Monthly Archives: February 2019

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 13

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 12

గజేంద్రమోక్షం

                           కిందటి భాగంలో భగవద్రామానుజాచార్యులు అనుగ్రహించిన వివరణ ఈ పాశురములో  కనపడుతుంది.

“మళుంగాద వైనుదియ శక్కరనల్ వలత్తైయాయ్

తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోడ్రినైయే

మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులగిల్

 తొళుంపాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ శోది మరైయాదే  “

                                     సాధు పరిత్రాణం చేయటానికి పరమాత్మా తనే వస్తాడని చెప్పడానికి గజేంద్ర మోక్షమును ఆళ్వార్లు ఉదహరిస్తారు. గజేంద్ర మోక్షము గురించి సామాన్యులకు కూడా తెలిసే ఉంటుంది. ఈ కథ పురాణాలలో కూడా విపులంగా చర్చించబడింది. పలు దివ్యదేశాలలో కూడా ఈ కథను మహా వైభవంగా చిత్ర రూపంలోనూ శిల్ప రూపంలోనూ ప్రదర్సించబడటం కనపడుతుంది .

          

               భగవంతుడి మీద భక్తితో, ఆయనకు తామర పూవును సమర్పించటానికి తామర పూవులు పుష్కలంగా ఉన్న తటాకంలోకి ఒక ఏనుగు దిగింది. అక్కడ ఉన్న ఒక మొసలి ఆ ఏనుగు కాలును నోటితో కొరికి పట్టుకుంది. ఆ ఏనుగు తనకు తానే  మొసలి పట్టును విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది. తన ప్రయత్నం ఫలించక పోవటంతో తానుగా మొసలి పట్టును విడిపించుకోలేనని గ్రహించి, సర్వ కారణుడు, సర్వ నియంత, సర్వ శక్తి వంతుడు అయిన పరమాత్మను, ఆదిమూలమును పిలిచింది. పరమాత్మా దాని పిలిపు విని గరుడ వాహనాన్ని అధిరోహించి వచ్చాడు. అక్కడికి చేరుకోగానే తన చక్రాయుధాన్ని మొసలి మీదికి ప్రయోగించాడు. ఏనుగు గాయాన్ని తన శ్రీహస్తాలతో తడిమి ఆశ్వాస పరచి, అది తొండంతో పట్టుకొని ఉన్న తామర పూవును స్వీకరించాడు.

                  పరమాత్మ తానుగా అక్కడికి రావలసిన అవసరం ఉందా! ఉన్నచోటు నుండే మొసలిని సంహరించ లేడా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన అక్కడికి రాకుండానే ఆ మొసలిని ఏ విధంగా సంహరించ వచ్చో ఒకసారి చూద్దాం .

  1. కూరత్తాళ్వారులు

    కూరత్తాళ్వార్లు,  శ్రీ వైకుంఠస్తవంలో పరమాత్మ లోకాలను తన సంకల్ప మాత్రం చేత సృష్టించి, రక్షించి, సంహరించగల సమర్దుడు అని చెప్పారు కదా! “విశ్వం దియైవ విరచయ నిచాయ భూయః సంజాహృష్టి” అన్నారు. అయినప్పుడు గజేంద్రుడిని సంకల్ప మాత్రంలో ఉన్న చోటు నుండే రక్షించి ఉండవచ్చు.

  2. పెరయాల్వారు

    ఆళ్వార్లు చెప్పినట్లుగా గజేంద్రుడిని మరొక విధంగా కూడా రక్షింవచ్చు. “కరుతమిడం పోరుదుకై  నిన్ర శక్కరత్తన్”. తన సుదర్శన చక్రాన్ని ఆదేశిస్తే చాలు అది మొసలిని సంహరించి ఏనుగును రక్షించి ఉండేది. ఇక్కడ పెరియాళ్వార్లు “కీళులగిల్  అసురర్ గళై కిళంగిరుందు కిళరామే ఆళి విడుత్తు అవరుడయ కరువళిత్తళిప్పాన్” అని చెప్పారు. పరమాత్మ తన చక్రాయుధాన్ని ఆదేశించి, కింద పాతాళ లోకంలో అసంఖ్యాకమైన రాక్షసులను కూకటి వేళ్ళతో తొలగించాడు. ఇక్కడ కూడా ఆయన, తటాకం దగ్గరకు రాగానే తన చక్రాయుధాన్ని ప్రయోగించి మొసలిని సంహరించాడు. ఈ పని పరమపదంలో ఉండే చేయవచ్చు కదా!

 

పై ఉదాహరణలను చూడగా సుదర్శన చక్రం పరమాత్మ రక్షకత్వ శక్తి అని తెలుస్తున్నది.

‘”వాణీ పౌరాహిణీ యం కతయతి మహితం ప్రేక్షణం కైటభారే (సుదర్శనుడి రక్షకత్వ శక్తిని సంకల్పం అని పురాణాలు గొషిస్తున్నాయి) అని సుదర్శన శతకం చెపుతున్నది.

అర్థాత్ గజేంద్ర రక్షణం, మకర సంహరణం  రెండూ ఆయన ప్రత్యక్షంగా రాకుండానే చేయగల శక్తిమంతుడు స్వామి అని తెలుస్తున్నది.

                         ఆళ్వార్లు ఈ విషయాన్నే చెపుతున్నారు. “మళుంగాద వైనుదియ శక్కరనల్ వలత్తైయాయ్” అంటే పరమాత్మ పరమపదంలో ఉండి సుదర్శన చక్రాన్ని ఆదేశించి ఉండవచ్చు.  “మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులగిల్” అంటే గజేంద్ర రక్షణకు అయన సంకల్పం మాత్రమే చాలు అని చెపుతున్నారు. అయిన పరమాత్మా తనే స్వయంగా దిగి వచ్చాడు. దీనికి కారణం “తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూ,ర్దు తోడ్రినైయే” అపారమైన ప్రేమ చేత ఆగలేక వచ్చావే ! అని ఆళ్వార్లు అంటున్నారు.

                       మొసలి బారి నుండి  ఒక ఏనుగును కాపాడటం కోసం మాత్రమే అయన రాలేదు. గజేంద్రుడే ఇలా చెప్పుకున్నాడు. “నాహం కలేవరస్యాస్య త్రాణార్థం మధుసూదనా! కరస్త కమలాన్వేయ పాదయోర్  అర్పితం తవ” (మధుసూదనా! నా శరీరాన్ని కాపాడు కోవటానికి నేను నిన్ను పిలవలేదు. నా తొండంతో పట్టుకున్న ఈ తామరపూవును నీకు సమర్పించటానికే నేను నిన్ను పిలిచాను.) గజేంద్రుడి మనో వాంఛ తెలిసిన వాడు కాబట్టే పరమాత్మా తన ధామం నుండి పరుగున వచ్చాడు.

