Category Archives: charamOpAya nirNayam

చరమోపాయ నిర్ణయం – అనుబంధము – సింహావలోకనము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ముగింపు

చరమోపాయ నిర్ణయం అనెడి ఈ గ్రంథములో గత అధ్యాయాలలో చూచిన అనేక విషయములను సంక్షిప్తముగా సింహావలోకనము చేసుకుందాం :

  • నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తమ గురువులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని కీర్తించి వారి అనుగ్రహము చేత ఈ గ్రంథము చేయుట జరిగినది. జగదాచార్యులైన శ్రీ రామానుజుల దివ్య గుణ వైభవమును చెబుతూ వారి అనుగ్రహమే శ్రీ వైష్ణవులను తమ చరమ గమ్యమైన పరమపదమునకు కొనిపోవుటకు హేతువు అన్న సత్యమును ప్రధాన భూమికగా చేసి ఈ గ్రంథము చెప్పటం జరిగినది.
  • ఆచార్య రత్నమాలలో ఎమ్బెరుమానార్లు మధ్యలో ప్రకాశించెడి అద్వితీయమైన వజ్రముగా చెప్పబడుచున్నారు.
  • స్వాను వృత్తి మరియు కృపా మాత్ర ప్రసన్నాచార్యుల తత్వములు ఈ గ్రంథములో వివరించిరి. అందులో ఎమ్బెరుమానార్లు కృపా మాత్ర ప్రసన్నాచార్యులుగా జగదోద్ధారకులుగా చెప్పబడినారు.
  • ఎమ్బెరుమానార్ల తిరుముడి సంబంధము చెప్పబడినది.
  • “పొలిగ! పొలిగ!” అను పాశురము ద్వారా నమ్మాళ్వార్లు శ్రీ రామానుజుల భవిష్యదవతారము గూర్చి చెప్పటమే కాక నాథమునులకు స్వప్నములో భవిష్యదాచార్యుని రూపములో దర్శన మిచ్చి నిజ రూపములో భవిష్యదాచార్య విగ్రహమును చెక్కించి ఇచ్చి అనుగ్రహించారు!
  • నాథమునులు ఆ భవిష్యదాచార్య విగ్రహమును ఉయ్యక్కోండార్ కు అనుగ్రహించారు!
  • ఉయ్యక్కోండార్ల నుంచి ఆ విగ్రహము మణక్కాల్ నంబికి దక్కినది!
  • మణక్కాల్ నంబి ఆ విగ్రహమును మరియు పారంపర్యముగా భవిష్యదాచార్య అవతారము గూర్చి వచ్చెడి రహస్య విషయములను ఆళవందార్లకు అనుగ్రహించారు!
  • ఆళవందార్లు ఇళయాళ్వారును తమ తరువాత శ్రీ వైష్ణవ ధర్మ ప్రవక్తకులుగా అనుగ్రహించి ఆశీర్వదించిరి!
  • ఆళవందార్లు భవిష్యదాచార్య విగ్రహమును తత్సంబంధిత రహస్యములను తిరుక్కోష్టియూర్ నంబికి అనుగ్రహించారు!
  • తమ వంశములో ఒక శ్రీ వైష్ణవుడు జన్మించుటచే పితృ దేవతలు ఎలా సంతోషపడతారో అలాగే శ్రీ రామానుజుల మునుపు అవతరించిన ఆచార్యులందరూ శ్రీ రామానుజులు ప్రపన్న కులములో అవతరించుట చేత పరమ సంతోషపడిరి!
  • భగవానుడు, నమ్మాళ్వార్లు, ఎమ్బెరుమానార్లు ఉత్తారకాచార్యులుగా నిరూపింపబడిరి! అందులో ముఖ్యముగా ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వము పరమ విశేషముగా వివరింపబడినది!
  • ఎమ్బెరుమానార్ల ఆచార్య పంచకమైన పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుమాలైయాణ్డాన్ తమ ఉపదేశముల ద్వారా ఇతర అనుభవముల ద్వారా ఎమ్బెరుమానారే ఉత్తారకులుగా నమ్మి తమ పిల్లలను సైతం ఎమ్బెరుమానార్లకు శిష్యులుగా చేసినారు!
  • తిరుక్కచ్చి నంబి ద్వారా వరదరాజ పెరుమాళ్ళు ఎమ్బెరుమానార్ల గొప్పతనమును లోకానికి చాటినారు! ఎలాగైతే పెరుమాళ్ళు రామ కృష్ణాది అవతారములలో విశ్వామిత్ర, సాందీపని మొదలగు మహర్షుల వద్ద విద్య నేర్చుకున్నారో ఎమ్బెరుమానార్లు కూడా తమ అవతారములో భాగంగానే ఆళవందార్ల శిష్యులను ఆచార్యులుగా స్వీకరించి వారి వద్ద విద్య నేర్చినారని వరద రాజ పెరుమాళ్ళు చెప్పినారు!
  • వేద వేదాంతములకు వక్ర భాష్యములు చెప్పి భగవత్తత్వమును పక్కదారి పట్టించిన అద్వైతమును మరియు వేదమును వ్యతిరేకించిన శూన్య మాయావాదుల సిద్ధాంతములను ఖండించి వేదాంతమునకు సరియైన భాష్యము చెప్పి పరమాత్మ అస్తిత్వాన్ని కాపాడిన ఎమ్బెరుమానార్లే నిజమైన ఉత్తారకాచార్యులు! కనుక వారిని ఆశ్రయించుటలో మనకు ఎటువంటి సందేహము అవసరం లేదు! ఎందుకంటే భగవంతునికే ఉత్తారకాచార్యుడు శ్రీ ఎమ్బెరుమానార్లు కనుక!
  • ఎమ్బెరుమానార్ల అవతార రహస్యము బహిర్గతము చేయటమైనది! వారి అసలు రూపము నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుడని తిరుమాళిరుంశోలై అళగర్, క్షీరాబ్ది నాధుడు, సరస్వతి మరియు తామే పలు సందర్భాలలో చెప్పినట్టు ఐతిహ్యములు చెప్ప బడినవి!
  • దేవ పెరుమాళ్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వాన్ మొదలగువారి మూలముగా ఉడయవర్ల గొప్పతనము చెప్పటం జరిగినది! ఎమ్బెరుమానార్ల పట్ల శిష్యులకు ఉన్న ప్రేమాతిశయము ఎటువంటిదంటే వారి పరమపద వార్త విని ఎంతో మంది శిష్యులు తత్క్షణమే ప్రాణము విడిచి వారూ పరమపదము చేరిరి!
  • శ్రీ రామానుజుల ఉత్తారకత్వము ఎవ్వరెవ్వరి చేత నిరూపింప బడినదంటే:
    • పలు సందర్భాలలో వారే చెప్పుకొనుట
    • అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్
    • తిరువేంగడముడైయాన్
    • తిరుక్కురుంగుడి నంబి
    • నడాదూర్ అమ్మాళ్
    • సోమాసియాణ్డాన్
    • కణియనూర్ సిరియాచ్చాన్
    • పొన్నాచ్చియార్  (పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ గారి భార్య )
  • ఆళవందార్లకు నాథమునుల మీద మరియు ఎమ్బెరుమానార్ల మీద గల ప్రేమాతిశయము వివరించడం జరిగినది! ఆళవందార్లు ఎమ్బెరుమానార్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట చెప్పటం జరిగినది!
  • ప్రథమపర్వ నిష్ఠ కన్నా చరమపర్వ నిష్టకున్న గొప్పతనమును వివరంచటం జరిగినది!
  • శ్రీరామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించిన వారు:
  • చివరిగా తిరువరంగత్తు అముదనార్లు “ఇరామానుశ నూఱ్ఱందాది” గ్రంథములో చెప్పిన చరమోపాయ నిష్ఠుడు పాటించవలసిన ధర్మ సూత్రములు:
    • ఎమ్బెరుమానార్ల యొక్క భక్తుల సన్నిధే మన పెన్నిధి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య గుణానుభవమే మన నిత్య విధి!
    • ఎమ్బెరుమానార్ల గొప్పతనమును కీర్తించని వారి సాంగత్యమును విసర్జించ వలెను!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య నామ సంకీర్తనమే (రామానుజ! భాష్యకారా! ఎతిరాజా! ఉడయవరే! ఎమ్బెరుమానారే!) మన జిహ్వకు ఉద్యోగము!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య రూపమే మనకు ధ్యాన చిత్రము!
    • ప్రేమ భావముతో ఎమ్బెరుమానార్ల యొక్క భక్తులకు సేవ చేయాలి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య మంగళ విగ్రహముతో ఆత్మ సంబంధము కలిగి వుండాలి !
    • ఎమ్బెరుమానార్ల యొక్క శ్రీ చరణాలపై పెట్టిన నమ్మకమే వారి సన్నిధికి మనలను చేరుస్తుంది! అనుమానము శాశ్వత సంసారములోనికి పడదోస్తుంది!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము :   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-summary-of-events.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – ముగింపు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

గత మూడు అధ్యాయాలలో జగదాచార్యులైన ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వమును అనుభవించి యున్నాము! ఇక ఇంత అద్భుతమైన గ్రంథము యొక్క ముగింపు చూద్దాము!

(గమనిక : ఈ ముగింపు భాగము తిరువరంగత్త అముదనార్లు రచించిన “ఇరామానుశ నూఱ్ఱందాది” అను ప్రబంధమును ఆధారముగా చేసుకొని చెప్పడం జరుగుతున్నది! అముదనార్లుకు ఉడయవర్లపై గల అసాధారణ మరియు నిరుపమాన భావానుభూతులు ఈ ప్రబంధము ద్వారా మనం తెలుసు కొనవచ్చును! ఈ ప్రబంధమును నాలాయిర ప్రబంధములలో చేర్చ వలెనని మరియు తిరు వీధులలో స్వామి పురప్పాడు (ఊరెరిగింపు) జరుగునపుడు ఈ ప్రబంధమును ఆచార్య పురుషులు అనుసంధించ వలెనని సాక్షాత్తు శ్రీ రంగనాధుడే (నమ్పెరుమాళ్) ఆజ్ఞ చేసాడు! దీని వలన భగవంతునికి కూడా ఈ ప్రబంధము పట్ల ఉన్న అభిమానము స్పష్ట మగుచున్నది! ఈ ప్రబంధమునకు “ప్రపన్న గాయత్రి” అని పేరు! ఈ ప్రబంధమును స్త్రీ పురుష వర్ణ వయో భేదములు లేక రామానుజ దాసులైన వారెల్లరూ గాయత్రి అనుష్టానము వలె దీన్ని అనుసంధించు కోవచ్చునని ఆర్యోక్తి !! అంటే గాయత్రి ఎంత జపిస్తే అంత శక్తిమంతమో ఈ ప్రబంధము కూడా ప్రపన్నులైన రామానుజ దాసులకు ఎంత పాడు కుంటే అంత రామానుజ కటాక్షము!!

జగదాచార్యులైన స్వామి రామానుజులు – శ్రీ పెరుంబుదూరు

గతములో తెలుసుకున్నట్లు ఎమ్బెరుమానార్లే జగదాచార్యులు, ఉత్తారకాచార్యులు! ఉడయవర్లు ఈ ఘోర కలిలో సామాన్య జనులకు  సైతం మోక్షార్హత కల్పించి వారిని సంసారము నుండి కాపాడి సద్గతుల నిచ్చు ఒక ప్రత్యేక అవతారముగా వచ్చి నటువంటి పరమ ప్రేమైక మూర్తి! వారి శ్రీచరణాలే పరమమని నమ్మి జీవించెడి చరమపర్వనిష్ఠులైన శ్రీవైష్ణవులకు నిస్సందేహముగా వారే ఉపాయము మరియు ఉపేయమున్నూ!

  • 105వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసనై తొళుమ్ పెరియోర్ ఎళుందిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కు ఇరుప్పిడమే – పెద్దలైన శ్రీ వైష్ణవులు ఎక్కడైతే రామానుజుల దివ్య వైభవాన్ని గానం చేస్తారో అక్కడే నాకు స్థానమ”, అని చెప్పినట్లు ప్రపన్నులు ఉండదగిన చోటు రామానుజ వైభవము కీర్తించెడి పెద్దల సాంగత్యములోనే.
  • 94వ పాశురములో “ఉవందరుందేన్ అవన్ సీర్ అన్ఱి యానోన్ఱుమ్ ఉళ్ మగిళ్ న్దే – రామానుజుల వైభవ కీర్తనము తప్ప మరేదీ మనసులో నిలుపజాలను”, అని చెప్పినట్లు చేయవలసిన కార్యము నిరతము రామానుజ దివ్యగుణ కీర్తనమే! ఇదే అర్థము 2వ పాశురములో కూడా ధ్వనిస్తుంది, “ఇరామానుశన్ మిక్క సీలమల్లాల్ ఉళ్ళాదు ఎన్నెన్జు – రామానుజ తత్వముపై తప్ప తక్కిన విషయములపై నిలువదు నా మనసు ” ! కనుక చరమాధికారుల (ఆచార్య నిష్టులు) పరమ గమ్యము రామానుజుల దివ్యగుణ స్మరణమే!
  • 15వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసన్ తన్ పిరంగియశీర్ సారా మనిసరై చ్చేరేన్ ఎనక్కెన్న తాళ్వినైయే – రామానుజుల దివ్యగుణములను అనుభవించని మనుష్యులతో చేరను! వారితో నాకేమి లాభము? “, అని చెప్పినట్లు రామానుజ గుణానుభవము చేయని వారి సాంగత్యమును విసర్జించవలెను! “అటువంటి వారితో చేరకపోవుట చేత నాకెటువంటి నష్టము లేదు!” అని అముదనార్లు పాశురములో చెప్పుటచే, “రామానుజ గుణానుభవత్యక్తుల సాంగత్యము మనకు నష్టమును కలిగించును”, అని అర్థము చేసుకొనవలెను! దీని వలన స్వరూప నాశనము జరుగునని రూఢి అగుచున్నది!
  • 28వ పాశురములో, “ఇరామానుశన్ పుగళ్ అన్ఱి యెన్ వాయ్ కొంజిప్పరవగిల్లాదు – రామానుజుల గుణ వైభవ కీర్తనము తప్ప నా నోరు పక్క దారి పట్టి ఎగుర లేదు! ” అని చెప్పినట్లు ఎల్లప్పుడూ రామానుజుల గుణానుభవ కీర్తనమే జిహ్వకు ఉద్యోగముగా చేయవలెనని అర్థము!
  • 35 వ పాశురములో చెప్పిన విధముగా, “ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ అయరేన్ – రామానుజుల దివ్యచరణ కమలాలను ఎన్నటికీ మరువను”, అనునట్లు సదా రామానుజుల చరణ సరోజములను ధ్యాన మందు నిలుపు కొనవలెనని అర్థము! ఎందు కంటే ఆ చరణములు సకల పాప హరణములు! అంతర్బాహ్య శుద్ధి కరణములు ! వాటిని ఎన్నటికీ మరువరాదు!
  • 107 వ పాశురములో, “ఉన్ తొండర్గట్కె అన్బుత్తిరుక్కుమ్ బడి ఎన్నై యాక్కి అంగాట్పడుత్తే – నీ దాసుల యందు ప్రియము కల్గి ఉండునట్లు నను నీవే చేసి అనుగ్రహించుము”, అని చెప్పినట్లు చరమ పర్వ నిష్టుల కర్తవ్యము (స్వరూపము) రామానుజుల దాసులైన శ్రీ వైష్ణవుల పట్ల అభిమానము కలిగి వారి యెడల సేవాభావముతో జీవించుట!
  • 104 వ పాశురములో చెప్పినట్లు, “ఉందన్ మెయ్యిల్ పిరంగియ శీర్అన్ఱి వేణ్డిలన్ యాన్….. ఇవ్వరుళ్ నీ సెయ్యిల్ తరిప్పన్ ఇరామానుశా – నీ దివ్య మంగళ విగ్రహ సందర్శనము తప్ప వేరేదీ కోరేవాడను కాను – అది నాకు అనుగ్రహిస్తే తరిస్తాను”, అని చెప్పినట్లు రామానుజుల దివ్య మంగళ విగ్రహమును సందర్శనమే మనస్సుకు పరమౌషధముగా భావించ వలెను!
  • 80 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామం నమ్బవల్లార్ తిరత్తై ….శైయ్వన్ సోర్విన్ఱియే – రామానుజుల తిరు నామము జపించెడి ఉత్తములైన శ్రీ వైష్ణవులను మనసా వాచా కర్మణా సేవిస్తాను”, అని చెప్పినట్లు రామానుజ ధ్యాన పరాయణులైన శ్రీ వైష్ణవ శిఖామణులను ఎల్లపుడు సేవిస్తూ వారికి మనసా వాచా కర్మణా సేవ చేయవలెను! మరియు 46 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామమ్ నమ్బిక్కల్లార్ అకలిడత్తోర్ ఎదు పేరెన్ఱు కామిప్పరే – రామానుజుల తిరు నామము నమ్మని వారికి ఈ లోకములో ఏది గతియని చూపించండి చూద్దాం?”, అని చెప్పుటలో రామానుజులను నమ్మని మూఢులకు లోకములో మోక్షము కొరకు వేరు గతి ఉండదని తెలుసుకోవాలి!

కూరత్తాళ్వార్లను సేవించెడి తిరువరంత్త అముదనార్లు – అముదనార్లు కూరత్తాళ్వార్ల వద్ద సమాశ్రయణము రామానుజసంబంధమును పొందారు

అముదనార్లు ఈ అద్వితీయమైన ప్రబంధమును శ్రీ రామానుజులు వేంచేసి ఉన్న కాలములోనే రచించి గానము చేసినారు! శ్రీ రామానుజుల చేత మరియు నంబెరుమాళ్ళయిన శ్రీ రంగనాథుని చేత ఆమోదించబడిన ఈ గ్రంథములో చెప్పిన చరమ పర్వస్థ నియమాలు సూత్రాలు నిస్సందేహముగా పాటించదగినవని పూర్వాచార్యుల ఉవాచ! ఎందు కంటే :

సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురుః !
స ఏవ సర్వలోకానామ్ ఉద్ధర్తా నాత్ర సంశయః !!

అర్థము : సత్యం! సత్యం! మరల సత్యం ! యతిరాజులే జగద్గురువులు ! వారే సర్వలోకులను ఉద్ధరించగలరు ! ఇందులో సందేహము లేదు!

ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ పొరుందానిలై యుడై ప్పున్మయిలోర్కు

ఒన్ఱుమ్ నన్మై శెయ్యా ప్పెరుందేవరై ప్పరవుమ్ పెరియోర్ తమ్ కళల్ పిడిత్తే  – 62 వ పాశురము

అర్థము – రామానుజుల శ్రీ చరణాలను ఆశ్రయించని దుర్మార్గులకు కొంచెము కూడా సహాయపడని గొప్ప దేవతలైన పెద్దల శ్రీచరణాలను ఆశ్రయిస్తాను!

చరమోపాయ నిర్ణయము ముగిసినది !!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీనివాస రామానుజదాసన్

మూలము:   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-conclusion.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము పెద్దలు పొందిన కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల ద్వారా తెలుసు కుందాము!!

ఒకనాటి రాత్రి ఎంబార్ భగవద్ గుణానుభవము గావిస్తూ తిరు వీధులలో నడుస్తూ ఉండగా భట్టర్ వారిని సమీపించి అంజలి ఘటించి, “ద్వివిధములైన ఆచార్యత్వము (స్వాను వృత్తి ప్రసన్నాచార్యత్వము, కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము) మరియు తద్విషయ స్వీకారత్వమున్ను (స్వగత స్వీకారము, పరగత స్వీకారము) ద్వి విధములై ఉన్నందున ఎందులో చరించవలెనో దేవరవారే అనుగ్రహించ వలసింది!”, అని ప్రార్థించగా ఎంబార్, “కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము, పరగత స్వీకారమే ఉత్తమమైన మార్గములు! అవి ఉడయవర్ల విషయములో మెండుగా ఉన్నవని మేము గ్రహించితిమి! మీరు కూడా మిమ్ములను శ్రీ రంగనాధుడు తమ పుత్రునిగా స్వీకరించాడని, పరమ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులైన కూరత్తాళ్వాన్ పుత్రుడనని, సకల విద్యా పారంగతుడనన్న అహంకారము ఇత్యాది జాడ్యములను దరి చేరనీయక మా వలె ఉడయవర్లే ఉత్తారకులుగా నమ్మి వారి వద్ద ఉత్తారక ప్రతి పత్తి చేయండి!”, అని బదులిచ్చెను!

