక్కోళుర్ – మనకు నిజమైన నిధి

51. ఆర్జన విరొధి  – ధన సంపదనలో అవరోధాలు

ఆర్జనం అంటే ధనం సంపాదించడం అని అర్థం. ఈ భాగం అతివిస్తారంగా ఉంది. ఇందులో కొన్ని అంశాలు స్పష్టంగా లేవు. పెద్దల నుండి తెలుకున్న తరువాత కూడా నాకు (వి వి రామానుజం స్వామి) సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. నేను (వి వి రామానుజం స్వామి)  అర్థం చేసుకున్నంత వరకు రాశాను. సాధారణంగా, సంపాదన అనేది ధర్మం (నీతి మార్గం) యొక్క సరిహద్దులలో ఉండాలి. వర్ణం మరియు ఆశ్రమాల పరిమితులను దాటకుండా సంపాదించాలి. ఒక పాత తమిళ్ సామెతలో చెప్పినట్లుగా “పోతుమెన్రా మనమే పొన్ చెయ్యుం మరున్తు” – ఉన్న దాంట్లో సంతృప్తి చెందడమే ఉత్తమమైన ఔషదం, ఉన్నదానితో సంతృప్తి చెందేందుకు మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అక్రమ పద్ధతులన్నిటికీ దూరంగా ఉండాలి. ఇతరులను మోసం చేయడం, అబద్ధం చెప్పడం, దోపిడీ చేయడం ద్వారా సంపాదించిన డబ్బుకి దూరంగా ఉండాలి. దురాశకు పూర్తిగా దూరంగా ఉండాలి. పక్క దార్లలో,  అక్రమ పద్ధతులతో, మన మనస్సాక్షికి వ్యతిరేకమైన మొదలైన వాటి ద్వారా డబ్బు సంపాదించడం పాత రోజుల్లో కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుటి రాజకీయాలలో మరియు ఇతర వ్యాపారాలలో మనం చూస్తున్న అవినీతి పాత రోజుల్లో ఉండేది కాదని నేను (వి వి రామానుజం స్వామి) అంచనా వేస్తున్నాను. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు అడ్డంకులను చూద్దాం.  అనువాదకుల గమనిక: సర్వ సాధారణంగా గోచరిస్తున్న సూత్రం ఏమిటంటే, మనం అందించిన ఏ సేవకైనా వేతనం కోరి తద్వారా డబ్బును సంపాదించకూడదు. ఇచ్చతో ఇచ్చినది ఏదైనా సంతృప్తితో స్వీకరించాలి,  ప్రాథమిక శరీర అవసరాలను తీర్చడానికి అవసరమైన దానికంటే ఎక్కువ  సంపదను ఆర్జించడంలో అత్యాశ చూపకూడదు. అలాగే, శ్రీవైష్ణవులకు ఎమ్బెరుమాన్ యొక్క పాద పద్మాలే నిజమైన సంపద. ఆళవందార్లు తమ స్తోత్ర రత్నంలో ఇలా అన్నారు “ధనం మదీయం తవ పాదపంకజం” – మీ చరణ కామలానే నా సంపద. కైంకర్య శ్రీ (భగవాన్ మరియు భాగవతులకు సేవ) కూడా గొప్ప సంపదగా కీర్తింపబడింది. మన ఆళ్వారులు మరియు ఆచార్యలు ప్రాపంచిక సంపద నుండి పూర్తిగా దూరంగా ఉండి, భగవాన్ మరియు భాగవతులకు సేవ చేయడంపై మాత్రమే సంపూర్ణ దృష్టి పెట్టారు. కాబట్టి, మనం కూడా ప్రాపంచికంగా సంపాదించకుండా నిజమైన సంపదపై దృష్టి పెట్టాలి. 

  • శ్రీవైష్ణవునిగా మారిన తరువాత కూడా విరాళాలు స్వీకరించి ధనం ఆర్జించడం ఒక అడ్డంకి. సాధారణంగా బ్రాహ్మణులు, విరాళాలు / బహుమతులు ఇవ్వడం మరియు అందుకోవడం రెండూ ధర్మశాస్త్రంలో అనుమతించబడింది. అటువంటి విరాళాలు / బహుమతులు కూడబెట్టుకోవడం మరియు దానిని నిల్వ చేయడం ఖండించబడిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనము విరాళాలు / బహుమతులు తీసుకున్నపుడు అవి అవసరమైన వారికి ఇవ్వాలి.
  • మనం చేసిన కొన్ని తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విరాళాలు / బహుమతులు ఇవ్వమని ఇతరులకు సలహా ఇవ్వడం మరియు అలాంటి విరాళాలను పొందడం. అనువాదకుల గమనిక: ఈ రోజుల్లో, ప్రజలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి పరిహారం (సమస్యల పరిష్కారం) పొందడానికి సలహాలు ఇస్తున్నారు. కొన్ని సార్లు సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఆ ప్రయోజనాల భాగీదారులు అవుతారు. ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎమ్పెరుమాన్ , ఆళ్వారులు మరియు ఆచార్యలు భౌతిక బాధలను తొలగించేందుకు వేచిలేరు. మనల్ని  భౌతిక బంధాల నుండి వెలికి తీయటాని కోసమే వారున్నది. మనం దీనిని పూర్తిగా అర్థం చేసుకొని, ఇతరులకు కూడా కేవలం ఎమ్పెరుమాన్ / ఆళ్వారులు / ఆచార్యలను ఆరాధించాలని మరియు వారికి శరణాగతి చేయాలని సూచించాలి.
  • ఇతరుల నుండి జలంతో ఇవ్వబడిన సంపదను దానంగా స్వీకరించుట ఒక అడ్డంకి. సాధారణంగా, ఏదైనా దానంగా ఇచ్చినప్పుడు, ఇచ్చిన దానం పూర్తిగా పుచ్చుకున్నవారిదని గట్టిగా నిర్ధారించడానికి ఇచ్చేవాడు తీసుకునేవారి చేతుల్లో నీటిని పోస్తాడు. దీనిని తమిళ్లో “దారై వార్తుక్ కొడుత్తల్”  అని వివరించారు. వైధిక కర్మలలో, సాధారణంగా “స్రోత్రియాయ శ్రీవైష్ణవాయ సమ్ప్రదతే నమమ” అని ఉచ్చరిస్తూ ఇచ్చే వస్తువుపైన పూర్తి హక్కు పుచ్చుకున్నవాడిదన్నపద్దతి చెప్పబడింది. భగవానుడు వామనుడిగా అవతరించి మహాబలి నుండి దానాన్నిస్వీకరిస్తారు  – ఈ సంఘటనను అనేక పాసురములలో ఆళ్వారులు గొప్పగా కీర్తించారు. తన భక్తులను రక్షించడానికి వారి ఆధిపత్యాన్ని తగ్గించుకొని అవతరించారు (అయినప్పటికీ ఇది వారి గొప్పతనాన్ని మరింత పెంచింది).   ఇది భగవానుని యొక్క అత్యంత నిస్వార్థ కార్యము. కానీ స్వార్థపూరిత ఉద్దేశ్యాల కోసం మనం ఇలాంటి దానధర్మాలను స్వీకరించకూడదని అంటారు.