              ‘కళిరుం’ అన్న మాట కంటే ముందు ఉన్న ‘తొళుంగాదల్’ (అసమానమైన ప్రేమ)అన్న ప్రయోగం గజేంద్రుడి భక్తి పారవస్యాన్ని తెలియజేస్తుంది. దీనినే గీతలో ‘సాధు’ అని కృష్ణ పరమాత్మా చెప్పారు. సాధు పరిత్రాణం అంటే శ్లిష్టరక్షణ దుష్టశిక్షణ మాత్రమే కాదు. దానిని దాటి పరమాత్మా తన భక్తులతో కలసి ఉండాలని, ప్రేమను పంచుకోవాలని కోరుకుంటాడు. ఆయనకు దాసుల మీద ఉండే ప్రేమ, ఆయన  మీద వారికుండే ప్రేమ ఆయనను కనులారా చూడాలన్న కోరిక ఆయనను ప్రత్యక్షంగా రప్పిస్తున్నాయి. ఉన్నతమైన భక్తి గలవారికి తమ దేహాన్ని కాపాడు కోవాలన్న కోరిక ఉండదు. స్వస్వరూపం, పరస్వరూపం తెలిసిన వారు కావున వారు ఆయన   అనుభవంలో మునిగి ఉంటారు. ఈ ఆత్మానుభవమే సాధుపరిత్రాణం యొక్క అంతరార్థము. ఇది అయన ప్రత్యక్షంగా రావటం వలన మాత్రమే లభిస్తుంది. అందుకే  ‘సాధూనాం  పరిత్రాణాయ  యుగే యుగే సంభవామి’ అని చెప్పుకున్నాడు.

                   ఆళ్వార్ల హృదయం తెలుసుకోకుండా ఈ విధంగా ‘సాధుపరిత్రాణం’ గురించి తెలుసు కోవటం సాధ్యం కాదు.  అందువలననే  ఈ అర్థాలు శ్రీభాష్యంలో మాత్రమే కనపడతాయి. వేదాలను తుదముట్ట అధ్యయనం చేసిన వారికి ఈ అర్థాలు బోధపడవు. ఆళ్వార్ల ద్రవిడవేదసారం తెలిసిన వారికే ఈ రహస్యాలు బోధపడతాయి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/11/dramidopanishat-prabhava-sarvasvam-13/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 12

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 11

                                                           అవతార ప్రయోజనము

   భగవద్గితలో శ్రీకృష్ణ పరమాత్మ ” పరిత్రాణాయ సాధూనాం వినాసాయచ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే” అని అన్నాడు. మంచి వారిని రక్షించటం, దుష్టులను శిషించటం, ధర్మమును స్థాపించటం కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని అన్నాడు .

వీటి కోసం పరమాత్మ తానే ఎందుకు అవతరించాలని ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన సర్వజ్ఞుడు, సర్వ వ్యాపి, సర్వ శక్తుడు. ఆయన ఒడిపోవడం అంటూ లేదు. తన సంకల్ప మాత్రంచేత తన అభీష్టాలను నేరవేర్చుకో గలడు . అలాంటి వాడు ఇక్కడ ఎందుకు అవతారించాలి? సర్వశక్తుడైన పరమాత్మ విభవావతారాలు  ధరించడానికి కారణం ఏమిటి ?

 

ఆది శంకరాచార్య

మాధవాచార్య

ఆది శంకరులు ఈ ప్రశ్నను గణనలోకే తీసుకోలేదు. పరమాత్మా వాస్తవంగా అవతరించాల్సిన  అవసరము లేదు, అయినా ‘లోకవత్తు లీలా కైవల్యం’ అనే బ్రహ్మ సూత్రం చెప్పినట్లుగా ఆయన తన లీలను చూపడానికే అవతరిస్తున్నారు అన్నారు మధ్వాచార్యులు. కృష్ణ పరమాత్మ సాదు సమ్రక్షణం అని స్పష్టంగా చెప్పినప్పటికీ వారు ఈ కారణాన్ని వ్యతిరేకించినట్లు, లీల మాత్రమే కారణమని వేరొక అభిప్రాయాన్ని చెప్పారు. పరమాత్మ లీల కోసం మాత్రమే అవతారాలు చేయటం లేదు అని చెప్పటానికి, పై గీతా శ్లోకం ఒక్కటే చాలు . ఇంకా    లోకాలను సృష్టించటానికి , అవతారాలు చేయడానికి కారణాలను, పైన  ఉదహరింపబడిన బ్రహ్మసూత్రం చక్కగా తెలియజేస్తున్నది. కావున ఈ శ్లోకాన్ని అవతార కారణాన్ని మార్చి చెప్పడానికి వినియోగించకూడదు .

 

బ్రహ్మ సూత్రంలోని  అంతరధికరణంలో ‘అంతసత్త ధర్మోపదేశాత్ “ (1-1-21) అన్న సూత్రాన్ని వివరించేటప్పుడు భగవద్రామానుజులు ఈగీతా శ్లోకాన్ని ఉదాహరించారు. తరువాత వారు “సాదవోహి ఉపాసకాః, తత్ పరిత్రాణమేవోద్దేశ్యం, ఆనుషంగికస్తు దుష్క్రుతం వినాస, సంకల్ప మాత్రేణాపి తదుపపత్తే” అని చెప్పారు.

అవతార ప్రధానోద్దేశ్యం ఉపాసకుని, భక్తితో నమస్కరించేవాడిని రక్షించటం మాత్రమే, దుష్ట శిక్షణ అనుషంగికం అవుతుంది. పరమాత్మ అవతరించకుండానే సంకల్ప మాత్రంచేత దుష్టశిక్షణం చేయగలడు .

అర్థాత్, పరమాత్మ అవతరించటం కేవలం దుష్టులను శిక్షించటంకోసం కాదు, అది సంకల్ప మాత్రంలో చేయగలడు. కానీ, భక్తరక్షణం కోసమే అవతరిస్తారు అని గ్రహించాలి. సాధు పరిత్రాణమే ఆయన లక్ష్యము.