భట్టర్ నంజీయరుకు తిరువాయ్మొళి వ్యాఖ్యానమును కాలక్షేపమును అనుగ్రహించి నపుడు “ప్రత్యక్షే గురవః స్తుల్యః – ప్రత్యక్షములో ఆచార్యులు స్తుతించదగినవారు”, అను విధముగా నంజీయర్ భట్టర్ ను పలు విధములుగా స్తుతించి, “దాసుని శిరస్సుపై దేవర వారి శ్రీ చరణాల నుంచి దాసుని అనుగ్రహించి తరింప చేయండి!”, అని ప్రార్థించగా భట్టర్ అటులనే ఏకాంతముగా నంజీయర్ శిరస్సుకు తమ పాద స్పర్శనము చేసి ఇటులనిరి, “ఈ పాదాలు కాదు మీరు శరణు వేడవలసింది! ఆచార్య కటాక్షముపై మీకు నమ్మకము కలుగచేయుట కొరకే మేమెటులచేసితిమి! మీకు, మాకు, మిగిలినవారందరికి ఉడయవర్లే ఉత్తారకులు! వారే జీవులకు చరమోపాయము! ఈ సత్యమును మనస్సులో ఉంచుకుని తదేక నిష్ఠులై జీవించండి! లేక పోతే నిత్య సంసారిగా మిగిలి పోతారు జాగ్రత్త!” దీనివల్ల మనకు తెలియునదేమనగా ఉడయవర్ల శ్రీ చరణాలను ఆశ్రయించుటయే ఉజ్జీవనమునకు హేతువు! మిగిలినవి ఉజ్జీవకములుగా భావించుట అజ్ఞానము!

ఈ అర్థమును అముదనారు “ఇరామానుశ నూఱ్ఱందాది”లో చక్కగా అనుగ్రహించారు!

పొయ్యై చ్చురక్కుమ్ పొరుళై త్తురందు
ఇంద ప్పూదలత్తే మెయ్యై పురుక్కుమ్ ఇరామానుశన్ నిర్క
వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దైవ మిన్గు యాదెన్ఱు ఉలర్న్దు
అవమే అయ్యప్పడానిఱ్పర్ వైయ్యత్తుళ్ళోర్ నల్లఱి విళిన్దే! – 79వ పాశురము

భావము – అసత్య ప్రచారములు (వేదమును అంగీకరించని మతాలు) చేయు బాహ్యములను, మరియు కుదృష్టులను (వేదమును అంగీకరించియును తప్పుడు అర్థమును బోధించెడి మతములు) రూపు మాపి జనులకు నిజమైన జ్ఞానమును అందించుటకు శ్రీ రామానుజులు సిద్ధముగా ఉండగా ఈ లోకులు ఎందులకు వేరే దైవము వచ్చి తమను ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తారు?

అని చెప్పడం చేత ఉడయవర్ల తరువాత జనులను ఉజ్జీవింపజేసేది ఇక భగవానుడే! అయితే చరమపర్వమగు ఉడయవర్లు వేంచేసి ఉండగా, ప్రథమపర్వమగు భగవంతుని ఆశ్రయించుట అజ్ఞాన కార్యమగును! మనవద్దకొచ్చిన చరమపర్వమును విడిచిపెట్టి విప్రకృష్టమగు ప్రథమ పర్వమును పట్టుకొనుట అజ్ఞానమే కదా!

ఎట్ట ఇరుంద కురవై ఇఱై ఎన్ఱు అన్ఱు విట్టు
ఓర్ పరనై విరుప్పురుతల్
పొట్టనైత్తన్ కణ్ సెంబళిత్తు కై తుఱత్తి నీర్ తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అన్ఱు -జ్ఞాన సారము – 33వ పాశురము

భావము – తనకు చేరువనున్న గురువును కాదని ఎక్కడో మనకు కనపడని దూరములో నున్న దైవమును ప్రార్థించుట ఎటులన్న దాహము గొన్నపుడు దరిలో నీరుండగా ఆకాశముకేసి చూసి వానకై నిరీక్షించి నట్టు ఉండును!
అని దృష్టాంత సహితముగా అరుళాళప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ అనుగ్రహించారు కదా!

(గమనిక – ఈ పాశురమును వ్యాఖ్యానించు సమయములో స్వామి మణవాళ మహాముణులు ఒక శ్లోకము చెప్పియున్నారు! అది “చక్షుర్గుమ్యం గురుం త్యక్త్వా శస్త్రగమ్యం తు యః స్మరేత్! కరహస్తం ఉదకమ్ త్యక్త్వా కా నస్థం ఆభివాఛతి !!” మహాముణులు జ్ఞాన సారము యొక్క గొప్పతనమును అవతారికలో అద్భుతముగా చెప్పియున్నారు! గ్రంథ కర్త అయిన అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ ఉడయవర్లకు ప్రత్యక్షంగా శుశ్రూష చేసి వారి వద్ద నేర్చుకున్న అత్యంత క్లిష్టతరమైన చరమోపాయమును బహు సులభముగా సామాన్యులకు అర్థమగు నట్లు చిన్న చిన్న ఉదాహారణలతో విశదీకరించి యున్నారు!)

“చరమపర్వమునకు తగనివాడు ప్రథమ పర్వమునకు కూడా తగడు!”, అని వంగి పురత్తు నంబి గారి సూక్తి! తదీయ శేషత్వ జ్ఞానము లేని వాడికి తచ్చేషత్వ జ్ఞానము కూడా లేకుండా ఉండును! భగద్విషయము నందు జ్ఞానము లేనివాడు దాన్ని పొందుటకు ఆచార్యుని ఆశ్రయించ వలెను! ఆచార్యాభి మాననిష్ఠుడు ప్రథమ పర్వ మందు తలదూర్చడు! ఆచార్యాభిమానము కోల్పోయిన వాడు భగవద్కృతమైన స్వరూప సంకోచమును పొందుతాడు! ఈశ్వరాభిమానమును కోల్పోయినవా డు ఆచార్యాభిమాన మందు ఒదిగి ఉండవలెను! చరమోపాయ నిష్ఠునకు ఈశ్వరాభిమానము అవసరం లేదని ఇక్కడ చెప్ప వచ్చు ! దీని బట్టి చెప్ప వచ్ఛేదేమిటంటే ఉడయవర్ల అభిమానము పొందని వానిని ఈశ్వరుడు కూడా విడిచి పెడతాడు! ప్రథమ పర్వమైన ఈశ్వరుడు దోషదర్శనము చేత చేతనుని విడిచి పెడతాడు! కానీ, చరమ పర్వమైన ఆచార్యుడు, అనగా, ఉడయవర్లు మాత్రం విడిచి పెట్టరు! ఉడయవర్ల శ్రీ చరణ సంబంధము పొందాక ఇక సద్గతి కొరకు భగవంతుని ప్రార్థన చేయ నక్కరలేదు కదా – అని అర్థము! “తేవు మత్తఱియేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే – వేరొక దైవమెరుగను ! శ్రీ  శఠకోపుల బంగారు పాదములాశ్రయించాను (కణ్ణినుణ్-2)” అనువిధముగా జీవించినట్లైతే సద్గతి తప్పక కలుగును కదా! ఎందు కంటే ఆశ్రయించెడి చరణాలు “పొన్నడి – బంగారు పాదాలు” కనుక! ఈ విధముగా అన్ని ప్రకారములుగా అందరికి ఉత్తారకులు ఉడయవర్లే కనుక కొరత చెందే పని లేదు ! అటువంటి ఉడయవర్ల యొక్క అభిమానమును మనసారా పొందనివారు నిత్య సంసారులుగానే మిగిలిపోతారు!

ఉడయవర్ల శ్రీ చరణాలు ఆశ్రయించిన వారు వారి తిరు నామమును నిత్యమూ స్మరించు కోవాలి! అముదనార్లు ఉడయవర్ల యొక్క తిరునామము యొక్క గొప్పతనమును వారి యొక్క శ్రీ చరణ కమల ప్రావణ్య జనకముగా ఈ విధముగా చెప్పియున్నారు, “ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వాళ నెంజే! సొల్లువోమ్ అవన్ నామంగళే! – ఇరామానుశ -1” అని చెబుతూ, “నామ్ మన్ని వాళ  అవన్ నామంగళే సొల్లువోమ్!” అని చెప్పుట వలన ఉడయవర్ల యొక్క నామజపము చేయని యెడల వారి యందు భక్తితో జీవించ లేమని అర్థము! వారిని ఆశ్రయించి జీవిస్తున్నట్లైతే శ్రీ రామానుజ నామస్మరణ అనుసంధించవలెనని అదే వారి శ్రీ పాద కమలాల యందు ప్రావణ్యమును పెంపొందింప జేయగలదని అర్థము! ఈ విధముగా ఉడయవర్ల తిరునామమును అనుసంధించు కొనుచు వారి శ్రీ చరణాలను ఆశ్రయించిన వారికి ప్రాప్య ప్రాపకములు రెండూ వారే కదా! “పేఱొన్ఱు మత్తిల్లై నిన్ చరణన్నిఅప్పేఱళిత్తర్కు యారొన్ఱుమిల్లై మత్త చ్చరణన్ని- ప్రాప్యము ఏది లేదు నీ శ్రీచరణాలు తప్ప! ఆ ప్రాప్యమును ఇచ్చునట్టి ప్రాపకమూ వేరేదీ లేదు నీ శ్రీ చరణాలు తప్ప – ఇరామానుశ – 45” అని ప్రాప్య ప్రాపకములు రెండూ ఉడయవర్ల యొక్క శ్రీ చరణాలే అని ఉద్ఘాటించారు అముదనార్లు!

వడుగ నంబి ఒకనాడు ఉడయవర్ల సభలోకి ప్రవేశించి ఉడయవర్లకు దండం సమర్పించి నిలుచుంటే, ఉడయవర్లు వారిని ఉద్దేశించి, “మన మధురకవులు వచ్చారు!” అన్నారుట! నమ్మాళ్వారుకు ఒక మధురకవులు ఉన్నారు కదా! అంత అభిమానము వడుగ నంబి మీద ఉడయవర్లకు! వడుగ నంబి కూరత్తాళ్వార్లను, ముదలియాణ్డాన్ ను ఉద్దేశించి, “ఇరుకఱైయర్- ఇరుతీరాలవారు”, అని పిలిచేవారుట! అంటే శ్రీ రామానుజులు, భగవంతుడు అంటే రెండు తీరాలను పట్టుకుని ప్రవహించే శుద్ధ గంగానది వంటి వారని వారి ఉద్దేశ్యము!

ఒకనాడు ఉడయవర్లు వడుగ నంబిని పిలిపించి, “వడుగా! ఆచార్యాభిమాన నిష్ఠుడు ఎలా ఉండవలెను?”, అని అడుగగా నంబి, “వేంబిన్ పుళుపోలే ఇరుప్పన్ – వేపలోని పురుగువలె ఉంటాడు”, అన్నారుట! దానికి అర్థము వేప చెట్టును పట్టుకుని బ్రతికే పురుగు వేపరుచి తప్ప వేరు రుచి ఎరుగదు!  “కఱుమ్బిన్ ఫుళు – చెఱకులోని పురుగు” వలె అన్య ఆస్వాదనాలాలస కలుగనిదై ఉండును! అదే విధముగా ఆచార్యాభిమాన నిష్ఠుడు కూడా వేప పురుగు వలె ఒక ఆచార్యుని మాత్రమే ఆశ్రయించి వారి అనుగ్రహము చేత ముక్తిని పొందుతాడు తప్ప వేరు ఆలోచన కూడా మనసుకు రానీయడు! మరి ఇక్కడ చెఱకు పురుగు అంశం ఎందుకంటే ఆచార్యుడు ఎంత దయాళువై ఉన్ననూ తననే నమ్ముకుని ఉన్న శిష్యుని పట్ల విరసభావమును పొంది ఘాతుక దశలో ఉన్ననూ, “నానున్నై యన్ఱి ఇలేన్ (నాన్ముగన్ తిరు -7 ) – నిన్ను వదిలి నేను ఉండలేను” అనువిధముగా ఆచార్యుడు లేకపోతే వేరు గతి లేదను ప్రగాఢ నమ్మకంతో, “కళైకణ్ మఱ్ఱిలేన్ (తిరువాయ్మొళి-5-9-8) – వేరు రక్షకుడు లేనివాడను”, అన్నంత ఆచార్య అభిమాన నిష్ఠ కలిగి ఉండవలెను! అందుచేత ఉడయవర్ల విషయములో ఒదిగి ఉన్నవాడు తదేక నిష్టుడై ఉండి తద్వ్యతిరిక్త విషయములలో ఆసక్తి లేనివాడై ఉండవలెనని అర్థము! అత్యంత గొప్పదైన పరమోత్కృష్టమైన వస్తువు సొంతమైతే ఇంక మిగిలిన విషయములు అవసరము లేదు కదా! “పల్లుయిఱ్కుమ్ విణ్ణిన్ తలైనిన్ఱు వీడళిప్పాన్ నమ్మిరామానుశన్ -(ఇరామానుశ – 95) పలు జీవులకు పరమపదములో తన పురుషకారము చేత చోటు ఇప్పిస్తారు శ్రీ రామానుజులు” అని ఉడయవర్ల యొక్క  గొప్పతనమును చెప్పారు కదా సకల శాస్త్ర ప్రావీణ్యులైన అముదనార్లు!

నంబిళ్ళై ఒకనాడు ఉడయవర్ల సన్నిధికి వెళ్లి దండము సమర్పించి, నూఱ్ఱందాది అనుసంధించి, “ఈనాడు దాసుడుకి ఒక హితమును అనుగ్రహించండి!”, అని ప్రార్థించారుట! ఆనాటి రాత్రి ఉడయవర్లు స్వప్నములో దర్శనమిచ్చి తమ తిరువడిగళ్లను నంబిళ్ళై శిరస్సుపై ఉంచి ‘మీకు హితము చేకూరవలెననిన మా పాదాలే రక్షకముగా భావించండి! మిమ్మలను ఆశ్రయించినవారికి కూడా వీటినే రక్షకములుగా ఉపదేశించండి! దీనిని మించిన హితము లేదు!'”, అని ఉపదేశించిరి! నిదురలేచిన నంబిళ్ళై ఆనంద బాష్పాలతో పరవశులై తమ కుమారుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని పిలిచి స్వప్న వృత్తాన్తమును చెప్పి సంతోష పడిరి! నంబిళ్ళై చరమ దశలో ఉండగా వారి కుమారులు సమీపించి తమకు దిక్కేది బాధపడు చుండగా నంబిళ్ళై, “ఎమ్బెరుమానార్ల శ్రీ చరణాలు మనకు రక్షకములు! వేరు హితమేమి అవసరము? వారి అభిమాన మందు అన్తర్భూతులై ఉంటే మన హితము కొరకు ఆలోచించాల్సిన అవసరము రాదు! అదే నిష్ఠతో జీవితము గడపండి! నేను పొందే పరమపదము మీకు కూడా లభిస్తుంది!”, అని ఉపదేశించారుట !
ఇక వచ్చే అధ్యాయములో ఈ గ్రంథము యొక్క ముగింపు విషయములను తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-3.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల మూలముగా తెలుసుకొనెదము!!

ఒకానొకప్పుడు అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల శిష్యులైన అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలైనవారు ఉడయవర్లను ఆశ్రయించి ఒక సందేహమడిగినారు, “ఈ ఆత్మకు ఆచార్యుడు ఒకరా? పలువురా? ఇంతమంది ఎందులకు?”  దానికి ఉడయవర్లు ఆ శిష్యులను వెళ్లి పొన్నాచ్చియార్ అను వారిని అడుగ వలసిందిగా చెప్పారు! అప్పుడు వారందరు పొన్నాచ్చియార్ అమ్మగారి తిరుమాళిగకు చేరుకొని తమ సందేహాన్ని వారి వద్ద విన్నవించారు! అప్పుడు పొన్నాచ్చియార్ అమ్మగారు తమ శిరోజాలని ముడి విప్పి విదిలించి మరల ముడి వేసుకుని, “ఈ సందేహమును దాసురాలు తీర్చజాలదు! అబలయైన దాసురాలికి అంత జ్ఞానమేమున్నది? స్వామి వారే మీ సందేహము తీర్చగలరు? ” అని వారికి సమాధానము చెప్పి నేలపై పడియున్న ఒక నూలు పోగును తల మీద పెట్టుకుని లోపలి వెళ్లిపోయారు! శిష్యులు చేసేది లేక మరల ఉడయవర్ల వద్దకు వచ్చి నిలబడిరి! ఉడయవర్లు వారితో, “కార్యము నెరవేరినదా?”అని అడుగగా వారు లేదని బదులిచ్చిరి! అంతట ఉడయవర్లు వారితో, “మీరు వెళ్ళి నప్పుడు వారు ఏమి చేసినారు?” అని అడుగగా వారు పొన్నాచ్చియార్ తమ జుత్తు ముడిని విప్పి జుత్తు విదిలించి తిరిగి ముడి వేసుకున్నారని, నేలపై పడియున్న ఒక నూలు పోగు శిరస్సుపై వేసుకుని లోపలి వెళ్లిపోయారని బదులిచ్చారు! దానికి ఉడయవర్లు, “అయితే మీకు సమాధానం దొరికింది! ఆమె తన చేష్టల ద్వారా మీకు సమాధానం చెప్పారు! మీకు అర్థం కాలేదే?”, అనగా శిష్యులు వారికి సాష్టాంగ దండం సమర్పించి, “మా అజ్ఞానాన్ని మన్నించి సవివరంగా దేవరవారే తెలియజేవలసింది!” అని ప్రార్థించిరి! దానికి ఉడయవర్లు వారి పట్ల వాత్సల్యము గలవారై వారితో ఇటుల చెప్పిరి, “ఆమె తమ జుట్టు ముడి విప్పి జుత్తు విదిలించడమంటే – ఈ ఆత్మకు ఆచార్యులు పలువురు ఉండవచ్చును (తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు, ఈ ప్రకృతి ఇలా జీవుడికి రకరకాల గురువులు ఉండవచ్చును )! అయితే ఆత్మకు ప్రాప్యమును కలిగించే (అంటే మోక్షమును ఇచ్చు) ఆచార్యుడు మాత్రం ఒక్కరే! అదే ఆమె తిరిగి తన జుత్తు ముడి వేసుకొనుటకు అర్థము! నేలపై పడి ఉన్న కావినూలు తీసి శిరస్సుపై ధరించుటలో అర్థం ఆత్మకు ప్రాప్యమును కలిగించే ఆచార్యుడు చతుర్థాశ్రమమైన సన్యాసమును స్వీకరించి కాషాయ త్రిదండ ధారుడైన ఎమ్బెరుమానార్ అనగా మమ్ములను సూచించారు! అక్కడ ఉండ కుండా లోపలి వెళ్ళుటలో అంతరార్థం అటువంటి ఆచార్యుని గుట్టుగా మనస్సులో స్థిరంగా నిలుపుకుని ‘పేణి క్కొణర్న్దు పుహుదు వైత్తుక్కొండేన్’ (ఆదరించి తీసుకువచ్చి విశ్లేషించకుండా హృదయంలో నిలుపుకున్నాను) అనునట్లు ప్రేమతో ఆచార్యుని ఆరాధిస్తూ వారి నామస్మరణ చేయుటయే శిష్యునికి ఉపాయము అని పొన్నాచ్చియార్ మీకు చేసి చూపించారు! కనుక మీరందరు అదే విధమైన నిష్ఠను కలిగి జీవించండి! ” అని బదులిచ్చిరి!

ఒకనాడు ఉడయవర్లు ఏకాంతంలో ఉన్న సమయములో ఎంబార్, వడుగనంబి వారి వద్దకు వెళ్లి, “మధురకవియాళ్వార్ నమ్మాళ్వార్ల విషయములో ‘తేవు మత్తఱియేన్’ – నీవు తప్ప వేరు దైవమెరుగను – అని శేషత్వ – శరణ్యత్వ – ప్రాప్యత్వములు ఆళ్వార్లే అని నిశ్చయించుకుని ప్రథమ పర్వమును (భగవత్స్మరణం) సైతం విడిచి పెట్టి తదేక నిష్ఠులై ఉన్న అటువంటి శ్రద్ధ మాకు కూడా కలిగేలా దేవరవారు ఆశీర్వదించవలసింది!”, అని ప్రార్థించగా ఉడయవర్, “మధురకవులు నమ్మాళ్వార్ల వద్ద కలిగి ఉన్న నిష్ఠను మీకు ఇదివరకే అనుగ్రహించి యున్నాను కదా? ఇంకేమి సంశయము?”, అని అడుగగా వారు,”అటువంటి నిష్ఠ యావదాత్మభావిగా జీవితాంతం కలిగియుండేలా అనుగ్రహించ వలసింది! ” అని ప్రార్థించిరి! ఉడయవర్లు పరమ సంతోషముతో శిష్యులంటే ఇటులకదా ఉండవలెనని మనస్సులో భావించి, “‘ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్’ – ఉపాయము ఉపేయము నీవేనను భావముతో శరణు వేడవలెను – అను రీతిలో ఉపాయోపేయ రూపములు రెండునూ మా వద్ద ఉండుట చేత “తేవు మత్తఱియేన్ ” అను రీతిలో మాకు శరణు వేడిన మీకు లోటు ఉండదు! ఇది మీకే గాక మీ సంబంధి సంబంధులకు వర్తించగలదు” అని బదులిచ్చెను!