  • కొన ఊపిరి తీసుకొంటూ చివరి క్షణాలలో ఉన్న వ్యక్తి నుండి దానం స్వీకరించడం ఒక అడ్డంకి. కాలదానం  – ఒక వ్యక్తి తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా శరీరాన్ని విడిచిపెట్టేటపుడు ఆఖరి క్షణాలలో ఇచ్చే దానం. కొంతమంది ధాన్యాలు, బంగారం మొదలైన వాటిని దానధర్మాలలో ఇస్తారు. కానీ దురాశతో అలాంటి దానధర్మాలను స్వీకరించకూడదు. అది శ్రీవైష్ణవులు అనే నిజమైన స్వభావాన్ని నాశనం చేస్తుంది.
  • శ్రాద్దంలో తినడం ద్వారా సంపదను కూడబెట్టుకోవడం ఒక అడ్డంకి. శ్రాద్దం అంటే తల్లి తండ్రులు  మొదలైన వారి సంవత్సరీకం సందర్భంగా పితృలకు  చేసే వైధిక కర్మలను  శ్రాద్దం అని పిలుస్తారు. ఈ చర్యలో భాగంగా, కర్మ చేసే వ్యక్తి ముగ్గురు బ్రాహ్మణులను పిత్రులుగా (ఎవరి కోసమైతే   శ్రాద్దం  నిర్వహిస్తున్నామో), విశ్వదేవర్ మరియు విష్ణు యొక్క స్థానాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు, వారికి వివిధ రకాలైన ఆహార పదార్థాలను తినిపించి చివరకు వారికి సంభావనను (దానం) మరియు తాంబూలం (వక్క తమలపాకులు, కొబ్బరికాయ మొదలైనవి) సమర్పించుకుంటారు. పాత రోజుల్లో, నిమంత్రణం వచ్చినప్పుడు (విశ్వదేవర్ మరియు విష్ణు యొక్క స్థానాన్ని స్వీకరించడానికి ఆహ్వానం), శ్రీవైష్ణవులు వారి అభ్యర్థనను స్వీకరించి, వైధిక కర్మను నెరవేర్చేవారు. నిమంత్రణం కోసం అత్యంత విశ్వసనీయమైన శ్రీవైష్ణవులను ఆహ్వానించడం కూడా అప్పట్లో ఒక పద్ధతి ఉండేది. కాని ఈ రోజుల్లో చాలా మంది  శ్రాద్దంలో తినడం, వాటి నుండి డబ్బు సంపాదించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇటువంటి పనులు అనుకూలమైనవి కావని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
  • ఇతరులకు కొన్ని ఉపచారాలను సూచించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. అజ్ఞానులైన / అమాయకులైన వారికి ఆరోగ్యం, సంపద మొదలైన వాటిని పొందడం కోసం కొన్ని ఉపచారాలు చేయమని సలహా ఇవ్వడం, వాటి నుండి సంపాదించడం స్పష్టంగా మోసచర్య,  వాటికి దూరంగా ఉండాలి.
  • ఇల్లు మొదలైన వాటికి సంబంధించి జ్యోతిష్య సలహా ఇవ్వడం తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి.
  • గ్రామ అధిపతిగా సంపాదించడం (ప్రాపంచిక అధికారంతో, వివాద పరిష్కారాలు మొదలైనవి) ఒక అడ్డంకి. శ్రీ రామాయణం ఉత్తర గాంటం, 69వ సర్గంలో ఒక సంఘటన వివరించబడింది. ఒక బ్రహ్మణుడు కోపంతో ఒక కుక్కను గాయపరుస్తాడు. కారుతున్న రక్తంతో ఆ కుక్క శ్రీ రాముని రాజభవనానికి వచ్చి ఈ సంఘటన గురించి వారికి ఫిర్యాదు చేస్తుంది.  శ్రీ రాముడు ఆ  బ్రహ్మణుడిని రాజసభకి ఆహ్వానించి ఈ  విషయాన్ని విచారిస్తాడు. బ్రహ్మణుడు “నేను అప్పుడు చాలా ఆకలితో ఉన్నాను, ఆహారం కోసం యాచిస్తూ చాలా అలసటతో ఉన్నాను. ఆ సమయంలో కుక్క నన్ను బాధపెట్టినందున, నేను కోపంతో ఆ కుక్కను గాయపరిచాను. నాకు ఏ శిక్షవేసినా నేను అంగీకరిస్తాను” అని అంటాడు.  శ్రీ రాముడు అప్పుడు ఆ కుక్క వైపు తిరిగి నీవే తగిన శిక్ష ఇవ్వమని చెబుతాడు. కుక్క బ్రహ్మణుడిని ఒక గ్రామానికి అధికారి చేయమని అంతుంది, శ్రీ రాముడు ఆ ఆదేశాన్ని అమలుచేయమని చెబుతాడు. ఆ శిక్ష ఎందుకు ఇచ్చారని కుక్కను అడుగుతాడు? కుక్క “నా మునుపటి జన్మలో నేను ఒక గ్రామానికి అధిపతి. నాకు తెలిసినంతవరకు, నేను అందరితో సమానంగా ప్రవర్తించాను, చాలా క్రమశిక్షణతో  గ్రామ ప్రజల అవసరాలను చూసుకున్నాను. అయినప్పటికీ నేను ఇప్పుడు ఇలాంటి పుట్టుకను పుట్టాను. నాకు తెలియకుండా నేను ఏదో అన్యాయం చేసుంటాను. లేదా నా క్రింద సహాయకులు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఆ కారణంగా నేను ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నాను “. అందువల్ల గ్రామ అధిపతిగా ఉండటం చాలా కష్టమైన స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. అనువాదకుల గమనిక: దేశంలోని పౌరులు చేసిన పాపాలలో కొంత భాగాన్ని రాజు పొందుతాడని గుర్తుంచుకోవాలి. గ్రామాధికారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అందుకని, డబ్బు / సంపద సంపాదించడంపై దృష్టి కేంద్రీకరించే ఏ లౌకిన వృత్తిలో పాల్గొనకుండా ఉండటం మంచిది.
  • పిల్లలకు ప్రాథమిక విద్య నేర్పించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. మరలా, విద్యాభ్యాసం నుండి డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టకూడదు – విద్యార్థులు గురుదక్షిణగా (ఉపాధ్యాయునికి సమర్పణలు) అందిస్తే, దానిని సంతోషంగా స్వీకరించవచ్చు, గురువు వాటితో సంతృప్తి చెందాలి.
  • తమ పాండిత్యము (జ్ఞానం) గొప్పతనాన్ని గురించి ప్రగల్భాలు పలుకుతూ సంపాదించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: “విద్యాదదాతి వినయః” – విద్య వినయాన్ని పెంచుతుంది, అని చెప్పబడింది. ఎవరైనా జ్ఞానవంతుడైనపుడు వారు ప్రగల్భాలు  చెపుతూ దాని నుండి డబ్బు సంపాదన చేయకూడదు. బదులుగా వారు వినయంగా ఉండి, ఇతరులు తమ నిస్వార్థ బోధనలు చేసి, ఆచరణాత్మమైన ఉదాహరణల ద్వారా సహాయం చేయాలి.