 భగవద్రామానుజుల ఈ వివరణ విన్న తరువాత కొందరు దుష్టశిక్షణం లాగా సాధు పరిత్రాణం కూడా సంకల్పమాత్రంతో చేయలేరా! అని ప్రశ్నించవచ్చు . తిరువాయిమోళి తెలియనివారు ఈ వ్యాఖ్యను ఎంత సాధన చేసినా అర్థం కాదు. శ్రీభాష్యం శబ్దాలకు మాత్రం అర్థం చెప్పేవారు ఇలా అంతరార్దాలలోనికి వెళ్ళరు . ఒకవేళ శిష్యుడు ఇలా ప్రశ్నించినా “స్వామియే చెప్పారు కదా! అయన వాక్కును ప్రశ్నించడానికి నువ్వు ఎవ్వరు? అని చెప్పేయవచ్చు . ఈ ఖండనంతో  కూడా శ్రీ భాష్యం స్పష్టంగా, చక్కగా చెప్పినట్లే కనపడవచ్చు . తిరువాయిమోళి నేర్చి , ఆళ్వార్లు, ఎమ్బెరుమానర్లు, జీయరు మనోగతాన్ని తెలుసుకొన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోగలరు. ఆళ్వార్లు, ఏమ్బెరుమాన్లు, జీయరు ప్రభృతుల మనోగతాన్నివారి కృప చేత పొందాను అని చెప్పే కంచి ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యస్వామి కృపవలన మనము ఈ విషయాన్ని తెలుసుకుందాము. వీరందరి శ్రీచరణాలకు ప్రణమిల్లి ఈ విషయాలను తెలుసుకుందాము. తిరువాయిమోళి 3-1-9 పాశురంలో

“  మళుంగాద వైన్నుతియ శక్కరనల్ వలతైయాయ్

తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోన్రినయే

మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులకిల్

తొళుమ్పాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ చోది మరియాదే”

          ఈ పాశురములోని మూడవ పాదములో వచ్చే ‘మళుంగాద జ్ఞానం’  అంటే ఓటమి ఎరగని పరమాత్మ సంకల్ప జ్ఞానము, అర్థాత్ పరమాత్మ హృదయము. సాధు పరిత్రాణానికి పరమాత్మ అవతరించాల్సిన ఆవశ్యకత గురించి ఆళ్వార్లు ఇక్కడ వివరించారు. ‘తొళుంపాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ శోది మరియాదే’ నువ్వు ప్రత్యక్షంగారాక, అవతారం చేసి  దాసులను రక్షించితే నీతేజస్సుకు, శక్తికి, కీర్తికి మచ్చ ఏర్పడుతుంది. నువ్వు  ప్రత్యక్షంగా వచ్చినప్పుడే నీ కీర్తి ప్రకాశిస్తుం ది అంటున్నారు.

ఆయన తన ఆదిశేషపర్యంకం మీద పవళించి ఉండి కేవల సంకల్ప మాత్రం చేత దాసులను కాపాడితే అయన కీర్తికి మచ్చ ఏర్పడుతుంది. తన దాసులను కాపాడడానికి అయన ప్రేమతో దిగిరావటం అయన దివ్య గుణములలో ఒకటి. అందువలన సాధుపరిత్రాణం సంకల్ప మాత్రంలో జరిగితే అది అయన కీర్తికి మచ్చ అవుతుంది. కానీ అయన  మచ్చలేనివాడు . అందువలన అయన సాధుపరిత్రాణం కోసం అవతరిస్తాడు. ఇది ద్రుఢము.

పై వివరణలు చాలా బాగున్నా పరమాత్మా ఈ ప్రకారంగానే సాధు సమ్రక్షణం చేస్తున్నాడని చెప్పడానికి ప్రమాణాలు ఉన్నాయా? అన్న ప్రశ్న మిగిలి ఉన్నది. దీనికి మన  అళ్వార్లమాటలే పరమ ప్రమాణం.  ఎందుకంటే మన ఆళ్వార్లు ప్రమాణం లేనిదే ఒక్కమాట కూడా చేప్పే వారు కారు. ఈ పాశురములో మొదటి భాగము ఈ ప్రమాణమును సూచిస్తున్నది. ‘తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోన్రినయే’ అన్నదే ప్రమాణము. గజేంద్రుడిని  కాపాడడానికి పరమాత్మ గరుడారోహుడై తన నిత్యవిభూతి నుండి దిగి వచ్చాడు. ఒక మొసలిని తానున్నచోటు నుండే సునాయాసంగా సంహరించ గలడు, కానీ భక్త సమ్రక్షణ గుణానికి అది సరిపోదు.. అందువలన అక్కడి నుండి దిగివచ్చి రక్షించాడు .

గజేంద్ర మోక్షంలోని సూక్ష్మమైన  వివరాలను తరువాత చూద్దాము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/10/dramidopanishat-prabhava-sarvasvam-12/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 11

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 10

సామ్రాజ్య పట్టాభిషేకం

                     గద్యత్రయం భక్తులకు ఎంత చదివినా తనివితీరని అతృప్తామృతం. “అఖిలహేయ ప్రత్యనీక” అని ప్రారంభమయ్యే భాగంలో, భగవద్రామానుజులు పరమాత్మ దివ్య స్వరూపమును, దివ్య రూపమును, దివ్య గుణములను, దివ్య ఆభరణములను, దివ్య ఆయుధములను  వివరించారు.

            “స్వోచిత వివిధ విచిత్రానంత” అని ప్రారంభిచి దివ్యాభారణాలను వర్ణిస్తూ  “కిరీట మకుట చూడా వతంస” అని అన్నారు.  “కిరీట మకుట చూడావతంస” అనే మూడు పదాలకు అర్థం ఒక్కటే, మూడు ఆయన దివ్య అభిషేకాన్ని, దివ్య శిరస్సును పెర్కొనేవే, ఒకటే విషయాన్ని చెప్పటానికి వీరు ఎందుకు మూడు పదాలను ప్రయోగించారని సందేహం కలుగుతుంది.

                ఒక్కొక్క పదము స్వామి దివ్య అభిషేకానికి ఒకొక్క విడదీసి ఒక భాగమును తెలుపుతుంది. వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో ఈ విషయం చక్కగా వివరించారు .

                కిరీటము – తల చుట్టూ ఆవరించి వున్న ఆభరణ విశేష అడుగు భాగాన్ని సూచిస్తుంది, మకుఠము తలకు పై భాగాన్ని సూచిస్తుంది, చూడా – కిరీటం ముందు భాగంలో కిరీటం నుండి వేలాడే మణులను సూచిస్తుంది. అవతంసం – అనగా పూవులలా చెవుల దగ్గర అమరి వుండే ఆభరణము. నమ్బెరుమాళ్ళ (శ్రీరంగంలో ఉత్సవ మూర్తులు ) ఉత్సవ సమయంలో భక్తులు వీటిని దర్సించుకునే వుంటారు.

                భగవద్రామనుజుల రచనలలో ఆళ్వార్ల అనుభవాన్ని చూస్తున్న ఈ సందర్భంలో ఆళ్వార్ల అనుభవం ఎలా వుందో చూద్దాం .

               “పారళంద పెరరసే! ఎం విస్వంబరసే ! ఎమ్మై నీత్తు  వంజిత్త ఓ రరసే! “(లోకాలను కొలిచిన రాజాది రాజా! మా విశ్వానికి రాజా! మమ్మల్ని విడి వంచించిన ఓ రాజా!) అన్నారు ఆళ్వార్లు. అరసే అంటే రాజు అని అర్థం .ఈ పదాన్ని  మూడు సార్లు ప్రయోగించారు. ఈ మూడింటిలో మూడు ప్రయోగాలకు వేరు వేరు అర్థాలు వున్నాయి.