గమని : ఇక మిగిలిన వ్యాసంలో  ఆళవందార్లు మరియు నాథమునుల సంబంధమును నిశితంగా తెలియజేయడమైనది.

మనకు ఒక సందేహము కలుగవచ్చు , “మనము ఆశ్రయించెడి ఆచార్యునకు ఈ లీలా విభూతిలో ఉన్న రోజులలో ఉపాయత్వము మాత్రమే కాక, ప్రాప్య భూమి అనబడే పరమపదంలో కూడా ఉపాయత్వము కలదా?” అంటే ప్రాప్య భూమి యందు కూడా ఆచార్యునకు ఉపాయత్వము కలదు! దీనిని స్వామి ఆళవందార్లు స్తోత్ర రత్నములో ఈ విధముగా అనుగ్రహించారు :

తస్మై నమో మధుజిదంఘ్రి సరోజ తత్వ
జ్ఞానానురాగా మహిమాతిశయాంత శీమ్నే!
నాధాయ నాథమునయే అత్ర పరత్రచాపి
నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం !!

అర్థము – మధుమర్దియైన శ్రీమన్నారాయణుని శ్రీ చరణముల పట్ల అచంచలమైన ప్రేమ, భక్తి కలిగి నిజజ్ఞాన పూర్ణులైన నాథమునులే నాకు యజమాని! వారి దివ్య సన్నిధి ఈ భూలోక మందు మరియు పరమపద మందును నాకు ఆశ్రయము!

మరియు విష్ణుపురాణ సూక్తియగు, “సాధ్యభావే మహా బాహో! సాధనైః కిం ప్రయోజనం?” అనగా – సాధ్య భావం సిద్ధించినపుడు ఇక సాధనములతో ఏమి ప్రయోజనం ? (అంటే దక్కవలసింది దక్కి నపుడు ఇక సాధనాలతో ఏమి ప్రయోజనం?).
కానీ, భట్టర్ అనుగ్రహించిన శ్రీ రంగరాజ స్తవములో ఈ విధముగా తెలిపారు (87వ శ్లోకము – ఉత్తర శతకం)

ఉపాదత్తే సత్తాస్థితి స్వనియమానాద్యైశ్చిదచితౌ
స్వముద్దిశ్య శ్రీమానితి వదతి వాగుపనిషదీ !
ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ
అతస్త్వామ్ శ్రీరంగేశయ! శరణమవ్యాజ్యమభజం !!

అర్థము – ఓ శ్రీ రంగేశ! శ్రీమన్నారాయణుడివై నీవు భూజాతులైన చిత్తులు (బుద్ధి జీవులు ) అచిత్తుల (బుద్ధి రహిత జీవులు) యొక్క సేవలను సృష్టి, స్థితి, నియమములనెడి పరికరముల ద్వారా స్వీకరించెదవని ఉపనిషత్తులు ఘోషించుట చేత చేతనులకు నీవే ఉపాయము మరియు ఉపేయము అనుట అతిశయోక్తి కాదు! అది సత్యము ! అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను!

అన్నందు వలన ఈ ఉపాయోపేయములు రెండు భగవానుడి స్వరూపములు! అయితే ఉపాయము బయటికి ప్రకాశిస్తుంది ఉపేయము అంతర్గతముగా  ఉండును! అయితే ఈ స్వరూపములు భగవానుడి విషయములోనే కదా? అంటే ఆచార్యుని విషయములో కూడా స్వీకరించ వచ్చును ! ఆళవందార్లు శాయించిన, “ఉపాయోపేయ భావేన…. ” అన్న విధముగా ఆచార్యునకు ఉపాయోపేయత్వములు రెండూ స్వరూపములై ఉండును! అందుకనే “అత్ర పరత్రాచాపి…” అని చెప్పబడింది ! మరియు “త్వమేవ..” అనుటలో భావం ఇటువంటి స్వరూపములు ఆచార్యుని యందు “మాత్రమే” ప్రకాశించును అని రూఢి చేసినట్లు ఉన్నది! కనుక చరమపర్వ మందు ఇతర సహాయ సంబంధములను సహించనిదై ఉండును! (అనగా చరమోపాయ నిష్టలో ఆచార్యుడు తప్ప ఇక వేరే ఇతర సహాయములు పనిచేయవు అని అర్థము)! కార్యకాలములో చరమపర్వము (చరమోపాయ నిష్ఠ) అన్నిటి కంటే ఉత్తమమై ఉండును! కనుక చరమపర్వము ప్రథమ పర్వము కన్నా ఏ విధముగా గొప్పదో క్లుప్తముగా చూద్దాం:

  •  భగవానుడు తనను ఆశ్రయించిన భక్తులను తన యొక్క సర్వతంత్ర స్వతంత్రత చేత మోక్షములోనో లేక తిరిగి సంసారములోనో ఉంచును! కనుక భగవానునిని ఆశ్రయించిన భక్తునికి మోక్షము తథ్యమని నమ్మరాదు (ఉడయవర్ల కాలములో సింహాచలంలో పరమ నృసింహ భక్తుడైన కృష్ణమాచార్యుని గాథ ద్వారా తెలియ వచ్చును)! కానీ ఆచార్యుడు తన శిష్యుడు ఏ విధంగానైనా తరించాలని తపనపడి తమ యొక్క నిర్హేతుక కృప చేత భగవానునికి పురుషకారము చేత మోక్షమును ఇప్పించును!
  • భగవానుడు ఆచార్య సంబంధము కలిగిన భక్తుని మాత్రమే స్వీకరించును ! కానీ కృపా పూర్ణుడైన ఆచార్యుడు ఎవరినైనా తన శిష్యునిగా స్వీకరించి భగవంతునితో సంబంధమును కలిగించును!
  • ఆచార్యుడు అజ్ఞాని అయిన తన శిష్యునికి భగవద్విషయమును తానే ఉపదేశించి భగవంతుని సేవించే విధమును నేర్పును కానీ శిష్యుని జ్ఞానార్జనలో ఒంటరిగా విడిచి పెట్టడు! కానీ భగవానుడు జ్ఞానవంతుడై ఆచార్య సంబంధము కలిగిన జీవుని మాత్రమే అనుగ్రహించును!
  • కనుక మోక్షము విషయములో మనలోని సంశయములు దూరం చేసి తనను ఆశ్రయించిన వారికి పరమపదము తథ్యమని ఉపదేశించిన ఉడయవర్ల చరణయుగళాన్ని ఆశ్రయించి మధురకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల కలిగియుండిన “తేవు మత్తఱియేన్…” అనెడి నిస్సంశయ, అన్యధా శరణ నాస్తి అనెడి నిర్దుష్టమైన భక్తి ప్రపత్తులు ఉడయవర్ల సన్నిధిలోనూ కలిగియుండుటలో ఎటువంటి ఆలోచన చేయనక్కరలేదు!

అయితే మనకు ఇంకొక సందేహము కలుగవచ్చు! పూర్వాచార్యులైన ఆచార్యులందిరికినీ ఉడయవర్లే ఉత్తారుకులని చెప్పుకున్నప్పుడు, మరి ఆళవందార్లు నాథమునుల విషయములో ఉపాయత్వమును నిశ్చయించుకున్నదెట్లు? దానికి సమాధానం – నాథమునులే కదా నమ్మాళ్వార్ల వద్ద రహస్యార్థములన్నీయును మరియు స్వప్నార్థములను భవిష్యదాచార్య విగ్రహముతో సహా పొంది తమ అంత్యకాలమందు వాటిని తమ శిష్యులైన ఉయ్యాక్కొండారుకు ఇచ్చి భవిష్యత్తులో అవతరించబోవు ఆళవందార్ల విషయమును వారికి చెప్పి, “ఈశ్వరమునులకు కలుగబోవు కుమారునికి రహస్యార్థములను ఉపదేశించ వలసింది! ” అని తెలిపినందువల్ల వారు అలాగే వేచియుండి తమ కాలమందు ఆళవందార్లు అవతరించక పోవుట చేత తమ శిష్యులైన మణక్కాల్ నంబికి ఆ బాధ్యతను అప్పజెప్పగా మణక్కాల్ నంబి ఆచార్య దివ్యాజ్ఞను అనుసరించి తమ కాలములో అవతరించిన ఆళవందార్లకు రహస్యార్థములను ఉపదేశించి మరియు భవిష్యదాచార్య విగ్రహమును వారికి అనుగ్రహించిరి! దానికి ఆళవందార్లు నాథమునుల వల్లనే కదా తమకు శ్రీ సంప్రదాయ విద్య అబ్బినదని సంతోషించి, “తాము పుట్టక మునుపే గర్భములోనే సంపదను పొందిన రీతిగా విశేష కటాక్షమును పొంది, సంప్రదాయ అర్థములను తెలియ పరచి, భవిష్యదాచార్య విగ్రహమును చూపి ఆ భవిష్యదాచార్యులైన ఉడయవర్లు తమకాలములోనే అవతరించగా వారిని దర్శించే భాగ్యాన్ని కలుగ చేసి సద్వారకముగా స్వప్న దర్శనమును అనుగ్రహించి ఇంత ఉపకారమును ఒనర్చిన నాథమునులకు నేనేమి ప్రత్యుపకారము చేయగలనని” చింతించి ఆళవందార్లు నాథమునుల పట్ల ఉండెడి ప్రత్యుపకార భావము యావదాత్మభావిగా ఉండునని తెలియ పరచ గోరి, “నాథమునులు నిశ్చయించిన విషయము వరకు ఎందుకు, నాకు ఇంత ఉపకారము చేసిన నాథమునులే నాకు సర్వస్వము కదా!”, అని పలికారు ఆళవందార్లు ! అదే దాని భావము! నిజానికి నాథమునుల మనోభావమే ఆళవందార్ల మనోభావము !

అలా ఆళవందార్లు నాథమునుల పట్ల ప్రాప్యమునకు తగిన ఉపాయత్వభావమును పొందుటయే కాక  నమ్మాళ్వార్ల పట్ల కూడా, “సర్వం యదేవ నియమేవ మదన్వయానాం! ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా!!” (స్తోత్ర రత్నం -5), (నా వంశమునకు చెందిన వారి కందరికిని శ్రీ శఠకోపుల పాదద్వయమే సమస్తమో ఆ శ్రీ చరణయుగళాన్నే ఆశ్రయిస్తున్నాను!) అని అందరికి, తమకు ఆళ్వార్ల శ్రీ చరణాలే ఉపాయముగా నిశ్చయించుకున్నట్లు అయినది! అక్కడే “మదీయ శరణం.. ” అన్నందు వలన తామొక్కరినే చెప్పి ఉపాయత్వమును చెప్పుటచే ఆళ్వార్లు తమకు చేసిన ఉపకారమునకు బద్ధులై తత్సమృద్ధి సూచకంగా చెప్పినట్లు స్పష్టమవుచున్నది !!

ఇక తరువాతి వ్యాసములలో ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును నిరూపించే మరి కొన్ని ఐతిహ్యములను చెప్పుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

పూర్వవ్యాసమందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసమందు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును (జీవులను ఉద్ధరించగల ఉత్తమ తత్వము) పూర్వాచార్యులైన పెద్దల అమృత అనుభవముల మూలముగా తెలుసుకొనెదము!

 తిరువాయ్మొళి ప్రవర్తకాచార్యులు – నమ్మాళ్వార్లు, భగవద్రామానుజులు, స్వామి మణవాళ మహాముణులు – ఆళ్వార్ తిరునగరి

భగవద్రామానుజులు తమ అభిమాన శిష్యులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ కు తిరువాయ్మొళి కాలక్షేపము గావిస్తున్న సమయమున “పొలిగ! పొలిగ! (తిరు-5-2-1)” దశకము రాగానే పిళ్ళాన్ హర్షాతిరేకముతో పులికితులై ఉండుట గమనించిన ఉడయవర్లు. “పిళ్ళాన్! ఏమి ఆ వైలక్షణ్యము?” అని ప్రశ్నించగా, వారు, “నమ్మాళ్వార్లు దేవరవారి యొక్క అవతారమును కటాక్షించి కదా ఈ దశకమునందు “కలియుమ్ కెడుమ్ కణ్డుకొణ్మిన్ – కలి నశిస్తుంది చూడండి!”” అని కీర్తించారు! అలాగే మీరు కూడా “దీనికి మేమే నిరూపణము!” అను విధముగా వేంచేసి ఉన్నారు! ఇదంతయు మనసులో తలచుకుని పులకితుడనై ఆళ్వార్లు అనుభవించిన రీతిలో దేవరవారు ఈ జీవులను ఉద్ధరించుటకు సర్వోత్తారకులుగా అవతరించినవారు! అటువంటి జన్మ విశేషము కలిగిన దేవరవారి తిరుముఖ మూలముగా తిరువాయ్మొళికి అర్థము తెలుసుకొను మహద్భాగ్యమును పొందితిని గదా అను విస్మయమొందు చుంటిని!”, అని బదులిచ్చెను. ఉడయవర్లు సంతోషించి పిళ్ళాన్ ను ఆనాటి రాత్రి పేరరుళాళన్ అయిన వరదరాజ స్వామి సన్నిధికి తోడ్కొని పోయి, తమ తిరువడిగళ్లను అతని శిరస్సుపై ఉంచి, “ఇక ఈ పాదములే మీకు రక్ష అని నమ్మండి! రాబోవు కాలమందు మిమ్ములను ఆశ్రయించిన వారికిన్నీ వీటినే రక్షకములుగా చూపించండి! రేపటి నుంచి వరదరాజ స్వామి సన్నిధిలో తిరువాయ్మొళికి విష్ణు పురాణ సాంఖ్యముగా (6000 శ్లోకములు గల విష్ణు పురాణమునకు సామ్యముగా) వ్యాఖ్యానమును రాయండి”, అని ఆదేశించిరి!

ఉడయవర్లు తమ శిష్యులైన కూరత్తాళ్వాన్, ముదలియాణ్డాన్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్ లతో కూడి భగవద్విషయమునకు వ్యాఖ్యాన సహిత కాలక్షేపములు గావిస్తున్న రోజులలో ఎందరో ఆచార్యులు ఉడయవర్లను ఆశ్రయించి శిష్యులయ్యారు ! అలా అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు ఉడయవర్లను ఆశ్రయించిరి! అయితే ఉడయవర్లు వారిని అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల చేత సమాశ్రయణము చేయించిరి! అంతట అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ తమ శిష్యులతో, ” పిచ్చుక కంఠానికి తాటికాయ కట్టినట్టు మీ అందరి బాధ్యత మోయుటకు నాకు శక్తి లేదు! సర్వోత్తారకులైన ఉడయవర్ల శ్రీ చరణాలే మీకూ మాకూ మనందరికీ దిక్కు!!”. అని బోధించెను! ఉడయవర్లు కూడా వారితో, “మీకు మా మూలముగా భగవత్సంబంధము కలిగించలేదని దిగులు పడకండి! మీ అందరి యొక్క ఉత్తారక బాధ్యత మా మీదనే ఉన్నది! మా చరణాలనే నిత్యమూ ధ్యానించండి!” అని చెప్పెను!

ఉడయవర్లు వారి శిష్యులు తిరుమల వెళ్ళి  తిరువేంగడముడైయాన్ అయిన శ్రీనివాసునికి  మంగళశాసనము చేయుటకు వరదరాజ పెరుమాళ్ళ వద్ద అనుమతి పొంది బయలుదేరిరి! నమ్మాళ్వార్లు “విణ్ణోర్ వెర్పు (తిరు-1-8-3) నిత్యసూరులు నివసించు కొండ” అని కీర్తించినట్టు, నిత్యసూరులే నిత్యము వచ్చి స్వామి కైంకర్యము చేసుకునే మహిమాన్వితమైన ఆ తిరుమల పర్వతమును కాలితో తొక్కి అపవిత్రము చేసి కొండను అగౌరవ పరచరాదన్న అభిప్రాయము కలిగి ఉడయవర్లు తిరుపతిలోనే నిలిచిపోయినారు! “తానే తొళుమ్ అతిశయుత్తు నొక్కీయే (తిరు – 6-5-5)- తానే ఆ దిశను చూస్తూ నమస్కరిస్తున్నది” అన్నట్లుగా తిరుమలేశుడు వేంచేసిన దిశవైపు చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోదామని అనుకున్నారు ఉడయవర్లు! అయితే తాము అంతకు ముందే స్వామి కైంకర్యము కొరకు నియమించిన అనంతాళ్వాన్ మరియు తక్కిన శ్రీ వైష్ణవులు, “మీరు కొండ ఎక్కనిచో మేము కూడా ఎక్కము! ఇకపై ఎవరును ఎక్కజాలరు! కనుక దేవరవారు అవశ్యం తిరుమల కొండ ఎక్కవలెను!”, అని ప్రార్థించెను! వారి విన్నపము మన్నించి ఉడయవర్లు, “పాదేనాధ్యారోహతి (ఛాన్దోగ్యోపనిషత్) – ముక్తుడు పాదముతో ఎక్కుతున్నాడు”, శ్రీ వైకుంఠనాధుని ఆజ్ఞతో పాదపీఠం పై కాలుమోపి అధిరోహించినట్లే, తిరుమలేశుని ఆజ్ఞానుసారం ఉడయవర్లు తిరుమల కొండ ఎక్కినారు! “ముడియుడై వానవర్ ముఱై ముఱై ఎదిర్గొళ్ల (తిరు -10-9-5) – కిరీటధారులైన నిత్యసూరులు క్రమానుసారముగా ఎదురు వచ్చి ముక్తుని ఆహ్వానించగా”, అనునట్లు తిరుమలలో స్వామి కైంకర్యపరులైన తిరుమల నంబి శ్రీ వైష్ణవ పరివారముతో పెరుమాళ్ళ తీర్థ ప్రసాదములను గైకొని ఎదురు వచ్చి ఉడయవర్లను ఆహ్వానించెను! ఉడయవర్లు భక్తితో దండం సమర్పించి తీర్థ ప్రసాదములు స్వీకరించి వయో వృద్ధులైన తిరుమల నంబిని ఉద్దేశించి, “మీరు ఇంత శ్రమ తీసుకోవాలా? చిన్నవారు ఎవరూ లేరా? ” అని అడుగగా నంబి, “నాలుగు మాడ వీధులలో ఎంత వెదకినను నాకన్నా చిన్నవాడు ఎవరూ కనపడలేదు! సాక్షాత్ ఆ తిరుమలేశుడే వచ్చి స్వాగతం పలకాలి! సర్వ జీవ ఉద్ధారకులైన మీవంటి మహానుభావుని ఆహ్వానించుటకు నాకు ఏ మాత్రము అర్హత లేదు! అయినా పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి నేను రాక తప్పలేదు”, అని నిగర్వముగా సమాధానమిచ్చెను! వారి యొక్క నిర్మలమైన నిరహంకార మనస్సుకు పులకితులైన ఉడయవర్లు మరి మరి దండం సమర్పిస్తూ సన్నిధిలోకి వేంచేసి పెరుమాళ్ళకు దండం సమర్పించి మంగళాశాసనము చేసి నిలువగా, ఆ ఆనందనిలయవాసుడు పరమానందముతో అర్చకముఖేన ఇట్లనెను, “మేము మీకు మా దక్షిణ గృహమైన శ్రీ రంగములో ఉభయ విభుతి ఐశ్వర్యములను ప్రసాదించి జగత్తును ఉద్ధరించుటకు నియమించితిమి కదా! ఇక ఏమి కొరవ ఉన్నదో చెప్పండి! ప్రసాదించెదము!” !