  • ఇతరులను ప్రశంసించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి 3.9 పాదిగంలో “చొన్నాల్ విరోదం”, మొదటి అసురంలోనే, నమ్మాళ్వార్ “ఎన్ న్నావిలింకవి యాన్ ఒరువర్కుం కొడుక్కిలేన్” – నా తీయని పద్యాలను భగవాన్కి తప్పా ఇంకెవ్వరికీ ఇవ్వను. నమ్మాళ్వార్ ధనవంతులను స్తుతించవద్దని, అలా డబ్బు సంపాదించి తద్వారా దిగజారవద్దని కవులకు సలహా ఇస్తున్నాడు. అనువాదకుల గమనిక: పాత రోజుల్లో, కవులు నిరుపేదలు, వాళ్ళు రాజు దగ్గరికి లేదా ధనవంతుల వద్దకు వెళ్లి వాళ్ళని ఆకాశానికెత్తినంత కవితలతో వారిని ప్రశంసించేవారు. తమ గురించి గొప్పగా విన్నందుకు సంతోషించిన రాజులు / ధనవంతులు కవులకు అనేక బహుమతులు ఇచ్చేవారు. ఇప్పటి రోజుల్లో కూడా, చాలా మంది ధనవంతులను కీర్తిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారు, వారిచే అనేక సహాయాలు పొందుతారు, తద్వారా ప్రాపంచిక విషయాలలో పూర్తిగా జారిపోతారు. ఈ విధమైన వైఖరిని భగవాన్ దాసులుగా మన స్వభావానికి వ్యతిరేకం కాబట్టి మన ఆళ్వారులు మరియు ఆచార్యలు తీవ్రంగా ఖండించారు.
  • ఇతరుల సంపదను / ఆస్తిని దొంగిలించి సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఇతరులను మోసం చేసి సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఇతరులు ప్రయాణించేటప్పుడు దోచుకొని సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఇతరులగురించి చెడుగా మాట్లాడటం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఆండాళ్  తిరుప్పావై రెండవ పాసురంలో ఇలా అన్నారు “తీక్కురళైచ్ చెన్రోతోం” –  ఎట్టి పరిస్తితుల్లో కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడము. అనువాదకుల గమనిక:  వ్యాఖ్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సీతా పిరాట్టిని కీర్తిస్తూ ఇలా వివరించారు. సీతా పిరాట్టి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షసులు చేసిన హింసల గురించి శ్రీ రామునికి ఒక్క మాట కూడా చెప్పదు. అయ్జనన్యాచార్యులు అందంగా కీర్తిస్తూ,  తమ హృదయంలో శ్రీవైష్ణవుల లోపాలను పరిగణించరాదని, ఎందుకంటే ఎమ్బెరుమాన్ తమ హృదయంలో అంతర్యామిగా ఉన్నందున – ఆ దురాలోచన మన హృదయంలోకి రానిస్తే, భగవాన్ ఆ విషయం తెలుసుకుంటాడు, కాబట్టి ఇతరుల లోపాల గురించి ఆలోచించడం మానుకోవాలి.
  • తాను  గొప్ప వ్యక్తిత్వం గలవాడని ఇతరులను నమ్మేలాచేసి,  తద్వారా వారు వాళ్ళకి లొంగి ఉండి డబ్బు, సంపద సమర్పణలు తీసుకొని సంపాదించడం  ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొంతమంది గొప్ప వ్యక్తులతో తమ సంబంధం ఉందని ప్రగల్భాలు పలికి తాము చాలా పలుకుబడి ఉన్నవారని నమ్మిస్తారు. ప్రజలు అలా నమ్ముతున్నప్పుడు, అలాంటి వ్యక్తుల నుండి సహాయం పొందటానికి ఇష్టపడేవారు వారి పట్ల వినయాన్ని ప్రదర్శించి, భౌతిక ప్రయోజనాలకు బదులుగా డబ్బు, సంపద మొదలైనవాటిని సమర్పించుకుంటారు. అటువంటి వైఖరిని ఇక్కడ ఖండించారు.
  • పురాణాలు చదవడం ద్వారా, పాసురాలపై ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సంపాదించడం. పురాణాలు చదవడం, ఉపన్యాసాలు ఇవ్వడం తప్పు కాదు. కానీ బదులుగా వేతనాన్ని ఆశించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకు ముందు వివరించినట్లుగా, శ్రవణం చేసినవారు ఇచ్చుకంగా ఇచ్చిన వాటిని స్వీకరించడం తప్పు కాదు.
  • గ్రంథాలను / పుస్తకాలను దొంగిలించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. పాత రోజుల్లో, సాహిత్యాన్ని తాటి పత్రాలపై నమోదు చేసేవారు. అవన్నీ చేతితో వ్రాసినవి. ఎంతో కృషితో ప్రయాసంతో కూడుకున్న పని అది. అవి మనకు అమూల్యమైన సంపద. వీటిని దొంగిలించి అమ్మడం మహా పాపం. అనువాదకుల గమనిక: ప్రస్తుత పరిస్థితులలో, ఇతరుల రచనలను దొంగిలించడం, వాటిని ప్రచురించడం, డబ్బు సంపాదించడం మరియు అసలు రచయితకి తగిన గౌరవం / బహుమానం ఇవ్వకపోవడం వంటివి ఈ అంశంతో పోల్చవచ్చు.
  • చెవి పోగులు దొంగలించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ అంశం యొక్క అర్థం స్పష్టంగా లేదు.
  • ఉన్నత కుటుంబం / వంశంలో వారి పుట్టుకను గొప్పగా చెప్పుకోవడం ద్వారా సంపాదించడం. కులాధికం – ఆబిజాత్యం – ఉన్నత కుటుంబం / వంశంలో జన్మించడం. “ఈ వ్యక్తి గొప్ప కుటుంబంలో జన్మించాడు, మీరు అతన్ని ఆరాధించండి / గౌరవించండి, వారికి సంపదను అర్పించుకోండి” అని ప్రచారం చేయడానికి మరియు అలాంటి  సంపదను స్వీకరించడానికి తెలివిగా కొంతమందిని నియమించుకోవడాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి వైఖరిని ఖండించారు. అనువాదకుడి గమనిక: కూరత్తాళ్వాన్ యొక్క కీర్తిని గుర్తుకు తెచ్చుకోవచ్చు – వారిని “ముక్కుఱుంబు అఱుత్తవర్” అని కీర్తించారు – 3 రకాల లోపాల నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు. అనగా, గొప్ప కుటుంబంలో జన్మించినట్లు తమను తాము అనుకోవడం, తమను తాము చాలా ధనవంతుడు అని అనుకోవడం, తమను తాము మహా పండితులమని అనుకోవడం – కూరత్తాళ్వాన్ గొప్ప కుటుంబంలో జన్మించినప్పటికీ, వారు మహాశ్రీమంతులైనప్పటికీ, వారు మహా పండితులైనప్పటికీ, వారు ఎన్నడూ వారి గొప్పతనాన్ని చెప్పుకోలేదు – ఇది నిజమైన శ్రీవైష్ణవుల లక్షణం.