త్రివిక్రముడు

“పారళంద పెరరసే! “అనటంలో సౌలభ్యంలో రాజు. త్రివిక్రమ అవతారంలో అయన తన శ్రీపాదాలను ప్రతి ఒక్కరి తల మీద ఉంచి తన సౌలభ్యాన్ని చాటుకున్నాడు .

 

             “ ఎం విస్వంబరసే ! “ అంటే పరత్వంలో రాజు. అయన శ్రీవైకుఠంలో నిత్యసూరి నాయకుడుగా తన పరత్వాన్ని ప్రకాశింపచేశాడు అని చెప్పారు.

 “ ఎమ్మై నీత్తు  వంజిత్త ఓరరసే! “ఆయన ఆళ్వార్లతో చేరటం విడిపోవటం వంటి ప్రణయిత్వం ద్యోతకమవుతుంది. పరమాత్మ మూడు స్థితులలోను రాజుగా ఉండటాన్ని అళగియ మనవాళ పెరుమాళ్  నాయనార్  తమ ఆచార్య హృదయంలో ‘పారళంద ఎన్నుం మూన్రు ముడిక్కురియ ఇళ వరసుక్కు “(లోకాలను కొలిచి ఎప్పటికి  మూడు రాజ్యాలకు యువరాజు) అని పేర్కొన్నారు .

                   భగవద్రామానుజులు కిరీట, మకుట, చూడావతంస అని పరమాత్మ పరత్వ , సౌలభ్య, ప్రణ యిత్వాలను, మూడు సామ్రాజ్యాలుగా చూపించారు.

                  ఇక్కడ ప్రణయిత్వము, సౌలభ్యంలో అంతర్భాగం కదా  అని తోస్తుంది. కానీ, అది విడిగా భావించవలసిన ఒక గుణము. సౌలభ్యం చేతనులందరికి చెందిన సామాన్య అనుభవము. ప్రణయిత్వము ఆళ్వార్లకు పరమాత్మా ప్రత్యేకంగా ఇచ్చిన అనుభవము. “ఉండియే ఉడైయే ఉగందిరుక్కుం ఇమ్మండలత్తోర్  ‘అని అందరికి సౌలభ్యం సమానం, కానీ  ‘ ఉణ్ణుం శోరుం ,పరుగుం నీరుం తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కన్నణ్ణన్’ అని భావించే ఆళ్వార్లకు మాత్రమే చెందిన అనుభవం ప్రణయిత్వం .

           ఇలాంటి  విశేష గుణానుభవము ఇంకా పలు సందర్భాలలో కనపడుతాయి. రామనుజులవారే శ్రీభాష్యంలో ఈ విషయాన్నీ ఒక సందర్భంలో చూపించారు.

          శ్రీభాష్యం  ప్రారంభంలోనే ‘అఖిల భువన జన్మ స్తేమ భంగాది లీలే అని ప్రారంభిచి పరమ పురుషుడైన శ్రీనివాసుడు సమస్త చేతనాచేతనములను సృష్టించి, రక్షించి, సంహరించటం లీల మాత్రంగా చేస్తున్నాడని చెప్పారు. మళ్ళీ ‘వివిధ వినత వ్రాత  రక్షైక దీక్షా’  అని సకల భువన రక్షణత్వాన్ని స్తుతించారు. అలాగే ప్రణయిత్వం కూడా ఒక విశేష అనుభవమని చెపుతున్నారు.

              పరమాత్మ దివ్య స్వరూపము, దివ్య రూపము, దివ్య గుణములు, దివ్య ఆభరణములు, దివ్య ఆయుధములు  మొదలైన వాటిని వివరించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/09/dramidopanishat-prabhava-sarvasvam-11/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 1

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవులు తమ రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానార్ వంగి పురత్తు నంబికి వివరించారు. వంగి పురత్తు నంబి ఈ ఉపదేశాలను వాటి వ్యాఖ్యానమును ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు ఈ పుస్తకము నందు పొందుపరపబడినవి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

1. స్వర్గత్తుక్కు సంసారం విరోధి  – సంసారం (ఈ శరీరానికి సంభందించినది) స్వర్గపు సుఖాలకు విరోధి.

సాధారణంగా స్వర్గం అంటే దేవతల గ్రహాలని అర్థం. ఇంద్రుడి నివాసం స్వర్గమని అంటారు. ఈ భూమిపైన కానరాని అనేక సుఖాలతో నిండి ఉంటుంది ఆ స్వర్గలోకం. కానీ స్వర్గలోకాన్ని చేరుకోడానికి అనేక తపస్సులు చేయవలసి ఉంటుంది.  ఈ భూలోకంలో (సంసారంలో) జన్మ, జీవితం వారి వారి కర్మ ఫలితంగా లభిస్తుంది. ఈ సంసార జీవితం తపస్సుకు అడ్డంకులుగా భావిస్తారు. తమ దేహం, బంధువులు (భార్య, పిల్లలు), ఆస్తులు (భూమి, సంపదలు)  తపోనిష్ఠకి అడ్డంకులు అవుతాయి. కావున వాటిని పరిత్యజించాలి.

 భూలోక సుఖాలు – స్వర్గానికి అడ్డంకులు

అనువాదకుని గమనిక: “జ్యోతిష్థోమేన స్వర్గ కామో యజేత”  స్వర్గాన్ని కోరుకునే వారు జ్యోతిష్థోమం చేయవలిన అవసరం ఉంది – ఈ హోమానికి అతికఠినమైన నిష్ఠ అవసరం.

2.  స్వర్గేచ్చువుక్కు ఐహిక సుఖం విరోధి – పరలోక సుఖాలను కోరేవారికి ఈ భూలోక సుఖాలు విరోధి.

మునుపటి సూత్రానికి పోలియున్నది. పరలోక సుఖాలను ఆస్వాదించే కోరిక ఉన్నవారికి, ఈ  భూలోక సుఖాలు అడ్డంకులు అవుతాయి. ఈ భూలోక సుఖాలపై ఆసక్తి ఉన్నట్లయితే, అది పరలోకాలను కోరేవారి నిష్ఠను భంగపరుస్తుంది.

అనువాదకుని గమనిక: ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది –  స్వర్గానుభవం గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అని? ఇది ప్రపన్నులకు ఎలా సంబంధించినది అని? ఇది కేవలం ఒక అభ్యుదయ మార్గంలో,  చిన్న కోరికల నుండి ఉన్నతమైన భాగవత సేవా ప్రాప్తి వరకు, ఉన్న వివిధ అడ్డంకుల గురించి వివరించుటకు అని అర్థం చేసుకోవాలి.