అంతట ఉడయవర్లు పెరుమాళ్ళకు దండము సమర్పించి,”స్వామి! కిడందదోర్ కిడక్కై (తిరుమాలై-23) – శయనించిన రూపము అద్వితీయము” అనియు, మరియు, “పిరాన్ ఇరుందమై (తిరు-6-5-5) – స్వామి కూర్చున్న అందము” అనియు మరియు, “నిలైయార నిన్ఱార్ (పెరియ తిరు-6-9-8) – నిలుచున్న స్వామి అందము”, అనియు దేవరవారి శయన, ఉపవిశ్య, ఉత్తిష్ట భంగిమలు ఎంతో అందముగా ఉంటాయి! శయన సౌందర్యమును శ్రీ రంగములో అనుగ్రహించితివి! నిలిచి ఉన్న భంగిమలో నీయొక్క సౌందర్యము హస్తిగిరిలో (కాంచీ పురము) అనుభవించితిమి! “అమరర్ మునిక్కణంగళ్ విఱుమ్బుమ్ తిరువేంగడత్తానే! (తిరు – 6-10-10) – దేవతలు, మునులు ఎంతో ఇష్టపడే ఓ తిరుమలేశుడా! “, అనునట్లు, ఈ తిరుమలలో గుణనిష్టులు, నీ యొక్క కైంకర్యపరులకు నీ దర్శనమును అనుగ్రహించెడి సన్నివేశం కనులార వీక్షించవలెనన్న కాంక్షతో వరదరాజ స్వామి వద్ద అనుమతి గొని నీ సన్నిధికి వచ్చితిమి!”, అని భక్తి పూర్వకముగా బదులిచ్చెను! అంతట పెరుమాళ్ళు, “అయితే ఇచటకు రండి” అని తమ వద్దకు పిలిచి తమ శ్రీచరణముల వద్ద శిరస్సు వంచమని, “మా తిరువడిని నిత్యమూ స్మరించి దర్శనాన్ని నిర్వహించండి! ఉభయ విభూతులకున్నూ మీరే అధికారి! మీ అభిమానములో ఒదిగిన వారే మాకు ఆప్తులు! అందరిని మాకు దాసులు అయ్యే రీతిలో సంస్కరించండి! జగత్తును ఉద్ధరింపచేయుట కొరకే మిమ్ములను మేము అవతరింప చేసితిమి! మీతో సంబంధము కలవారికి ఏ కొరతా ఉండదు! “శూళల్ పల పల (తిరు -1-9-2) – చేసిన ఉపాయములు అనేకములు”, అనునట్లు ప్రపన్నుల కొరకు మేము ఎన్ని అవతారాలెత్తి వెదకినను లభించ లేదన్న కొరతతోనే శ్రీ వైకుంఠమునకు వెళ్ళి పోయాము! ఆ కొరతను మీరు తీరుస్తారని విశ్వసిస్తున్నాము! మా నమ్మకమును నిజము చేసి చూపించుము!”, అని తిరుమలేశుడు ఉడయవర్లకు బదులిచ్చెను! ఈ విధముగా తిరుమల పెరుమాళ్ళు కూడా ఉడయవర్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించెను!

అచట నుంచి ఉడయవర్లు వారి శిష్య గణము తిరుక్కురుంగుడి వెళ్ళిరి. అక్కడ వేంచేసి ఉన్న తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళు ఉడయవర్లను సాదరముగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించి వారితో ఇట్లనెను, “”బహూని మే జన్మాని వ్యతీతాని (భగవద్గీత 4-5) – నా జన్మలు అనేకములు గడిచినాయి”, అనునట్లు ఎన్ని జన్మలు లోక కళ్యాణార్థమైన మేము ఎత్తిననూ మాకు మావారని ఎవ్వరూ లభించక, “అసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని, మమ ప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్ (భగవద్గీత 16-20) – దుష్ట యోనులలో ముఢులై ఎన్నో జన్మలు ఎత్తిన జీవులు నన్ను పొందకనే మరింత అధోగతి పాలవుతున్నారు”, అనునట్లు అసురప్రకృతి కలవారై అధోగతి పాలవుతున్నారు! కానీ ఇప్పుడు అదే జనులు మిమ్ములను ఆశ్రయించి తరించుచున్నారు! ఈ విధముగా మీరు వారిని ఆకర్షించుకున్న ఉపాయమేమి? ఆ ఉపాయము మీరు మాకు కూడా చెప్పవలెను!”, అని తిరుక్కురుంగుడి నంబి ఉడయవర్లను అడుగగా ఉడయవర్లు, “దేవరవారు సర్వజ్ఞులు! అయినా మీరు అడిగినారు కనుక చెప్పెదము! అయితే ఆ ఉపాయము తెలుసుకొనుటకు అడగవలసిన విధము కలదు! ఆ విధమున మీరు అడిగినచో ఆ దివ్య రహస్యమును మీకు చెప్పగలము!”, అని బదులివ్వ నంబి తమ మూల స్థానము నుంచి క్రిందకి వచ్చి కింద చిత్రాసనముపై కూర్చుని ఉడయవర్లను తమ సింహాసనముపై కూర్చుండ బెట్టి అందరిని బయటకి పంపించేసి, “ఇప్పుడు అషట్కకర్ణముగా ఉన్నది! అనుగ్రహించ వచ్చును!”, అని అనగా ఉడయవర్లు, “నివేశ్య దక్షిణే స్వస్య వినతాంజలి సంయుతం, మూర్ధ్ని హస్తం వినిక్షిప్య దక్షిణం జ్ఞాన దక్షిణం, సవ్యం తు హృది విన్యస్య కృపయా వీక్షయేత్ గురుః, స్వాచార్యం హృదయే ధ్యాత్వా జప్త్వా గురుపరంపరామ్, ఏవం ప్రపద్య దేవేశం ఆచార్యం కృపయా స్వయం, అధ్యాపయేన్మన్త్ర రత్నం సర్షిచ్ఛన్ధోధి దైవతం – వినయముతో అంజలి చేసిన శిష్యుని తన దక్షిణ దిక్కులో కూర్చొనపెట్టుకుని, అతని తలపై జ్ఞాన దక్షిణమైన కుడి చేతిని ఉంచి, ఎడమ చేతిని తన గుండెపై పెట్టుకుని, గురువు ఆ శిష్యుని కటాక్షించాలి! తన ఆచార్యుని హృదయమందు ధ్యానించి, గురుపరంపరను జపించి, భగవానుని, ఆచార్యుని శరణు వేడి, కృపతో స్వయముగా మంత్రరత్నమును, ఋషి – ఛందస్సు – అధిదేవతల సహితముగా మంత్రమును ఉపదేశించవలెను!”, అనువిధముగా తిరు మంత్రమును మరియు ద్వయ మంత్రమును నంబి యొక్క కుడి శ్రీ కర్ణ మందు ఉడయవర్లు ఉపదేశించిరి!

అంతట ఉపదేశము పొందిన నంబి పరమ సంతోషముతో, “మేము ఒకనాడు బదరికాశ్రమము నందు శిష్యాచార్య రూపేణ తిరు మంత్రమును బహిర్గతము చేసితిమి! అచట మేమే శిష్యునిగా మరియు ఆచార్యునిగా ఉండితిమి! కానీ అన్యుని ఆచార్యునిగా స్వీకరించి మేము శిష్యులమై ఉండి ఉపదేశము పొందుట ఇప్పటివరకు జరుగలేదే అనే పెద్ద కొరతతో ఉంటిమి ఇన్నాళ్ళున్నూ! ఆ కొరత నేడు మీమూలముగా తీరినదే! ఇక ఈనాటి నుంచి మేము కూడా రామానుజుల శిష్యులలో ఒకరిగా ఆవిర్భవించితిమి కదా! ఈ నాటి నుంచి మేము వైష్ణవ నంబి అయినాము! “, అని అనుగ్రహించిరి! అయితే నంబి యొక్క శిష్యత్వము వారి యొక్క స్వాతంత్ర్య గుణము యొక్క పరాకాష్ట అని తాత్పర్యము! అందరికి ఆదిగురువైన ఆ పరమాత్మ (తిరుక్కురుంగుడి నంబి) రామానుజుల వద్ద శిష్యరికము చేయుటలో ఉన్న ప్రభావమును గుర్తించి వారి వద్ద శిష్యరికమునకు ఆశపడుట కేవలం ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును లోకమునకు చాటుట కొరకే కదా!

నడాదూరు అమ్మాళ్  శ్రీ చరణాలను ఆశ్రయించి పన్నెండు మంది శిష్యులు శ్రీ భాష్యమును అధికరించుచున్న కాలమందు, “భక్తి ప్రపత్తులు దుశ్శకములు, స్వరూప విరుద్ధములు, విశ్వాస దుర్లభములు కనుక అవి ఆచరించలేని నిస్సహాయుడైన చేతనునికి ఇక ముక్తి ఏ విధంగా కలుగుతుంది? “, అను సంశయమును శిష్యులు అమ్మాళ్ వద్ద అడుగగా వారు, “ఇవి రెండూ లేని వారికి ఉడయవర్ల శ్రీ చరణములే దిక్కు! అంతకన్నా వేరే దారి లేదు! నేను నమ్మిన సత్యమూ అదే!”, అని బదులిచ్చెను! అమ్మాళ్ చరమదశలో శిష్యులు వద్దకు చేరి తాము తరించుటకు దారేదని అడుగగా వారు, “భక్తి ప్రపత్తులు ఆచరించండి! అవి దుష్కరములుగా తోచినచో రామానుజుల దివ్య చరణయుగళాన్ని పట్టి ఉండండి! అవే మీకు రక్షకములని విశ్వసించండి! ఇక మీ సంతోషమునకు కొరత రాదు!”, అని బదులిచ్చెను! “ప్రయాణకాలే చతురః స్వశిష్యాన్ పదాంతికస్థాన్, వరదో హి వీక్ష్య, భక్తిప్రపత్తీ యది దుష్కరే వో రామానుజార్యమ్ నమతేత్యవాదీత్!! – వరదులనబడే నడాదూరు అమ్మాళ్ తమ ప్రయాణకాల మందు తమ పాదాలను ఆశ్రయించిన శిష్యులను చూచి, “భక్తి ప్రపత్తులు మీకు ఆచరణ సాధ్యములు కాకున్నచో రామానుజులను శరణాగతి చేయండి!”- అని అన్నారు”, అని చెప్పిన అర్థము సుప్రసిద్ధము కదా!!

కారాంజి గ్రామస్థులైన సోమాసియాణ్డాన్ ఉడయవర్లకు అభిమాన శిష్యులు! చాలా రోజులు శ్రీ రంగములో  ఉండి ఆచార్య కైంకర్యము చేసుకొని తమ స్వగ్రామానికి వెళ్ళినారు! అయితే కొన్నాళ్ళకు భార్యాభిమానములో మునిగిన సోమాసియాణ్డాన్ ఆచార్య కైంకర్య విషయమును విస్మయించి ఉడయవర్లను సేవించుటకు శ్రీరంగము వెళ్ళలేదు! సోమాసియాణ్డాన్ తమ స్వగ్రామములో ఉడయవర్లకు ఆలయము కట్టించవలెనని సంకల్పించి విగ్రహము చేయించారు! అయితే విగ్రహము తమకు నచ్చినట్టు రానందున మరియొక శిల్పము చెక్కించవలెనని స్థపతికి చెప్పెను! ఆనాటి రాత్రి సోమాసియాణ్డాన్ కు స్వప్నములో ఉడయవర్లు సేవ సాయించి, “నీవు ఎందుకు నన్ను బాధించి నా విగ్రహము తయారు చేయుచుంటివి? నా పట్ల అభిమానమే ఉత్తారకమని గ్రహించని నీవు నా విగ్రహమునకు ఎట్లు శరణాగతి చేయగలవు?”, అని తెలుపగా ఉలిక్కిపడి లేచిన సోమాసియాణ్డాన్ తాను తప్పు చేయుచున్నట్లు గ్రహించి తమ భార్యను వెంటబెట్టుకుని శ్రీ రంగము వెళ్లి ఉడయవర్ల పాదాలపై బడి చంటి పిల్లవాని వలె విలపించెను! అంతట ఉడయవర్లు కారణమేమని అడుగగా సోమాసియాణ్డాన్ తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి క్షమించమని ప్రార్థన చేసిరి! దానికి ఉడయవర్లు సమాధానమిస్తూ, “నీకున్న స్త్రీ ఆసక్తి ని వదిలించుట కొరకే మేము అటుల స్వప్నమందు దర్శనమిచ్చితిమి! అంతే కానీ నీ మీద మాకు కోపము లేదు! నీవెక్కడ ఉన్ననూ నీ బాధ్యత మాదే కదా!! నీ యొక్క భారములన్నియు మాపై ఉంచి నిర్భయముగా జీవించుము!!”, అని చెప్పినట్లు మన పెరియ వాచ్చాన్ పిళ్ళై గారు అనుగ్రహించిరి!!

కణ్ణియనూర్ ఆచ్చాన్ ధరించిన దుస్తులతోనే కావేరి యందు స్నానమాడి (సాధారణముగా స్నానము ధరించిన దుస్తులతో చేయరాదు! వేరే దుస్తులు ధరించి స్నానమాచరించ వలెను! చర్మ కైంకర్యము లందు, చక్ర స్నాన మందు మరియు సత్య ప్రమాణము చేయు సమయ మందు మాత్రమే ధరించిన దుస్తులతో స్నానము చేయవలెనని శాస్త్రము చెప్పుచున్నది !) పెరియ తిరుమండపమును నందు శ్రీవైష్ణవులందరిని రావించి, శ్రీ శఠకోపము తలపైనుంచుకొని ఇట్లు చెప్పిరి:

సత్యమ్ సత్యమ్ పునస్సత్యమ్ యతిరాజో జగద్గురుః |
స ఏవ సర్వ లోకానామ్ ఉద్ధర్తా నాస్తి సంశయః ||

అర్థము: ఇది సత్యము ! ఇది సత్యము !ఇదే సత్యము ! మన యతిరాజులే జగద్గురువులు!! వారు మాత్రమే సర్వ లోకములను ఉద్ధరించ గలవారు!! ఇది నిస్సంశయము!!

అక్కడ గుమిగూడిన అందరిని ఉద్దేశించి ఆచ్చాన్ ఇట్లు ఘోషించెను, “ప్రపన్న కులమునకు చెందిన అందరు శ్రీ వైష్ణవులకు భగవద్రామానుజులే రక్షకులు! వారి శ్రీ చరణాలు మనకు ఉద్ధారకము! నా మాటను నమ్మండి !”

వచ్చే అధ్యాయములో ఉడయవర్ల ఉత్తారకము గురించి మరిన్ని ఐతిహ్యములు తెలుసుకుందాం!!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల అవతార రహస్యము

పూర్వ వ్యాస మందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసములో భగవద్రామానుజుల వైభవ ప్రశస్తి పెద్దలైన పూర్వాచార్యులు ఏవిధముగా అనుభవించిరో తెలుసుకొనెదము.

కూరత్తాళ్వార్లు చోళ రాజు యొక్క మత ఛాందసమునకు బలి కాబడి చూపు కోల్పోవడమే కాక భగవద్రామానుజుల వియోగము కూడా పొంది ఎంతో కాలము తల్లిని విడిచిన పసిబిడ్డ వలె భగవద్రామానుజుల కొరకు విలపించారు. పిదప భగవద్రామానుజులు తిరిగి శ్రీ రంగమునకు విజయము చేయుట జరిగి చోళరాజు చేత అవస్థ పడ్డ కూరత్తాళ్వార్ల కథ తెలుసుకుని ఎంతో బాధపడిరి. భగవద్రామానుజులు ఒకనాడు కూరత్తాళ్వార్లను పిలిచి,”మీరు కాంచిపురమునకు వెళ్ళి ఆశ్రిత వరదుడైన వరదరాజ పెరుమాళ్ళను మీకు కంటి చూపు ప్రసాదించమని ప్రార్థించండి”, అని ఆజ్ఞాపించిరి. అంతట ఆళ్వాన్ భగవద్రామానుజులు చెప్పినట్టే కాంచి పురమునకు వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళ విషయముగా “వరదరాజ స్తవము” అను స్తోత్రమును చేసి పెరుమాళ్ళను ప్రసన్నము చేసుకొనిరి. (http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-kurathazhwan.html). అది పూర్తి అవగానే ఆళ్వాన్ ఉడయవర్ల వద్దకు వచ్చి దణ్ణము సమర్పించి కాంచీపురంలో జరిగినది ఇట్లు విన్నవించారు, “దేవరవారి ఆజ్ఞననుసరించి వరదరాజ పెరుమాళ్ళ సన్నిధిలో “వరదరాజ స్తవమును” చేసి స్వామికి సమర్పించితిని. అంతట, “పెరువిశుమ్బరుళుమ్ పేరరుళాళర్ ” (పరమపదమును అనుగ్రహించెడి అమితానుగ్రహ వరదులు) అగు వరదరాజ స్వామి వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః ! ఆస్తే విష్ణురచించ్యాత్మా భక్తైర్భాగవతై స్సహ !! (పరమపదమగు వైకుంఠములో జగత్పతి యగు విష్ణువు అచింత్యాత్ముడై అమిత వైభవము కలిగి శ్రీదేవితో, భగవద్భాగవతులతో కలిసి వేంచేసి ఉంటాడు – లింగ పురాణము) అనునట్లు దాసుడికి పరమపదమును అనుగ్రహించిరి. కానీ వారు మాతో, “మేము “వానిలిళవరసు (మేము పరమపదములో యువరాజుము – పెరియాళ్వార్ల దివ్య సూక్తి)” కనుక మా స్వాతంత్ర్యము కూడా పరిమితమే! అందు చేత మీరు వెళ్ళి ఉడయవర్లను ప్రార్థించండి. మాకు సేవ చేయు నిత్యసూరులలో శ్రేష్టులగు భగవద్రామానుజులు అనుమతిస్తే పరమపదమునకు వేంచేయ వచ్చును!!”, అని కృప చేసినారు! కనుక మీరు కరుణించి దాసుని కటాక్షిస్తే దాసుడు ఇక ఈ లీలా విభూతి నుంచి సెలవు తీసుకుంటాడు.” అని విన్నవించిరి.

అంతట భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క తిరువుల్లమును గ్రహించి పరమ సంతోషమును పొంది కూరత్తాళ్వార్ల కుడి చెవిలో ద్వయ మంత్రమును చెప్పి, “నలమందమిల్లదోర్ నాడు పుగువీర్ (అపరిమిత ఆనంద నిలయమగు పరమపదము మీకు కలుగు గాక!)” అని ఆశీర్వదించిరి. ఆళ్వాన్ కూడా, “నాన్ పెట్ఱ పేఱు నాలురానుమ్ పెఱ వేణుమ్ (నేను పొందిన ఉత్తమగతిని నాలురాన్ కూడా పొందవలెను (‘ఈ నాలురాన్ అనేవాడు చోళ రాజుకు నమ్మకస్తుడైన మంత్రిగా ఉండి తన యొక్క విషపూరితమైన మాటలతో రాజును వైష్ణవ ద్వేషిగా మార్చి కూరత్తాళ్వాన్ కు కంటి చూపు పోవుటకు కారణమైనవాడు. కానీ అతను చేసిన తప్పును అజ్ఞాన పూరితముగా భావించి క్షమించి అతనికి కూడా పరమపదము కలుగు నట్లుగా ఆళ్వాన్ ఉడయవర్లను ప్రార్థించారు! ‘) )” అని భగవద్రామానుజులను ప్రార్థించగా వారు, “శ్రీ కృష్ణ పరమాత్మ ఘంటాకర్ణునికి మోక్షమును ఇవ్వగా అతనితో అతని సంబంధీకులందరూ మోక్షము పొందినట్లుగా మీరు పొందిన ఉత్తమ గతి మీ సంబంధీకులకు కూడా కలుగు గాక! ఇందులో సందేహము లేదు సుమా!” అని అనుగ్రహించగా ఆళ్వాన్ సంతోషముగా “కలఙ్గా ప్పెరునగర్ (కలతలేని మహానగరమైన పరమపదము – 3వ తిరు – 5)” ను పొందారు.

పిదప భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క పెద్ద కుమారులైన పరాశర భట్టరుల చేత ఆళ్వాన్ కు అంతిమ సంస్కార తిరువధ్యయనేత్యాది కార్యములను నిర్వహింప చేసిరి. మరుదినము భగవద్రామానుజులు పితృ వియోగము చేత పరమ దుఃఖితులై ఉన్న పరాశర భట్టరులను శ్రీ రంగనాథుని సన్నిధికి గొనిపోయిరి. అంతట పెరుమాళ్ళు భట్టరులతో, “వత్సా! దుఃఖించకుము. ఇకపై నీకు మేమే తండ్రిమి!” అని చెప్పి పుత్ర స్వీకారము చేసుకొనిరి. పిదప పెరుమాళ్ళు భట్టరులతో, “నీవు దేనికీ చింతించ వలసిన పనిలేదు. ఈ లోకములో ఉండగా నీకు ఎటువంటి కొఱత కలుగనీయము! పర లోకములో కూడా నీ సుఖమునకు ఏ లోటూ లేకుండుటకు భగవద్రామానుజుల సంబంధము నీకు ఎటులనూ ఉన్నది! కనుక నిశ్చింతగా ఉండుము!”, అని చెప్పెను.ఈ విధముగా శ్రీ రంగనాథుడు భగవద్రామానుజుల వైభవమును వెల్లిబుచ్చెను.