  • తమ సాంప్రదాయకమైన గుణాల గురించి ప్రగల్భించి దాని నుండి సంపాదన  చేయడం ఒక అడ్డంకి.
  • ప్రతి ఒక్కరికీ “అహం బ్రహ్మ” అని నమ్మించి దాని నుండి సంపాదించడం. “అహం బ్రహ్మ” అనేది ఒక అద్వైత సూత్రం. జీవాత్మ బ్రహ్మతో సమానమని  అద్వైతుల (కుదృష్టులు – లోపపు దృష్టి ఉన్నవారు) అర్థవివరణ. ఈ సూత్రం ఎమ్పెరుమానార్ దర్శనానికి సంపూర్ణంగా  వ్యతిరేకమైనది. దీనిని “నేను గొప్పవాడిని” అని కూడా అర్థం చేసుకోవచ్చు మరియు అలాంటి బోధనలు / ప్రచారం నుండి నేను సంపాదించవచ్చు అన్న చర్యలను ఇక్కడ ఖండిస్తున్నారు.
  • శాస్త్రంలో తమ జ్ఞానాన్ని ప్రగల్భించి సంపాదించడం ఒక అడ్డంకి. తమకు జ్ఞానం ఉన్నదని సొంత ప్రచారంలో పాల్గొనకూడదు, అలాంటి చర్యల నుండి డబ్బు సంపాదించకూడదు.
  • తమ శౌర్యం / ధైర్యం గురించి గొప్పగా చెప్పుకొని తద్వారా సంపాదించడం  ఒక అడ్డంకి. గొప్ప బలం, శౌర్యం మొదలైనవి తమకున్నాయని ప్రచారం చేయడం తప్పు. ఈ రోజుల్లో దీన్ని   డాన్స్ చేస్తుండటం మనం చూస్తున్నాము.
  • ఇంద్రజాలంతో మాంత్రికం మొదలైనవి చేసి సంపాదించడం ఒక అడ్డంకి.
  • డబ్బు సంపాదించడానికి అజ్ఞానులను అమాయకులను తమ వైపు ఆకర్షించడం ఒక అడ్డంకి. మంత్రం, అంజనం, కళ్ళతో మంత్రముగ్దులను చేయడం ద్వారా  ఆకర్షించి వారి నుండి డబ్బును దోచుకోవడం లాంటి చర్యలను ఇక్కడ ఖండిస్తున్నారు.
  • వైద్యునిగా ఉండి సంపాదించడం ఒక అడ్డంకి. వైద్య వృత్తి ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో చేయాలి కాని డబ్బు సంపాదించడం కోసం కాదు.
  • నిధులను చూపిస్తానని హామీ ఇచ్చి సంపాదించడం ఒక అడ్డంకి.
  • అణగారిన వ్యక్తులకు పనిచేసి సంపాదించడం (సంసారులు –  లౌకిక సుఖాలకు పూర్తిగా లోనైనవాడు).
  • రసవాదిగా సంపాదించడం. ఇనుము, రాగి మొదలైన వాటిని బంగారంగా మార్చే సూత్రం రసవాదం. ఈ రోజుల్లో ఇది సాధ్యం కాదు. కానీ దీనిని చేయగలరని నమ్మించి వారిని మోసం చేయడం ఒక అడ్డంకి.
  • రాజు / చక్రవర్తి / పాలకుడి దగ్గరి తమ సన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకొని తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది చాలా సాధారణం కాబట్టి దీనిని మరింత వివరించాల్సిన అవసరం లేదు.
  • ప్రాపంచిక వార్తలను ప్రదర్శించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. కొంతమంది ఇతరులను విమర్శించి తద్వారా వారి మనుగడ సాగిస్తారు – అలాంటి వైఖరి ఖండించబడింది.
  • వివిధ జీవుల విష దాడులను నయం చేసే నైపుణ్యతతో సంపాదించడం. పాము, తేలు, కొన్ని రకాల కీటకాలు మొదలైనవి కుడితే శరీరంలో విషం వ్యాపిస్తుంది. కొన్ని మంత్రాలు, మందులను ఉపయోగించి ఇది నయంచేయవచ్చు. ఇది వ్యాపారంగా కాకుండా ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో చేయాలి.
  • భగవత్ విషయం బోధించడం ద్వారా సంపాదించడం. తిరువాయ్మొలి మరియు తిరువాయ్మొలి వ్యాఖ్యానాలను సమిష్టిగా భగవత్ విషయం అని పిలువబడుతున్నప్పటికీ, భగవాన్ గురించి విషయాలను సూచించడానికి ఇది ఒక సాధారణ పదం. ఇది ధన ప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు జ్ఞానోదయం చేయాలనే ఉద్దేశ్యంతో భోదించాలి.
  • ఎమ్బెరుమాన్ పట్ల వారికున్న భక్తిని ప్రగల్భాలుగా పలికి తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. భగవాన్ పట్ల మన భక్తి ఏ బాహ్య ప్రేరణ లేకుండా చేయాలి. దీన్ని ప్రచారం చేయనవసరం లేదు.
  • దివ్య ప్రబంధాలను పఠించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. అరుళిచెయల్ (దివ్య ప్రబంధం) పఠనం కోసం ధనసహాయం కోరకూడదు.
  • ఇతరులను మరియు తమను తాము కీర్తించి మహిమపరచి సంపాదించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ధన ప్రయోజనాల కోసం ప్రాపంచిక వ్యక్తులను కీర్తించే అంశాన్ని ఆళ్వారులు ఖండించారు. భగవాన్ మరియు భాగవతులను మాత్రమే మహిమపరచడానికి నాలుక మనకు ఇవ్వబడిందని, ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని వారు గట్టిగా స్థాపించారు.
  • తమ త్యాగాన్ని గురించి గొప్పగా చెప్పుకుని సంపాదించడం ఒక అడ్డంకి. కొంతమంది మాటలతో డబ్బు ఇచ్చినప్పుడు “వద్దు” అని చెప్పడం సాధారణంగా కనిపిస్తుంది, కాని తీసుకోడానికి వారి చేతులు మాత్రం చాచి ఉంటాయి  – అలాంటి ప్రవర్తన ఇక్కడ ఖండించబడింది.
  • ఇతరులతో నమ్మకంగా / స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
  • తమ నిస్సహాయ పరిస్థితిని చూపించి సంపాదించడం ఒక అడ్డంకి.
  • వేరే ఆశ్రయం లేదని నటిస్తూ సంపాదించడం అడ్డంకి.
  • భగవాన్ / ఆచార్యులకు కైంకర్యం చేసే పేరుతో సంపాదించడం, ఆ ధన సహాయాన్ని వ్యక్తిగత అవసరాలకి వాడుకోవడం ఒక అడ్డంకి.