3. ఆత్మానుభవత్తుక్కు స్వర్గానుభవం విరోధి – స్వర్గపు సుఖానుభవం తమ ఆత్మ సుఖానికి  అడ్డంకి.

స్వర్గ సుఖాలు – ఆత్మానుభవానికి అడ్డంకి

కైవల్యం అనే మోక్షరకంలో ఆత్మానుభవము ఒకటి. కైవల్యం మోక్షం అనగా, ఆత్మ ఈ జన్మ మరణ చక్రం నుండి విడులైయ్యి విరజా నదిని దాటి శ్రీవైకుంఠం చేరుకొని పూర్తిగా తనను తాను (జీవాత్మ) ఆనందించడం అన్నమాట. ఈ సంసారంలో మరలా పుట్టుక ఉండనందున ఇది కూడా ఒక రకమైన మోక్షంగా పరిగణిస్తారు. మన పుణ్య ఫలం ఉన్నంతవరకే స్వర్గసుఖాలు అనుభవించగలుగుతాము. ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తరువాత, ఈ భూమిపైన మరలా జన్మనెత్తి తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాలి అని “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” లో వివ రించారు.

4. ఆత్మానుభావ కామనుక్కు స్వర్గం విరోధి – ఆత్మానుభావం ఆశించే వారికి  స్వర్గ సుఖాలను అనుభవించాలనే కోరిక అడ్డంకి.

(దయచేసి మునుపటి సూత్ర వివరణను చూడండి.)

5. భగవత్ అనుభవత్తుక్కు ఆత్మానుభవం విరోధి – తమ ఆత్మానుభవం భగవత్ అనుభవానికి విరోధి.తమ అనుభవం – భగవత్ అనుభవానికి విరోధి

భగవత్ అనుభవం అనగా భగవానుడి ఉభయ విభూతి ఐశ్వర్యాన్ని (నిత్య విభూతి, లీలా విభూతి) కళ్యాణ గుణాలతో కూడిన వారి దివ్య మంగళ స్వరూపాన్ని ఆస్వాదించడం అన్నమాట. ఈ అనుభూతి భగవత్ ప్రీతిని కలిగింపజేస్తుంది. ఆ భగవత్ అనుభూతి నుంచి భగవత్ కైంకర్యం చేయాలనే కోరిక పుడుతుంది. శ్రీవైకుంఠంలో ఈ పరమానందాన్ని నిత్య పరమానంద మోక్షం అని అంటారు. అత్మానుభవం ఆ శ్రీవైకుంఠానికి దారితీస్తున్నప్పటికిని భగవత్ అనుభవంతో పోల్చితే,  అది చాలా అల్పమైనది. కావున, తనను తాను ఆస్వాదించే (ఆత్మానుభవం) కోరిక  భగవత్ అనుభవానికి ఒక ఆటంకము.

అనువాదకుని గమనిక: జీవాత్మ స్వతహాగానే జ్ఞానమయుడు, ఆనందమయుడు. కావున, అతడికి అత్మానుభవ ఆసక్తి  కలుగవచ్చు. కానీ అది చాలా  అల్పమైనది. ఎందుకంటే ఆత్మ అణు స్వరూపమైనది. ఈ ఆత్మ యొక్క జ్ఞానానందాలు కూడా చిన్నవే. కానీ భగవానుడు విభుడు (సర్వవ్యాపి,  సర్వశక్తిమంతుడు). భగవదనుభవంతో పోల్చితే జీవాత్మ అనుభవం అల్పమైనది స్వల్పమైనది.

6. భగవత్ అనుభవ కామనుక్కు ఆత్మానుభవ ఇచ్చై విరోధి – భగవత్ అనుభవాన్ని ఆశించేవారికి, తమను తాము ఆనందించడం ఆటంకము.

(దయచేసి మునుపటి సూత్ర వివరణను చూడండి.)

7. గుణనిష్ఠనుక్కు గుణి విరోధి – భగవత్గుణ నిష్ఠ ఉన్నవారికి, భగవత్ స్వరూపం విరోధి.

భగవత్ స్వరూపాన్ని ఆస్వాదించి అనుభవించుట – భగవత్ గుణానుభవం గుణనిష్ఠకి అడ్డంకి – “సదా పరగుణావిష్ఠః” అని చెప్పినట్లు, “భగవత్ మంగళ గుణాలను సదా అనుభవించువాడు అని అర్థం. “సోస్నుతే” అని శృతి ప్రమాణంలో చెప్పినట్లు, జీవాత్మ పరమాత్ముని మంగళ గుణాలతో కూడి ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు అని తెలియజేస్తుంది. “రసోవై సః” అంటే మాధుర్యంతో రూపుదిద్దుకున్నవాడు అని అర్థం. శ్రీవైకుంఠంలో ముక్తాత్మ ఆ అనుభవాన్ని పొందుతాడు. ఎమ్బెరుమాన్ (భగవాన్) తమ దివ్య లీలల ద్వారా తన దివ్యమంగళ గుణాలను దర్శింపజేస్తారు. తిరువిరుత్తం 98వ పాసురంలో “నెంజాళ్ నినైప్పరిత్తాళ్ – వెణ్ణెయుణెన్నుం ఇరచ్ చొళ్ళే” అని, తిరువాయ్మొళి 1.3.1 వ పాసురం “ఎత్తిఱాం! ఉరలినోడు ఇణైన్తిరుంతేంగియ ఎళివే” అని, నమ్మాళ్వార్ల పాశురాల ద్వారా భగవద్ గుణానుభవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది పెరియ తిరువందాది 86వ పాశురంలో “చీర్ కలంత చొల్” గా  (భగవత్గుక్షణాలలో మునిగిన శబ్దాలు అని అర్థం) వివరించారు. గుణి అనగా దివ్యమైన భగవత్ స్వరూపం (అనగా, గుణం ఉన్నవాడు గుణి అని అర్థం). గొప్ప యోగులు కూడా అతి కష్టమైన ఈ భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయారు. భగవత్ స్వరూపంపైన దృష్టి ఉంచడం భగవత్ గుణ అనుభవానికి ఒక అడ్డంకి అవుతుంది.

8. కైంకర్యనిష్ఠనుక్కు భగవత్ సౌందర్యం విరోధి –  భగవత్సేవను అనుభవించే వాడికి భగవత్ సౌందర్యం అడ్డంకి.