ఉడయవర్లు తమ శిష్యులను తోడ్కొని దివ్య దేశ యాత్ర చేయుచు ఆళ్వార్ తిరు నగరి దివ్య దేశము చేరినారు. అచ్చట వేంచేసి ఉన్న తిరుక్కురుగూర్ నంబి పెరుమాళ్ళను, మరియు నమ్మాళ్వార్లను సేవించి “కణ్ణినుణ్ శిఱుఱ్ఱాంబు” అను దివ్య ప్రబంధమును మధురముగా అనుసంధానము చేయగా నమ్మాళ్వార్లు ప్రసన్నులయి అర్చక ముఖేన ఉడయవర్లకు అరుళప్పాడు (సన్నిధిలోనికి గౌరవ ఆహ్వానము) పలికిరి. ఆళ్వార్లు ఉడయవర్లను తమ శ్రీ చరణాల వద్ద శిరస్సున ఉంచమని చెప్పి, సకల శ్రీ వైష్ణవులను మరియు సన్నిధి పరిచారిక గణమును పిలిచి, “మా యందు ప్రేమతో భక్తితో మెలగి మాతో సంబంధము ఆశించు వారందరునూ మాకు పాదుకల వంటి వారైన మా రామానుజులను ఆశ్రయించండి! రామానుజులను ఆశ్రయించినచో మమ్ములను ఆశ్రయించి నట్టే అగును! రామానుజులనే ఉత్తారకులుగా భావించి ఉజ్జీవించండి!” అని శాయించెను. ఆనాటి నుండి నమ్మాళ్వార్ల శ్రీ శఠకోపమునకు “ఇరామానుశన్” అని సార్ధక నామధేయము సిద్ధించినది! తత్పూర్వము నమ్మాళ్వార్ల శ్రీ శఠకోపమునకు “శఠకోపపదద్వయం లేదా మధురకవులు” అని తిరు నామము ఉండేది. అందుకనే తిరువరంగత్త ముదనార్లు “మాఱన్ అడిపనిందుయందవన్ – మాఱన్ (నమ్మాళ్వార్ల) యొక్క తిరువడిని ఆశ్రయించి ఉజ్జీవించినవారు” అని ‘ఇరామానుశ నూఱ్ఱందాది’ అను దివ్య ప్రబంధములో ఉడయవర్లను ఉద్దేశించి శాయించినారు.

వైకుంఠ ఏకాదశి రోజు ఆళ్వార్ తిరునగరి దివ్య దేశము నందు నమ్మాళ్వార్లు శయన తిరుకోల మందు (భంగిమలో) వేంచేయగా వారి శ్రీ చరణాల వద్ద ఉడయవర్లు నాచ్చియార్ తిరుకోల మందు వేంచేసి ఉన్న దివ్య విశేషము.

మధుర కవులు సర్వజ్ఞులు అగుట చేత నమ్మాళ్వార్ల శ్రీ చరణాలను “మేవినేన్ అవన్ పొన్నడి – అతని బంగారు శ్రీ చరణాలనే ఆశ్రయించితిని” అని కీర్తించారు. అయితే ఇచ్చట ఒక్క విషయము విశ్లేషించదగినది. శుద్ధ వైరాగ్య చిత్తులు పరాభక్తి తత్పరులైన మధుర కవులు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల శ్రీ చరణాలను “తామరై అడి – పాదపద్మములు” అని గాక “పొన్నడి – బంగారు పాదములు” అని ఎందుకు కీర్తించ వలసి వచ్చింది? బంగారము సకల ద్రవ్యముల కంటెనూ ఉత్కృష్టమైనది, అందఱును పరమ ప్రీతితో ఆశపడునది, ఫల ప్రదమగునది, సర్వ కాలములందు లభ్యమగునది, వ్యక్తి తారతమ్యములను చూడక అందరి వద్ద ఉండునది, తన పట్ల రుచి కలిగిన వారందరి వద్ద ఉండునది, ఆడ – మగ అను వ్యత్యాస మెఱుంగక ఆందరి చేతా వెంబడించబడునది, చేతబడితే రక్షించు కోవలెననిపించునది, చేజారితే ప్రాణ హానికి హేతువగునది. ఇలా బంగారమునకు ఉన్న ఈ లక్షణములను ఉడయవర్లలోనూ మనము దర్శించవచ్చును. అనగా,

  1.  ఉడయవర్లు తాము “కారుణ్యాత్ గురుషూత్తమో యతీపతిః – కారుణ్యము చేత గురువులలోకెల్లా ఉత్తములు ఉడయవర్లు” అని కదా కీర్తించ బడినారు.
  2. డెబ్భై నాలుగు సింహాసనాధి పతుల చేత కోరి కైంకర్యం చేయబడినవారు.
  3. మోక్షమనే ప్రతి ఫలాన్ని ఇచ్చేవారు.
  4. తరతమ బేధమెరుగక రహస్యార్థములను అందరికిన్నీ అనుగ్రహించినవారు.
  5. అనంతమైన శ్రీ వైష్ణవ భక్త గుణములలో తామూ మమేకమై భక్తి, నిష్ఠలను మరియు శ్రియఃపతిపై ప్రేమను వారిలో పెంపొందింప చేసినవారు.
  6. క్రిమికంఠుని వల్ల క్లేశమెదురై నప్పుడు ముదలి యాణ్డాన్ మొదలగు శిష్యుల చేత రక్షించ బడినవారు.
  7. వారి ఎడబాటును తాళలేక ఎంతో మంది భక్తాగ్రేసరులు ప్రాణాలు సైతం విడిచేటట్లు వేంచేసి ఉన్నవారు.

ఉడయవర్లలో ఇటువంటి సద్గుణములు ఉండి బంగారము యొక్క లక్షణములతో సామ్యమేర్పడుట వలన శ్రీ మధుర కవులు ఒక మర్మమైన దివ్య దృష్టి చేతనే నమ్మాళ్వార్ల తిరువడిని “పొన్నడి” అని కీర్తించడం ఎంతో ఉచితముగా తోచుచున్నది.

ఉడయవర్లు పరమపదమునకు వేంచేయు సమయమున వారి వియోగమును తాళలేక ఎంతో మంది భక్తాగ్రేసరులు ప్రాణాలు విడిచారు. ఉడయవర్ల శిష్యులైన కణ్ణియనూర్ శిరియాచ్చాన్ ఉడయవర్లను విడిచి తమ సొంత ఊరిలో ఉన్నారు. ఒకనాడు తమ ఆచార్యులను సేవించవలెనని ఆశపడి హుటాహుటీన శ్రీ రంగం వేంచేయగా ఆలయంలో ఎదో ఉత్సవం జరుగునట్లు జనం గుమిగూడి అందరునూ విషణ్ణ వదనులై ఉండుట గమినించిన శిరియాచ్చాన్ సన్నిధి నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూచి తమ ఆచార్యులైన ఉడయవర్లు కుశలమే కదా అని అడుగగా ఆ వ్యక్తి బహు దుఃఖముతో ఉడయవర్లు తిరునాడు అలంకరించారని తెలుపగా, గుండె పగిలినవారై శిరియాచ్చాన్, “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడి కక్కడే ప్రాణాలను విడిచెను.

“కొమాండూర్ ఇళయవిల్లి ” అను మరొక శిష్యులు తిరుప్పేరూర్ లో వేంచేసి ఉండగా ఒకనాడు స్వప్నములో ఉడయవర్లు కోటి సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు నిరవధిక తేజోరూపులై దివ్య విమాన మెక్కి ఆకాశ వీధిలో పోవుచుండగా పరమపదము నుంచి పరమపద నాథుడు అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరి గణములతో, ఆళ్వార్లు నాథమునులు మొదలగు నిత్య ముక్తులతో శంఖ భేరికాగళా మొదలగు వాద్య విశేషములతో ఎదురొచ్చి ఉడయవర్లను స్వయముగా పరమపదమునకు వేంచేపు చేసుకొని పోవుచున్నట్టు కల గని ఉలికి పాటుతో మేల్కొని తమ పక్క ఇంటి వారైన వళ్ళల్ మణివణ్ణన్ ను పిలిచి తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి ఇక తానూ ఈ ఇహ జీవనము భరించలేనని “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడికక్కడే ప్రాణాలను విడిచెను.

ఈ విధముగా ఉడయవర్ల యొక్క ఎడబాటు భరించలేక ప్రాణాలను విడిచిన భక్తాగ్రేసరులు ఎందరో కలరు. ఈ విషయము ఉడయవర్లకు ముందుగానే తెలియుట చేత తాము పరమపదించిన పిదప ఎవరూ ప్రాణ త్యాగము చేయరాదని తమ ఆశ్రమములో శిష్య గణమునకు, ఆంతరంగిక పరిచారకులు, అనంత శ్రీవైష్ణవ ఆచార్య గణమునకు వారు ముందుగానే హెచ్చరిక చేసి పరమపదించి నందు వలన ఉడయవర్ల తరువాత సంప్రదాయ బాధ్యతలు వహించుట దైవాజ్ఞ కనుక ఉడయవర్ల అనుంగ శిష్యులు కొందఱు మాత్రం ఆ విశ్లేషార్తిని భరించి ఉన్నారు. ఈ విధంగా ఉడయవర్ల వైభవ ప్రభావము అంత విలక్షణమైనది!

ఇక వచ్చే అధ్యాయములో భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వ ప్రభావమును పెద్దలైన పూర్వాచార్యులు ఎలా దర్శించారో చూద్దాము

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-glories.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల అవతార రహస్యము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట

పూర్వ వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/02/14/charamopaya-nirnayam-ramanujars-acharyas/) ఆళవందార్ల యొక్క శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వము నిరూపించిన విధమును చూచితిమి. ఈ వ్యాసములో ఇంకనూ విపులముగా భగవద్రామానుజుల ఉత్తారకత్వమును మరి కొన్ని దివ్యానుభావాల ద్వారా తెలుసుకొందాం!

ద్వాపర యుగమందు కృష్ణావతారము ధరించి భువికి వేంచేసిన శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుడు అర్జునుని పట్ల అవ్యాజమైన అభిమానము చేత తన విషయమైన చరమ శ్లోకమును (‘సర్వధర్మాన్ …. మా శుచ!!’) అనుగ్రహించి తానే ప్రథమోపాయముగా నిశ్చయించిన విధముగా భగవద్రామానుజులు కూడా ఈ కలియుగ మందు జనులు గుర్తించ వలసిన చరమోపాయము తామే యని నిశ్చయించిన సందర్భము ఒకటి ఉన్నది. అది ఉడయవర్లు తిరునారాయణ పురమందు వేంచేసి ఉన్న కాలమందు జరిగినది. ఒకనాడు ముదలియాణ్డాన్ (దాశరథి) “యాదవగిరి మహాత్మ్యము” ను పారాయణ చేయుచుండగా ఒక శ్లోకము తటస్థించినది.

“అనంతశ్చ ప్రథమమ్ రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్ !
బలభద్రః తృతీయస్తు, కలౌ కశ్చిత్ భవిష్యతి !! ”

అర్థము – ప్రథమ రూపమున అనంతుడై ఉండి పిదప లక్ష్మణ స్వామిగా అవతరించెను. పిదప బలభద్రునిగా అవతరించెను. ఈ కలియుగమున కూడా అవతరించి ఉన్నారు.

ఈ శ్లోకము వచ్చినంతనే పారాయణ ఆగినది. అక్కడ ఉన్న శిష్యులు, పండితులు ఆ శ్లోకములో చెప్పబడి నట్టుగా కలియుగమున అనంతుడు ఎవరి రూపములో అవతరించెను ? అని ముదలి యాణ్డాన్ని ప్రశ్నించెను. అంతట ముదలి యాణ్డాన్ పరమ భక్తి పూర్వకముగా భగవద్రామానుజుల వంక చూచి “ఉడయవర్లే చెప్పాలి!” అనెను. అంతట ఉడయవర్లు ముదలి యాణ్డాన్ మాటను అపేక్షించి “ఆళ్వార్లను ఉద్దేశించి ఋషి చెప్పి ఉంటారు. ” అని బదులిచ్చెను. అయితే ఉడయవర్ల బదులుకు గోష్టి సంతృప్తి చెందక, “మాపై దయుంచి ఇం కొంచెం విపులీకరించ వలసింది! ” అని ఉడయవర్లను వేడుకొనెను. అపుడు ఉడయవర్లు, “ముందు పారాయణము పూర్తి అవ్వనివ్వండి. ఇంకొకమారు చెప్పెదము”, అని విషయము గంభీరముగా దాటవేసెను. ఆనాటి రాత్రి ఉడయవర్ల శిష్యులైన ముదలి యాణ్డాన్, ఎంబార్, తిరునారాయణపురత్తరయర్ , మారుతియాణ్డాన్, ఉక్కలమ్మాళ్ ముదలగువారు ఉడయవర్లను సమీపించి ఆ శ్లోకమునకు అర్థమును తెలియపరచ వలసిందని ప్రార్థించగా, ఉడయవర్లు.”దాని రహస్యార్థమును మీకు తెలియపరచ వలెననిన ఒక షరతు! దీనిని ఎట్టి పరిస్థితులలోనూ ఇంకెవ్వరికీ చెప్పరాదు సుమా! ఋషి ఆ శ్లోకములో చెప్పిన భవిష్యదాచార్యులు మేమే!! మమ్ము ఆశ్రయించుటయే చరమోపాయము. అనంతుని యొక్క దివ్యాంశగా ఈ కలియుగమున జనోద్ధరణకై అవతరించితిమి”, అని బదులిచ్చి వారిని అనుగ్రహించెను. ఈ విషయము పరమ రహస్యముగా ఉన్ననూ బయటకు రాక తప్పలేదు.

ఒకనాడు తిరుమాలిరుంజోలై అళగర్ సన్నిధిలో అధ్యయనోత్సవము జరుగు చుండగా, పెరుమాళ్ళు గోష్టిని ఉద్దేశించి, “నమ్మిరామానుశముడైయార్కు అరుళప్పాడు”- అర్థము: మా రామానుజుల యొక్క శిష్యులను ఆహ్వానిస్తున్నాము, అనెను. అంతట, అందరు శ్రీ వైష్ణవులు, “నాయన్దే!” (నేను నీ దాసుడను), అని ముందుకు వచ్చెను.

శ్రీమన్నారాయణుని మరియు ఆదిశేషుని అవతార పరంపర

కానీ కొందరు మహాపూర్ణుల శిష్యులు మాత్రం లేచి ముందుకు రాలేదు. అప్పుడు అళగర్ పెరుమాళ్ళు వారు రాకపోవుటకు కారణమేమని ప్రశ్నించగా వారు, “దేవరవారు భగవద్రామానుజుల శిష్యులను మాత్రం ఆహ్వానించియున్నారు. భగవద్రామానుజులు మా ఆచార్యులు పెరియ నంబిగారి శిష్యులగుట చేత మేము రాలేదు”, అని బదులిచ్చెను. అప్పుడు పెరుమాళ్ళు వారికి ఈ విధముగా సమాధానమిచ్చెను, “ఎమ్బెరుమానార్ల వారికి మహాపూర్ణులు ఆచార్యులు! అదెట్లనగా మాకు రామావతారములో దశరథునివలె అలాగే కృష్ణ వతారములో వసుదేవుని వలె మేము వారలకు కుమారునిగా జన్మించిననూ మా అవతార కార్యములో వారి పాత్ర నామమాత్రమే! అటులనే ఎమ్బెరుమానార్లు కేవలం సకల జీవోద్ధరణే ప్రథమ కారణముగా అవతరించియున్నారు. సర్వ జీవులు వారిని ఆశ్రయించియే ఉజ్జీవించగలరు. మీరు ఈ నిజమును గుర్తించుము! “.పిమ్మట అళాగర్ పెరుమాళ్ళు ఉడయవర్ల ప్రియ శిష్యులైన కిడంబి ఆచ్చాన్ ను ఆహ్వానించి ఒక పాశురము మధురముగా ఆలపించమని ఆజ్ఞాపించెను. అంతట పరమ వినయశీలులైన ఆచ్చాన్ లేచి నిలబడి ఆళవన్దార్ స్తోత్రమందలి “న ధర్మ నిష్టోస్మి న చ ఆత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిన్దే ! అకించనోऽనన్య గతిశ్శరణ్యః త్వత్పాదపద్మమ్ శరణం ప్రపద్యే !! ”  అను శ్లోకమును శ్రావ్యముగా ఆలపించెను.

అర్థము – ‘ఓ స్వామి! నేను ధర్మనిష్టుడను కాను! ఆత్మా జ్ఞానిని కాను! నిను ఆశ్రయించుటకు ఏ విధమూ తెలియనివాడను. ఓ సర్వజీవులకు శరణ్యమైనవాడా! ఇదే నీ చరణారవిన్దములను ఆశ్రయించుచున్నాను’,

అంతట అళగర్ పెరుమాళ్ళు, “ఆచ్చాన్! అదేమి ఇలా అంటున్నారు. సకల జీవోజ్జీవకులైన ఉడయవర్లను ఆశ్రయించినాక ఇక ఉజ్జీవనకై భయమేల? మీరు ఒక గొప్ప ఆచార్యుని ఆశ్రయములో జీవించుచున్నారు. మీరు ఇలా అనుట పాడి కాదు”, అని బదులిచ్చిరి.

కాంచిపురములో ఒక బ్రాహ్మణుడికి కలిగిన కుమారుడు ఆరేళ్ళ వయస్సు వచ్చిననూ ఇంకా మాటలు రాక ఉండెను. ఆ బాలుడు రెండు సంవత్సరాలు కనపడ కుండా ఎక్కడికో పోయి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన ఆ బాలుడు మంచి ముఖవర్చస్సు కలిగి మృదు మధురముగా మాటలాడు చుండెను. ఇంతకాలము ఎక్కడికి వెళ్ళావని అందరూ ఆ బాలుని ప్రశ్నించగా, “నేను క్షీరాబ్దికి వెళ్లి పెరుమాళ్ళను సేవించాను. అక్కడి జనులందరూ ఇలా మాట్లాడుకొను చున్నారు. పెరుమాళ్ళ సేనాపతి విశ్వక్సేనులవారు ఈ కలియుగములో జనులను ఉద్ధరించుటకు ఇళయాళ్వారుగా అవతరించెను.!”, అని చెప్పి ఆ బాలుడు అందరూ చూస్తూండగానే అంతర్ధానమయ్యెను. ఈ విధముగా క్షీరాబ్ది నాధుడైన భగవంతుడు ఆ బాలకుని మూలముగా ఉడయవర్ల జన్మ కారణత్వమును తెలియపరచెను.

ఇళయాళ్వారు యాదవ ప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రములను అభ్యసిస్తున్న రోజులలో ఒకనాడు ఆ దేశపు రాజు యొక్క కూతురికి బ్రహ్మ రాక్షస్సు (పూర్వ జన్మ యందు ఈ బ్రహ్మ రాక్షస్సు ఒక బ్రాహ్మణుడై ఉండి వేద, ధర్మ శాస్త్రార్థములకు వక్ర భాష్యములు చెప్పి ఆదాయమును గడించుట వలన అతనికి మరు జన్మయందు బ్రహ్మరాక్షస్సు గతి పట్టెను!) పట్టి తాను యువరాణిని విడిచిపెట్టవలెనన్న ఇళయాళ్వారు వచ్చి తమ పాదములతో తన శిరస్సును తాకి తనకు మోక్షము ఇప్పించవలెనని చెప్పెను. చిన్న పిల్లవాడైన ఇళయాళ్వారు వలన పిశాచి పీడ తొలగించటం ఏమవుతుందని భ్రమించిన యాదవ ప్రకాశులు తామే స్వయముగా రాజు ఆస్థానమునకు వెళ్లి ఎన్నో పిశాచ విమోచన మంత్రములు జపించి  ప్రయత్నించి విఫలమయ్యెను. ఆ బ్రహ్మ రాక్షస్సు, “ఓరి వెర్రివాడా! నీవా నన్ను విడిపించునది? అది నీ వల్ల సాధ్యపడదు! పోయి నీ శిష్యుడు ఇళయాళ్వారుని పంపించుము ! అతను ఎవరో కాదు! శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని యొక్క నిత్య సూరులైన గరుడ విశ్వక్సేనాదులకు నాయకుడైన ఆదిశేషుడే మానవ రూపములో ఈ కలియుగములో జీవులను ఉద్ధరించుటకు అవతరించెను. అతడే నన్ను తరింపచేసి నాకు మోక్షము ప్రసాదించగలడు. మూర్ఖుడా! నీకును అతడే దిక్కు ! వెళ్లి అతనినే ఆశ్రయించుము ” అని యాదవప్రకాశులను హేళనగా మాట్లాడి ధిక్కరించెను. పిదప ఇళయాళ్వారు తమ పాదములను యువరాణి తలకు తాకించగా ఆ బ్రహ్మరాక్షస్సు యువరాణిని విడిచిపెట్టి సభలో అందరు చూస్తుండగా ఇళయాళ్వారుకు నమస్కరించి మోక్షమును పొందెను. ఈ విధముగా చిన్న వయస్సులోనే భగవద్రామానుజుల అవతార విశేషము జగద్విఖ్యాతమయ్యెను.