  • సన్యాసిగా  నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఎంబెరుమాన్  కోసం పూల తోటలు మొదలైనవాటిని నిర్వహణ చేస్తున్నట్టు నటించి సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఎంబెరుమానుకి  పూల దండలు అర్పిస్తున్నట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
  • తిరుమల (తిరుపతి)  మొదలైన వంటి దివ్య దేశాలకు సహాయం చేస్తున్నట్టు నటించి సంపాదించడం ఒక అడ్డంకి.  ఇప్పటి రోజుల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది.  ప్రజలు దివ్య దేశాలలో కైంకర్యాలు చేసే ముసుగుతో ధనమార్జిస్తునారు. ఇటువంటి ప్రవర్తనను ఇక్కడ ఖండించారు.
  • ఉత్సవాల సమయంలో శ్రీవైష్ణవులకి వసతి మొదలైన ఏర్పాట్లు చేసినట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
  • ఉత్సవాల సమయంలో ప్రత్యేక సమర్పణలు మొదలైన వాటి ముట్టడి ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఉత్సవాల సమయంలో, “పోలిగ పోలిగ” (తిరువాయ్మొళి 5.2), “ఉలగముణ్డ పెరువాయ” (తిరువాయ్మొళి 6.10), “కంగులుం పగలుం” (తిరువాయ్మొళి 7.2), “నాఱు నఱుం పొళిల్” (నాచియార్ తిరుమొళి)   మొదలైనవి పారాయణం చేయబడతాయి, ప్రత్యేక ప్రసాదాలు ఎమ్బెరుమాన్ కి  అర్పించబడతాయి. స్థల పాసురం (ఉత్భవం జరుగుతున్న దివ్య దేశానికి సంబంధించిన ప్రబందం / పాసురం ) ఉన్నప్పుడు, ప్రత్యేక సమర్పణలు ఇవ్వబడతాయని కూడా సాధారణంగా చూడవచ్చు. అలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకొని వాటి ద్వారా ధనం సంపాదించకూడదు.
  • సాత్తుముఱ చేయటానికి దివ్య ప్రభంధం పఠనం / అభ్యాసం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి.
  • తిరువారాధనం చేసినందుకు బదులుగా ధనాన్ని ఆశించడం ఒక అడ్డంకి. తిరువారాధనం అంటే ఉభయ వేద పారాయణం (సంస్కృత వేదం  మరియు ద్రావిడ వేదం) యొక్క పారాయణం మరియు పితృ కైంకర్యాలు (శ్రాద్దం) అని రెండింటినీ అర్ధం చేసుకోవచ్చు.
  • ఎమ్బెరుమానుకి తిరువారాధనం చేయడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ రోజుల్లో, తమ ఇంట్లో ఎమ్బెరుమానుకి  తిరువారాధనం చేయటానికి ఇతరులను నియమిస్తారు. ఇది సరైన వైఖరి కాదు. తమ ఎమ్బెరుమానుకి క్రమం తప్పకుండా  తిరువారాధనం సొంతంగా తమ చేతులతో చేయాలి. తమ సంద్యావందనం తామే చేయాలి కదా? అలాగే తమ  ఎమ్బెరుమానుకి తిరువారాధనం తామే చేయవలసి ఉంటుంది. తప్పించుకునే అవకాశం లేదు.
  • పొలం పనులతో  శారీరకంగా శ్రమించి సంపాదించడం మొదలైనవి అడ్డంకులు. వారి వర్ణాశ్రమం ప్రకారం వారికి ఏది సరితూగుతుందో చూసి అలాంటి పనులను మాత్రమే చేయాలి.

ఈ అంశంతో ప్రారంభించి ముష్తి కుడై (పిడికిలి) గురించి కొంచెం చర్చ జరుగుతుంది. వీటిలో కొన్ని అంశాలు చాలా కాలం నుండి వాడుకలో లేనందున, పెద్దలు కూడా వివరంగా చేప్పలేదు. నేను నా (శ్రీ వి.వి.రామానుజం స్వామి) అవగాహన ఆధారంగా రాస్తున్నాను. ఈ అవగాహనలలో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఈ చర్చాంశాలలో, “ముష్తి”, “ముష్టి పుగురుగై”, “ముష్టి కూడై”, “మౌష్టిక వ్యావ్రుత్తి” మొదలైనవి ఉన్నాయి. ముష్తి అంటే సాధారణంగా ‘పిడికిలి’ అని అర్ధం – ప్రధానంగా ఇక్కడ పిడికిలి బియ్యం మొదలైన వాటి మీద దృష్టి కేంద్రీకరించబడింది.  వేదాంతాచార్యుల యొక్క శ్రీసూక్తి (దివ్య పలుకులు) ని గుర్తుచేసుకోవచ్చు. “యో సౌధాయాలుః పురాదానా ముష్టిముచే కుచేలమునయే దత్తేమ” – భగవానుడు వారి సహజ కారుణ్యభావంతో కుచేలుడిచ్చిన పిడికిలి అటుకులకు బదులుగా అతనికి గొప్ప సంపదను ప్రసాదించారు. భిక్షాటన అనే ఈ అంశం బ్రాహ్మణ వర్ణ ధర్మంలోని భాగం. వారి ఉదయ అనుష్ఠానాలు పూర్తి చేసిన తరువాత, ఎంచుకున్న కొన్ని ఇళ్లకు వెళ్లి, ఎంబెరుమాన్ నామాలను పఠించి, “భవతి భిక్షాం దేహి” అని భిక్షాటన చేయాలి. కొంత ధాన్యాన్ని సేకరించడం ద్వారా వారు తమ జీవనోపాధిని కొనసాగించాలి. మహాభారతంలో పాండవ యువరాజులు వనవాసంలో బ్రహ్మణులవలె మారువేషంలో ఉన్నప్పుడు, వారు భిక్షాటన చేసి జీవించారు.  కూరత్తాళ్వాన్ చాలా ధనవంతుడైనప్పటికీ, తమ సంపద మొత్తాన్ని వదులుకుని  శ్రీరంగం చేరుకున్నారు, శ్రీ రామానుజులను ఆశ్రయించి భిక్షాటన చేసి తన జీవనాన్నికొనసాగించారు. ఒకసారి, ఒక వర్షపు రోజున, భిక్ష కోసం బయటకు వెళ్ళలేక ఇంట్లోనే పడుకున్నారు. ఆ సమయంలో, ఆండాళ్ (అతని ధర్మపత్ని) తన భర్త ఆకలిని చూసి తీవ్రంగా బాధపడుతూ శ్రీరంగనాథుని ప్రార్థించింది. శ్రీ రంగనాథుడు వెంటనే తన అరవణై ప్రసాదాన్నిపంపుతాడు, ఆ ప్రసాదం ఆరగించిన తరువాత అళ్వాన్ / ఆండాళ్ జంటకు అనుగ్రహంగా దివ్యసంతానం పొందుతారు, వారు పరాశర భట్టర్ మరియు వేద వ్యాస భట్టర్ గా ప్రసిద్దులౌతారు. ఈ క్రింది అంశాల నుండి,  చాలా ముఖ్యమైన వివరాలను మనం అర్థం చేసుకోవచ్చు . భిక్ష (భిక్షాటన) ఇక్కడ “ముష్తీ” గా గుర్తించబడింది. బిక్ష పాత్ర  (భిక్షాటనకు ఉపయోగించే పాత్ర) ను “ముష్తి కుడై” అంటారు. ప్రతిరోజూ పిడికిలి ధాన్యాని వేడుకొని దానితో జీవించాలి. ఆ భిక్షతో ఎమ్బెరుమానుకి తిరువారాదనం చేసి, శ్రీవైష్ణవ అతిథులకు వడ్డించి, చివరికి తాము మిగిలిన ప్రసాదాన్ని తీసుకోవాలి. బ్రాహ్మణులు తమ భవిష్యత్తు కోసం ఎప్పుడూ సంపదను కూడపెట్టకూడదు. ఇలాంటి అనేక ఆంక్షలు ఉన్నాయి, పాత రోజుల్లో వాటిని ఖచ్చితంగా పాటించేవారు.