భగవత్ సౌందర్య నిష్ఠ –  కైంకర్యలో అడ్డంకి (నిత్యం రాముడి సేవలో మునిగి ఉండేవాడు లక్ష్మణుడు)

కైంకర్యనిష్ఠులు –  “అహం సర్వం కరిష్యామి” (మీకోసం ఏదైనా చేస్తాను) అని ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) అన్నట్లు,  సదా తమ దృష్టి భగవానునిపైనే ఉంచారు. మన దృష్ఠి ఒకసారి అతని దివ్య సౌందర్యంపైన పడి అతనిని అనుభవించటం మొదలుపెడితే, మన మనస్సు దృష్టి అతనిపైన స్థిరపడి ఆశ్చర్యచకితులమౌతాము. మనలో ఈ భావన వచ్చినపుడు అది పెరుమాళ్ళ కైంకర్య నిష్ఠలో బాధ కలిగిస్తుంది. అందువల్ల పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి సూత్రం 187 లో ” సౌందర్యం అంతరాయం” అంటే భగవత్ సౌందర్యం అడ్డంకి అని అర్థం. సహజంగా – భగవనుడు యజమాని, జీవాత్మ అతనికి దాసుడని అంటారు. భగవత్ గుణాలను అనుభవించడం ద్వారా, భగవంతుడికి జీవాత్మకు మధ్య అనుబంధం పెరిగి, అతనిలో క్రమేణ  ఆ మంగళ గుణాలున్న భగవానుడికి సేవ చేయాలనే కోరిక పుడుతుంది. శేషత్వ స్వరూపుడైన జీవాత్మకి ఈ భావన సరితూగుతుంది, ఇది కోరదగినదే. ఇది ఎంతో అవసరం. కాని ఒకసారి భగవత్ సౌందర్యముపై దృష్టి మరలితే, ఆ అనుభవం కైంకర్యం జరగకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, కైంకర్య నిష్ఠులకు భగవత్ సౌందర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.

9. భాగవత కైంకర్య నిష్ఠనుక్కు భగవత్ కైంకర్యం విరోధి – భాగవత (భక్తులు) కైంకర్యంలో రుచి ఉన్నవారికి  భగవత్ కైంకర్యం ఒక అడ్డంకి.

భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యంలో అడ్డంకి

జీవాత్మ స్వరూపం భగవత్ దాస్యం. భగవానుడికి పూర్ణ దాసుడిగా ఉండాలి. ఇంకా ముఖ్యమైనది – స్వరూప యాథాత్మ్యం, భాగవత శేషత్వం. పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్లు తిరుమంత్ర సారాన్ని ఎమ్బెరుమానికి తెలియజేస్తూ ఇలా అన్నారు, ” నిన్ తిరువెట్టెళుత్తుం కఱ్ఱు నాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” –  తిరుకణ్ణపుర భగవానుడా! తిరుమంత్ర సారాన్ని తెలుసుకున్న తరువాత నేను నీ భక్తులకు దాసుడని అర్థం చేసుకున్నాను. తిరుమళిశై ఆళ్వార్ నాన్ముగన్ తిరువందాది 18 వ పాశురంలో “ఏత్తియిరుప్పారై వెల్లుమే మాఱ్ఱవరైచ్ చాత్తియిరుప్పార్ తవం” – భగవత్భక్తి కన్నా ఉన్నతమైనది భక్తుల పట్ల ప్రేమ). ఏత్తియిరుప్పార్ – భగవత్  శేష భూతర్ – భగవానునికి శరణాగతి చేసినవాడు. అటువంటి భక్తులకు శరణాగతులై ఉన్నవారి స్థితి ఉన్నతమైనది. శ్రీరామాయణంలో, శ్రీరాముడికి లక్ష్మణ భరతులు పూర్ణ శరణాగతులై ఉండేవారు. భరతుడే సర్వస్వంగా శత్రుఘ్నుడు ఉండేవారు. శ్రీరామాయణంలో  “శత్రుఘ్నొ నిత్యశతృఘ్నః” (అడ్డంకులన్నింటినీ జయించినవాడు) అని చెప్పబడింది.  మన పూర్వాచార్యులు ఇలా వివరించారు “శ్రీరాముడి సౌందర్య గుణాలపై ధ్యానించకుండా భరతుడి సేవలో మునిగి ఉండేవారు. తిరువాయ్మొళి 8.10.3 పాశురంలో నమ్మాళ్వార్లు “అవనడియార్ శిఱుమామనిశరాయ్ ఎన్నైయాణ్డార్”. భగవానుడికి శరణాగతి చేసినవాడిని ‘శిఱుమామనిశర్’ అని అంటారు. చిన్న వాడైనా జ్ఞానాచరణలో గొప్పవాడు అని అర్థం. అటువంటి వాడే నాకు స్వామి అని నమ్మాళ్వార్లు చెబుతున్నారు. అటువంటి భక్తులు ఎదుట ఉన్నప్పుడు, వారిని విస్మరించి పెరుమాళ్ళ పాద పద్మాలను ఎలా సేవించగలం? భాగవత కైంకర్యమే జీవాత్మ స్వరూపానికి అతి ఉత్తమమైనది. అందువల్ల భాగవత కైంకర్యానికి భగవత్ కైంకర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.

తరువాత భాగాన్ని మనం వచ్చే సంచికలో అనుభవిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో :  http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-1.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 10

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 9

భగవద్రామానుజులు చేతనులలో అంతర్యామిగా ఉన్న శ్రీరంగనాథుని  చూసారు.

వారి   శ్రీరంగ గద్యం ‘ స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం’ అని ప్రారంభించి నారాయణుడే సకల ఆత్మలను, వస్తువులను నియంత్రించు వాడు, అందువలననే ఈ లోకంలో ఆత్మలు ఆత్మలుగాను, లోకము లోకముగాను ఉన్నవి.

నంపెరుమాళ్ – సకల లోకాలను నియంత్రించువాడు

వాటి స్థితి, స్వరూపము  అయన అధీనములో ఉన్నాయి. ఆయన రక్షకత్వం వలననే ఈ జగత్తు, ఆత్మలు తమ స్థితిని పొంది ప్రస్తుతము ఉన్న రూపంలో ప్రకాశిస్తునాయి. ఈ ప్రవృత్తి నివృత్తి అనే క్రియలు ఆయన మనో సంకల్పానికి తగినట్లుగానే నడుస్తున్నవి. ఈ లోకము, ఇక్కడి మనుష్యుల స్థితి, ప్రవృత్తి  సమస్తం ఆయన వలననే నిర్వహింపబడుతున్నవి.

 

ఈ విషయము వేదాలలోను, ఉపనిషత్తులలో, మునులచే అనుగ్రహిమ్చబడిన పలు గ్రంధాలలో సుస్పష్టంగా కనపడుతుంది. స్వామి రామానుజుల వారి ఈ అభిప్రాయం వారు  అనుగ్రహించిన గ్రంధాలలో పలు చోట్ల కనపడుతుంది.

సకల చేతనాచేతనముల స్వరూపము, స్థితి, ప్రవృతి సమస్తం ఆయన సంకల్పమే అని స్వామి ఎలా చెప్పారో అదే విధంగా తిరువాయిమోళిలో కనపడుతుంది.