ఉడయవర్లు తాము రాసిన శ్రీ భాష్యమును దేశమంతటా ప్రచారము చేయుచు కాశ్మీరులోని శారదా పీఠమును దర్శించెను. ఆనాడు శారదా దేవి ఉడయవర్లను స్వయముగా ఆహ్వానించి వారు రాసిన శ్రీ భాష్యమును విని పరమ సంతోషపడెను. ముఖ్యముగా ఛాన్దోగ్య ఉపనిషత్తులోని “కప్యాసమ్ పుండరీకమేవమక్షిని” అను వాక్యముకు ఉడయవర్లు శాయించిన, “పరమ పురుషుడైన శ్రీ మన్నారాయణుని నేత్రములు నీరు త్రాగి ప్రకాశించుచున్న సూర్యుని యొక్క కిరణాలు పడి వికసించిన ఎర్రకలువ పుష్పపు రేకులవలే యున్నవి” అన్న వ్యాఖ్యానమునకు పులకితురాలైన సరస్వతీదేవి, “ఉడయవరే! మీరు కారణ జన్ములు. మీ యొక్క నిర్హేతుక కృప చేత ఈ చేతనాచేతన జీవరాశిని ఉద్ధరించి ఉజ్జీవింప చేయుటకే అవతరించినవారు! నేడు నా పుణ్య విశేషము చేత నాకు శ్రీ భాష్యము వినిపించి అనుగ్రహించినారు. మీరే “భాష్యకారులు”గా ప్రఖ్యాతి పొందుదురు గాక! ” అని తెలిపెను. ఈ విధముగా శారదాదేవి కూడా ఉడయవర్ల యొక్క అవతార వైశిష్ట్యమును ప్రకటించెను.

ఇక వచ్చే అధ్యాయములో పూర్వాచార్యులైన పెద్దలు భగవద్రామానుజుల వైభవ ప్రశస్తిని అనుభవించి తరించిన విధమును తెలుసుకొనెదము.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-avathAra-rahasyam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ఉత్తారక ఆచార్యులు

పూర్వ వ్యాసములో ముగ్గురు ఉత్తారకాచార్యుల ద్వారా భగవద్రామానుజుల ఉత్తారకత్వము ప్రతిపాదించబడిన విధానమును చూచితిమి. ఇక భగవద్రామనుజుల యొక్క పంచ సదాచార్యులైన మహాపూర్ణేత్యాదులు శ్రీ రామానుజ ఉత్తారకత్వమును స్థిరీకరించిన విధమును వారి వారి దివ్య సూక్తుల ద్వారా తెలుసుకొనెదము.

ఉడయవర్ల పంచ సదాచార్యులు – పెరియ నంబి (మహా పూర్ణులు), తిరుక్కోట్టియూర్ నంబి (గోష్టి పూర్ణులు), పెరియ తిరుమల నంబి, తిరుమలై ఆణ్డాన్, తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్.

వరాహ పురాణములో చెప్పినట్టుగా “చక్రాధి ధారణం పుంసాం పర సంబంధ వేదనం పతి వ్రతా నిమిత్తం హి వలయాది భూషణం” అనగా – పతివ్రతకు వలయాది ఆభరణ ధారణము ఎటుల మంగళకరమో అటులనే చక్రాంకిత ధారణము పురుషులకు శ్రియఃపతితో గల దివ్య సంబంధమునకు సూచకము, మరియు, “ఏవం ప్రపద్యే దేవేశం ఆచార్య కృపయా స్వయం అథ్యాపయేన్మన్త్రరత్నమ్ సర్షి చ్చన్దోధిదైవతమ్”, అనగా – ఆచార్యుడు శిష్యుని పట్ల గల అపార కృప చేత శిష్యునికి మొదట సమాశ్రయణము ద్వారా భగవద్సంబంధము కలిగించి పిదప ఋషి, చందస్సు మరియు అధిష్టాన దేవత కలిగిన మహామంత్రోపదేశము చేస్తాడు. పైన చెప్పిన సూక్తులను అనుసరించి మహా పూర్ణులు మధురాంతకము నందు వేంచేసి ఉన్న ఏరికాత్త రామర్ (ఏరు కాచిన రాముడు) సన్నిధిలోని వకుళ వృక్షము కింద కూర్చుని ఇళయాళ్వారుకు సమాశ్రయణము చేసి తిరుమంత్రము, ద్వయము ఉపదేశించినారు.

మహాపూర్ణులు ఇళయాళ్వారుతో, “మీకు ఆచార్యుని కావలెనన్న కోరికతో మీకు మంత్రోపదేశము చేయలేదు. మా ఆచార్యులైన ఆళవందార్ల ఆజ్ఞానుసారం మేము ఈ కార్యము నిర్వహించితిమి. నమ్మాళ్వార్లు ఆనతిచ్చినట్టు ‘కలియుం కెడుమ్ కణ్డుకొణ్మిన్’ అని, మీరు ఎంతటి మహానుభావులో ఎరిగిన మాకు మీతో ఈ విధముగా సంబంధము కలిగినందుకు మా జన్మ ధన్యమైనది. ‘వెఙ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్ త్తోన్ఱి విణ్ముళుదుమ్ వుయ్యక్కొణ్డవీరన్’, ‘జనకానామ్ కులే కీర్తిమాహరిష్యతి మే సుతా’ అన్న దివ్య సూక్తుల ప్రకారం మీ యొక్క అవతార ప్రభావము చేత ఈ ప్రపన్నకులమే ప్రసిద్ధి పొందబోవుచున్నది”, అని చెప్పెను. ఈ సూక్తులు సంప్రదాయమునకు బహు ముఖ్యముగా పెరియ వాచ్చాన్ పిళ్ళై చేత ఆపాదించబడినది.

భగవద్రామనుజులు పెరియ తిరుమల నంబి వారి తిరుమాళిగలో ఒక పూర్ణ సంవత్సరము వేంచేసి ఉండి ఇతిహాసరాజమైన శ్రీ రామాయమును కాలక్షేపము గావించినారు. ఆ సమయమున, “యస్య రామం నపశ్యేత్తు యఞ్చ రామో నపశ్యతి, నిన్దితః స వసేత్శోకే స్వాత్మాప్యేయమ్ విగర్హతి” (అనగా- ఎవరు రాముని దర్శించరో లేక ఎవరిని రాముడు చూడడో అతనిని పరులే కాక అతని ఆత్మ కూడా శపించును) అన్న శ్లోకము వద్ద భగవద్రామనుజులు, “మరి అటువంటి దౌర్భాగ్య జనులు స్వగత మరియు పరగత స్వీకారమును విడిచి ప్రవర్తించుట చేత తమను తామూ మరియు పరులూ నిందించునట్లు ఉండిన ఇక అటువంటి చేతనులకు ఉత్తారకమేది?” అని తమ ఆచార్యులను ప్రశ్నించగా, “నిత్యసూరులకు నాయకుడగు మీ యొక్క అమోఘమైన అభిమానమే చేతనులకు ఉత్తారకము” అని పెరియ తిరుమల నంబి సెలవిచ్చిరి. పిదప తమ శిష్యుడైన ఎంబార్లను ఉదకపూర్వకముగా ఉడయవర్లకు సమర్పించి పెరియ తిరుమల నంబి ఎంబార్ తో, “ఇక మీరు సదా ఉడయవర్లనే ఆచార్యునిగా స్మరించుకోండి. వారి యొక్క శ్రీ చరణములే చరమోపాయము. వారు సర్వోత్తారకులుగా తిరు అవతరించినారు. మాకు వారితో నేరు సంబంధము లేకపోయిననూ శ్రీ రామాయణ మూలముగా ఒక దివ్య సంబంధము ఏర్పడినది. ఆళవన్దార్లు కూడా వీరిని దర్శించ లేదనే వ్యధతోనే పరమపదస్థులైరి. అటువంటి మహిమాన్వితులగు ఉడయవర్ల సంబంధము కలిగిన మనము నిర్భయులై ఉండవచ్చును. కనుక మీరు వారిని విడువక నీడ వలె వెన్నంటి నిలువుము”, అని ఉపదేశించిరి. అనగా కేవలము నిస్సహాయులగు చేతనుల పట్ల నిర్హేతుక అభిమానము చేత వారిని ఉద్ధరించుటకు అవతరించిన భగవద్రామానుజుల యొక్క శ్రీ చరణములే మనకు రక్షణ అని ఎంబార్ కు పెరియ తిరులమల నంబి ఉపదేశించిన విషయ తాత్పర్యము. ఇదే మన సంప్రదాయము యొక్క మూల సూత్రము.

పిదప ఉడయవర్లు గోష్టిపురమనబడు తిరుక్కోట్టియూరుకు వేంచేసి గోష్టిపూర్ణుల (తిరుక్కోట్టియూర్ నంబి) వద్ద చరమ శ్లోకార్థమును కాలక్షేపము గావించెను. అప్పుడు గోష్టిపుర్ణులు, “ఉడయవరే! మిమ్ములను పద్దెనిమిది మార్లు తిప్పించుకుని ఇంత శ్రమకు గురి చేసినానని తప్పుగా భావించకండి. ఇదంతా మీరు నేర్చుకున్న రహస్యార్థముల యొక్క మహత్తును మీకు తెలియపరుచుట కొరకే! మీరు కారణజన్ములు. నాథమునుల మనస్సులో ఎల్లప్పుడు మీ స్మృతి మెదిలేదట. మీతో దివ్య సంబంధము కలిగి ఉన్నచో ఇక ఉజ్జీవనము గురించి కలత చెందక హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిదురించవచ్చు. మా ఆచార్యులైన ఆళవందార్లు కూడా మీతో సమాగమము కొరకు ఎంతగానో ఆరాట పడినారు. వారి శిష్య బృందములో ఎంతోమంది సుశిక్షితులు, సంప్రదయోద్ధారణ చేయగల సమర్థమైన శిష్యులు ఉన్ననూ మీరే ఆ బాధ్యత వహించవలెనన్న సత్సంకల్పముతో కంచి పేరరుళాళ ప్పెరుమాళ్ళను మిమ్ములను అనుగ్రహించ వలసిందిగా ప్రార్థించినారు. మీతో నాలుగు రోజులైననూ గడుపవలెనని ఆశించి ఆ బెంగతోనే తిరునాడు అలంకరించినారు. అటువంటి సర్వోత్కృష్టులైన మీ యొక్క తిరు నామముతోనే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయము “ఎమ్బెరుమానార్ దరిశనమ్” అని వెలుగొందగలదు” అని ఉడయవర్లకు మంగళాశాసనము చేసినారు.

పిదప ఉడయవర్లకు మరో ఆచార్యులైన తిరుమలై ఆణ్డాన్ గోష్టిపుర్ణుల యొక్క ఆజ్ఞతో ఉడయవర్లకు తిరువాయ్మొళి రహస్యార్థములు ఉపదేశించసాగారు. కాలక్షేపములో ఒక చోట ఉడయవర్లకు, తిరుమలై ఆణ్డాన్ కు మధ్య భావభేదము ఏర్పడుట చేత కాలక్షేపము నిలిచి పోయినది. ఈ విషయము తెలుసుకొన్న గోష్టిపుర్ణులు తిరుమలై ఆణ్డాన్ ను తమ వద్దకు పిలిపించుకుని, “మీరు ఉడయవర్లకు తిరువాయ్మొళి కాలక్షేపము వారికి తెలియదని చెప్తున్నారని అనుకోకండి. శ్రీ కృష్ణుడు సాందీపని మహర్షి వద్ద ఎలా వేదాలు (తనకు అవన్నీ తెలిసిననూ) నేర్చుకున్నాడో ఉడయవర్లు కూడా అట్లే మీ వద్ద తిరువాయ్మొళి రహస్యార్థములను కాలక్షేపము సేవిస్తున్నారు. వారికి ఏ అర్థము తోస్తే అది ఆళవన్దార్లకు తోచినదే అవుతుంది”, అని చెప్పారు. పిదప గోష్టిపూర్ణులు, పెరియ నంబి కూడా కలిసి గోష్టిలో ఉండి కాలక్షేపమును కొనసాగించారు. అప్పుడు, “పొలిగ! పొలిగ!….. కలియుమ్ కెడుమ్”, అన్న పాశురము వద్ద ఉడయవర్ల ముఖములో పరమోత్సాహమును గమనించిన గోష్టి పూర్ణులను ఉడయవర్లు తమను అటుల గమనించుటకు కారణమేమని ప్రశ్నించగా గోష్టిపూర్ణులు, “ఈ పాశురము యొక్క అర్థము మీ యొక్క తిరు అవతార వైభవమే అని మా చేత చెప్పించు కొనుటకే మీరు మమ్ములను ఈ ప్రశ్న వేసినారా? ప్రపన్న కులోద్భవులైన మీరు మావంటి సామాన్య జనులను ఈ సంసార సాగరము నుండి రక్షించి తీరము చేర్చుటకే కదా నిత్య విభూతిని వదిలి ఇచ్చట అవతరించిరి”, అని బదులిచ్చిరి. అది విన్న తిరుమలై ఆణ్డాన్ పరమ సంతోషముతో పులకిత గాత్రులై , “నేడు కదా నా జన్మ ధన్యమైనది. ఉడయవర్లు మా ఆచార్యులు ఆళవందార్ల యొక్క అంశమే. వీరే నన్ను తరింపచేసేది”, అని సెలవిచ్చిరి.

ఉడయవర్లు తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్ వారికి సుశ్రూష చేయుచూ వారి వద్ద చరమోపాయ రహస్యములను (ఆచార్యుడే సర్వస్వమను సత్యమును రూఢీ చేయు రహస్యములు) నేర్చుకోనినారు. అరయర్ స్వామి కూడా ఎంతో ప్రేమతో ఉడయవర్లకు రహస్యములను ఉపదేశిస్తూ, “ఉడయవరే! మా వద్ద చరమోపాయ రహస్యములను మీరు నేర్చుకుంటున్ననూ నిజమునకు ఆ రహస్యములే మీ యొక్క తిరు అవతారముగా మూర్తీభవించినవి. ఈ నమ్మకము మాకు నాథమునుల ద్వారా కలిగినది. కనుక మీరు జగదోద్ధారకులనడంలో ఎట్టి సందేహమూ లేదు”, అని ఉద్ఘాటించారు.

ఈ విధముగా ఆళవందార్ల యొక్క పంచ శిష్య రత్నములైన మహాపూర్ణ, గోష్టిపూర్ణ, మహా శ్రీశైల పూర్ణ, మాలాధర, శ్రీ రంగనాధ అలరులు ఉడయవర్లకు విద్య నేర్పించిననూ ఉడయవర్లే ఉత్తారకాచార్యులుగా పలు సందర్భములలో నిరూపించిరి.

గోష్టిపూర్ణులు తమ కుమార్తెను కూడా ఉడయవర్లనే ఆశ్రయించమని ఆదేశించిరి. ఉడయవర్లు తమ యొక్క నిర్హేతుక కృప చేత ఆమెను అనుగ్రహించి తమ శ్రీ చరణములను చూపి, “ఇక నీకు ఈ శ్రీ చరణములే ఉజ్జీవకము!” అని ఉపదేశించెను. అంతట ఆమె, “మా అయ్యగారైన తిరుక్కోట్టియూర్ నంబి వద్ద దేవరవారి ఉత్తారకత్వము గూర్చి విని మనస్పూర్తిగా మీరే రక్షకులను నమ్మితిని. ఇక వేరే ఎవరిని ఆశ్రయించ గలను? మీ శ్రీ చరణములే నా జీవోద్ధారకములు”, అని బదులిచ్చెను.

కాంచి పూర్ణులు వరదరాజ పెరుమాళ్ళకు (పేరరుళాళన్) చామరము వీచే కైంకర్యము (తిరువాలవట్టము) సమర్పిస్తూ, “స్వామి! ఇళయాళ్వానుకు (రామానుజుల పూర్వాశ్రమ నామధేయము) శాస్త్ర సందేహములు కలవుట. నా వద్దకు వచ్చి చెప్పి మీతో విన్నవించమని చెప్పినాడు”, అని విన్నవించగా పెరుమాళ్ళు, “నమ్బీ! ఆ విషయము మాకు ముందే తెలుసును. అతని సందేహములను మేము తీర్చెదము. జగత్కారణభూతుడనైన నేను సర్వజ్ఞుడను. అయిననూ అవతార నియమమును బట్టి ఆయా అవతారాలలో ఋషులను ఆచార్యులుగా స్వీకరిస్తాను. అలా మేము కృష్ణావతారమందు సాందీపనిముని వద్ద విద్యనభ్యసించినట్లే రామానుజులకు కూడా విద్య నేర్చుటకు ఆచార్యుని అవసరము ఒక నెపము మాత్రమే. అతను స్వతః సకల శాస్త్ర పారంగతుడు. అన్ని ధర్మ రహస్యములు ఎరిగినవాడు. నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుని అంశలో మానవ రూపమున అవతరించినవాడు. ఈ లోకమున జ్ఞాన సౌరభములు వెదజల్లి జీవోద్ధరణ చేయగల జగదాచార్యుడతడు. అతనకి శాస్త్ర సందేహములు కలిగి మీ ద్వారా మమ్మల్ని అడుగుట మాకు బహు ఆశ్చర్యకరముగానున్నది. ” అని సాయించెను.

పేరరుళాళన్ (వరదరాజ పెరుమాళ్ళు) తిరుక్కచ్చి నంబికి వార్తాషట్కమును ఉపదేశించుట

ఇచ్చట ఒక సందేహము కలుగగలదు – ఉడయవర్లు ఆళవన్దార్ల శిష్య పంచకమునకు శిష్యులు. వారు ఆచార్యులై, ఉడయవర్లు శిష్యులై ఉండగా వారు తమ యొక్క చరమోపాయము ‘రామానుజ సంబంధము కలుగుటయే’ అని చెప్పుట ఎట్లు సమంజసము? సామాన్యముగా శిష్యుని చరమోపాయము ఆచార్యుల యొక్క శ్రీ చరణములను ఆశ్రయించుట. కాగా, ఉడయవర్ల విషయములో మాత్రము భిన్నముగా ఆచార్యులే తమ చరమోపాయము శిష్యుడైన ఉడయవర్లతో సంబంధము కలిగియుండుట అని ఉద్ఘాటించినారు.

శ్రీ రామ కృష్ణాది అవతారములలో శ్రియఃపతి విద్య కొరకు మహర్షులైన విశ్వామిత్ర సాన్దీపులను ఆశ్రయించినాడు. శ్రీ రామాయణములో, “కింకరౌ సముపస్స్థితౌ”, “తవాహమ్ దాసభూతోస్మి కిమద్య కరవాణి తే”, అనగా – ఓ విశ్వామిత్ర! మేము మీకు కింకరులమై ఉన్నాము. మీకు దాసభూతుడైన ఉంటిని. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి! అని చెప్పబడి నట్టుగా విశ్వామిత్ర సాన్దీపనులకు శ్రీ రామ కృష్ణులు శిష్యులై విద్యాభ్యాసము చేసిననూ వారి వల్ల లాభపడినది ఆచార్యులే కానీ వారు కాదు. సర్వతంత్ర స్వతంత్రుడు సర్వవిదాత్ముడైన శ్రియఃపతి అవతార నియమము చేత విద్య నేర్చుకున్ననూ ఆ గొప్ప ఆచార్యులకే కానీ స్వామికి కాదు.ఇదే విధముగా ఆళవందార్ల శిష్యపంచకమునకు ఉడయవర్ల సంబంధముతో ఉజ్జీవనము కలిగినది.