  • పెరియాళ్వారులు పెరియాళ్వార్ తిరుమొళి 4.6.3 “పిచ్చై పుక్కాగిలుం ఎమ్పిరాన్ తిరునామమే నచ్చుమిన్” – మీరు యాచిస్తున్నప్పటికీ, దయచేసి నా ప్రియమైన భగవానుడు శ్రీమాన్నారాయణుని నామమును ప్రేమతో స్మరించుకోండి – కాని భగవానుని నామములను గట్టిగా జపిస్తూ యాచించి సంపాదించడం ఒక అడ్డంకి. ఇక్కడ, మనం “భిక్షను ఈయమని బలవంతం చేయడం” అని అర్థం చేసుకోవచ్చు, అటువంటి వాటికి దూరంగా ఉండాలి.  అనువాదకుల గమనిక: ఈ పాసురము “కాసుం కఱైయుడై” పదిగంలోని భాగం. మాముణుల వ్యాఖ్యానంలో ఇలా వివరిస్తుంనారు, ఆళ్వారులు  ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు భగవాన్ పేర్లను పెట్టమని ప్రోత్సహిస్తున్నారు, పైగా అర్ధంలేని భౌతిక పేర్లకు బదులుగా యాచించడం ద్వారా వారి జీవనోపాధిని సంపాదించాలి. తమ పిల్లలకు భగవాన్ పేర్లను పెట్టడం ద్వారా, వారు భగవాన్ పేరును ఎప్పటికప్పుడు పిలవడం ద్వారా నిరంతరం ఆనందించవచ్చు. అలాగే, భగవాన్ పేర్లతో పిల్లలకు పేరు పెట్టడం ద్వారా, పిల్లల తల్లి కూడా నరకానికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఈ 3 వ పాసురంలో ప్రత్యేకంగా, మాముణుల చేత ఒక సంఘటన కీర్తించబడింది, ఇది తిరువాయ్మొళి పిళ్ళై, నాలూరాచాన్ పిళ్ళైను ఉటంకిస్తుంది. ఒకసారి ఒక బ్రాహ్మణుని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకి అతను సకల సంపద,  శ్రేయస్సు తెచ్చే దేవత పేరు పెట్టాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి వైశ్రవావణాన్ (సంపదకు దేవత అయిన కుబేరుని పేరు) అన్న పేరు పెట్టమని సలహా ఇస్తాడు. అక్కడ ఉన్న ఒక ఆస్టికుడు, “అలాంటి అర్థంలేని పేర్ల సలహా ఇవ్వద్దు. అతనికి శ్రీమన్నారాయణ నామాలతో పేరు పెట్టండి – అతను జీవనోపాధి కోసం యాచనం చేసినా పరవాలేదు” అని అంటాడు. మాముణుల వివరిస్తూ, పిల్లలకి ఎమ్పెరుమాన్ నామంతో పేరు పెట్టినప్పుడు, తన జీవనోపాధి కోసం యాచించనవసరం లేని విధంగా అతన్ని రక్షించి, వారి పెంపు పోషణ ఎమ్పెరుమాన్ నిర్వహిస్తాడు –  అతను మనలను రక్షిస్తాడని ఎమ్పెరుమాన్ మీద గట్టి నమ్మకం ఉండాలి. అంతేకాకుండా, ఈ భాగం ఎక్కువగా భిక్షాటన గురించి మాట్లాడుతున్నప్పటికీ (ఇది బ్రాహ్మణుల జీవనోపాధి యొక్క ప్రధాన పద్ధతి), ఇది విరాళాలు, బహుమతులు మొదలైనవిగా మనకు లభించే ఏదైనా డబ్బు / సంపదతో సులభంగా సంబంధించ వచ్చు.
  • శ్రీవైష్ణవునిగా  భిక్షాటన చేయుటకు వెనుకాడటం ఒక అడ్డంకి. భిక్షాటన తమ సొంత వర్ణాశ్రమ ధర్మానికి (బ్రహ్మణుల / బ్రహ్మచారులు / సన్యాసులకు) కూడా ఇది సరైనది. అనువాదకుల గమనిక: భిక్షాటన చేసిన కూరత్తాళ్వాన్ను మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే, శ్రీ రామానుజులు కూడా సన్యాసి  కావడంతో, కొంతమంది దుండగులు అతన్ని విషమిచ్చి చంపాలని ప్రయత్నించే వరకు వారు స్వయంగా భిక్షాటన చేసారు. తిరుక్కోష్టియూర్ నంబి యొక్క ఆదేశం మేరకు, కిడంబి ఆచాన్ని  ఎమ్పెరుమానార్ యొక్క భిక్షను (ప్రసాదం) జాగ్రత్తగా చూసుకోమని నియమిస్తారు. పాత రోజుల్లో, గురుకులం కాలంలో సాధారణంగా  బ్రహ్మచారులు భిక్షాటన చేసేవారు, ముడి పదార్థాలను సేకరించి, వారి గురువులకు సమర్పించేవారు.
  • భిక్షాటన కేవలం కడుపు నింపుకొని, తద్వారా డబ్బును కూడబెట్టుకోవడం ఒక అడ్డంకి. భిక్షాటన మన ప్రాథమిక అవసరాలను చూసుకొని,  కైంకర్యాలను సులభతరం చేయడానికి చేయాలి.
  • భిక్షాటన తమ వర్ణాశ్రమం ధర్మానికి తగిన ధర్మమన్న అవగాహనతో భిక్షాటన చేయాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి. ఇది మునుపటి చర్చా అంశాలకు సమానమైనది.
  • భిక్షాటన మన పూర్వాచార్యులు అనుసరించినదన్న అవగాహనతో చేయాలి, శారీరక అవసరాలను తీర్చడానికి ఇది సరైన పద్ధతి అని చేయాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
  • పిడికిలితో ఇచ్చిన భిక్షతో సంతృప్తి చెందకపోవడం, తక్కువ భిక్ష పొందినందుకు చింతించుట ఒక అవరోధం. కొన్ని ప్రదేశాలలో, కొన్ని సమయాల్లో మాత్రమే భిక్షాటన చేసి ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి.