ఆళ్వార్ – రామానుజుల మార్గదర్శకులు

తిరువాయ్మొళి మొదటి శతకంలోని మొదటి దశకం (తిరువాయ్మొళి) ఈ ప్రకరణానికి సమానార్థకంగా ఉంది .

స్వరూపము

నామ్ అవన్ ఇవన్ ఉవన్ అవళ్ ఇవళ్ ఉవళ్ ఎవళ్

తామ్ అవర్ ఇవర్ ఉవర్ అదు ఇదు ఉదు ఎదు

వీమ్ అవై ఇవై ఉవై అవై నలమ్ తీంగవై

అమ్ అవి ఆయ్  అవై ఆయ్ నిన్ర అవరే  1.1.4

ఇక్కడ పరమాత్మ అనుగ్రహిమ్చినవే నామ్, అవన్, అవళ్, అదు, అవర్, అవై,ఇవై,( మనము , వాడు, ఆమె , అది,వాళ్ళు ,అవి,ఇవి ) అనేవి అన్ని మనకు తెలిసిన మనుషులు , వస్తువులకు సంబందించిన స్థితి ,  స్వరూపము .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప

తిరుక్కురుగై పిరాన్  పిళ్ళాన్  దీనిని  వివిధ నిర్దేశములతో నిర్దిష్టమైన సమస్త వస్తువుల స్వరూపము భగవదాధీనము అని చెపుతున్నారని వివరించారు. దీని వలన మనము చూస్తున్న సమస్త వస్తువులు ఆయన సంకల్పమే అని బోధపడుతున్నది.

స్థితి

అవరవర్ తమతమదు అఱి  వఱి వఱి వకై

అవరవర్ ఇఱైయవర్ ఎన వడి  అడైవర్గళ్

అవరవర్ ఇఱైయవర్ కుఱైవిలర్  ఇఱైయవర్

అవరవర్ వితి వళి అడైయనిన్రనరే      1.1.5

ఒక్కొక్కరు వారి వారికి తగినట్లు వాస్తవాలను స్వీకరించి వేరు వేరు పురుషార్థాలను పొందటం కోసం వేరు వేరు దైవాలను కొలుస్తారు. అలాంటి వారు వారి కర్మ ఫలానికి తగినట్లు ఫలితాలను పొందుతారు. కానీ ఆయా దైవాలలో నారాయణుడే ఉండి వారి ఉపాసనలను స్వీకరించి ఫలితాన్ని ఇస్తున్నాడు.

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితిగా

పిళ్ళాన్ ఈ విషయంగా, సర్వ కర్మల సమారాధ్యుడై సకల ఫల ప్రదాయి కావటంచేత  జగద్రక్షణము ఆధీనమై అన్నారు. సకల కర్మల చేత ఆయనే పూజిమ్పబడటం వలన ఆయనే ఫల ప్రదాత అవుతున్నాడు. అందు వలన జగద్రక్షణము ఆయన దివ్య సంకల్పమని స్పష్ట మవుతున్నది.

ప్రవృత్తి :

నిన్ఱనర్ ఇరుందనర్ కిడందనర్ తిరిందనర్

నిన్ఱల ర్ ఇరుందిలర్ కిడందిలర్ తిరిందిలర్

ఎన్రుం ఓర్ ఇయల్వినర్ ఎన నినైవరియవర్

ఎన్రుం ఓర్ ఇయల్వోడు నిన్న్రవెంతిడరే ‘

వేదవేదాంతములు తెలియ జేయు పరమాత్మ- హృదయము, స్పందనలను నుండి వేరు పడి ఉన్నాడు. ఆయనే సమస్త కర్మలను కర్మలు లేని స్థితిలోను  ఉన్నాడు .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి

పిళ్ళా న్  ఈ పశురాన్ని, “చేతనాచేతనత్మక సమస్త వస్తు వస్తువుల సమస్త ప్రవృత్తి, నివృత్తులు  పరమపురుష సంకల్పాధీనములు అని చెపుతున్నాయి” అని వివరించారు. అంటే  ప్రాణులు, అప్రాణులు, సమస్త చేతనాచేతనముల కర్మాకర్మలు ఈశ్వరుని సంకల్పమే అనే విషయం స్పష్టముచేస్తున్నారు.

ఈ మూడు పాశు రాలు చేతనాచేతనముల సమస్త  ప్రవృత్తి, నివృత్తులు పరమపురుష సంకల్పా ధీనములు అని చెపుతున్నాయని భగవద్రామానుజుల భావమే కాదు, అది ఆళ్వార్ల మనోభావాలు కూడా. దానిని వీరు వివరించారన్నది  సుస్పష్టం మవుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-10/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 9

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 8

ఈ భాగంలో భగవద్రామానుజుల ‘ కప్యాసం పుండరీకాక్ష ‘ అనే శృతి వాఖ్యానికి ఆళ్వార్ల మనోభావాలను చూడబోతున్నాము.

గంభీరాంబస్సముద్భూత పుండరీక—-తామర , జలజము , అంబుజము  లేక నీరజము . అది నీటిలో పుట్టటము వలన దానికి పై పేర్లన్నీ అమరినవి. తామర నీటిలోనే పుడుతుంది, నేలపై పుట్టదు.   కాబట్టి ఈ పేర్లన్నీ తామరకు మాత్రమే చెందుతాయి. అమ్బస్సముద్భూత  అంటే నీటిలో పుట్టినవి.

స్వామి పిళ్ళై లోకాచార్య

శ్రీవచన భూషణంలో స్వామి పిళ్ళై లోకాచార్యులు ‘ తామరను వికసిమ్పచేసే సూర్యుడు అది నీటిని విడిచి బయటకు వస్తే తన వేడితో వదలగొట్టినట్టుగా ‘ అని అన్నారు. దీనిని బట్టి తామరకు నీరు ఎంత అవసరమో తెలుస్తున్నది.

 

పరమాత్మ కళ్ళు పుండరీకాక్షము. వాటిని తామరతో పోల్చి చూడబడుతున్నది . నీటిలో నివసించే తామర గుణాలు ఆళ్వార్ల పాశురాలలో వివరించబడ్డాయి. సిరియ తిరుమడల్ లో తిరుమంగై ఆళ్వార్లు, ‘నీరార్ కమలం పోల్ సేమ్క్ ణ్ మాల్ ఎన్రోరువన్’  అన్నారు. పరమాత్మ ఎర్రని కళ్ళను ఎర్ర తామర లాగా భావించారు వారు.  ఇంకా తిరువిరుత్తంలో నమ్మాళ్వార్లు ఇదే అర్థంలో ‘ అళలర్  తామరై కణ్ణన్ ‘ అన్నారు. ఈ పాశుర వ్యాఖ్యానంలో స్వామి నమ్బిళ్ళై కప్యాస శృతిని ఉదాహరణగా చూపించారు. వదికేసరి జీయర్ స్వాపదేశము కూడా ఇలాగే కనపడుతుంది.