శ్రియఃపతి అవతార నియమములో భాగముగా ఋషులకు శిష్యునిగా మారిననూ, అతని శక్తి యుక్తులను ప్రదర్శించు సమయమున ఋషులది కేవలము ప్రేక్షక పాత్ర మాత్రమే. ఎందుకనగా శ్రియఃపతి మాత్రమే జగదోద్ధారకుడని వారికినీ తెలుసును. మహాభారతములో, “విష్ణుర్మనుష రూపేణ చచార వసుధాతలే”, అనగా – విష్ణువు మానవరూపుడై భూమి యందు సంచరించును. విష్ణు పురాణములో, “ఇదానీమపి గోవింద లోకానాం హితకామ్యయా మానుషం వపురాస్థాయ ధ్వారవత్యామ్ హి తిష్ఠసి”, అనగా- ఓ గోవిందుడా! సర్వ లోకముల హితము కొరకు ఇప్పుడు నీవు ద్వారకలో నివసించు చుంటివి. అన్న ప్రమాణముల చేత ఆచార్యునకు శ్రియఃపతికి గల సంబంధమును చెప్పవచ్చును.

ఇదే సూత్రము ఉడయవర్ల విషయములోనూ వర్తించును. “ఆచార్యస్స హరిస్సాక్షాత్ చరరూపీ న సంశయః”, అనగా – ఆచార్యుడు సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమైన శ్రీ మన్నారాయణుని రూపమైన ఆచార్యుడు మన ఎదుట సంచరించుచున్నాడు. “గురురేవ పరంబ్రహ్మం”, అనగా-ఆచార్యుడే పరబ్రహ్మ స్వరూపము.”పీదగవాడై ప్పిరానార్ పిరమగురువాగి వన్దు”, అనగా – పసుపురంగు పట్టు వస్త్రము ధరించి సర్వేశ్వరుడు ఆచార్యుడై వచ్చును. “తిరుమామగళ్ కొళునన్ తానే గురువాగి”, అనగా – జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మికి నాధుడైన శ్రియఃపతి తానే ఆదిగురువగుచున్నాడు. ఈ విధముగా ఎలాగైతే శ్రియఃపతి యందు ఆది గురుత్వము కలదో అదే విధముగా ఉడయవర్ల విషయములో కూడా అట్టి ఆచార్య విశేషము కలదు. ఈ నిగూఢ రహస్యమును ఎరిగిన యామున శిష్య పంచకము కూడా కేవలము అజ్ఞాత జ్ఞాపన ద్వారా తాము ఉడయవర్లకు ఆచార్యులుగా ఉన్నప్పటికిన్నీ నాథమునుల నుండి వచ్చిన సంప్రదాయము యొక్క మూల రహస్యమును(ఉడయవర్లు భవిష్యదాచార్యులని) తెలిసినవారు అగుట చేత ఆత్మోజ్జీవన రూపమగు ఉత్తారకత్వమును ఉడయవర్లకు ఆపాదించి వారునూ సద్గతులు పొందినారు.

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయమును గమనింపవలసి ఉన్నది. ఒక ఆచార్యునికి ఉత్తారకత్వమును ఎట్లు ఆపాదించుట? ఈ సర్వ జగత్తునకు ధర్త, భర్త, త్రాత, హన్త అగువాడు సర్వేశ్వరుడు. ఈ సకల చారచర సృష్టికి తల్లి తండ్రి అయినవాడు అగుట చేత మరి ఉత్తారకత్వమును శ్రియఃపతికే ఆపాదించవలెను కదా? మరి అదెట్లు ఉడయవర్లను ఉత్తారకులుగా మనము చెప్పుకోనుచున్నాము? దీనికి జవాబు – ప్రథమాచార్యుడైన ఆ సర్వేశ్వరునికే ఆచార్యులైన వారు ఉడయవర్లు. దీనిని కొంచెం పరిశీలిద్దాం! ఉడయవర్ల ఉత్తారకత్వము ఎట్లు మిగిలిన ఆచార్యుల కన్నా విశేషమైనది? అసలు ఉత్తారకత్వమనగా నేమి?

ఉత్తారకత్వమనగా  స్వరూప స్వభావములను పోగొట్టుకున్న ఒక వస్తువునకు తిరిగి తన యొక్క స్వరూప స్వభావములు పొందునట్లుగా చేయుట. స్వరుపమగా నిజ తత్వము. స్వభావమనగా విశేష గుణ జాలము. పరమాత్మ యొక్క స్వరూప స్వభావములను పునరావిష్కరించిన ఆచార్యులు ఉడయవర్లు. బాహ్యుల చేత (అనగా వేద శాస్త్రములు ఒప్పుకోని బౌద్ధ, యవనాదులు) మరియు కుదృష్టుల  చేత (వేద శాస్త్రములను ఒప్పుకున్ననూ వాటికి వక్ర,శూన్య భాష్యములు చెప్పిన అద్వైతాదులు) పరమాత్మ యొక్క స్వరూప స్వభావములు అంతరించిపోగా ఉడయవర్లు వేద శాస్త్రములకు సరియైన శ్రీ భాష్యమును చెప్పి ధర్మయుక్తమైన వాదముతో బాహ్య కుదృష్టులను ఓడించి తిరిగి పరబ్రహ్మము యొక్క స్వరూప స్వభావములను ఆవిష్కరించి పరమాత్మను శూన్య తత్వము నుంచి కాపాడి ఉద్దరించారు. కనుకనే ఉడయవర్లు ప్రథమాచార్యుడైన పరమాత్మకే ఆచార్యులై, జగదోద్ధారకులై జగద్గురువులైనారు. ఇంకనూ నారదులవారు శ్రీ కృష్ణుని విషయములో, “గోపాలోయాదవం వంశం స్వయం అభ్యుద్ధరిష్యతి”,(అనగా – గోపాలుడైన శ్రీ కృష్ణుడు స్వయముగా యదువంశమును ఉద్ధరిస్తాడు.) అని చెప్పినట్టుగా ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఉడయవర్ల విషయములో “కలియుం కెడుమ్ కణ్డుకొణ్మిన్” (అనగా – ఒక సిద్ధపురుషుని అవతారము చేత కలిబాధలు తొలగిపోగలవు) అని ఉడయవర్ల విషయములో మంగళాశాసనము చేసినారు. అందుచేతనే ఆళవందార్ల మొదలుకొని ఎందరో దర్శన ప్రవర్తకులు ఉడయవర్ల తిరునామ ప్రభావముతో ఎదిగి జ్ఞానధికులు, డెబ్బైనాలుగు మంది శ్రీ వైష్ణవ సింహాసనాధిపతులైన సన్యాసులు, వేలకొలది ఏకాంతులు, జ్ఞానాధికులైన స్త్రీలు కలిగి ఈ నిరవధిక శ్రీ వైష్ణవ శ్రియము ప్రపన్న తత్వ ప్రచారముతో జ్ఞానసుధను వర్షించుచు రామానుజ దర్శనమని నేటికిన్నీ అలరారుచున్నదంటే ఆ దర్శనప్రవర్తకులైన ఉడయవర్లు ఎంత సత్యవంతులో, శక్తివంతులో తెలుసుకొనవచ్చును.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – ఉత్తారక ఆచార్యులు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< శిరస్సంబంధం (తిరుముడి సంబంధం)

క్రిందటి అధ్యాయములో చెప్పినట్టుగా రెండు విధముల ఆచార్యులు కలరు – ఉత్తారకాచార్యులు తామే శిష్యులను సంసారము నుంచి ఉద్ధరించి పరమపదమునకు చేర్చగలరు, ఉపకారకాచార్యులు తాము శిష్యుల యొక్క ఉద్ధరణ బాధ్యతను వహింపక వారిని ఉత్తారకాచార్యుల దరికి చేర్చి శిష్యోద్ధరణకు ఉపకరించెదరు.

ఈ భూమియందు ఉత్తారకత్వము మూడు విధములుగా ప్రకటింపబడినది – శ్రియఃపతి అగు సర్వేశ్వరుడు అయిన శ్రీ మన్నారాయణుడు (ఎమ్పెరుమాన్), శ్రీ శఠకోపులు (నమ్మాళ్వార్లు) మరియు భగవద్రామానుజులు (ఉడయవర్లు). ఉభయ విభూతులను (నిత్య విభూతి అగు పరమపదము, లీలా విభూతి అగు సంసారము) శాసించగల వారి వద్దనే ఈ ఉత్తారకత్వము ప్రకాశించును. (వేదము భగవానుడైన శ్రియఃపతినే శాసకుడుగా నిర్ధారించగా) శ్రియఃపతి తానే ఉభయ విభూతులకు నాయకునిగా నిర్ధారించుకున్నట్టుగా విష్వక్సేన సంహితలో చెప్పబడినది. అది, “అస్యా మమ చ శేషం హి విభూతిరుభయాత్మికా”, అర్థము- ఉభయ విభూతులు నా యొక్క మరియు పిరాట్టి అగు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆధినములో ఉండును.

నామ్మాళ్వార్లు తిరువాయిమొళి 6. 8. 1 లో “పొన్నులగాళీరో పువనముళుదాళీరో” అని చెప్పిరి. అంటే అర్థము – ఓ పక్షులారా! నా అవస్థను పెరుమాళ్ళకు చేరవేయండి. నేను మిమ్ములను ఈ లీలా విభూతిలోనూ మరియు నిత్య విభూతిలోనూ ఉద్ధరించగలను. ఇక్కడ ఆళ్వార్లు భగవానుని అనుగ్రహము చేత తమను తామే ఉభయ విభూతి నాధులని నిర్ధారించిరి.

పెరియ పెరుమాళ్ళగు శ్రీ రంగనాధుడు భగవద్రామానుజులకు ఉభయ విభూతి నాధత్వమును ప్రసాదించెను. అందుకనే భగవద్రామానుజులు ఉడయవర్లుగా ప్రసిద్ధులైరి. అందుచేత భగవద్రామానుజులకు కూడా ఉత్తారకత్వము ఆపాదించబడినది.

నమ్బెరుమాళ్ళు భగవద్రామానుజులకు “ఉడయవర్” అను నామమును ఇచ్చి ఉభయ విభూతి నాధత్వము ప్రసాదించుట.

ఈ సంసారములో చిక్కి అలమటిస్తున్న జీవులను ఉద్ధరించి, తన వైపు తిప్పు కొనుటకు శ్రియఃపతి నమ్మాళ్వార్లను ఉపకరణముగా చేయ నిశ్చయించి ఈ భూమిపై అవతరింపచేసెను. అయితే నమ్మాళ్వార్లు తమ యొక్క 32 సంవత్సరముల అవతార వ్యవధిలో శ్రియఃపతి యొక్క ఎడబాటును తాళ లేక భక్తి తీవ్రతలో అమితమైన వ్యధతో విలపించిరి. “కూవిక్కొళ్ళుమ్ కాలమ్ ఇన్నుం కురుగాదో! “, అర్థము – నీ ఎడబాటులో కాలము కరుగకున్నదే, “ఎన్నాళ్ యానున్నై ఇని వన్దు కూడువనే!”, అర్థము – ఏనాటికి నిన్ను చేరుకుని నీలో కలిసిపొయెదను. “మంగవొట్టు ఉన్ మామాయై”, అర్థము – నాదేహము యందు నీ ఆపేక్షను విడువుము. (ఎందుకనగా శ్రియఃపతికి  నమ్మాళ్వార్ల జీవ తిరుమేనిపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకనే నమ్మాళ్వార్లు తన తిరుమేనిపై గల ఆపేక్షను విడిచినచో తాను పరమపదము చేరి దివ్య తిరుమేని పొందగలనని శ్రియఃపతికి విన్నవించెను). ఈ విధముగా నమ్మాళ్వార్లు తమ యొక్క ఆర్తిని భగవానుని వద్ద వెల్లిబుచ్చుకుని చివరికి ఈ సంసారమును విడిచి పరమపదమును పొందిరి. అయితే శ్రియఃపతి అభిలషించిన జీవోద్ధరణ కార్యము నమ్మాళ్వార్ల చేత జరగ లేకపోయింది. ఆ దివ్య కార్యము భగవద్రామానుజుల చేత జరుపబడింది. వారు 120 సంవత్సరముల సుదీర్ఘకాలము వేంచేసి ఉండి ప్రపత్తి మార్గమున జీవోద్ధరణను ఒక ఉద్యమము వలె నలుదిశలా వ్యాప్తి చేసిరి.

భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వ ప్రభావము చేత చాలా మంది జనులు శ్రీవైష్ణవులైరి. ఈ విషయమును నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి 5.2.1 లో ప్రస్తావిస్తూ, “కడల్వణ్ణన్ బూదంగళ్ మణ్మేల్ ఇశై పాడియాడి ఎంగుమ్ ఉళి దరక్కణ్డోమ్”, అర్థము – మేము భవిష్యత్తును (కలియుగములో) గాంచితిమి. భగవానుని పట్ల అమితమైన ప్రేమ కలిగి, భగవానుని ఎడబాటుని క్షణమైనా సహింపలేక, భగవానుని వైభవమును నిర్భయముగా నలు దిశలా వ్యాప్తి చేసే పరమ భక్తాగ్రేసరులను మేము గాంచితిమి. ఎంతో మంది జనులు శ్రీ వైష్ణవులగుటకు కేవలము భగవద్రామానుజుల యొక్క ఉత్తరకత్వమే కారణము. ఇక ఆచార్యత్వ విషయములో కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము ఉడయవర్లలో ప్రస్ఫుటముగా కానవచ్చుచున్నది. ఆచార్య పురుషులలో అరుదుగా కనిపించి అపార కరుణ, ఇతరుల కష్టములను తమ కష్టములుగా భావించి బాధపడెడి స్పటిక సదృశ మగు మనస్సు ఇత్యాది విశేష గుణములు జగదాచార్యులగు ఉడయవర్లలో మనము చూడవచ్చును. స్వానువృత్తి ప్రసన్నాచార్యుడగు శ్రీ కృష్ణ పరమాత్ముని అర్జునుడు సమీపించి, “యచ్చ్రేయస్సానిచ్చితమ్ బ్రూహి తన్మే చిష్యస్ తేऽహం చాదిమాం త్వమ్ ప్రపన్నమ్ ” (భ.గీ 2.7) అర్థము – కృష్ణా! నేను నీ భక్తుడిని. నాకు ఏది హితమో ఉపదేశింపుము ఆచరించెదను – అని ప్రార్థించెను. అప్పుడు శ్శ్రీకృష్ణ పరమాత్ముడు, “తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః “, అర్థము – తత్వ దర్శనము చేసిన జ్ఞానుల వద్ద ప్రణిపాతము, సేవ మరియు పరిప్రశ్న చేత జ్ఞానము పొందవలెను – అని ఉపదేశించెను.

కనుక పైన చెప్పిన విషయముల సారము ఏమనగా శ్రియఃపతి ఉత్తారకత్వమును కలిగి ఉన్ననూ స్వాను వృత్తి ప్రసన్నాచార్యుడు అగుట చేత జీవోద్దరణకై సంకల్పించి నమ్మాళ్వార్లను అవతరిమ్పచేసెను. అయితే నమ్మాళ్వార్లు భగవానుని ఎడబాటును తాళలేక తమను వెంటనే పరమపదమునకు గొనిపొమ్మని ప్రార్థించి పిన్న వయస్సులోనే శ్రియఃపతి తిరువడి చేరెను. తరువాత అవతరించిన భగవద్రామానుజులు జీవుల పట్ల అపార కరుణ కలిగినవారై ప్రపత్తి మార్గమున జనులు సులభతరముగా మోక్షమును పొందుటకు విశిష్టాద్వైత సంప్రదాయ బాట వేసి లోకమునకు మహోపకారము చేసిరి. అందుచేత భగవద్రామానుజులను ఉత్తారకాచార్యులు అని పిలుచుట అతిశయోక్తి కాదు.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-uththaraka-acharyas.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం -శిరస్సంబంధం (తిరుముడి సంబంధం)

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< వేడుకోలు (ప్రార్థన)

శ్రీ నాథమునులు నమ్మాళ్వార్ల నుంచి భవిష్యదాచార్య విగ్రహమును స్వీకరించుట

నమ్మాళ్వార్లు నాథమునులకు తిరువాయ్మొళిని అనుగ్రహిస్తూ (నాథమునులు 12000 సార్లు “కణ్ణినుణ్ సిరుత్తాంబినాల్” జపము చేసి నమ్మాళ్వర్లను  ప్రసన్నము చేసుకుని వారి నుంచి అరుళిచ్చెయల్ ను మరియు అష్టాంగ యోగ రహస్యములను తెలుసుకొనిరి.), 5.2.1 నందు, “పొలిగ ! పొలిగ ! ” (అనగా జయము ! జయము !) పాశురము నందు ఉడయవర్ల యొక్క అవతార రహస్యమును ప్రస్తావించి, “కలియుమ్ కెడుం కణ్దు కొణ్మిన్ ” (కలి నశించు గాక !) అని కీర్తించిరి. త్రికాలజ్ఞులైన నమ్మాళ్వార్లు శ్రియఃపతి అనుగ్రహము చేత ఉడయవర్ల అవతారమును ముందుగానే గ్రహించి నాథమునులకు ఇట్లు ఉపదేశించిరి, “భవిష్యత్తులో ప్రపన్నకులములొ ఒక గొప్ప ఆచార్యశ్రేష్టుడు అవతరించబోవుచున్నాడు. ఈ చరాచర జగత్తుకు ఆచార్యుడై ఉద్ధరించగల సమర్థుడు అతడు”. ఈ విషయము విన్న నాథమునులు ఆశ్చర్యభరితులై ఇంక తెలుసుగొనగోరి “పయనన్నాగిలుమ్” పాశురము మధురముగా పాడి నమ్మాళ్వర్లను ఆనందిమ్పచేసి ఇట్లు ప్రార్థించిరి, “ఆళ్వారె ! దేవరవారు సర్వజ్ఞులు. దాసుడి యందు దయుంచి భవిష్యత్తులో అవతరించబోవు ఆ మాహాత్ముని శరీరాకృతి గూర్చి తెలియజేయుడు!” అని కోరిరి. ఆనాటి రాత్రి నాథమునులకు ఒక దివ్యస్వప్నము కలిగెను. అందు నమ్మాళ్వార్లు కాషాయ వస్త్రము ధరించి, ద్వాదశోర్ధ్వ పుండ్రధారులై, త్రిదండము చేత బట్టి, ఆజానుబాహువులతో దివ్య సాముద్రిక లక్షణములు కలిగిన తిరుమేనితో దర్శనమిచ్చిరి. సూర్యుని తేజస్సు వంటి శరీర ఛాయతో, కనులయందు వాత్సల్యము నిండి అనుగ్రహరూపులై సేవ సాయించి నమ్మాళ్వార్లు భవిష్యదాచార్యులు ఇట్లు ఉందురని తెలిపిరి. దీని బట్టి భగవద్రామానుజుల తిరుమేని సాక్షాత్ నమ్మాళ్వర్లేనని తెలియుచున్నది. కలలో దర్శించిన తిరుమేనికి నాథమునులు పరమ సంతోషముతో నమ్మాళ్వార్లను పరిపరి విధముల కీర్తిన్చిరి. నాథమునులేమిటి ఆ పరమ దివ్య తిరుమేని యావత్ ప్రపంచాన్నే ఆకర్షించింది.

తదుపరి నాథమునులు ఈ భవిష్యదాచార్యుని ఎట్లు పూజించవలయునని నమ్మాళ్వార్లను ప్రార్థించగా, నమ్మాళ్వార్లు  ఒక శిల్పికి స్వప్నమునందు సేవ సాయించి భవిష్యదాచార్యుని విగ్రహమును చెక్కవలెనని విగ్రహపు రూపురేఖలు ఎట్లుండవలెనో తెలిపిరి. మరునాడు ఆళ్వార్లు చెప్పిన విధముననే ఆ శిల్పి నిరంతరాయముగా చింత చెట్టు కింద భవిష్యదాచార్యుల విగ్రహమును చెక్కెను. ఆ విగ్రహమునకు నమ్మాళ్వార్లే  స్వయముగా ప్రాణప్రతిష్ట చేసి నాథమునులకు ఆ విగ్రహమును ఇచ్చి, “శ్రీ రామచంద్ర మూర్తికి లక్ష్మణుడు ఎట్లు అనుంగుడో అటులనే ఈ భవిష్యదాచార్యుని మా అనుంగునిగా తలంపుము. మా సంకల్పము చేత ఉద్భవించిన ఈ భవిష్యదాచార్యుని మా యొక్క తిరువడిగా గుర్తింపుము. మా కోరికలను వీరు నెరవేర్చగలరు. మీ వంశములో జన్మించబోవువారు వీరిని నేరుగా కలుసుకొనగలరు. ఈ మహాపురుషుడు మేము అవతరించిన శ్రీ రామ పట్టాభిషేకము నిశ్చయించిన మాసమునకు తదుపరిదైన వైశాఖ మాసములో మా నక్షత్రమైన విశాఖ నుంచి పద్ధెనిమిదవ నక్షత్రములో (ఆరుద్ర, తిరువాదిరై) అవతరించగలడు. మీరు ఈ విగ్రహమును మమ్ము అర్చించిన విధముగానే భక్తి శ్రద్ధలతో అర్చిన్చుడు. ” అని ఆశీర్వదించి కాట్టుమన్నార్ కొయిల్ కి పంపించెను. నమ్మాళ్వార్ల ఉపకార స్మృతికి కృతజ్ఞతగా నాధమునులు ఈ క్రింది శ్లోకముతో ఆళ్వార్లను కీర్తించినారని పెరియ వాచ్చాన్ పిళ్ళై తెలియజేసేవారు.