  • ఎక్కువ భిక్ష లభించినప్పుడు ఎక్కువ ఆనందించడం కూడా ఒక అడ్డంకి. భగవాన్ యొక్క దివ్య అనుగ్రహంతో ఈ రోజు ఎక్కువ భిక్ష లభించిందని, ఆ భిక్షను అదే రోజున అవసరమైన వారికి పంచాలి. అనువాదకుల గమనిక: భగవద్గీత, 2.14 లో, ఎమ్పెరుమాన్ “మాత్రా స్పర్సాస్ తు కౌంతేయ సీతోష్ణ సుక దుఖ దాః  ఆగమాపాయినో నిత్యాస్ తాం తితిక్షవ భారత” – ఓ కౌతేయ (కుంతీ పుత్ర – అర్జున), ఇంద్రియాల ద్వారా గ్రహించబడే వేడి / చలి, ఆనందం / దుఃఖం మొదలైన వాటితో బాధపడకూడదు. ఓహ్ భారత (భరత వారసుడు), నీవు అలాంటి వ్యత్యాసాలను తట్టుకొని వాటి కంటే పైకి ఎదగడం నేర్చుకోవాలి “. కాబట్టి, తాత్కాలిక సుఖాలు, దుఃఖాలు, నొప్పులు, బాధలన్ని అన్ని సమయాల్లో తట్టుకోవాలి / నియంత్రించాలి.
  • మునుపటి అంశం మాదిరిగానే ప్రతిరోజూ ఒక నిర్దిష్ట పరిమాణ భిక్షతో సంతృప్తి చెందాలి – ఎక్కువ పొందాలని అత్యాశ ఉండకూడదు.
  • భగవాన్ నామాలను “గోవింద! గోవింద!” అని గట్టిగా వినపడేటట్టు పఠించాలి, భిక్ష ఇచ్చేవారు భగవాన్ పేర్లను వింటారు. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • భగవాన్ నామాలను పఠించడం శిష్టాచారము (పెద్దల అభ్యసించినది) ప్రకారం జరుగుతుందన్న మనస్తత్వంతో మాత్రమే చేయాలి.
  • భగవాన్ నామాలను పఠించడం భిక్ష పొందేందుకు మార్గమని అనుకోకూడదు. మునుపటి వివరణకు సంబంధించినది – నామ జపం మన రాకను సూచించేదుకు కాని భిక్ష ఇవ్వమని వారిని బలవంతం చేసినట్టు కాదు.
  • అన్య దేవతలు (దేవతాంతరములు – భగవాన్ మరియు ఆళ్వారులు / ఆచార్యలు కాకుండా) పూజించే ఇళ్ళ వద్ద భిక్షాటన చేయడం ఒక అడ్డంకి. దేవతాంతరముల సంభందం ఉన్న వ్యక్తుల నుండి భిక్ష కూడా స్వీకరించకూడదు.
  • భగవత్ తిరువారాధనాన్ని తక్కువగా చూసే ఇళ్ళ నుండి భిక్షాటన చేయకూడదు.
  • శుక్రవారాలలో నేలను తుడిచే  (శుభ్రం చేయబడిన) ఇళ్ళ నుండి భిక్షను స్వీకరించడం. ప్రతిరోజూ కాకుండా శుక్రవారం మాత్రమే ఇంటిని శుభ్రపరిచే వ్యక్తులను ఖండిస్తున్నట్లు చూడవచ్చు. అనువాదకుల గమనిక: శుక్రవారం నేలను  తుడువకూడదని శాస్త్రంలో నిషేధం ఉండే అవకాశం ఉంది.
  • భగవాన్ నామాలను విని సంతోషించని ఇండ్ల నుండి భిక్షను స్వీకరించడం ఒక అడ్డంకి.
  • భగవాన్ / భాగవతులను అవమానించిన ఇండ్ల నుండి భిక్షను స్వీకరించడం ఒక అడ్డంకి
  • భిక్షాటన చేయుట శ్రీవైష్ణవుల సరైన చర్య అని అర్థం చేసుకోకుండా శ్రీవైష్ణవులను అవమానించిన వారి ఇండ్ల నుండి భిక్ష స్వీకరించడం ఒక అడ్డంకి. భిక్షాటన  శ్రీవైష్ణవుల సరైన ధర్మానుష్టానము  – దీనిని తక్కువగా చూడకూడదు.
  • దేవతాంతరములకు ప్రియమైన లేదా దేవతాంతరములను ఆరాధించే వారితో నిండిన గ్రామానికి / పట్టణానికి వెళ్లడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రత్యేకంగా  దేవతాంతరములు ప్రాచుర్యం పొందిన అనేక పట్టణాలు ఉన్నాయి – శ్రీవైష్ణవులు  అటువంటి పట్టణాలకు వెళ్లకుండా ఉండాలి.
  • శ్రీమన్నారాయణుని ఆలయాలు లేని ఊర్లల్లో భిక్ష స్వీకరించుట ఒక అడ్డంకి.
  • భగవత్ తిరువారాదనం క్రమం తప్పకుండా చేయని ఇళ్ళలో భిక్షాటన చేయకూడదు.
  • ఒక ప్రపన్నుడు కావడం వల్ల, పండుగ రోజులలో మాత్రమే భిక్షాటనను వెళ్ళడం  దివ్య ప్రబందం పఠించడం ఒక అడ్డంకి. దివ్య ప్రబందం తప్పక పఠించి  ప్రతిరోజూ వాటి అర్థాలను గుర్తుచేసుకోవాలి – కాని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాదు.
  • ఖాళీ సమయం ఉన్నప్పుడు, దివ్య ప్రబంద పారాయణం చేయడంలో మరియు అర్థాలను గుర్తుచేసుకోవడంలో నిమగ్నమై ఉండాలి. ప్రాపంచిక విషయాల గురించి చర్చించడంలో మన విలువైన సమయాన్ని వృథా చేయకూడదు. నమ్మాళ్వార్ పెరియ తిరువందాదిలో ఆశ్చర్యపోతూ ఇలా అన్నారు “మనుషులు ఎమ్పెరుమాన్ మరియు వారి దివ్య గుణాల గురించి ఆలోచించకుండా ఎలా వారి సమయం గడుపుతారు?”
  • రహస్య మంత్రాలు / గ్రంథాల గురించి బహిరంగంగా మాట్లాడటం/చర్చించడం ఒక అడ్డంకి. రాహస్య అర్ధాలను ఆచార్యుల నుండి వినాలి,  బహిరంగంగా చర్చించకూడదు.
  • చెడు సంఘంలో ఉండటం ఒక అడ్డంకి. చెడు సహవాసం అంటే దుర్మార్గపు వ్యక్తులు, అజ్ఞానపు మూర్ఖులు తో సహవాసం చేయడం, ఎవరైతే వారి నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోనివారు మొదలైనవారు. ఉపనిషత్తులు ఇలా ఘోషిస్తున్నాయి “అసన్నేవ స భవతి – అసత్ బ్రహ్మేది వేదచేత్” –  భగవంతుడు ఉన్నాడని గ్రహించని వారు కేవలం ఒక పదార్థం మాత్రమే.