                                     

   స్వామి నంపిళ్ళై                                                                              వడికేసరి జీయర్

 

ఇక్కడ ‘గంభీర ‘ అన్న ప్రయోగం నీటి సమ్రుద్దిని సూచిస్తున్నది. ‘ తిరువాయిమోళి ‘ లో ఆళ్వారు ‘ తణ్  పెరునీర్ తడంతామరై మలర్దాల్ ఒక్కుం కణ్ పెరుంకణ్ణన్ ‘ అని వర్ణించారు. తామర పెద్ద , చల్లని తటాకంలో వికసించింది . పరమాత్మ కళ్ళు కూడా అలాంటివే అన్న అర్థంలో చెప్పారు.

‘సంరుష్ట నాళ పుండరీక “ – తామరపువ్వు ఎలాగైతే నీళ్ళ మీద ఆధారపడి ఉంటుందో అలాగే తన ఎర్రని కాడ మీద కూడా  ఆధారపడి ఉంటుంది. ఆళ్వార్ల పాశురాలలో దీనికి సంబంధించిన ఆధారాలు కనపడతాయి.

తిరువురుత్తంలో ఆళ్వార్లు “ఎమ్పిరాన్ తడంకణ్ గళ్  మెన్ కాల్ కమల తడం పోల్ పొలిందన” (పరమాత్మా ఎర్రని కన్నులు తామర పువ్వు లాగా విచ్చుకున్నాయి) అన్నారు.

“ రవికర వికసిత “ నీటిలో ఉన్న తామర సూర్యరశ్మి వలన వికసించింది . రమ్యమైన సుందరమైన పరమాత్మ కన్నులకు దగ్గర పోలికలు గలవి తామరలు మాత్రమే. సూర్యకిరణాలు ఆయనకు చేతులు.  “సెమ్జుడర్ తామరై “ అని ఆళ్వార్ల పాశురాలలో ఉదాహరించారు.

పరమాత్మా కళ్ళకు, తామరకు ఉన్న సంబంధమును కులశేఖర ఆళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమోళిలో  “సెంకమలమ్ అందరమ్ సీర్ వేమ్కదిరోర్ కల్లాల్ అలరావల్ “ అని అనుగ్రహించారు.

పుండరీక దళామలాయతేక్షణ  – మూలములో ‘పుండరీకమేవ మక్షిణి’ ఉంది. దీనిని బట్టి తామర వంటి కన్నులు గలవాడు అనో, పుండరీకాక్షుడు  అనో చెప్పవచ్చు. కానీ రామానుజులు దళ, ఆమల, ఆయత అనే మూడు పదాలను పుండరీక, ఈక్షణ అనే రెండు పదాల మధ్య చేర్చి చెప్పారు. ఇది ఆళ్వార్ల పాశురాలను వలననే సాధ్యం అవుతుంది.

ఆళ్వార్లు “తామరై తడం కణ్ణన్”,  “ కమల త్తడం పెరుం కణ్ణన్”  వంటి పదాలను ప్రయోగించారు.  తమిళంలో ‘తడ’, సంస్కృతంలో ‘తళ’ సమానార్థకాలు. సంస్కృతంలోని ‘ళ కారము’ తమిళంలో ‘డ కారముగా మారుతుంది. ఈ మార్పిడిని తమిళ భాషా శాస్త్రజ్ఞులు ‘ఎళుత్తుపోలి’ (అక్షరంలో పోలిక ) అంటారు. పూర్వాచార్యులు తమ వ్యాఖ్యానాలలో ‘తడం’ అంటే పెద్ద, కొలను, ఆకు అని వివరించారు. ఇక్కడ ఆకు అన్న అర్థం సరిపోతుంది.

ఆళ్వార్ల “ కమల కణ్ణన్  …..అమలంగళాగా విళిక్కుం” (కమలముల వంటి నేత్రాలవాడు అమలములను పోగొడతాడు) పరమాత్మ కరుణా కటాక్షము సకల పాపాలను పోగొడతాయి. అయన దృష్టి ‘ అమల’ అనటం వలన ఈ విషయమ బోధపడుతుంది. కీట్స్ ఆంగ్ల కవి చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆనంద అంటే ఒక అందమైన వస్తువు ఆనందాన్ని ఇచ్చి అది నిరంతరం ప్రవర్తమానమవటం అన్నారు.  లోకంలో ఎంత ఆనందకరముగా ఉండే అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు కలిగిస్తుంది. నిత్య జీవన  ప్రవాహంలో ఎంతో అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు పుట్టిస్తాయి, అసలు ఆ అందాన్ని అనుభవించే ఓపిక కూడా ఉండదు. దానికి విరుద్ధంగా ఎప్పటికి నవనవోన్మేషంగా ఉండేది పరమాత్మ రూపం ఒక్కటే. భక్తి పెరిగిన కొద్దీ ఆయన అందం ఇనుమడిస్తుంది. ఆయన అందమైన నేత్రాలు ప్రేమతో కారుణ్యంతో నిండి వుంటాయి. ఇది నిజమైన, పవిత్రమైన విషయం మాత్రమే కాదు చేతనులను ఉద్దరించే దృఢ సంకల్పం గోచరమవుతుంది. ఆయన అందమైన నేత్రాలు మన పాపాలను పోగోట్టడమే కాక చేతనులను ఉన్నతగతికి చేరుస్తాయి .

శ్రీ వైష్ణవులకు ‘ఆయత’ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది అని చూడడం సులభం.  రుప్పాణ్ణాళ్వార్ల

తిరుప్పాన్ఆళ్వార్

‘కరియవాగి పుడైపరందు మిళిర్దు సెవ్వరియోడి నీండవప్పెరియ వాయకంణ్ గళ్’ అన్న మాటలు మన హృదయంలో రూపుకడతాయి.

 

స్వామి రామానుజుల మాటలకు, ఉదాహరణలకు ఆళ్వార్ల పాశురాల నుండి కాక బయట అర్థాలను వెతికితే ప్రయోజనం ఉండదు. శ్రీ రామాయణంలో ‘రామ కమల పత్రాక్ష’ , ‘పుండరీక విశాలాక్ష’ అన్న ప్రయోగాలు తప్ప వేరేగా ఎక్కడ కనపడవు . ఆళ్వార్ల పాశురాల ఆధారంగానే ఈ ప్రయోగాలను వివరించారు.

స్వామి ఆళ్వార్ల పాశురాలపై తమకు గల అధికారంతో చేసిన ఈ వ్యాఖ్య పరమాత్మ నేత్రాల సౌందర్యాన్ని, దాని నుండి మనపై ప్రవహించే కరుణను మనము అనుభవించగలుగుతున్నాము.

 

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-9/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org