“యస్స్వభావకాలే కరుణాకరస్సన్ భవిష్యదాచార్య పరస్స్వరూపమ్
సంతర్చయామాస మహానుభావమ్ తమ్ కార్యసూనమ్ శరణం ప్రపద్యే ”

అర్థము: తన యొక్క పరమకారుణికత చేత నా స్వప్నమునందు భవిష్యదాచార్య దర్శనము కలిగించిన కారి పుత్రులైన శఠకోపులను శరణు వేడెదను.

అంతే కాక భవిష్యదాచార్యుని అవతార విషయము ఎవరికీ చెప్పక రహస్యముగా ఉంచబడినదని, కేవలం ఏకాచార్య (ఓరాణ్ వళి) పరంపర ద్వారా నమ్మకస్థులైన శిష్యులకు మాత్రము చెప్పటం జరిగినదని పెరియ వాచ్చాన్ పిళ్ళై తెలిపి ఉన్నారు.

ఆ విధముగా శ్రీ నాథమునులు నమ్మాళ్వార్ల వద్ద నాలాయిర దివ్య ప్రబంధమును నేర్చుకొని వీర నారాయణ పురుము చేరుకొని మన్నార్ పెరుమాళ్ళ వద్ద మృదు మధురముగా ఆ దివ్య ప్రబంధమును పాడి ప్రశంసలు పొందిరి. పిదప తమ గృహుము చేరుకొని తమ మేనళ్ళుళ్ళైన కీళై అగత్థాళ్వాన్ మరియు మేలగత్థాళ్వాన్ లకు జరిగిన విషయమును చెప్పిరి. వారు ఆశ్చర్యపడి ఒక మహానుభావుని (నాథమునులు) సంబంధము పొందినందకు పరమ సంతోషించిరి. శ్రీ నాథమునులు తాము నేర్చిన దివ్యప్రబంధ రహస్యములను తమ శిష్యులు కణ్ణమంగై ఆండాన్ కు వివరించి “పొలిగ! పొలిగ !” అను పాశురము యొక్క అర్థము, తాము స్వప్నములో దర్శించిన భవిష్యదచార్యుని గూర్చి వివరించగా ఆణ్డాన్ పరమ సంతోషముతో, “దేవరవారి సంబంధము చేత దాసుడు కూడా ధన్యుడయ్యాడు” అనిరి. పిదప శ్రీ నాథమునులు ఇదే విషయమును తమ పుత్రులైన ఈశ్వరమునులకు, మరియు ఇతర శిష్యులు పుణ్డరీకాక్షులు, కురుగై కావలప్పన్ కు వివరించిరి. కావలప్పన్ కు అష్టాంగ యోగమును ఉపదేశించిరి. పుణ్డరీకాక్షులకు సంప్రదాయ ప్రచార బాధ్యత అప్పగించిరి. ఈశ్వరమునులకు తమకు భవిష్యత్తులో పుట్టబోయే పుత్రునికి “యమునైత్తు ఉరైవన్ ” అని నామకరణము చేయమని ఆజ్ఞాపించిరి. తమ చివరి దశలో పుణ్డరీకాక్షులను పిలిపించి భవిష్యదాచార్య అవతారము గూర్చి ఎవరి వద్ద చెప్పవలదని ప్రమాణము స్వీకరించి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన భవిష్యదాచార్య విగ్రహమును బహుకరించి, భవిష్యత్తులో అవతరించబోవు “యమునైత్తు ఉరైవన్” కు ఆ విగ్రహమును ఇవ్వవలసినదిగా ఆదేశించి, నాథమునులు “ఆళ్వార్ తిరువడిగళే శరణం! ” అనుచు పరమపదమును పొంది నిత్యముక్తులైరి.

నాథమునుల ఆజ్ఞ ప్రకారం పుణ్డరీకాక్షులు తమ శిష్యులతో శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారం చేయసాగారు. ఒకనాడు పుణ్డరీకాక్షులు శిష్యులైన మణక్కాల్ నంబి, తిరువల్లిక్కేణిప్పాణ్ పెరుమాళ్ అరయర్ “పొలిగ ! పొలిగ !” అను పాశురములో “కలియుం కెడుమ్” పాదము గూర్చి వివరించమని కోరగా పుణ్డరీకాక్షులు వారికి అర్థము చెబుతూ తాము తమ గురువులవద్ద పొందిన దివ్యానుభావాలను వివరించిరి. భవిష్యదచార్యుని అవతారము గురించి విన్న శిష్యులు పరమ సంతోషముతో “వారి దివ్యదర్శన భాగ్యము ఎవరికి కలుగగలదు?” అని ప్రశ్నించిరి. దానికి పుణ్డరీకాక్షులు, “వారు ఎప్పుడు అవతరిస్తారో తెలియదు. వారి అవతారము చేత ప్రపంచము సమస్తము ఉద్ధరించబడగలదు.” అని బదులిచ్చిరి. పుణ్డరీకాక్షులు తమ అవసాన దశలో మణక్కాల్ నంబిని పిలిచి భవిష్యదచార్య అవతారము గూర్చి వివరించి తమకు పిదప శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారము చేయవలసినదిగా తమ ప్రియ శిష్యులైన మణక్కాల్ నంబిని ఆదేశించి, భవిష్యదాచార్య విగ్రహమును ఇచ్చి అనుగ్రహించిరి. త్వరలో అవతరించాబోవు “యమునైత్తు ఉరైవన్” కు ఆ విగ్రహము ఇవ్వవలసినదిగా నంబిని ఆదేశించి తాము కూడా పరమపదమును పొందిరి.

తరువాత కొంత కాలమునకు రామమిశ్రులు, పుణ్డరీకాక్షుల ఆజ్ఞ మేరకు, ప్రభుత్వ బాధ్యతలు నడుపుచున్న యామునులను కలిసి వారిని సంప్రదాయము వైపు ఆకర్షించి, వారిని ఉద్ధరించి శ్రీ రంగమునకు తీసుకొనివచ్చిరి (http://guruparamparai.wordpress.com/2012/08/25/manakkal-nambi/)). రామమిశ్రులు శ్రీ యామునులకు రహస్యార్థములను, భవిష్యదాచార్య అవతరణమును గూర్చి తెలిపి శ్రీ యామునులను సంప్రదాయ ప్రచార బాధ్యతను స్వీకరించమని ఆజ్ఞాపించిరి. శ్రీ రామమిశ్రుల అవసాన కాలము సమీపిస్తుండగా ఒకనాడు నాథమునులు స్వప్నమున సేవ సాయించి, “వెంటనే భవిష్యదాచార్యుని గూర్చి వెతకమని యామునులను ఆజ్ఞాపించుము. మీ వద్ద ఉన్న భవిష్యదాచార్య విగ్రహమును యామునులకు ఇవ్వుము.”, అని పలికిరి. తమ మనుమడైన యామునులు భవిష్యదాచార్యుని దర్శించినచో తమకు కూడా ఆ దర్శన ఫలము దొరుకునని నాథమునులు చెప్పినది స్వప్నమున విని రామమిశ్రులు పరమ సంతోషపడి శ్రీ యామునులను పిలిపించి జరిగిన విషయమును చెప్పెను. శ్రీ యామునులు మొదట తమకు నాథమునుల దర్శనము కాకపోవుటకు చింతిన్చిననూ పిదప తమ ఆచార్యుని ఆజ్ఞను సంతోషముతో స్వీకరించిరి. రామమిశ్రులు శ్రీ యామునులతో , “మీ తాతగారైన నాథమునుల ఆజ్ఞను అనుసరించి భవిష్యదాచార్య విగ్రహమును మీకు ఇస్తున్నాము. దీనిని శ్రద్ధతో కాపాడండి. నాధమునుల ఆజ్ఞ మేరకు భవిష్యదాచార్యుని వెదికి శ్రీరంగము తీసుకువచ్చి వారికి మీ తదుపరి ధర్మ ప్రచార బాధ్యతను అప్పగించండి. రాబోవు ఆచార్యుడు ఈ సమస్త ప్రకృతిని తన నిర్హేతుక కృప చేత ఉద్ధరించగల జగదాచార్యుడు కాగలడు. ఈ రహస్యమును పరమ గోప్యముగా ఉంచవలెను. ” అని చెప్పి ఆశీర్వదించెను.

శ్రీ యామునులు భవిష్యదాచార్య విగ్రహమును రామమిశ్రుల నుంచి పరమ సంతోషముతో స్వీకరించిరి. తమ తదుపరి సంప్రదాయ ప్రచారము చేయగలిగిన ఉత్తమ ఆచార్యుని అవతారము కొరకు వేచి చూడసాగారు. కొన్నాళ్ళకు శ్రీ యామునులకు ఒక శుభవార్త తెలిసింది. కాంచిపురములో “ఇళయాళ్వాన్” అని ఉత్తమ వటువు ఉన్నాడని అతడి వైభవము గూర్చి తోటి శ్రీ వైష్ణవుల ద్వారా తెలుసుకొనిరి. వెంటనే కాంచిపురము వెళ్లి, శ్రీకాంచిపూర్ణుల సహాయముతో శ్రీ కరుమాణిక్క పెరుమాళ్ళ సన్నిధిలో బాలకుడైన “ఇళయాళ్వాన్” ను చూసెను. ఆ వటుడి వైభవము, దివ్య సాముద్రిక లక్షణములు కలిగిన తిరుమేని, ఆ బాలకుని జన్మ నక్షత్రము ఆర్ద్రా అని తెలుసుకొనిరి. భవిష్యదాచార్యుని కనుగొనుటకు పెద్దలు చెప్పిన ఈ మూడు గుర్తులు సరిపోలిఉండుట చేత ఇళయాళ్వానే భవిష్యదాచార్యుడని నిశ్చయించుకొని, “అవును వీరే అగ్రగణ్యులు.” అని రూఢీ చేసిరి.

శ్రీ ఆళవందార్లు కాంచిపురములో “ఇళయాళ్వాన్” ను చూసి ఆశిర్వదించుట

శ్రీ యామునులు తమ చివరి రోజుల్లో గోష్టీ పూర్ణులను పిలిపించి వారికి భవిష్యదాచార్య విగ్రహమును ఇచ్చిరి. గోష్టీ పూర్ణులకు భవిష్యదాచార్య అవతార రహస్యమును తెలిపి ఇళయాళ్వాన్ వెలుగుతున్న దీపము వలె ప్రపన్నకులములో జన్మించి ఈ లోకమును ఉద్ధరించగలడని సమయము వచ్చినపుడు ఇళయాళ్వాన్ కు రహస్యార్థములు ఉపదేశించవలెనని ఆజ్ఞాపించిరి. ఇళయాళ్వాన్ పీఠమును అధిష్టించిన పిదప శ్రీ వైష్ణవ దర్శనము “ఎమ్బెరుమనార్ దర్శనం” లేదా “రామానుజ దర్శనం” అను నామముతో జగద్విఖ్యాతి పొందగలదని శ్రీ యామునులు గోష్టిపుర్ణులకు తెలిపిరి. శ్రీ యామునుల చివరి క్షణములలో తమ శిష్యులు తమకు ఏది దారి యని దుఃఖము పొందగా శ్రీ యామునులు ఈ విధముగా సందేశము నిచ్చిరి, “ఇళయాళ్వాన్ మీకు నా తరువాత ఆచార్యుడు కాగలడు. అతడే మిమ్మల్ని ఉద్ధరించగలడు. ఇళయాళ్వాన్ వైభవము మాకు తెలిసిననూ అతని సహచర్యము పొందలేక చింతించుచు భార హృదయముతో పరమపదమును పొందుచుంటిని.”

ఈ విధముగా భగవద్రామానుజుల మునుపు ఆచార్యులందరూ భగవద్రామానుజులను ఉత్తారాకాచార్యులుగా స్థిరీకరించిరి.

అయితే భగవద్రామానుజుల అవతారమునకు మునుపే పూర్వాచార్యులు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ఒప్పుకొనుట ఎట్లు సంభవం?

దీనికి సమాధానం వరాహ పురాణములోని ఈ క్రింది శ్లోకము చెబుతుంది.

ఆస్పోటయన్తి పితరః ప్రణ్యుత్యన్తి పితామహాః ।
వైష్ణవో నః కులే జాతః స నః సంతరిష్యంతి  ॥

పితరులు ఈ లోకము నందు లేకపోయిననూ తమ కుటుంబము నందు ఒక శ్రీ వైష్ణవుడు పుట్టుట చేత వారునూ ఉద్ధరిమ్పబడగలరు.

నాధమునులు మొదలగు ఆచార్యులు పరమపదము పొందిననూ నిత్యసూరుల నాయకుడగు ఆదిశేషుని అంశలో ఇళయార్వారు ప్రపన్న కులములో జన్మించుట చేత అది వారికి ఉద్ధరణ చేకూర్చినది.

అయితే పితరులు ఈ లోకములో లేకపోతే వారికి వైష్ణవత్వాధికారము ఉండదు. కనుక వారి కడ గమ్యము పరమపదము చేరుకోవడమే, దీనికి ఒక వైష్ణవుడు తమ ఇంట జన్మిస్తే చాలు.

కానీ నాథమునుల వంటి పూర్వాచార్యులు ఉత్తమమైన శ్రీ వైష్ణవులుగా లొకోద్ధరణ చేసి చరమ గమ్యమగు పరమపదమును పొందారు. అందుచేత వారికి ముక్తిని ఇవ్వగల ఉద్ధారకుడు అవసరము లేదు. కానీ, వారు భవిష్యదచార్యుని ఉత్తారకునిగా స్వీకరించారు. అందులో అతిశయోక్తి లేదు. దీనికి వివరణ పెద్దలు ఈవిధముగా ఇచ్చారు: నాథమునులు నమ్మాళ్వార్లను ఆశ్రయించి వారినే తమ ఉత్తారకునిగా స్వీకరించారు. నమ్మాళ్వార్ల దివ్య చరణాలను ఉపాయముగా భావించారు నాథమునులు. అందులో సందేహము లేదు. అయితే, నమ్మాళ్వార్లు భవిష్యదాచార్య అవతార రహస్యమును నాథమునులకు వివరిస్తూ, “భవిష్యత్తులో అవతరించబోవు జగదాచార్యుడు నా తిరువడిగా భావింపుము ఎలాగైతే లక్ష్మణుడు శ్రీ రాముని కుడి బాహువు (రామస్య దక్షిణో బాహు:) అని శ్రీ రామాయణములో వర్ణించినదో అటులను.” అని ఉపదేశించుట చేత నాథమునులు భవిష్యదాచార్యుని సాక్షాత్ తన ఆచార్య తిరువడిగా భావించి ఆరాధించారు. ఇటువంటి గొప్ప భావన నాథమునుల నుంచి పుణ్డరీకాక్షులకు, వారి నుంచి రామమిశ్రులకు, వారి నుంచి శ్రీ యామునులకు పరంపరగా ఉపదేశముగా సంప్రాప్తించింది. శ్రీ యామునుల నుంచి భవిష్యదాచార్య అవతార రహస్యము వారి శిష్యులైన గోష్టిపూర్ణులు, తిరుమలై ఆణ్డాన్, మహా పూర్ణులు, తిరువరంగ పెరుమాళ్ అరయర్ మొదలగు వారికి ఉపదేశముగా వచ్చింది. తిరుమాలై దివ్య ప్రబంధములోని “కణ్డ్  కొణ్మిన్ ” పాశురము మరియు గరుడ పురాణములో “తస్మై ధేయమ్ తతో గ్రాహ్యమ్ ” అను ప్రమాణాలననుసరించి ఉత్తమ భక్తునికి ఉండవలసిన 8 గుణములు 1) భగవంతుని మీద అకారణమైన ప్రేమ కలిగి ఉండుట 2) భగవద్ సేవను సంతృప్తిగా అనుభవించుట 3) శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని మరియు నిత్యానపాయని అయిన లక్ష్మి దేవిని మాత్రమే ఆరాధించుట 4) గర్వము లేకుండుట 5) శ్రియఃపతి భగవద్గుణ వైభవమును ప్రేమతో వినుట 6) శ్రియఃపతి గురించి చెప్పినా, విన్నా, ఆలోచించినా రోమాంఛనము వంటి శరీరానుభవములు కలుగుట 7) ఎల్లప్పుడూ భగవంతుని గురించే ఆలోచించుట 8) భగవంతుని ఆరాధించి తుచ్ఛమైనవైన లౌకిక కోరికలు కోరకుండుట.

ఇటువంటి గొప్ప గుణములు భగవద్రామానుజులు కలిగి ఉండుట చేత శ్రీయామునుల పంచ శిష్యులైన గోష్టిపూర్ణులు మొదలగువారు ఆచార్యుల రూపములో భగవద్రామానుజులతో సంబంధము పొందటమే గాక తమ పిల్లలను కూడా భగవద్రామానుజులకు శిష్యులను చేసి వారికి కూడా భగవద్రామానుజ సంబంధము కలిగించిరి. శ్రియఃపతి అనుగ్రహము చేత ఘంటాకర్ణునితో పాటు  అతని సోదరుడు ముక్తి పొందినట్టు, శ్రీ రాముని విభీషణుడు శరణు జొచ్చినప్పుడు శ్రీ రాముడు అతనితో పాటు అతనితో వచ్చిన నలుగురు రాక్షసులను కూడా అనుగ్రహించి నట్టు, శ్రియఃపతి అనుగ్రహము చేత ప్రహ్లాదాళ్వాన్ తో పాటు అతని వంశమంతా ఉద్ధరింపబడి నట్టు శ్రీ యామునుల శిష్యులైన గోష్టిపూర్ణులు మొదలగు ఆచార్యులు తమ పిల్లలను భగవద్రామానుజుల సంబంధము కలిగించుట చేత తామూ ఉద్ధరింప బడినట్టు భావించారు. సాక్షాత్ భగవంతుడే తనను శరణు పొందిన భక్తులతో పాటు వారి సంబంధీకులను కూడా అనుగ్రహిస్తే, మరి భగవద్రామానుజుల గూర్చి ఏమని చెప్పవలెను. స్వామి కరుణ అమృత సదృశము. వారిని శరణుపొందిన వారితో బాటు వారి సంబంధీకులు కూడా ఉద్ధరింపబడగలరు. శ్రీ యామునుల పంచ శిష్యరత్నాలు భగవద్రామానుజుల ఆచార్యులు అగుటకు నాథమునుల దివ్య వాక్కులే పునాది మరియు భగవద్రానుజుల ఆచార్యులు అగుట చేత భగవద్రామానుజులతో గురుపరంపరకు సంబంధము కలిగించారు ఈ ఐదుగురు ఆచార్యులు.

ఆళవందార్ల ఆజ్ఞ ప్రకారం భగవద్రామానుజుల గురువులైన ఐదుగురు ఆచార్యులు తమ ఆచార్యత్వమును ఉపకారక రూపమున నిర్వహించెను.

ఆచార్యత్వము రెండు విధములు

ఉత్తారక ఆచార్యత్వము – తాముగా శిష్యుని సంసారము నుంచి ఉద్ధరించుట.

ఉపకారక ఆచార్యత్వము – తాము తమ శిష్యునికి తమ ఆచార్య సంబంధము కలిగించి ఉపకారము చేయుట.

ఈ విధముగా వారు భగవద్రామానుజులకు తమ గురుపరంపర ద్వారా నమ్మాళ్వార్ల   శ్రీ చరణ సంబంధము కలిగించారు.

ఒకవేళ వారు ఉత్తారకత్వము వహించినట్లైతే తమ పిల్లలకు తామే సమాశ్రయణములు చేసి తమ శిష్యులుగా చేసుకునేవారు. కానీ వారు అలా చేయక తమ పిల్లలను ఉత్తారకత్వమునకు అధికారము కలిగిన భగవద్రామానుజులకు శరణాగతి చేయించినారు.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-thirumudi.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org