  • ప్రాపంచిక ఆనందాల నుండి కళ్ళు మరలించకపోవడం ఒక అడ్డంకి. భగవత్ / భాగవత విషయాలపై దృష్టి పెట్టాలి, స్త్రీలు, రాజకీయాలు మొదలైన ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. తొండరడిప్పొడి ఆళ్వార్ తన తిరుమాలైలో ప్రాపంచిక ఆనందాలకు బానిసలాంటి వైఖరిని అతి తీవ్రంగా ఖండించారు.
  • మనం జాగ్రత్తగా అడుగులు వేసి, మన అంతిమ లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • భిక్ష కోసం వెళ్ళేటప్పుడు శాంతియుతంగా ఉండకపోవడం ఒక అడ్డంకి.
  • అముదు పడి కూడై (భిక్ష పాత్ర)ని స్వీకరించి ఆచార్యులకు సేవ చేయకపోవడం ఒక అడ్డంకి.
  • అలాంటి పాత్రను తలపై కిరీటంలా ఆనందంతో మోయాలి.  భిక్ష పాత్రను తీసుకెళ్లడం తక్కువ పనిగా పరిగణించకూడదు. అలా చేయడం ఒక అడ్డంకి.
  • భిక్ష కోసం వెళ్ళేటప్పుడు ద్వయ మహమంత్రాన్ని నిరంతరం పఠించాలి / గుర్తుంచుకోవాలి. శ్రీవైష్ణవులకు, ద్వయం యొక్క నిరంతర పారాయణం సహజం. ద్వయం యొక్క లోతైన అర్ధాలను గుర్తుంచుకోవడంతో పాటు ద్వయ పఠనం చేయాలి. శ్రీరంగనాథుడు ఎమ్బెరుమానార్ని శ్రీరాంగంలో ఉండి ద్వయం యొక్క నిరంతర  పఠనం చేయమని ఆదేశిస్తారు – “ద్వయం అర్థానుసందేన సహ యావచ్చరీర పాదం అత్రైవ శ్రీ రంగే సుకమాస్వ” –  అర్ధాలను గుర్తుంచుకోవడంతో పాటు ద్వయ పఠనం చేస్తూ ఈ శ్రీరంగంలోనే తన జీవితాంతం సంతోషంగా ఉండిపో.
  • పంచ సంస్కారం కాని వారి నుండి భిక్ష స్వీకరించడం. పంచ సంస్కారం అనేది ఒక వ్యక్తిని శ్రీవైష్ణవ సత్ సాంప్రదాయంలోకి ప్రవేశింపజేసే ఒక  ప్రక్రియ. ఆ సంస్కారం అయ్యే వరకు, మనము వారి నుండి ఏదీ స్వీకరించలేము.
  • పాముల ఆకారంలో చెవిపోగులు ధరించే వారి నుండి భిక్ష స్వీకరించడం. సాధారణంగా శ్రీవైష్ణవులు సాధారణ చెవిపోగులు లేదా భగవాన్ యొక్క శంఖు చక్రాలు ఉన్న వాటిని ధరిస్తారు.
  • అహం మరియు అహంకార వైఖరితో నిండిన వారి నుండి భిక్ష స్వీకరించడం. తమను తాము దాసులు, అడియేన్ మొదలైనవిగా పరిగణించాలి, ఇది దాసత్వాన్ని సూచిస్తుంది.
  • భిక్షను స్వీకరించేటప్పుడు, ఒక భాగాన్ని ఆచార్యునికి, శ్రీవైష్ణవులకు మరొక భాగాన్ని, భగవాన్ కోసం మరొక భాగాన్ని ఉంచాలి. వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి భిక్షను స్వీకరించడం సరైన పద్దతి కాదు.
  • సేకరించిన ఏదైనా భిక్షను ఆచార్యుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, వారు అనుమతించిన తర్వాత మాత్రమే తనకు అవసరమైన భాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి.
  • సేకరించిన భిక్ష (ముడి పదార్థాలు) బహిర్గంగా అందరికీ చూపించకూడదు. వాటిని సరిగ్గ కప్పి  ఇంటికి తీసుకెళ్ళి, వండి, ఎమ్పెరుమాన్కి అర్పించి తరువాత ప్రసాదంగా తినాలి.
  • సంసారులను (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ప్రశంసిస్తూ భిక్ష సేకరించకూడదు.
  • ఏదైనా సంపాదించేటప్పుడు శ్రీవైష్ణవులను బలవంతం చేయకూడదు.
  • ఆచార్యుల యొక్క ఆస్తి / సంపదను దొంగిలించడం ద్వారా సంపాదించడం గొప్ప పాపం.
  • భగవాన్ యొక్క ఆస్తి / సంపదను దొంగిలించి సంపాదించడం. ఆలయ సంపద, ఆస్తులు మొదలైనవాటిని మళ్లించడం/ దొంగిలించడం లాంటి చర్యలను గొప్ప పాపాలుగా భావిస్తారు.
  • భగవాన్ ఆస్తి / సంపదను దొంగిలించే వ్యక్తుల నుండి యాచించి సంపాదించడం. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు వివిధ రకాల అపచారాల గురించి వివరిస్తున్నారు. భగవత్ అపచారం, భాగవత అపచారం మరియు అసహ్యాపచారం. భగవాన్ ఆస్తి / సంపదను దొంగిలించే ఈ అంశాన్ని భగవత్ అపచారంగా వివరించారు. అంతే కాదు, భగవాన్ యొక్క ఆస్తి / సంపదను దొంగిలించేవారికి  సహాయపడటం మరియు అలా  దొంగిలించిన సంపదను యాచించి పొందడం లేదా ఇచ్చినప్పుడు అటువంటి సంపదను స్వీకరించడం కూడా భగవత్ అపచారంగా గుర్తించబడుతుంది – అందువల్ల ఇటువంటి చర్యలకు దూరంగా ఉండటం మంచిది.

అనువాదకుల గమనిక: ఈ సుదీర్ఘ విభాగాన్ని ముగించడానికి, డబ్బు సంపాదించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుత వ్యవస్థలో మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, ఇక్కడ మొత్తం వ్యవస్థ మన శాస్త్రం అందించిన ఆదర్శాలకు విరుద్ధంగా అయిపోయాయి.  శాస్త్రానికి ప్రత్యక్ష విరుద్ధంగా సంపాదించబడిన డబ్బు చాలా ప్రసరణలో ఉంది. ఇది మన అవసరాలను పూర్తిగా తగ్గించడానికి మరొక సూచన, ముఖ్యంగా ఈ ప్రాపంచిక ఆలోచనలు మరియు జీవనశైలిలో చిక్కుకోకుండా మనల్ని రక్షించడానికి ఎమ్పెరుమాన్ని నిరంతరం ప్రార్థించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-18.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org